"చేతిలో హాండ్ బ్యాగ్ వుందా?"
"లేదు"
"మరి ఆ కాగితాన్ని ఎక్కడ పెట్టుకుని వుంటుంది?"
రామూ గతుక్కుమని "నిజమే. ఆ ఆలోచన రాలేదు" అన్నాడు సంజాయిషీ చెపుతున్నట్టు. "ఒక్క నిముషం దాదా. మళ్ళీ ఫోన్ చేస్తాను."
దాదా ఫోన్ పెట్టేసి కూర్చున్నాడు.
చాలా చిన్నసమస్య అనుకున్నది క్రమంగా క్లిష్ట మవుతుంది.
అంతలో ఫోన్ మ్రోగింది. అయితే ఇది రామూ నుంచి కాదు. సలీంశంకర్ నుంచి.....
"ఆ బాడ్ ఖోవ్ విశ్వేశ్వరశాస్త్రిగాడింట్లోంచి ఒక్క పురుగు బయటకు రావటంలేదు. లోపలికి ఎవరూ వెళ్లటం లేదు. రాత్రి నుంచీ ఇక్కడే కాపలా కాస్తున్నాను" అన్నాడు విసుగ్గా. శంకర్ కి బెదిరించి పన్లు చేయించుకోవటం క్షణాల్లో మర్డరు చేయటం అలవాటుగానీ, ఇలా ఓపిగ్గా, అందులో ఒక ఆడపిల్లకోసం గంటల తరబడి వేచివుండటం మొదటిసారి. చాలా ఇరిటేటింగ్ గా వున్నాడు.
"అఖ్కర్లేదు శంకర్. ఆ అమ్మాయి మనవాళ్ళకి దొరికింది".
"ఎక్కడ?"
బస్ స్టాండ్ లో వుంది. రామూ ఇప్పుడే ఫోన్ చేసాడు".
నేవెళ్తానక్కడికి" తొందరగా అన్నాడు.
"ఊహు. వద్దు..... ఒక నిముషం ఆగి ఫోన్ చెయ్యి. అన్నట్టు బస్ స్టాండ్ కి వచ్చేముందు ఆ అమ్మాయి ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలిసిందా?"
"ఆ, బ్రహ్మానందం అని ఒక సునియాగాడి దగ్గిర కెళ్ళింది. అంతే. మిగతా స్నేహితురాళ్లిద్దరినీ వాకబుచేసారు మనవాళ్ళు. ఆ ఒక్కడి దగ్గిరకే వెళ్ళింది".
"ఉత్తరం గురించి..."
అతడి మాటలకి అడ్డుపడుతూ, "వాడికేం తెలీదు దాదా. మన గుండప్ప డీల్ చేసాడు. వాడొక నఫ్జా....... మనవాడు రెండు ప్రశ్నలడిగేసరికి ఏడవటం మొదలు పెట్టాడు. ఇంకా ఎక్కువ రప్చర్ చేయటం ఇష్టంలేక మనోడు వచ్చేసాడు. గుండప్ప చెపుతే ఇక తిరుగులేదు".
ఆ విషయం నిజమే ఇటువంటి వాటిలో గుండప్ప అత్యంత సమర్ధుడు. ఆ అమ్మాయి బ్రహ్మంకి ఏమీ చెప్పలేదు అన్నది నిర్థారణ అయినట్టే.
వసంత్ దాదా టైమ్ లెక్కవేసాడు. ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటపడగానే శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళివుంటుంది. అక్కణ్ణుంచి ఈ మొగ స్నేహితుడికి. అటు తరువాత బస్ స్టాండ్ కి. అంతే, ఇంకెక్కడికి వెళ్ళటానికీ టైమ్ లేదు. అంత తెల్లవారుఝుమునే స్నేహితురాళ్ళని లేపటానికి మొహమాటపడి వుంటుంది.
"శంకర్. ఈ బ్రహ్మం అనే కుర్రావాడి దగ్గిర ఆమె ఏమైనా డబ్బు తీసుకుందా?"
"అది కనుక్కోలేదే. ఎందుకు?"
"అర్థరాత్రి నిన్నుచూసి కట్టుబట్టల్తో బయటపడిన ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని వుండదు. బహుశ బ్రహ్మానందం ఇచ్చివుంటాడు. అది అప్రస్తుతం అనుకో. ప్రస్తుతం ఆ అమ్మాయి అమలాపురం బయల్దేరుతూవుంది".
"నేను బస్ స్టాండ్ కి వెళతాను..."
"ఉహూ వద్దు. ఆ విశ్వేశ్వరశాస్త్రి ఇంటికి పోలీసులెవరైనా వచ్చారా?"
"లేదు. ఎందుకొస్తారు?"
"అవును. రారు. రావాలన్న తెలివితేటలుంటే వాళ్ళు పోలీసులు అవరు".
"నువ్వెళ్ళు శంకర్. ఆ ఇంటిని అంగుళం అగుంళం గాలించు, తరువాత నాకు ఫోన్ చెయ్యి...."
"మరి ఆ అమ్మాయి?"
"దాని సంగతి నేను చూసుకుంటాను. మన దగ్గిర మంచి కండిషన్ లో వున్న జీపులు ఎన్ని వున్నాయి?"
"రెండున్నాయి. ఒకటి రామూ దగ్గిర వుంది".
"రెండో జీపు వేసుకుని గుండప్పని బస్ స్టాండ్ కి వెళ్ళమను. మిగతాది రాముకి చెపుతాను. నువ్వు ఫోన్ పెట్టెయ్యి. అవతల్నుంచి రాము ఫోన్ కోసం ప్రయత్నం చేస్తూవుండి వుంటాడు".
శంకర్ ఫోన్ పెట్టెయ్యగానే అది తిరిగి మ్రోగింది. "నేనే రామూని. ఆ అమ్మాయి బట్టల్లో అది లేనట్లుంది. మనవాడు తడిమి చూశాడు".
"సర్లే. గుండప్ప అక్కడికి వస్తున్నాడు. రెండు జీపుల్లో బస్ ని ఫాలో అవండి. బస్ ని మధ్యలో ఆపి ఆమెని ఎక్కించుకోండి. రెండు బెదిరిస్తే ఆ వుత్తరం సంగతి చెప్పేస్తుంది. చెప్పగానే అడవిలోనే చంపెయ్యండి. శవం దొరక్కుండా కప్పి పెట్టెయ్యండి కిడ్నాపింగ్ కేసు మాత్రమే వుంటుంది. మర్డరుండదు".
"రెండు జీపులెందుకు? నేనొక్కణ్ణే వెళతాను...."
"మధ్యలో జీపు పాడవుతే?"
"రామూ నాలిక్కర్చుకుని, "సర్లే దాదా. సారీ" అని పెట్టేసాడు. వసంత్ దాదా కూడా ఫోన్ పెట్టేసి ఇక శంకర్ దగ్గిర నుంచి వచ్చే వార్తా కోసం ఎదురు చూడసాగాడు.
ఒక జీపు పాడవుతే మళ్ళీ ఇంకో ఇంత ప్రయత్నమూ చేయవలసివచ్చే అవసరం లేకుండా రెండు వాహనాల్ని పంపాలన్న ఆలోచన చేయగల్గినందుకే వసంత్ దాదా ఒక గొప్ప మాఫియా లీడర్ కాగలిగాడు. నాలుగ్గోడల మధ్య కూర్చుని దేశపు నాలుగు దిక్కుల్ని పాలించగల్గుతున్నాడు.
* * *
ఉత్పల సిగ్గుతో కుదించుకుపోయింది. అదృష్టవశాత్తు ఎక్కువమంది చూడలేదు కాబట్టి సరిపోయింది.
ఎందుకో వున్నట్టుండి కౌంటరు దగ్గిర గొడవ జరిగింది. నిక్కరేసుకుని రౌడీలా వున్న ఒక మనిషి డైరక్టుగా కిటికీలో చెయ్యిపెట్టి టికెట్టు అడిగాడు. క్యూలో వున్న ఇంకొకడు ఘర్షణకి దిగాడు. క్షణాల్లో కౌంటర్ దగ్గిర గొడవ జరిగింది. క్యూకి పక్కగా వున్న ఉత్పల చుట్టూ నలుగురు చేరారు. అందులోంచి బయటకు రాలేకపోయింది. గొడవ జరుగుతూ వుండగా ఆ నిక్కరేసుకున్న వ్యక్తి చెయ్యి వెనకనుంచి ఆమె ముందుకు వచ్చింది. ఏం జరుగుతూందో గ్రహించేలోపు అతడి చెయ్యి ఆమె జాకెట్టుపైన స్థన మధ్యాన్ని తడమటం జరిగిపోయింది. మరో చెయ్యి నడుము మీదనుంచి క్రిందికి జారింది. ఇదంతా స్ల్పిట్ సెకండ్స్ లో జరిగింది. ఎంత తొందరగా గొడవ మొదలైందో అంత వేగంగా చల్లారిపోయింది. క్యూ మామూలుగా వుంది దెబ్బలాట పెట్టుకున్న ఇద్దరూ క్యూలో లేరు.
ఉత్పలకి మొహం తిరుగుతున్నట్టు అనిపించింది. వళ్ళంతా చెమట పట్టింది. చుట్టూ చూసింది. ఎవరూ గమనించలేదు. గమనించినా ఇద్దరు బలిష్టులు ఆ అల్లరి పని చేస్తూ వుండగా అడ్డుకునే ధైర్యంగానీ, మందలించే తెగువకానీ సామాన్యులకి వుండదు. చూసీ చూడనట్టు వదిలేసారు. ఆమె అవస్థని ఒకరే గమనించారు.
"అమ్మాయ్ నువ్వెక్కడి వెళ్ళాలి?" అన్న స్వరానికి తెప్పరిల్లి ఎలాగో నోరు పెగలించి "అమలాపురం" అంది.
అవతలి వ్యక్తి లావుగా, పొడుగ్గా వున్నాడు. బట్టతల కాస్త వుంది. అచ్చు యస్వీ రంగారావులా వున్నాడు. చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది.
అమాలపురం అన్నాక ఉత్పలం ఏం చెయ్యటమా అని ఆలోచించింది. తన దగ్గిర డబ్బులులేవు. అసలు కౌంటర్ దగ్గిర తనెందుకు నిలబడిందో ఆమెకే తెలీదు. ఎవర్నైనా అడుగుదామనుకుందా? అడుగుతే వాళ్ళు అడ్వాంటేజి తీసుకోకుండా వుంటారా? ఇవేమీ ఆలోచించలేదు. ఇప్పుడీ పెద్దమనిషికి ఎలా ఇవ్వాలి డబ్బు అన్న ఆలోచనలో పడింది.
ఇంతలో అతడు టిక్కెట్టు తీసుకుని దగ్గిరకొచ్చి ఆమె చేతిలో దాన్ని పెడుతూ "లోపలికెళ్ళాక చూసుకుందాంలే అమ్మాయ్" అని హడావుడిగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
బస్ లో అతడిని బ్రతిమాలవచ్చులే అనుకుంటూ ఆమె వడిగా వెళ్ళి బస్సు ఎక్కింది. ఎంత తొందరగా ఈ మహా నగరం నుంచి బయటపడదామా అని ఆమె మనసు వత్తిడి చేస్తోంది.
ఆమె టిక్కెట్టు నెంబర్ చూసుకుని వెళ్ళి సీట్లో కూర్చుంది. ఇరువైపు సీట్లూ ఖాళీగా వున్నాయి. ముగ్గురు కూర్చునే సీటు అది. బస్ ఇంకో రెండు నిముషాల్లో కదలబోతూ వుందనగా ఆ మిగతా టిక్కెట్ల వాళ్ళిద్దరూ వచ్చారు. అందులో ఒకరు తనకి టిక్కెట్టు కొనిచ్చిన మనిషి.
"కార్లో వెళ్ళకుండా ఎందుకీ బస్సు ప్రయాణం?" అని ఆ మనిషి పక్కనున్నతనితో అంటున్నాడు. ఆ రెండో వ్యక్తి పొడుగ్గా వున్నాడు. నుదిటి మీదకి జుట్టు నిర్లక్ష్యంగా పడుతూంది. ఆ మాటలు విన్నట్టు లేదు. కళ్లెక్కడో చూస్తూన్నాయి. తన సీటు దగ్గిరికి వచ్చి అక్కడో అమ్మాయి వుండటం చూసి కంగారుపడినట్టు కనిపించాడు. అది గమనించి యస్వీ రంగారావులా వున్న వ్యక్తి "నీకు కిటికీ దగ్గిర సీటు కావాలన్నావు. నాకు కాళ్ళు చాపుకోవటానికి ఈ చివరి సీటు కావాలి. మధ్యలో అమ్మాయి. పాపం కూర్చోనివ్వు. ఏమమ్మా నీకేమన్నా అభ్యంతరమా?"
ఉత్పల లేదన్నట్టు తలూపింది. చెరోవైపునా వున్న ఇద్దరూ భారీ మనుష్యులు అవటంతో కాస్త ఇరుగ్గా వున్నట్టు అనిపించింది. కానీ అదెంతో నిశ్చింతగా వున్నట్టు అనిపించింది. ఒక తల్లి పక్షి రెక్కల మధ్య ఒదిగి, బయట ప్రపంచపు భీభత్సాన్నించి తప్పుకున్న భావన అది. ఇంతలో డ్రైవరు బెల్ కొట్టాడు.
పక్కన కూర్చున్నది అమ్మాయి అని అయినా గుర్తించకుండా, గెడ్డంక్రింద చెయ్యి ఆన్చి కిటికీలోంచి బయటకు చూస్తున్న వ్యక్తి చిత్రంగా అనిపించాడు. అతడి కళ్ళు ఒకచోటే, ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టు వున్నాయి.
ఉత్పల తల దించుకుంది. బస్ తొందరగా కదిలితే బావుణ్ణు అని మాటిమాటికి అనుకుంటుంది.
"ఏం అమ్మాయ్ ఇరుగ్గా వుందా?"
ఉత్పల తేరుకుని, "అబ్బే లేదంకుల్" అంది.
అతడు అదిరిపడి, "అంకులా?" అని కీచుమని అరిచాడు. ఆ తరువాత ఆశువుగా చెప్పాడు.
"అల్లనల్లన వెతికి జూసినా- తలను
తెల్ల వెంట్రుక ఒకటి లేదు.
మెల్లమెల్లన వయసు పైబడిన -ఏ
పిల్ల నన్నింత వరకూ అంకులనలేదు!"
ఉత్పల కళ్ళు విప్పరితం చేసుకుని అతడివైపు చూసింది. అతడు స్నేహపూరితంగా నవ్వాడు. "నా పేరు బిల్హణుడు. ఆ పేరు ఎలా వచ్చింది అని అడక్కు. మనం ఇంకా పన్నెండు గంటలు ప్రయాణం చెయ్యాలి. అప్పుడు చెపుతాను. నీకటువైపు కూర్చున్న వాడిపేరు జానీ. సీరియస్ టైపు. అఫ్ కోర్స్ నీలాటి అమ్మాయిలు అలాటి వాడినే లైక్ చేస్తారనుకో. అన్నట్టు నీకు ప్రేమంటే తెలుసా?"
ఉత్పల బిత్తరపోయి "తెలీదు" అంది.
"ఒకరికి సరిపోయే జాగాలో ఇద్దరు ఇమడటం!..... అలాగే, ఇద్దరికి సరిపోయే జాగాలో ముగ్గురు ఇమడటాన్ని ఏమంటారో తెలుసా?'
ఆమె మరింత కంగారుపడి "తెలీదు" అంది.
"ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సుసీటు. నీకు ఇరుగ్గా వున్నట్టుంది. బాధ మార్చిపోవటానికి కావాలంటే నీకు 'ఇరుకు' మీద ఒక కందపద్యం చెపుతాను విను.
చనుగవబరువో? లేకీ
పెనకువగల శోభనాంగి పిరుదులు బరువో?
యనికన, విధి మన ముగ్గురికి పిడికిట బ
ట్టిన పట్టో? యనగ గౌను ఠేవన్ వెలయున్".
"మూడోపాదంలో 'మన ముగ్గురిని' అన్నది అధిక పదం. రెండు వ్యర్థ గణాలు" అంది ఉత్పల వెంటనే. పండిత విశ్వేశ్వరశాస్త్రి కూతురామె. ఈసారి బిత్తరపోవటం బిల్హణుడి వంతైంది. అతడి ఆశు కవిత్వంలో ఇంత వరకూ ఎవరూ తప్పులు పట్టుకోలేదు. ఆమాటే జానీతో అన్నాడు.