'సుపుత్రా ప్రాప్తిరస్తు!' అని అందరూ మనసారా దీవించారు.
గౌతముల మోము నిండా వెన్నెలకు దీటైన చిరునవ్వు వెలుగుతూ ఉంది. అహల్య మోములో నునుసిగ్గు దొంతరలు.
10
అమరావతి.
బ్రహ్మ సన్నిధి నుండి భంగపడి, నిరాశకు లోనై అమరావతికి తిరిగి వచ్చిన అమరేంద్రుడు ఒంటరిగా నందనోద్యానంలో పారిజాత వృక్షం నీడన నిలుచున్నాడు.
అతని మనసు నిండా వేదన... ఆ వేదనని మించి అహల్యా రూపం ఆవేదననీ అహల్యనూ తోసిరాజంటూ ఆత్మ వేదన. అహల్యా అహల్యా... అప్రయత్నంగా అమరేంద్రుడి నోటివెంట వెలువడింది.
ఈ పాటికి ఆ జడదారి అహల్యణు వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్ళి ఉంటాడు అనుకున్నాడు.
అలా అనుకోగానే అతని మనస్సులో అసూయ కదలాడింది. తనని తను నిందించుకున్నాడు.
సభ ఏర్పాటు చేసి సరసులయిన అందరిముందు అందగత్తెలయిన అచ్చెరలు నాట్యమాడితే చూసి ఆనందించక, అందరిలోనూ అందగత్తె ఎవరు అని తను ఎందుకు అడిగాడు? అడిగితే అడిగాడు. ఎవరో ఒకరి ఎవరి పేరో ఒక పేరును సూచిస్తే దాన్ని అందరూ అంగీకరిస్తే పోయేదానికి, ఎవరికి నచ్చిన సుందరి పేరు వాళ్ళెందుకు చెప్పాలి?
చెపితే అందరి వాదనలు విని విన్న తను సుర నాధుడిగా, సకల లోక పాలకుడిగా తనకు నచ్చిన ఏదో ఒక పేరు చెప్పి- ఎవరినీ నొప్పించకుండా ఒప్పించక తగుదునమ్మా అంటూ తగాదా పరిష్కారానికి ఆ సృష్టికర్త సన్నిధికి మందగట్టుకుని ఎందుకు వెళ్ళాలి? వెళ్లాను పో- ఆ సృష్టికర్త ఇన్ని యుగాలుగా, ఇందరు సుందరీమణుల్ని సృష్టించినవారు ఏదో ఒక పేరు చెప్పి ఆమే జగదేకసుందరి అని నిర్ణయిస్తే ఎవరు కాదనగలిగేవారు? ఎవరు ఎదురు ప్రశ్నించేవారు? కాదు- ఎవరి పేరు చెబితే ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనుకుంటే...
సుర సుందరీమణులలో సుందరాంగి సరస్వతీదేవి అని ప్రకటించి ఉంటే- ఆయన అర్ధాంగి అని అయినా అందరూ అంగీకరించేవారు కదా! అర్ధాంగి అందచందాలూ నాలుగు ముఖాలా చూసినా కనిపించి ఉండకపోతే- జగన్మాత పార్వతీదేవి పేరు చెప్పి వుండరాదా! ముక్కంటి కంటి మంటలకు జడిసి అయినా సర్వులూ శిరః కంపన చేసి శిరసావహించి ఉండేవాడు కదా?
కాదు ఎందుకు ఆ త్రిమూర్తులతో పేచీ అనుకుంటే అష్ట దిక్పాలకులున్నారు కదా. వారి పత్నుల పేర్లు ప్రకటించి ఉంటే ఏం పోయేది?
శచీదేవి పేరు చెప్పిఉంటే తనకెంత సంబరంగా, సమ్మతిగా ఉండేది? త్రిమూర్తులు ముగ్గురూ కలిసి సృష్టిస్థితి లయాధిపత్యం కలిగివున్నా, సురనాధుడు తనే కదా! ముక్కోటి దేవతల మొక్కులందే మొదటి వేలుపు తనే కదా!
తన అర్ధ సింహాసనం అలంకరించగలిగిన శచీదేవి జగదేక సుందరి అని ప్రకటించి ఉంటే అది తనకున్న అధికారాలకీ, ఐశ్వర్యాలకీ, అర్హతలకీ మరో అదనపు అందం అయి ఉండేది కదా!
కాదు- అఖిల లోకాధిపతినన్న పక్షపాతంతో ప్రకటించారని అనుకోవడం ఆడిపోసుకుంటారు అనే జంకు వుంటే మిగతా దిక్పాలకులున్నారు కదా- స్వాహాదేవి పేరు ప్రకటించి ఉంటే అది అగ్నికి ఆనందం కలిగించి ఉండేది కదా?
యముడికి భయపడో- అతని అధికారాలన్నీ గౌరవించో అతని అర్ధాంగి పేరు ప్రకటించి ఉండరాదా? వాయువు సర్వలోకాలకూ ప్రాణదాత కదా అని మన్నించి అతని సతిని గౌరవించి ప్రకటించి ఉండరాదా! నిరృతిని మన్నించి ఉండకూడదా? వరుణుడి సతిని ప్రకటించి వరుణుడి కీర్తిని మరింత వన్నె తెచ్చి ఉండరాదా?
ఈశానుడున్నాడే- ఆయన పనికిరాలేదా? గుర్తులేదా? ఆయన సఖుడు ఉత్తర దిశానాధుడు- కుబేరుడు ధనం మూలం ఇదం జగత్ అని కదా నానుడి- అందరి అధికారాలూ ఐశ్వర్యం దగ్గరే ముగుస్తాయి కదా- ఆయనని గౌరవించి ఉండకూడదా? ఆయన అర్ధాంగే అందరికన్నా అందగత్తె అని ప్రకటన చేసి ఉండరాదా?
పశ్చిమ దిశానాధుడు- వరుణుడు- ప్రాగ్నాధుడ్ని నేను- దక్షిణాధిపతి యముడు ఉత్తర దిశానాధుడు కుబేరుడు- మేం ఎవరమూ పనికిరాలేదా? ఎవరి పేరూ ప్రకటించకుండా ఎవరేమని తలుస్తారోనని ఆలోచించకుండా ఇంతవరకూ ఏ లోపమూ లేని స్త్రీని సృష్టించనే లేదు. ఇదిగో ఇప్పుడు సృష్టిస్తున్నానని ఆ నలుమోముల మేలుపు అప్పటికప్పుడే అహల్యని ఎందుకు సృష్టించాలి?
సృష్టించాడు పో. సృష్టించే వేళలోనే ఎవరికో ఒకరికి బ్రహ్మ ముడిపెడతాడన్న లోకోక్తి ప్రకారం ఫలానా వాడికి- అదే ఆ గౌతమ మునీంద్రునికే అనుకుందాం- నిర్ణయించానని అతనికే ఇచ్చి చేసి ఉండరాదా! అలా కాకపోతే...
అడిగింది నేను- అవసరం కలిగించింది నేను- అమరాధిపుడ్ని నేను- అన్ని విధాలా అన్ని అర్హతలూ ఉన్నవాడిని నేను. నాకు ఎందుకు కన్యాదానం చేసి ఎందుకు కన్యను అప్పగించి ఉండకూడదు? అనుకుంటే ఎందుకు పందెం ప్రకటించాలి?