కళ్ళప్పజెప్పి చూస్తున్న రవిని చూసి నవ్వింది. అతడి ఆపాదమస్తకమూ ఝల్లుమంది. ఆ సంభ్రమంలో అతడి చెయ్యి టార్చిలైట్ స్విచ్ మీది నుంచి తొలగిపోయింది. ఆ చీకట్లో ఆమె అతడిని ఒరుసుకుంటూ ముందుకు సాగిపోయింది. అతడి నరనరాన విద్యుత్తరంగాలు బోరుపెట్టాయి. తనని తాను తిట్టుకుంటూ మళ్ళీ టార్చ్ వెలిగించాడు.
ఆ అమ్మాయి కనిపించలేదు. చుట్టూ టార్చ్ ఫోకస్ చేశాడు. పొదలతో, గుట్టలతో, గుంటలతో, దట్టమైన అడవి-ఏమయి ఉంటుంది? ఏ పొదచాటున అయినా దాక్కొని ఉంటుందా?
అలా దాక్కోవలసిన అవసరం ఏం ఉంటుంది? ఒకవేళ దాక్కొందని అనుకున్నా, ఈ అడవిలో ఏ పొదమాటున ఆమెని వెతగ్గలడు? ఆడది ఇంత రాత్రివేళ ఒంటరిగా అడవిలోకి ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్తోంది? పెద్దింటి పిల్ల అని చూడగానే అనిపిస్తోంది.
ఇంట్లోవాళ్ళు ఎలా రానిచ్చారు? ఈ అమ్మాయి నిజంగా స్త్రీయేనా? లేక...లేక... కథల్లో చెప్పినట్లు కామినీ పిశాచమా?
ఫోరెన్సిక్ లాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. గుహలోకి వెళ్ళినప్పుడు బట్టలమీద పడ్డది రక్తమేననీ, అయితే అది మనిషి రక్తం కాదని గొర్రె రక్తమనీ, ఒకరోజుకంటే ఎక్కువ నిలవ వున్నది కాదనీ రిపోర్ట్స్ వచ్చాయి.
రవికి ఏ ఆలోచనా పాలుపోలేదు. ఆ గుహలోకి ఏ రక్తం కానీ, ఎలా వచ్చింది? ఎవరో చిలకరించినట్లుగా గుహలోకి వెళ్ళిన అందరిమీదా ఆ రక్తపు జల్లు ఎలా పడింది? ప్రధానంగా గుహ ముఖ ద్వారానికి సమీపంలో ఆ ఉధృతమైన గాలులెందుకొస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపలి గుహలో గాలులు లేకపోవటానికి సమశీతలంగా వుండటానికి కారణమేమిటి?
"గొర్రె రక్తం! అక్కడ మనకు కనిపించిన వ్యాళాసురుడూ, వ్యాఘ్రాసురుడూ, ఎవరో క్షుద్రదేవతలై వుంటారు. వాటికి గొర్రెలని బలి ఇచ్చి వుంటారు. ఆ రక్తం గాలికి మనమీద పడి ఉంటుంది" అన్నాడు విష్ణు.
"కానీ, మనకి అక్కడ గొర్రె కళేబరం కానీ, రక్తం కానీ కనపడలేదు గదా!" అడిగింది అనిల.
"చంపిన గొర్రెని తీసుకుపోయి ఉంటారు. నైవేద్యం వండుకు తినటానికి! నెత్తురు నేలమీద గడ్డ కట్టి ఉందేమో! మనకా చీకట్లో ఏం కనిపిస్తుంది?"
"అలా అనుకున్నా నేలమీదది మన వంటిమీదకి అలా చిలకరించినట్లుగా రాదు! ఎవరో పని కట్టుకుని మనమీద జల్లినట్లు ఉన్నాయి ఆ నెత్తురు మరకలు! అయినా, ఈసారి నేలని పరీక్షగా చూద్దాం" రవి అన్నాడు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం! మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళి నేలమీద ఏం ఉందో చూడటానికి అక్కడి అందరూ సంసిద్దంగా లేరు.
విష్ణు రవిని కాస్త పక్కగా పిలిచి "ఇంతకీ ఇక్కడ ఇంకా నిధులు వున్నాయంటావా?" అన్నాడు.
అతడు ఈ ప్రశ్న అడగటం నూట పదకొండోసారి! రవికి కొద్దిగా చికాకు కలిగింది. సాధారణంగా గంభీరంగా ఎదుటి వ్యక్తులకి తనంటే గౌరవం కలిగేలా వుండే విష్ణు డబ్బు విషయం వచ్చేసరికి చాలా బేలగా అయిపోతాడు.
ఎంత ప్రయత్నించినా డబ్బంటే తనకి వుండే "యావ" కప్పిపుచ్చుకోలేడు. ఈ ఎక్సకవేషన్ కి విష్ణు సహాయం ఎందుకు కోరానా అని అతడు మధనపడ్డ సందర్భాలు తక్కువలేవు. కానీ, యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్ మీద పంతం కొద్దీ, అతడి సహాయం తీసుకోవటానికి సిద్ధపడ్డాడు.
రవి తెలివైనవాడు. తన వృత్తిలో విధి నిర్వహణలో ఏనాడూ, ఏ చిన్న పొరపాటూ రానీయలేదు. అయినా యూనివర్శిటీ పాలిటిక్స్ సీనియర్ ప్రొఫెసర్ రీసెర్చ్ కి వచ్చినవాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ నందరినీ, ప్రధానంగా తను తీసుకుని లేదా తను అభిమానించే రీడర్స్ కిచ్చి, రవికి మాత్రం ఏవరేజ్ స్టూడెంట్స్ ని అలాట్ చేసేవాడు.
వాళ్ళు సహజంగానే ఏవరేజ్ కావటంవల్ల, వాళ్ళకి ఆర్కియాలజీలో ఇంటరెస్ట్ కంటే, ఉద్యోగం మీది ఆశే ఎక్కువ ఉండేది. మెరిట్ స్టూడెంట్స్ కాకపోవటం వల్ల స్కాలర్ షిప్స్ ఉండేవి కావు. అందుచేత ఉద్యోగం రాగానే రీసెర్చ్ వదిలేసేవారు.
ఉద్యోగం దొరక్క పనిచేసేవాళ్ళయినా చాలా మందకొడిగా వర్క్ చేసేవారు. ఈ కారణాల వల్ల రవి గైడెన్స్ లో రీసెర్చ్ చేసిన వాళ్ళెవరూ లేకపోయారు. ఇదొక అనర్హతగా అతడికి ప్రొఫెసర్ షిప్ రాలేదు. ఈ పాలిటిక్స్ తో విసిగిన అతడు ప్రాచీన మత విధానాలకు సంబంధించిన శిల్పాలమీద పరిశోధన చేసి పుస్తకాలు వ్రాయాలనుకున్నాడు.
ఈ ప్రయత్నంలో తిరుగుతుండగా అతడికి ఒక చిన్న గ్రామంలోని నృసింహస్వామి దేవాలయం పూజారి ఇంట్లో ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథం దొరికింది. అది దేవనాగరిలిపిలో సంస్కృతంలో ఉంది. విక్రమాదిత్యుని చరిత్ర అది.
మ్లేచ్చుల బాధ దేశంలో ఎక్కువయిందట! దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తే, శివుడు తన ప్రథమ గణాలలో మాల్యవంతుడిని ఉజ్జయిని పరిపాలించే మహేంద్రాదిత్యుడికి పుత్రుడిగా పుట్టించాడట. విక్రమాదిత్యుడి దిగ్విజయాలూ, అతడి సాహస కార్యాలు, అతడు మదన లేఖనూ, కళింగసేననూ, మలయవతినీ వివాహం చేసుకోవటం మొదలైన కథలన్నీ వున్నాయి అందులో.
అన్నిటికంటే రవిని ఆకర్షించిన విశేషాంశం ఒకటి ఉంది. మగధ రాజైన సుశర్మ హిందువు వైదిక మతాభిమాని. ఆ కాలంలో బౌద్ధం చాలా ప్రబలంగా వుండేది. బౌద్ధమతాభిమానులూ వైదిక మతాన్ని అభిమానించి ప్రోత్సహించే సుశర్మను వధించాలనుకున్నారు.
ఆ విషయం సుశర్మ గ్రహించి తన రాణి పద్మ రాణితో సహా వర్మ భైరవస్వామిని ఆరాధించే మిషతో, లక్ష్మీ నగరానికి వచ్చాడు. అక్కడ ప్రత్యేకించి రాజుకోసం, రాజ పరివారం కోసం భవనాలు నిర్మించారు. రాజు వెంట శిల్పులూ, గాయకులూ, చిత్రకారులూ మొదలైన వారంతా వచ్చారు.
ఆ రోజుల్లో అలాగే వచ్చేవారు. సుశర్మ మహారాజు అక్కడి గుహల్లో తన ధన సంపదనీ, ఆయుధాలనూ జాగ్రత్త పరచి ఆ ధనమంతా వైదిక మత పునరుద్ధరణకే వినియోగపడాలని తగిన కట్టుదిట్టం చేశాడు. ఈలోగా మ్లేచ్చులు అతడిపై దండెత్తి అతడిని వధించారు. అతడి రాణి సహగమనం చేసింది.
ఇంతే ఉంది, ఆ గ్రంథంలో....
సుశర్మని చంపింది మ్లేచ్చులా? లేక శాతవాహనులా? లేక విక్రమాదిత్యుడా? విక్రమాదిత్యుడే కుంతల శాతకర్ణి కావచ్చునంటోంది, శాతవాహన సంచిక. కానీ ప్రమధ గణాల సంతతివాడైన విక్రమాదిత్యుడు బౌద్దుడైన కుంతల శాతకర్ణి కావటం సంభవమేనా? శాతవాహనుల ఆస్థానంలో ఒక సుశర్మ ఉన్నట్లు కథా సరిత్సాగరంలో వుంది. మగధ రాజైన సుశర్మను ఆంద్ర శాతవాహనులు జయించారన్నది చాలామంది ఒప్పుకుంటున్న చారిత్రక సత్యం!
ఏ రాజు ఎప్పుడు జయించాడన్న విషయంలోనే వాదోపవాదాలు. విశ్వనాథ "పులిమ్రుగ్గు" నవలలో సుశర్మను చంపింది శాతవాహనులలో మొట్టమొదటివాడైన "శ్రీముఖ శాతకర్ణి" అన్నారు. అడవి బాపిరాజు "హిమబిందు" నవలలో సుశర్మను చంపింది "శ్రీకృష్ణ శాతకర్ణి" అన్నారు.
సుశర్మ పేరుతో వున్న నాణేలూ, "కన్న" (శ్రీకృష్ణ శాతకర్ణి) పేరుతో వున్న నాణేలూ ఒక ప్రాంతంలో కనిపించాయని పరిశోధకులు అంటారు. చాలామంది సుశర్మను వధించినది కుంతల శాతకర్ణి అనే అభిప్రాయంలోనే వున్నారు.
ఈ తాళ పత్ర గ్రంథం చదివిన తర్వాత ఉత్సాహంతో ఈ విషయంలో పరిశోధన చెయ్యటానికి ఆర్ధిక సహాయం చెయ్యమని యూనివర్శిటీని కోరాడు. యధాప్రకారం యూనివర్శిటీ కమిటీ, తగిన పరిశీలన లేకుండానే ఈ వ్రాతలన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.
రవి ఏమీ చెయ్యలేకపోయాడు. ఎక్కడికక్కడ లంచగొండి తనమూ, అవినీతి, దురహంకారమూ ఏలుతున్న రాజ్యంలో రవిబోటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు.
రవి స్నేహితుడు అతడిని విష్ణువర్ధన్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఎటుచూసినా ప్రాచీన కళా సంపద తొణికిసలాడుతోంది. గోడల మీద అజంతా చిత్రాలకి ప్రతిరూపాలైన తెల్ల వర్ణ చిత్రాలు వేలాడుతున్నాయి. జీవకళ వుట్టిపడుతోన్న సైడ్ టేబిల్ పైన గ్లాసు షోకేసులో చందనంతో చేసిన నటరాజస్వామి విగ్రహం. మరొకపక్క ఎత్తయిన బల్ల మీద పాలరాతిలో మలచిన రాధాకృష్ణ విగ్రహాలు. ఆ విగ్రహాలలో ఔత్తరాహుల శిల్పకళ కనిపిస్తోంది.