Previous Page Next Page 
13... 14.... 15 పేజి 24


    మధూహ ఇల్లు చిన్న సందులో వుంటుంది. కారు అక్కడి వరకూ వెళ్ళాదు. సందు మొదట్లో ఆపుచేసాడు. మధుహ కారుదిగి, "వెళ్ళొస్తాను" అంది. అతడు ఆమెవైపు చూడటం లేదు. అతడి దృష్టి సందులోకి ప్రసరించి వుండటం చూసి, మధుహ కూడా అటువైపు చూసింది.

    తన ఇంటిముందు జనం గుమిగూడి వున్నారు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ప్రహసిత్ కూడా కారుదిగి ఆమెతోపాటు వడివడిగా నడిచాడు. దగ్గరకు చేరుకోగానే, ఆ దృశ్యం చూసి స్థాణువైనట్టు నిలబడిపోయింది మధూహ. ఇంటి ముందు రెండు శవాలు పడుకోబెట్టివున్నాయి. భార్యాభర్తలవి.

    ఉన్న పొలం కాస్తా అమ్ముకుని భార్యని రక్షించుకోవాలనుకున్నాడు చంద్రయ్య. భార్య మరణించిందన్న వాస్తవం కృంగదీసిందో, సూడో హిప్నటిస్టు మాటలకి తను మోసపోయానన్న అవమానం దహించివేసిందో, తన అమాయకత్వంతో ఆస్తంతా అమ్ముకుని కొడుక్కి నిలువనీడలేకుండా చేసానన్న బాధ ఎద రగిల్చిందో.....కారణం ఏదైతేనేం అతడు కూడా ఆత్మహత్య చేసుకుని భార్యతో సహా వెళ్ళిపోయాడు.

    "మావయ్యా.....మావయ్యా" అంటూ మధూహ ఆ శవాలమీద పడి ఏడుస్తోంది. సోమం ఇంకా షాక్ నుంచి తేరుకోనట్టు అలాగే చూస్తూ కూర్చుండిపోయి వున్నాడు.

    ప్రహసిత్ కి పరిస్థితి అర్థమైంది. మొత్తం బాధ్యతంతా భుజాలమీద వేసుకున్నాడు. మధుహ కుటుంబానికి మొగదిక్కు లేదని అతడికి తెలుసు. దగ్గరుండి దహన సంస్కారాలు జరిపించాడు. రెండు రోజులపాటు ఆ పనులలో మునిగివుండి, ఆకాశరామన్న ఉత్తరం సంగతి తాత్కాలికంగా పక్కన పెట్టాడు.

    ఇదంతా జరుగుతున్నా ఒక వ్యక్తి నిర్లప్తంగా వుండటం ఎవరూ గమనించలేదు. ఆ కుర్రవాడు సోమం!

    డాక్టర్ ని చేసే టంత జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తినీ ఇస్తామని మైండ్ థెరపీ వాళ్ళు ఫీజు వసూలు చేసినప్పుడూ అతడు అలా నిర్లప్తంగానే వున్నాడు. తల్లిని పడుకోబెట్టి "నీకు కేన్సర్ లేదు. నీకు కేన్సర్ లేదు" అని రోజూ ఆమె పక్కన నిలబడి రాజు హిప్నటైజ్ చేస్తున్నా నిరాసక్తంగానే వున్నాడు. తండ్రి శరీరం ఇంటి దూలానికి వ్రేలాడుతున్నప్పుడూ అలాగే నిశ్చలంగా వున్నాడు.

    అతడి మనసులో ఏముందో భగవంతుడికే తెలియాలి.


                                       5

    లాయర్ శివశంకరం ముప్పయి ఏళ్ళ యువకుడు. సమాజంపట్ల, మనిషి మనుగడపట్ల బాధ్యతా పరమైన నమ్మకం వుంచుకున్నవాడు. చాలామంది బీదలకీ, మధ్యతరగతి వారికీ తక్కువ ఫీజుతో  న్యాయం జరిగేలా చూస్తాడని ప్రతీతి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇటువంటి బోగస్ సంస్థలనీ, క్వాక్ డాక్టర్లనీ ఎదుర్కోవటమే జీవితాశయంగా పెట్టుకున్నవాడు.

    మధూహ చెప్పినదంతా విన్నాడు. జ్ఞాపకశక్తి పెంపొందిస్తామని సోమం దగ్గిర డబ్బు వసూలు చేయటం  దగ్గిర్నుంచీ దంపతుల ఆత్మహత్య వరకూ అంతా చెప్పింది.

    శివశంకరం మొహంలో బాధా వీచిక కదలాడింది. అతడు ఎన్నో కేసులు విన్నాడు. కానీ ఇంత దారుణమైన మోసం గురించి వినటం అతడికిదే మొదటి అనుభవం. తెలివైనవాడు అమాయకుడి అజ్ఞానం మీద ఆడుకోవటం ఆధునిక సమాజంలో అతి సహజమైపోయిన మాట  నిజమే. కానీ మరీ ఇంత  దారుణంగానా?

    అతడు లాయరు. ఎన్నో కేసులు టేకప్ చేసాడు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కాకుండా, ఎక్కువగా అతడు కన్సూమర్ ఫోరంకి వెళ్తూవుంటాడు. అక్కడ దావావేస్తే కోర్టుఫీజు చెల్లించనవసరంలేదు. ఆ మాటకొస్తే లాయర్ అవసరం కూడా లేదు. కేసులు త్వరగా పరిష్కారమవుతాయి. మోసపోయేది ఎక్కువగా మధ్యతరగతివాళ్ళే కాబట్టి, తక్కువ ఖర్చుతో న్యాయం పొందవచ్చు అని అతడి విశ్వాసం.

    సామన్యుడిపట్ల శివశంకరానికి అపారమైన సానుభూతి వుంది. ఈ సామాన్యుడెంత అమాయకుడు? నిజాయితీగల డాక్టర్లనీ , సైక్రియాట్రిస్ట్ లనీ, సైకాలజిస్టులనీ నమ్మడు. అద్భుతాల్ని అరచేతిలో పేట్టి స్వర్గం చూపిస్తామని పత్రికల్లో ప్రకటనలిచ్చే వారినే నమ్ముతాడు. మోసపోయినా ఎదురుతిరగడు. క్యూలో తన వెనుకవచ్చిన వాడిని హెచ్చరించడు. ఇదంతా జీవితంలో ఒక  భాగమని అనుకుంటాడు. మోసపోవటం కూడా!

    "ఫీజ్ తీసుకున్నట్టు ఆ క్లినిక్ వాళ్ళు రసీదు ఇచ్చారా?" అడిగాడు శవశంకరం.

    "లేదండీ" అంది మధూహ. "వీళ్ళెవరూ రసీదులు ఇవ్వరుగా"

    "ఫర్వాలేదు. ఇలాటివి జరుగుతాయని తెలిసే, కోర్టులో రసీదుకి అంత ప్రాముఖ్యత ఇవ్వటంలేదు. బాధితుడు తనెంత ఖర్చుపెట్టాడో కోర్టుకి అఫిడవిట్ ఇస్తే చాలు."

    ఎప్పటినుంచో వున్న అనుమానం మధూహ అడిగింది......

    "నీకు ఫలానా వ్యాధి నయం చేస్తామని ఒక డాక్టర్ అంటాడు. 'శాయశక్తులా ప్రయత్నించాను నయం కాలేదు. నేనేం చేయగలను' అంటాడు. దానికి కోర్టు మాత్రం ఏం చేస్తుంది?"

    లాయర్ శివశంకరం లేచి వెళ్ళి పుస్తకాల రాక్ లోంచి ఒక చిన్న బుక్ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు.

    DRUGS AND MAGIC REMEDIES ACT - 1954

    అతడు దానిగురించి వివరించాడు. "ఇలాంటి కేసుల కోసమే 1956లో  ప్రభుత్వం ఒక ఆక్టు నిర్మించింది. చాలామందికి దీని గురించి తెలీదు" అంటూ పుస్తకం తెరిచి చదివాడు.

    SECTION 3 OF THIS ACT PROHIBITS ADVERTISE MENT OF CURING CERTAIN DISEASES LIKE...." అంటూ ఆ లిస్టు చదివాడు..... సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాను, మా దగ్గిర ట్రీట్ మెంట్ తీసుకుంటే  నీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నత్తి తగ్గిస్తాము. డయాబిటిస్, మూర్చ, ఫిట్స్, అస్తమా లాటివి తగ్గిస్తాము.....అంటూ ఎవరూ పేపర్లోలో ప్రకటన ఇవ్వకూడదు" అంటూ తిరిగి చదివాడు "......SUCH PERSONS ARE LIABLE FOR 6 MONTHS IMPRISONMENT AND WITH FINE."

     మధూహకి సంతోషం వేసింది, అన్యాయాన్ని ఎదుర్కోవటానికి కనీసం ఒక మార్గముంది. చాలు. తనిక  చివరి  వరకూ  పోరాడుతుంది.

    'మ్యాజిక్ రెమెడీ'

    చాలా గమ్మత్తయిన పదం! తమ  అద్భుతమైన శక్తివల్ల రోగం నయం చేస్తామనే వారి ఆయుధం!

    ఇప్పుడిక దాన్ని ఎదుర్కోవాలి.

    లాయర్ శివశంకరం అన్నాడు. "ఆర్నెల్ల క్రితం మాదగ్గిరకి ఒక క్లయింట్ వచ్చింది. నిద్రలేమి, మానసిక ఆందోళన, భయం, డిప్రెషన్, ఫ్రిజిడిటి, బి.పి. లతో బాధపడుతూ ఒక హిప్నాటిస్ట్ దగ్గిరకు వెళ్ళింది. సెల్ఫ్  హిప్పాసిస్ అని మూడు రోజుల్లో నేర్పి పంపాడు. దానివల్ల ఏం లాభం వుంటుంది? చెల్లించిన ఫీజు వాపను ఇమ్మని కన్సూమర్ ఫోరంలో కేసు వేసాం. మీరు చెప్పినట్టే వాదించాడు. తను చాలామందికి నయం చేసాననీ, ఈ ఒక్కకేసూ నయం కాకపోతే తన  బాధ్యత ఏమీలేదని కోర్టులో చెప్పాడు. కావాలంటే తన దగ్గిన వ్యాధుల్ని నయం చేయించుకున్న పేషెంట్లని హాజరుపరుస్తానని అన్నాడు. అలాటి పేషెంట్లందరూ  కిరాయికి సాక్ష్యం చెప్పేవాళ్ళని మాకు తెలుసు. అదృష్టవశాత్తు ఈలోపులో మరో కేసు వచ్చింది........" నవ్వేడు.

    "ఎమ్ సెట్ లో రాంక్ కోసం ఒక కుర్రాడు ఇదే క్లినిక్ లో చేరాడు. సీటు రాలేదు. అతడి తరపున  కేసు వేసాం. మొత్తం ఎందరు విద్యార్థులు ట్రీట్ మెంట్  తీసుకున్నారు? ఎందరికి మంచి మార్కులు వచ్చినవో లిస్టు ఇమ్మని జడ్జి అడిగాడు. దొంగసాక్ష్యాల్ని తెచ్చినట్టు విద్యార్థుల్ని తేలేడుగా. ఆ విధంగా మాకు దొరికిపోయాడు. మా ఇద్దరు క్లయింట్లకీ,చెల్లించిన  ఫీజు వాపసు ఇమ్మని జడ్జిమెంట్ వచ్చింది. ఆ హిప్నాటిస్ట్ కి వెయ్యిరూపాయలు జరిమానా విధించి, మొదటి తప్పిదంగా  హెచ్చరించాడు."

    (వినియోగదారుల ఫోరంలో ఇలాటి కేసులు వేయటానికి కోర్టు ఫీజు అవసరం లేదు. పైనచెప్పిన వివరాలన్నీ చెప్పిన అడ్వొకేట్..... శ్రీ వేముల గౌరీశంకరరావు, 9....136,సాయిబాబాగుడి పక్కన, దిల్ సుఖ్ నగర్, హైద్రబాద్ 500 060.ఫోన్. 2878347. అవసరమైన వారు ఈయన్ని ఉత్తరంద్వారా గానీ,  ఫోన్ ద్వారా గానీ సంప్రదించవచ్చు.....రచయిత)

    "తరువాత ఏం జరిగింది లాయర్ గారూ?" అడిగింది.

    "మా దగ్గరికి చాలాకేసులు రావటం మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆక్లినిక్ లో ఏ ఒక్కకేసు నయం కాలేదు. ఎప్పుడయితే మేము  కేసుగెల్చిన విషయం వెల్లడయిందో, ఇక  ఆ పేషెంట్లు మమ్మల్ని ఆశ్రయించటం మొదలుపెట్టారు. అంతేకాదు "నీ సంతానోత్పత్తికి మేము సాయపడతాము" అని ప్రకటన ఇవ్వటం కూడా DRUGS AND MAGIC REMEDIES ACT క్రింద తప్పే. మొత్తంమీద ఏ క్లయింట్ మాదగ్గరకొచ్చినా వెంటనే మేమొక నోటీసు ఇవ్వటమూ, వారు కోర్టుతో సంబంధం లేకుండా తీసుకున్నా ఫీజు తిరిగి ఇచ్చెయ్యటమూ....ప్రస్తుతం అలా జరుగుతోంది. ఇది మాకూ బాగానే వుంది. క్లయింట్స్ బాగుపడటమే కదా కావాల్సింది."

    "ఇంతకీ మీరు చెప్పిన ఆ వ్యక్తి ఎవరు?"

    "రాజు అని.....డాక్టర్ విశాల్ క్లినిక్ తెలుసుగా"  

    మధూహ ఉలిక్కిపడింది.

    అయితే తన సంచలనాన్ని బయట పడనివ్వలేదు.

    ఒకప్పుడు అతడు తన స్నేహితుడు అన్న విషయం చెప్పకుండా, "సోమం దగ్గర, అతడి తల్లి కాన్సర్  నయం చేస్తానని ఫీజు తీసుకున్న మైండ్ హిప్నో మాగ్నో క్లినిక్ ఆ రాజుదే లాయర్ గారూ" అంది.

    శివశంకరం ఆశ్చర్యపోయాడు. తరువాత ఏదో అర్థమైనట్టు తలూపుతూ, "అతడు చేసే మోసాల్ని మేము వేటగాళ్ళలా వేటాడుతున్నామని తెలిసి, మరింత సైంటిఫిక్ గా ఈ మాగ్నో క్లినిక్ పెట్టాడన్నమాట" అని లేస్తూ, "ఇక్కడ కూడా ఇతన్ని వదిలిపెట్టను. మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను" అన్నాడు.

    మధూహ కూడా లేచి నిలబడి నమస్కారం చేసి "వెళ్ళొస్తాను లాయరుగారూ" అంది.

    ముందు నోటీసు ఇద్దాము. ఇలాటి కేసుల్లో డాక్టర్లుకూడా కోర్టులకు వెళ్ళటానికి ఇష్టపడరు. మనం కోర్టులో గెలిస్తే ఆ వార్తని పేపర్లన్నీ ప్రముఖంగా ప్రచురిస్తాయి. అదిచూసి వీళ్ళవల్ల నష్టపోయిన ప్రతివాడూ కోర్టుకి వెళ్తాడు. వీళ్ళు ప్రాక్టీసు మానుకుని కోర్టులు చుట్టూ తిరగాలి. అందుకని సాధారణంగా నోటీసు అందగానే  వీళ్ళు ఫీజు వెనక్కి ఇచ్చేసి, పైగా  అంతో ఇంతో పైన  ముట్టచెప్పి మనల్ని వదుల్చుకోవటానికి సిద్ధపడతారు. కన్సూమర్  ఫోరం ద్వారా మనకి రావల్సిన న్యాయం కూడా అదే కదా!"

    "వీళ్ళని అరెస్టు చేయించటానికి వీల్లేదా?"

    "420క్రింద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. కానీ మనకి ముందు కావాల్సింది మనం చెల్లించిన ఫీజు వెనక్కీ రావటం! కన్సూమర్ ఫోరం అయితే తక్కువ వాయిదాల్తో తీర్పు వస్తుంది."

    "మరి మీ ఫీజు?"

    "అవసరం లేదు"

    ఆమె విస్మయంతో "అదేమిటి లాయర్ గారూ" అంది.

    "గెల్చిన తరువాత ఇద్దురుగాని....."అన్నాడు శవశంకరం. "......ఇలాటి కేసుల్లో సాధారణంగా ఎవరూ లాయర్ల దగ్గరకు రారు. నష్టపోయింది కేవలం  రెండు మూడు వేలు కాబట్టి కోర్టుకేమి వెళ్తాంలే అని వూరుకుంటారు. లేదా......లాయరుఫీజు ఎంతవుతుందో అని భయపడతారు. ఇలాటి కేసుల్లో కోర్టు ఫీజు కూడా ఏమీ వుందని చాలామందికి తెలీదు. అయినా ఇక్కడ డబ్బుకాదు సమస్య, ఒక అన్యాయాన్ని ఎదుర్కుంటున్నామన్న సంతృప్తి."

 Previous Page Next Page