"డాక్టర్ ని పిలుస్తాను" ఆమెను పడుకోబెట్టి అన్నాడు.
"అఖ్కర్లేదు బాబూ! బెదిరిపోయింది. అయినా దొంగలు మరీ బరితెగించారు. రోల్డుగోల్డు గోలుసుకోసం కూడా కత్తులు దూస్తున్నారు" అంది బామ్మ, ఆమె ఆ ఉద్దేశ్యంతో వుండడమే మంచిదనుకున్నాడు. అయిదు నిమిషాల తరువాత మాలకి మెలకువ వచ్చింది. బామ్మ అతడిని పొగుడుతూంది. ఇక అక్కడ వుండడం ఇష్టంలేక వచ్చేశాడు.
కారు ఇంటివైపు వెళ్తూంది.
విహారి చాలా మొండి. ఇంకొకరయితే అయిదు నిమిషాలక్రితం జరిగిన సంఘటనకు బెదిరిపోయి వుండేవాడు. అసలతను దాని గురించి ఆలోచించటంలేదు. ఎడమచేతి క్రింద మోకాళ్ళ క్రింద భాగం, కుడి చెయ్యి పట్టుకున్న భుజాల మెత్తదనం, ఇంట్లోకి ఆమెను తీసుకొస్తున్నప్పుడు ఛాతీకి తగుల్తూ హత్తుకున్న జఘనం అతడిని ఊపిరిసలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాటిమాటికీ పెదాలమీద చిరునవ్వు కదలాడుతోంది.
అతడు ఇంటికొచ్చేసరికి వర్ధనమ్మ అతడి గురించి ఎదురుచూస్తోంది. మెడమీద రక్తపుచార ఆమెకి కనపడకుండా జాగ్రత్తపడ్డాడు.
"నీ కోసం ఎవరో వచ్చార్రా, హాల్లో కూర్చున్నారు. చాలా సేపట్నుంచి" అంది. అతడు హాల్లోకి వెళ్ళాడు.
"మీరేనా విహారి".
"అవును. మీరెవరు?"
"మీకోసం గంటనుంచి చూస్తున్నాను సర్. అక్కడ వాళ్ళందరూ కూడా మీ కోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు వస్తే బయల్దేరదాం."
"ఎవరు వెయిట్ చేస్తున్నారు?" విస్మయంగా అడిగాడు.
"ముఖ్యమంత్రిగారు".
10
అంత రాత్రి ముఖ్యమంత్రి తనకోసం వెయిట్ చేస్తూ వుండడం అతడికి విస్మయంగా అనిపించింది. దానికన్నా ఎక్కువ 'థ్రిల్లింగ్' గా వుంది. అయిదు నిమిషాల తరువాత అతడికి పిలుపొచ్చింది.
ఛాంబర్ లో చీఫ్ మినిష్టర్ ఒక్కరే వున్నారు.
వెళ్ళి ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు విహారి.
కొంచెం సేపు మామూలు విషయాలు మాట్లాడి "సాయంత్రం నువ్వు చెప్పినదంతా కరక్టేకదూ" అన్నారాయన. విహారి ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అక్షరాల నిజం. నేను చెప్తే మీరెవరూ నమ్మకపోవడం దురదృష్టం" అంటూ ఆ తర్వాత తనమీద జరిగిన దౌర్జన్యాన్ని గురించి కూడా చెప్పాడు.
"వియ్ ఆర్ సారీ" అతడి మెడమీద కత్తిగీతని చూస్తూ అన్నారు ముఖ్యమంత్రి. వాళ్ళు అందుకు తెగించిన వాళ్ళే. పోతే వాళ్ళలో నా సీనియర్ సహచరుడు సూర్యారావు కూడా వుండడం విచారకరం. రాజకీయం అంటే తెరవెనుక చాలా భాగోతాలు జరుగుతాయి. కానీ, మరీ పదవికోసం పసిపిల్లల్ని చంపే స్టేజ్ కి ఈ రాజకీయ స్వార్ధాలు దిగజారిపోతాయి అని వూహించలేదు."
"నేను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా కనీసం మీరైనా."
"నేనే కాదు సి.బి.ఐ. డిపార్టుమెంట్ మొత్తం నమ్ముతోంది."
అతడు తలమునకలయ్యేటంత ఆశ్చర్యంతో "మరి నేను చెపుతూ వుంటే అందరూ నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూశారు" అన్నాడు ఇరిటేటిండ్ గా.
"ఆ విషయమే డిప్యూటీ చీఫ్- మిస్ ప్రవల్లికని కనుక్కున్నాను. నువ్వు చెప్పినదంతా అక్షరాలా నిజమని ఆమె ధృవీకరించింది."
"మరెందుకు అలా మౌనవ్రతం పట్టిందట?" వెటకారంగా అడిగాడు.
"విహారీ! నేనీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం గురించిన వ్యవహారాల్నిచూడడం మాత్రమే నా బాధ్యత. ఆమె చెప్పినదాన్నిబట్టి ఇదంత చిన్న విషయం కాదు. దీని వెనుక ఒక అంతర్జాతీయ ముఠా-ఇంటర్నేషనల్ మాఫియా వుంది. అయితే అది స్మగ్లర్ల గాంగ్ కాదు. మతము, సెంటిమెంట్ మీద ఆడుకుంటున్న గ్రూపుకి నన్ను తొలగించి సూర్యారావును ముఖ్యమంత్రి చేయడమన్నది చాలా చాలా చిన్నవిషయం. వాళ్ళ సహచరుడు సరదాగా అడిగితే ఈ పనిని బహుమతిగా ఇవ్వబోయారు. అంత పెద్ద ముఠా అన్నమాట అది. ఈ ముఠా గురించి, ఈ జరిగినదాన్ని గురించి ఇప్పుడే అరగంటసేపు మాట్లాడాను."
"ఎవరితో?"
"మన ప్రధానమంత్రితో-"
విహారి ఊపిరి బిగబట్టాడు. "ఏమన్నాడాయన?"
"నేనే దీన్ని పెద్ద సమస్య అనుకున్నాను. కానీ ప్రధానమంత్రి దీనికన్నా పదిరెట్లు పెద్ద ప్రమాదాన్ని వూహిస్తున్నారు. 'మతం' అనే ఆయుధంతో ఆ స్వామి దేశాన్ని కబళించబోతున్నాడు. ఒక మతానికి చెందిన కనీసం యాభై కోట్లమంది అతని వెనుక అండగా నిలవబోతున్నారు."
"ఇంపాజిబుల్-"
ఆయన విషాదంగా నవ్వేడు. "నేను 'కనీసం' అన్న పదాన్ని ఉపయోగించాను అంటే తక్కువలో తక్కువ అన్నమాట. నువ్వు గమనించే వుంటావు. వేరే ఏ మతపు దేవుడినైనా నువ్వు ఒక్కమాట అను, చీల్చేస్తారు. అదే మన గురించి అయితే ఎంత అవహేళన అయినా చెయ్యొచ్చు. ఇతర మతస్థుల చట్టాన్ని మార్చడానికి కోర్టు కూడా భయపడుతుంది. మనదేశంలోని మనకులేని ఎన్నో సదుపాయాలు మిగతావారికి వున్నాయి, దాన్ని 'క్యాష్' చేసుకుంటే ఎంతోమందిలో ఆవేశాన్ని రెచ్చగొట్టవచ్చు. వారి అండ సంపాదించవచ్చు."
"కానీ లాజికల్ గా ఆలోచిస్తే-"
"లాజిక్...? మతం, ఆచారం- వీటిముందు లాజిక్ పనిచేయదు. రాజస్థాన్ లో 'సతి'ని నువ్వు సపోర్టు చేస్తే యాభై అయిదు శాతం ఓట్లు లభిస్తాయి. 'భర్త చచ్చిపోతే అతడితోపాటు భార్యని తగలబెట్టటం ఏమిటి... నాన్సెన్స్' అని అంటే నలభై అయిదు శాతం లభిస్తాయి. మన దేశంలో అనేమిటి- మనుషుల్లో మతతత్వం ప్రపంచం అంతా అలానే నిండి వుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాడు స్వామి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని ఇరుకున బెట్టడానికి అతి పదునయిన ఆయుధాల్ని రెండింటిని ఆ విధంగా ఉపయోగించబోతున్నాడు. ఒకటి మతం, రెండు టెర్రరిజం. ఉగ్రవాదుల్ని ఆ విధంగా ఉపయోగించి, తన మతస్తుల్ని వరుసగా చంపుతాడు. అది వేరే మతంవాళ్ళు చేస్తున్నారు అని అపోహ కల్గిస్తాడు. ఒక సుప్రభాత సమయాన "ఫలానా మతం వారిని దేశంనుంచి వెళ్ళగొట్టేవరకు నేను నిరాహారదీక్ష చేసి ప్రాయోపవేశం చేస్తున్నాను" అని ప్రకటిస్తాడు. ప్రజలు సపోర్టు ఎవరికి లభిస్తుంది? నిశ్చయంగా స్వామికే! అంతకుముందే ప్రజలు తమ మతం వారికి జరిగిన అన్యాయాల్ని చూశారు. కాబట్టి అతడిని తమ పరిరక్షకుడిగా ఆరాధించడం మొదలుపెడతారు. ఈ దేశానికి స్వామి తప్ప మరో అధినేత లేడన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. అధికారంలో వున్న ప్రభుత్వం- నువ్వన్న లాజిక్ ప్రకారం మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పించాలి. కానీ అది సాధ్యమేనా? కుతకుత వుడికే మతతత్వం ముందు ప్రజాస్వామ్యం నిలవదు. సరిగ్గా ఇదే స్వామి ప్లాను. రెండు మూడు సంవత్సరాలు అకుంఠిత దీక్షతో డిప్యూటీ చీఫ్ శోధించి తయారుచేసిన వివరాలు ఇవి-"
విహారికిచ్చిన అప్పాయింట్ మెంట్ టైమ్ అయిపోయినట్టు సెక్రటరీ వచ్చి గుర్తుచేశాడు. అతడిని వెళ్ళిపొమ్మన్నట్టు సైగచేసి, విహారివైపు చూశాడాయన.
"నిన్ను పిలిపించడానికి ప్రత్యేక కారణం ఏమీలేదు. సామాన్య పౌరుడివి అయినా, నీ అంత సివిక్ సెన్స్ వున్న వ్యక్తిని నేనీ మధ్యకాలంలో చూడలేదు. నువ్వు చెప్తూవుంటే అందరిలాగా ఇదంతా సూర్యారావుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆడిస్తున్న నాటకమేమో అనుకున్నాను. కానీ అసలు సంగతి తరువాత తెలిసింది డిప్యూటీ చీఫ్ ద్వారా."
"ఆమె ఎందుకని అప్పుడు అబద్ధం చెప్పింది?"
చీఫ్ మినిష్టర్ జవాబు చెప్పకుండా బజర్ నొక్కి "ప్రవల్లిక ఇక్కడే వుంది" అన్నాడు. అటెండరు ఆమె కోసం వెళ్ళేక "ఆ క్షణమేగానీ ఆమె నిజం చెప్పి వుంటే ఆ కాన్ఫరెన్స్ హాలు తునాతునకలైపోయి వుండేది. బాంబ్ బ్లాస్టులో ఒక్కరం కూడా మిగిలి వుండేవాళ్ళం కాదు- ఏం జరిగిందో కనీసం పత్రికలవాళ్ళకి చెప్పడానికి."
విహారి దిగ్భ్రాంతుడయ్యాడు.
కొన్ని విషయాలు, అవి ఎంత చిన్న విషయాలయినా వూహకందవు. తను మరీ చిన్నపిల్లవాడిలా ప్రవర్తించాడు. ఆవేశం తప్ప మరేమీ లేదు తనకి. తనకన్నా కనీసం అయిదేళ్ళ చిన్నదయిన ప్రవల్లిక ఆలోచించిన పాటి తను ఆలోచించలేకపోయాడు.
అనంతానంతస్వామి బలంతో పోల్చుకుంటే అక్కడున్న సెక్యూరిటీ చాలా చిన్నది. అసలు విషయం ఏమిటో బయటకు రాకుండా సజీవ సమాధి అయిపోయేవారు.
"మరిప్పుడు నేను చెప్పిన విషయాలమీద మీరు ఎంక్వయిరీ చేస్తారని వాళ్ళకు అనుమానం రాదా?"
"వస్తుంది. కానీ మేమేమీ చెయ్యలేమని వాళ్ళకు తెలుసు. పసిపిల్లల హత్యకి, అనంతనంతస్వామికి సంబంధం ఉందని నేనంటే నాకు పిచ్చెక్కిందనుకుంటారు ప్రజలు."
"స్వామిని మీరేం చెయ్యలేకపోవచ్చు. కానీ సూర్యారావు మీ కాబినెట్ లో మంత్రి."
ముఖ్యమంత్రి మాట్లాడలేదు. విచారాన్ని, నిస్సహాయాతని సూచించే ముడత ఒకటి ఆయన నుదుటిమీద తేలింది. పక్కడ్రాయరు తెరచి ఒక కవరు బల్లమీద పెట్టాడు.
"ఇదేమిటో వూహించగలవా?"
"సారీ, తెలీదు."
"మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తున్నట్టు సూర్యారావు ఇచ్చిన ఉత్తరం."
బలమైన కెరటం వచ్చి మొహానికి తగిలినట్టు అయింది విహారికి.
ఆయన చెప్పడం ప్రారంభించాడు. "ఈ రోజు జరిగిన సంఘటన తన మనసుని కలచి వేసిందని, తనమీద అనవసరమైన అభాండం పడినాక, తను ఇక పదవిలో కొనసాగలేననీ సూర్యారావు రాజీనామా సమర్పించాడు. అతడికి తనవంతూ రెండు మూడు దినపత్రికలున్నాయి. రేపు అవన్నీ అతడి నైతిక ప్రవర్తనని పొగుడుతూ వ్రాస్తాయి. ఆకాశానికి ఎత్తేస్తాయి. ప్రజల దేముంది? పత్రికలు జనాభిప్రాయాన్ని చాలా సులభంగా మార్చగలవు. అతడికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది నేనే. అతనేం అడగలేదు. ఆ విషయాన్నీ హెడ్ లైన్స్ గా పెడతాయి. అటువంటివాడు రాజీనామా చేసాడనగానే సానుభూతి అతడిమీద వెల్లువలా పొంగుతుంది. సరియైనచోట నామీద దెబ్బకొట్టాడు. స్వామిమీద గానీ, అతడిమీదగానీ నేనే రకమైన విమర్శ చేసినా-" ఆయన ఆగి నెమ్మదిగా పూర్తి చేశాడు- "వెంటనే మా మంత్రివర్గం కూలిపోతుంది."
ప్రత్యర్ధి ఎంత వేగంగా ఆలోచించగలడో విహారికి అర్ధమైంది. ఆ తెలివితో పోల్చుకుంటే తను ఎంత దిగువన వున్నాడో కూడా తెలిసింది. అతడి మనసు వ్యాకులమైంది. సామాన్య మానవుడు కలలో కూడా వూహించలేని సాలెగూళ్ళు ఇవి.
"మరిప్పుడు ఏం చెయ్యబోతున్నారు?" అడిగాడు.
"నేను చేయగలిగిందేమీలేదు. చెప్పానుగా! కేవలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేను. ఇది దేశానికి సంబంధించింది. ప్రమాదం పొంచి వుంది. వచ్చే ఏకాదశి నుంచి స్వామి తన కార్యకలాపాలకు తుదిరూపం ఇవ్వడానికి ముహూర్తం నిర్ణయించాడని మాత్రం సి.బి.ఐ. రిపోర్టు ఇచ్చింది. వాళ్ళ అంచనా కరెక్టయితే సరీగ్గా నెలరోజుల్లో దేశం అతడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం ఏ విధంగానైనా అతడిని వ్యతిరేకించినా, అతడు సార్వభౌమత్వం డిక్లేర్ చేసిన గంటలోనే అతడి రాజకీయాధికారాన్ని గుర్తించడానికి ఫిజి ఐలెండ్ మొరాకో, ఫిలిఫ్ఫైన్స్ తో సహా రెండు అగ్రరాజ్యాలు సిద్ధంగా ఉన్నాయి."
"నేను నమ్మలేను. ఇంత ప్రమాదం ఇంత దగ్గిరగా వున్నా ఎవరికీ తెలీదంటే నేను నమ్మలేకుండా వున్నాను."