విజ్జి చెప్పిన కథ : ఓడ ప్రయాణం
రెండు రోజుల కల్లోలం తరువాత ఆ రోజు సముద్రం కొద్దిగా శాంతించినట్లయ్యింది. అప్పటివరకూ ఎవరి కాబిన్స్ లో వాళ్ళు బంధించుకుని కూర్చున్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా బయటికి రాసాగారు.
ఆ రోజు బాగా ఎండ కాసింది. మబ్బులు కూడా విచ్చుకుని దూరం దూరంగా సాగిపోవటం ప్రారంభించాయి. ఇంక ప్రమాదం ఉండదని అందిరికీ ధైర్యం వచ్చింది. చీకటిపడింది ఆ రోజు రాత్రి డిన్నర్ హల్ లో ఎప్పుడూ కనబడని వాళ్ళు కూడా కనిపించారు.
యూరప్ నుంచి మద్రాసుకు వస్తూన్న ఓడ అది, దాదాపు రెండొందలమంది ప్రయాణీకులతో నిండివుంది. అందులో సగం మంది ఆ రాత్రి అక్కడ డైనింగ్ హాల్లో ప్రతిధ్వనిస్తూంది. రాత్రి పదిన్నర కావస్తూంది.
సరిగ్గా సగం డిన్నర్ పూర్తయ్యే టైమ్ కి చిన్న కుదుపుతో ఓడ అటూ ఇటూ కదిలింది. హాల్లోవున్న వాళ్ళందరూ ఒక క్షణం మాట్లాడం ఆపటంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది. అందరూ ఒకర్నొకరు చూసుకున్నారు. మొదటిసారి చిన్నగా వున్న ఆ కుదుపు రెండోసారి మరింత బలం పుంజుకుని ఓడని వూపేసింది. కుర్చీలో కూర్చుని తింటున్న వాళ్ళు, లేవాలావద్డా అని ఆలోచనలో పడ్డారు. కొందరు అసలు దాన్ని గుర్తించనట్లే నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ మొహంలో కూడా నవ్వు తొందర్లోనే మాయమైంది.
మొదటి కుదుపు వచ్చిన పది నిమిషాలకి ఇంకో పెద్ద అల వచ్చి ఓడని తాకింది. నీళ్ళలో బంతిలాగా ఒక పక్కకి ఒరిగింది ఓడ గ్లాసులు పడిపోయాయి. ప్లేట్లు. జారిపోయాయి. ఇద్దరు ముగ్గురాడవాళ్ళు కెవ్వున అరిచారు కూడా. "భయంలేదు భయంలేదు" అంటున్నా రెవరో.
ఆ తరువాతఓడ మళ్ళీ మామూలుగా ప్రయాణం సాగించింది.
బయట గాలివేగం పెరిగింది. తాగుతున్న గ్లాసు పూర్తిచేసి దైవాధీనం లేచాడు. తలుపుదాటి, జాగ్రత్తగా మెట్ల పక్కనున్న గొలుసు పట్టుకుని పైకి ఎక్కసాగాడు. రెండు అంతస్తులు దాటి పైకి వచ్చాడు. ఓడమీద ఎత్తుగా వున్న వీస్తూంది. తాటిచెట్టునైనా ఎత్తి పడేసేటంత వేగంతో వీస్తూంది గాలి. రెండు తాళ్ళ ప్రమాణంలో లేస్తున్న కెరటానికి ఓడ అటూ ఇటూ వూగుతుంది. అందులోనూ అది పై భాగం అవటం వల్ల ఆ తాకిడి మరీ ఉధృతంగా వుంది.
ఉత్తరదిక్కునుంచి ఏనుగులా వస్తున్న నల్లటి మేఘాన్ని చూస్తూ- 'ఈ రాత్రి ఓడలో వాళ్ళకి కాళరాత్రే' అనుకున్నాడు. ఇంతలో- "ఎవరదీ" అన్న కేక వినిపించింది. ఒక పెద్దాయన పైకి వచ్చాడు. వయసు యాభై దాటినా బలిష్టంగానే వున్నాడు. అతడు డిప్యూటీ కెప్టెన్.
"ఈ వేళప్పుడు. ఇలా రాకూడదని తెలీదా" అధికార పూర్వకంగా అన్నాడు దైవాధీనం అతడికి క్షమాపణలు చెప్పుకున్నాడు. దూరంగా సముద్రంలో అలలు ఎత్తుగా లేచి విరుచుకు పది ఆ చీకటిలో భయం కొల్పుతున్నాయి.
"మనకేం ప్రమాదం లేదుకదా?" దైవాధీనం అడిగాడు.
"ప్రమాదమా?" బిగ్గరగా నవ్వాడు అతడు. "ఇలాటి తుఫాన్లని లక్ష చూశాను నేను"
మెట్లకున్న గొలుసులు పట్టుకుని జాగ్రత్తగా దిగాసాగాడు దైవాధీనం. ఏ మాత్రం పట్టు తప్పినా శరీరం గాలిలో ఎగిరి ఎక్కడో కొట్టుకోవటం తప్పనిసరి.
అతడు నెమ్మదిగా మెట్లు దిగుతూ వుండగా అప్పుడొచ్చింది- ప్లాష్ లాటి ఆలోచన. ఆ ఆలోచన వచ్చాక అతడు చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడు. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగాడు. సముద్రం ఇంకా ఆల్లకల్లోలంగానే ఉంది. ఓడ వూగుతూనే ఉంది. అరగంట క్రితం ఆనందంతో వెల్లివిరిసిన ఆ డైనింగ్ రూమ్ ఇప్పుడు మనుష్యులు లేక వెలవెల బోతూంది. అందరూ వారివారి కాబిన్స్ లోకెళ్లి తలుపులు బిగించుకున్నట్టున్నారు అనుకున్నాడు.
జూదంమీద ఉత్సాహం వున్నవాళ్ళు మాత్రం స్మోక్ రూమ్ చేరుకుంటున్నారు.
ఓడల్లో కొత్తరకం జూదం ఆడబడుతుంది. ఓడ ప్రయాణీకులకి కాలక్షేపం కలగాజేయుటం కోసం నిరపాయకఠమైన ఆట అది. అందరూ సులభంగా దీన్లో పాల్గొనవచ్చు. చివరకు ఆడవాళ్ళుకూడా.
ఒకరోజులో తన ఓడ ఎంతదూరం ప్రయాణం చెయ్యగలదో కెప్టెన్ అంచనా వేస్తాడు. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల్నుంచి మరుసటిరోజు పన్నెండు గంటల వరకూ ఓడ ఎన్నిమైళ్ళు ప్రయాణం చేస్తుందో లెక్కకట్టి ఉజ్జాయింపుగా చెప్తాడు. దానిమీద పందెం ప్రారంభమవుతుంది. కొంతమంది ఆశావాదులు అంతకన్నాఎక్కువ వెళ్తుంది అని పందెం కాస్తారు. ఎవరు యదార్థానికి దగ్గిరగా వెళ్ళగలిగితే వాళ్ళకి ఆ పందెం డబ్బు వెళ్తుంది.
దైవాధీనం డిప్యూటీ కెప్టెన్ కి సిగరెట్ ఆఫర్ చేశాడు.
ఆ చలిగాలికి, గుండెల్నిండా చేరిన సిగరెట్ పొగ యెంతో ఉత్తేజాన్ని కలిగిస్తూంది. దూరంగా పైకి లేస్తూన్న కెరటాలు సముద్రం మీద పరచుకున్న చీకటిలో వికృతంగా మెరుస్తూ భయం కలిగిస్తున్నాయి.
"రేపు పన్నెండింటి లోపులో ఓడ ఎంతదూరం వెళుతుందో మన కెప్టెన్ ఎస్టిమేషన్ వేశాడా?" చాలా మామూలుగా అడిగాడు దైవాధీనం.
డిప్యూటీ కెప్టెన్ తన తెల్లటి జుట్టును చెవి వెనక్కి తోసుకుంటూ "చేసే వుంటాడు. మధ్యాహ్నం నేవిగేటింగ్ ఆఫీసరుతో మాట్లాడుతూ వుండగా చూశాను" అన్నాడు.
"మధ్యాహ్నం మన వాతావరణ సూచన ఎలా వుంది?"
"గత మూడు రోజులుగా సముద్రంలో డిప్రెషన్ (పీడనం ) ప్రోద్దున్నతో పోయిందని రిపోర్టు వచ్చింది. ఇంక అంతా క్లియర్ గానే వుంటుందని అనుకున్నాం. అందరూ తమ తమ గూళ్ళల్లోంచి వస్తారని మంచి డిన్నర్ కూడా ప్రయాణీకుల కోసం ఈ రోజు స్పెషల్ గా చేయించాము. కానీ తుఫాను మళ్ళీ తిరగబెట్టినట్టుంది."
"మనకేం ప్రమాదం లేదుగా" మళ్ళీ అడిగాడు.
"ప్రమాదమా?" బిగ్గరగా నవ్వేడు డిప్యూటీ కెప్టెన్. "ఇలాంటి తుఫాన్లని ఎన్నిటినో తట్టుకుంది ఈ ఓడ."
"ఆ విషయం నాకూ తెలుసు" మనసులో అనుకున్నాడు దైవాధీనం. పైకి మామూలుగా, "ఈ వాతావరణం మార్పు చూసి, మన కెప్టెన్ తన ఎస్టిమేషన్ లెక్క మార్చుకోడుగా."
"వీల్లేదు. ఎలా మార్చుకుంటాడు? తన లెఖ్ఖ సాయంత్రమే ఆక్షనీరు(వేలం పాటగాడు) కి ఇచ్చేశాడుగా."
అదే అతడికి కావల్సింది. షేక్ హాండిస్తూ. "ఈ రాత్రి ఏం చెయ్యబోతున్నారు సర్" అని అడిగాడు.
"ఈ రోజు రెస్టు డే. అందులోనూ చలిరాత్రి. వెళ్లి శుభ్రంగా రెండు పెగ్గులు తాగి నిద్రపోతాను" అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు.
దైవాధీనం స్మోక్ రూమ్ వైపు నడిచాడు. అంతలో ఎదురుగా నేవిగేటింగ్ ఆఫీసర్ వస్తూ కనబడ్డాడు. దైవాధీనం ఒక పక్కకి నమ్రతగా వత్తిగిలి నిలబడి ఆయన దగ్గరికి రాగానే. "గుడ్ మార్నింగ్" అన్నాడు రాత్రిని.
"గుడ్ మార్నింగ్" హడావుడిగా వెళుతూ అన్నాడు.
"ఏమిటి ఓడ వేగం తగ్గిపోయింది."
"ఈ తుఫానులో ఇంతకన్నా సాధ్యంకాదు."
"దాదాపు సగం అయిందనుకొంటా."
"సగం ఏమిటి? మామూలు వేగంలో నాలుగోవంతు కూడా లేదు" ఇంజన్ రూమ్ వైపు దిగుతూ ఆయన అనేసి వెళ్ళిపోయాడు.
దైవాధీనం తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. మామూలు జూదగాళ్ళకు తెలియనివి తనకి చాలా విషయాలు తెలిశాయి. ఈ ఇరవై నాలుగు గంటల్లో ఓడ యెంత దూరం వెళ్ళగలదూ అన్న విషయం ప్రొద్దున పన్నెండు గంటలకే నిర్ణయమైపోయింది. ఆ తరువాత తుఫాను తిరిగి విజృంభించింది. ప్రస్తుతం ఓడ మామూలు వేగంలో నాలుగో వంతే వెళుతూంది.
దైవాధీనం మొహం అదోరకం వెలుగుతో మెరిసిపోయింది. వడివడిగా స్మోక్ రూమ్ కి వెళ్ళాడు. అప్పటికే అక్కడికి చాలా మంది చేరుకొన్నారు. ప్రళయం వచ్చినా- జూదానికి అలవాటు పడితే ఆ టైమ్ కి అక్కడికి చేరుకోవాల్సిందే.
ఆక్షనీర్ (వేలం పాటగాడు) తన స్థానాన్ని ఆక్రమించాడు.
పందెం ప్రారంభం అయింది.
"ఈ రోజు కెప్టెన్ అంచనా ప్రకారం మన ఓడ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సరిగ్గా అయిదొందల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. దీనికి పదిమైళ్ళు అటూ ఇటూగా పందెం కాసే వాళ్ళున్నారా?" అన్నాడు ఆక్షనీరు.
సాధారణంగా కెప్టెన్ అంచనా మీద చాలామందికి నమ్మకం వుంటుంది. దాదాపు ఆరుగురు వేలం మొదలుపెట్టారు. రాగల ఇరవై నాలుగు గంటల్లో ఓడ 482మైళ్ళనుంచి 510 మైళ్ళ వరకూ ప్రయాణం చేస్తుందని భావించిన వాళ్ళమధ్య పందెం అది. ఒక ముసలతను లేచి "పది పౌండ్లు" అన్నాడు.
బ్రిటీషు ఓడ అది. పందెం అంతా పౌండ్లులో జరుగుతూంది. దైవాధీనం ఎప్పటికప్పుడు రూపాయిల్లోకి లెక్క మార్చుకుంటున్నాడు.
ఇంకో ఆస్ట్రేలియాను లేచి- "పన్నెండు పౌండ్ల దగ్గిర స్ట్రయిక్ చేశాడు. అంటే ఓడగాని మరుసటిరోజుకి 490నుంచీ 510మైళ్ళ మధ్య ప్రయాణం చేస్తే ఆ వేలంలో పోగైన డబ్బంతా ఆ ముసలతనికి వెళుతుందన్నమాట. 490-510 అన్న సంఖ్యని ముసలతను 70 పౌండ్లకు కొనుక్కున్నాడు.
తరువాత510 నుంచీ 530 మైళ్ళకి పాట జరిగింది. దాని మీద బెట్ యాభై పౌండ్లకి సెటిల్ అయింది. ఒక ఐరిష్ స్త్రీ దాన్ని కొనుక్కుంది వేలంపాటలో.
530 నుంచి 550కి మరో ముప్ఫై పౌండ్లకి పాడబడింది.
ఆ తరువాత కెప్టెన్ నిరాశావాదులవైపు తిరిగాడు. 470 నుంచీ 490 మాత్రమే వెళుతుందనీ ఒక ఆంగ్లో ఇండియన్ రెండు వందల పౌండ్ల దగ్గిర పందెం కాశాడు. ఈ సంఖ్యకోసం వేలం పాట ముమ్మరంగా సాగింది. బైట తుఫానుని చూసి, చాలామంది 450 నుంచీ 490 వరకూ పందెం కాయటానికి సిద్ధపడ్డారు. వేలం పాట అయిదొందల పౌండ్లవరకూ వెళ్ళింది. 440 దగ్గిర మరో వెయ్యి పౌండ్ల పాట కొనసాగుతూంది.
ఆక్షనీరు అప్పటివరకూ పోల్ అయిన మొత్తాన్ని లెక్కగట్టి చెప్పాడు. "యాభైవేల రూపాయలు."
దైవాధీనం గుండె సంతోషంతో ఒక్కక్షణం ఆగిపోయినట్టయింది-యాభైవేల రూపాయలు!!
పందెం మూడొందల మైళ్లు దగ్గిర జరుగుతూంది. ఎవరూ లేవటం లేదు అంటే ఓడ మూడొందలు గానీ, అంతకన్నా తక్కువగానీ ప్రయాణం చేస్తే అక్కడ పందెం కాసినవాడికి మొత్తం అందరి డబ్బంతా వెళుతుందన్నమాట.
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓడ రెండొందలు మైళ్ళకన్నా ఎక్కువ ప్రయాణం చేయటానికి ఆరాత్రి అవకాశం లేదు.
దైవాధీనం లేచి "పది పౌండ్లు" అన్నాడు. ఆక్షనీరు జనం వంక చూసి "ఒకటో సారి" అన్నాడు.
ఎవరూ మాట్లాడలేదు.