Previous Page Next Page 
సీతాచరితం పేజి 21

   
    యాగ సంరక్షణ


    తెల్లవారి విశ్వామిత్రుడు దీక్ష ప్రారంభించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రునికి పాదాభివందనం చేశారు. రాక్షసులెక్కడ వుంటారు. వారినెలా సంహరించాలి, అని అడిగారు. విశ్వామిత్రుడు దీక్షలో వున్నాడు, పలుకలేదు ఇవ్వాల్టినుంచి ఆరు రోజులదాక యజ్ఞాన్ని సంరక్షించాలి అక్కడి మునులు అన్నారు.


    రామలక్ష్మణులు అప్రమత్తులై యజ్ఞాన్ని కాపాడసాగారు. అలా ఐదురోజులు గడిచాయి. యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలుగలేదు. రాక్షసులు రాలేదు. యజ్ఞం జరుగుతున్నది. అగ్ని నాలుకలు జాచి మండుచున్నది. అంతలో వర్షాకాలం వలె మేఘం కమ్ముకున్నది. అది మేఘం కాదు- మారీచ సుభాహువులు. వారు ఆకాశమార్గాన పరుగెత్తుక వచ్చారు. మాయలు చేయడం ప్రారంభించారు. కుండలతో రక్తం తిచ్చి కురిపించసాగారు.


    ఆ రాక్షసులను చూచాడు రాముడు. అగ్ని కుండలోని అగ్నిలా మండిపడ్డాడు. విల్లులు అమ్ము తొడిగాడు. మానవస్త్రము ప్రయోగించాడు. దానితో మారీచుడు సముద్రతీరానికి ఆవల నూరు యోజనాల దూరంలో పడ్డాడు. మారీచుడు చేవలేదు. గడ్డిపోచలా కొట్టుకుపోయాడు. అది చూచాడు రాముడు. సుభాహుని మీద ఆగ్నేయ అస్త్రం ప్రయోగించాడు. అది వాని గుండెలకు తగిలింది. వాడు నేలకూలాడు. తర్వాత రాముడు వారివెంట వచ్చిన రాక్షసులను కూడ హతమార్చాడు.


    రాక్షసులు యజ్ఞానికి విఘ్మం కల్గించాడు. వారిని రాముడు హతమార్చాడు. పూర్వం ఇంద్రుడు ఇలాంటిపనే చేశాడు. అసురులను జయించాడు. అప్పుడు ఋషులు ఇంద్రుని పూజించాడు. అలాగే ఇప్పుడు రాముణ్ణి పూజించాడు. అలా యజ్ఞం సమాప్తమయింది. విశ్వామిత్రుడు రాముణ్ణి చూచి సంతోషించాడు. "నీవు మహాబాహుడవు. యశోవంతుడు. నీవల్ల నేను కృతార్ధుణ్ణయ్యాను. నీవటు తండ్రి యాజ్ఞను నిర్వర్తించావు. ఇటు ఈ ఆశ్రమం పేరు సార్ధకం చేశావు అన్నాడు.

    
    విశ్వామిత్రుని కథ


    యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది. విశ్వామిత్రునికి సిద్ధి లభించింది. అందువల్ల అతడు ఆ ఆశ్రమం వదిలివేయాలనుకున్నాడు. హిమపత్పర్వతానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. ఈలోగా మిధిలలో జనకుడు యజ్ఞం చేస్తున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్లాలనుకున్నాడు. అతడు రామ లక్ష్మణులతో ఇలా అన్నాడు.


    "జనకుడు మిధిలకు రాజు. ధార్మికుడు, అతడు యజ్ఞం చేస్తున్నాడు. అది చూట్టానికి నేను వెళుతున్నాను. మీరు రండి. జనకుని దగ్గర ఒక అద్భుతమైన ధనస్సు వుంది. దేవతలైనా దాన్ని ఎక్కుపెట్టలేరు, దానిని మీరు తప్పక చూడాలి."


    రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరారు. ఆశ్రమంలో వున్న మునులు  కూడా వెంటసాగారు. సాయంకాలం వరకు వారు శోణానదితీరం వెళ్లారు. సాయంసంధ్య ముగించుకున్నారు. అంతా ఒకచోట కూర్చున్నారు. మధ్యన విశ్వామిత్రుడు కూర్చున్నవాడు. మునులు వలయాకారంలో కూర్చున్నారు. రామలక్ష్మణులు విశ్వామిత్రునికి ఇరువైపులా కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు వారికి తన కథంతా చెప్పాడు. ఆ కథ సంగ్రహంగా ఇలా వుంటుంది.


    కుశుడు బ్రహ్మపుత్రుడు. అతడు విదర్భ రాజపుత్రికని పెండ్లాడాడు. వారికి నల్గురు పుత్రులు కలిగారు. వారిలో కుశునాభుడొకడు. అతడు మహోదయ పట్టణాన్ని నిర్మించాడు. ఘృతాచి, అనే అప్సరను పెండ్లాడాడు. వారికి నూర్గురు కూతుళ్లు కలిగారు.


    ఆ నూర్గురు అమ్మాయిలు చాలా అందమైన వాళ్లు. చక్కని చుక్కలు. తల్లిదండ్రులకు విధేయులు. వారంతా ఒకనాడు ఉద్యాన విహారానికి బయలుదేరారు. వారు ఉద్యానంలో విహరిస్తుంటే అందానికి కాళ్లు వచ్చినట్టనిపించింది. వారిని వాయుదేవుడు చూశాడు. వారి హొయలు చూశాడు. వారిని మోహించాడు. మనుష్యరూపం దాల్చాడు. వారిదగ్గరికి వచ్చాడు.  "వయసు చంచలమైంది. ఎప్పుడూ వుండేదికాదు. నన్ను పెండ్లాడండి. నిత్యయవ్వనులు కండి." అన్నాడు.


    అందుకు వారు అంగీకరించలేదు. "మాతండ్రి మాకు ప్రభువు. అతడే మాకు పరమదైవం. అతడు మమ్ములను ఎవరికిచ్చి పెళ్లిచేస్తాడో అతడే మాకు భర్తవుతాడు" అన్నారు.


    వాయుదేవుడు వారి మాటలు విన్నాడు. అతనికి వారిమీద కోపం వచ్చింది. వారు గూనివారు, కరూపులు అయ్యేట్లు శపించాడు. వారి అందం అంతరించింది. వారు గూనివారు, కురూపులయ్యారు.


    ఆ కన్యలకు తపశ్శక్తి వుంది. వారూ శపించగలరు. ఐనా శపించలేదు. ఈ ఆపదను గురించి తండ్రికి విన్నవించారు. కుశనాభుడు పరమ ధార్మికుడు. అతడు వాయుదేవుని మీద కోపించలేదు. తన కూతుళ్ల ఓర్పు వహించాడు. అందుకు వారిని కొనియాడారు. ఇలా అన్నాడు. "అమ్మాయిలూ! మీరు సహనం కలవారు. ఎవరైనా అపరాధం చేసినప్పుడు చేయవలసింది క్షమించడమే. మీరు చాలా గొప్పపని చేశారు. ఐకమత్యంగా వుండిననా కులాన్ని రక్షించారు. క్షమించడం స్త్రీలకు, పుఋషులకు భూషణం. అందున గొప్పవారిని క్షమించడం మరీమంచిది. క్షమదానం, క్షమయజ్ఞం, క్షమసత్యం, క్షమయే కీర్తి, క్షమయే ధర్మం, జగత్తంతా క్షమమీదనే ఆధారపడి వున్నది."


    కుశనాభుడు తన కూతుళ్లను బ్రహ్మదత్తుడను రాజుకిచ్చి పెళ్లి చేశాడు. అతడు వారిని తాకగానే వారి కురూపములు, గూనులు పోయి అందగత్తులు అయినారు.


    కుశనాభునికి పుత్రులు లేరు. అందుకతడు పుత్రకామేష్టి చేశాడు. అతనికి 'గాధి' అనే కుమారుడు కలిగాడు. గాధికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. కుమారుడు విశ్వామిత్రుడు, కుమార్తె సత్యవతి. సత్యవతి విశ్వామిత్రుని అక్క. ఆమె భర్తతో సశరీరంగా స్వర్గానికి వెళ్లింది. తిరిగి ఆమెయే 'కౌశికి' అనే నదియై భూలోకానికి దిగింది.


    ఈ కథను గురించి కొంత ఆలోచిద్దాం. ఆనాడు పెళ్లిళ్లకు కులాలు అడ్డురాలేదన్న విషయం విధితమవుతుంది. కుశుడు బ్రహ్మపుత్రుడు. కాబట్టి బ్రాహ్మణుడు. అతడు విదర్భ రాజపుత్రిని పెండ్లాడాడు. ఆమె క్షత్రియకన్య. అలాగే కుశనాభుడు ఘ్రూతాచి అనే అప్సరసను పెండ్లాడాడు. అంటే పెళ్ళిళ్ళకు కులాలు అడ్డురాలేదనే అర్థం.


    మరొక విషయమేమంటే స్త్రీ పుఋషులిద్దరు తపస్సు చేసేవారు. ఆడవాళ్లకు తపస్సు చేయడం నిషేధం కాదు. కాబట్టే కుశనాభుని పుత్రికలు తపస్సు చేశారు.


    పెళ్లిళ్ల విషయంలో కన్యలు తండ్రులమీదనే ఆధారపడేవారు. స్వయంగా వరించి పెళ్లిచేసుకోవడం ఆచారంగా లేనట్టు కనిపిస్తుంది. కాకుంటే వాయుదేవుడంతటివాడు పెళ్లి చేసుకుంటానంటే కన్యలు కాదంటారా?


    కుటుంబానికి యజమాని తండ్రి. కుటుంబాన్ని ఒక మార్గంగా నడపాలంటే కుటుంబ సభ్యులు అతనికి విధేయులై వుండటం అవసరం. ఈలాంటి విధేయతముందు బలప్రయోగం వల్ల వచ్చినా క్రమక్రమంగా అది ఆచారంగా మారింది. విధేయులుగాని కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం ఒక్కటిగా వుండటం కష్టం. ఛిన్నాభిన్నమైన కుటుంబం సమాజానికి శ్రేయస్కరం కాదు. ఈ విధేయత మనకిప్పుడు వంటబట్టింది. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్టికి మనం చూస్తున్న విషయమేమంటే, కుటుంబ బాధ్యత వహించే యజమానికి కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం ఒక్కటిగా వుండటం కష్టం. ఛిన్నాభిన్నమైన కుటుంబం సమాజానికి శ్రేయస్కరంకాదు. ఈ విధేయత మనకిప్పుడు వంటబట్టింది. ఒకరు చెప్పాల్సిన అవసరంలేదు. ఇవ్వాల్టికి మనంచూస్తున్న విషయమేమంటే, కుటుంబ బాధ్యత వహించే యజమానికి కుటుంబ సభ్యులు విధేయులుగా వుంటున్నారు.

 Previous Page Next Page