Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 22


    -ఇదీకథ.
    చదివిన వైజయంతికి ఎందుకో అతడిమీద జాలివేసింది. ఈ వెర్షనంతా కరెక్టయి, నిజంగా పట్నయక్కే దాన్ని కనుక్కుంటే- రామన్ ని ముక్కలు ముక్కలుగా కోసి కాకులకీ, గ్రద్దలకూ వేసినా పాపంలేదు.
    కానీ నిజం ఎవరికీ తెలియదు.
    ట్రూత్  టెల్లర్ సహాయంతో తెలుసుకోవచ్చు. కానీ ఆ పిచ్చిలో పట్నాయక్ ఆ పరికరాన్ని నాశనం చెయ్యటమేకాక దాని ఫార్ములాని కూడా ధ్వంసం చేశాడు.
    సంవత్సరంపాటు జరిగిన ఆ కేసు వివరాలు తన పేపర్లో చదివితే, ఆమెకు ఎవరు నిజం చెప్తున్నదీ అర్థం కాలేదు.
    అదే స్వామినాయుడి గొప్పతనం.
    పేపర్లో అతడు ఎవరివైపూ కమిట్ కాలేదు. ప్రజల్ని తన వ్యాసాలద్వారా రెండుగా చీల్చాడు. కొందరు రామన్ నీ, కొందరు పట్నాయక్  నీ సపోర్ట్ చేస్తూ వ్యాసాలూ వ్రాశారు. అన్నీ ప్రచురించాడు. విషయం తేల్చకుండా సంవత్సరంపాటూ  ఈ విషయం మీద పేపరు నడిపాడు.
    ఆమె పేపర్లు అన్నీ తిరిగి సర్దేసి, స్వామినాయుడు ఇచ్చిన కవరు పట్టుకుని జైలుకి బయల్దేరింది.
    ఆమె ఎటువంటి ట్రాప్ లో ఇరుక్కోబోతూందో ఆమెకి తెలియదు.
    ఆకాశం మేఘావృతమై వుంది. పెద్ద గాలివాన వచ్చేటట్టుంది. ఆమెకు లోపలి కెళ్ళాడానికి పర్మిషన్ సులభంగానే దొరికింది.
    సెల్ లో పట్నాయక్ పులిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. రేపే ఉరి అయినా, ఇంకా అతడి ఆవేశం తగ్గలేదుగా వుంది. వైజయంతి అతడిని దూరంనుంచే పరిశీలించి చూసింది.
    ఆమె అతడి భీకర స్వరూపం చూడటంలేదు. ఆ కసి, ఉక్రోషం, ఆవేశం వీటన్నిటి వెనుకా అతడి చిన్నపిల్లాడి మనస్తత్వం అర్థం చేసుకోగలదు. సైంటిస్టులు చిన్న పిల్లళ్ళకన్నా గొప్పవాళ్ళేమీ కాదు.
    ఆమె నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళింది.
    అంతలో సెంట్రీ అతడున్న  సెల్ తాలూకు తలుపు తీసి అతడిని బయటకు  రమ్మనాడు. డెత్ సెల్ వరండా పక్కనేవున్న గదిలో టేబిల్ కి ఇటువైపు కూర్చుని వుందామె. సెంట్రీ పక్కగా నడుస్తూ అతను వస్తున్నాడు.
    అంతకుముందు రోజు అతడిని కలుసుకోవటానికి చాలా మంది విలేఖరులు ప్రయత్నం చేశారుట. అందర్నీ తిరస్కరించాడు. ఈ రోజు అతడిని కలుసుకోవటం పడదనే అనుకుంది వైజయంతి. కానీ అతడు  ఈ ఇంటర్వ్యూకి అంత సులభంగా వప్పుకోవడం తన అదృష్టంగా భావించింది, ఆశ్చర్యం వేసింది కూడా.
    అతడి మొహంలో మరుసటిరోజు మరణం తాలూకు విచారం ఏమీ లేదు. కళ్ళు ఎర్రగా వున్నాయి. ఒక మృగంలా వున్నాడు.
    "ఎవరు నువ్వు? ఏ పేరు నీది?" భయంగొలిపే స్వరంతో అడిగాడు. వైజయంతి వెంటనే సమాధానం చెప్పలేదు. అతడి వైపు పరిశీలనగా చూసింది. అసలితడేనా మనషి రక్తప్రసరణం మీదా, ఎమోషన్స్ మీదా ప్రయోగం చేసి  అద్భుతమైన పరికరాన్ని కనుక్కున్నా సైంటిస్టు? ఎటువంటివాడు ఎలా అయిపోయాడు. పరిస్థితుల ప్రభావం అంటే అదే కాబోలు.
    ఆమె ఉలిక్కిపడి "నా పేరు వైజయంతి. నేనూ......" అంటూ ఏదో  చెప్పబోయింది.
    "అక్కర్లేదులే. నీకే పేరయితే నాకేమిటి? ఇంతకీ ఎందుకొచ్చావ్ నువ్వు?"
    "మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని"
    "హ్హ హ్హ హ్హ ఇంటర్వ్యూ .....నేను చచ్చిపోవటాన్ని కూడా మీరు కాష్ చేసుకోవాలనుకుంటున్నారన్నమాట. మీకూ రాబందులకీ తేడా లేదు" వెటకారంగా అన్నాడు.
    వైజయంతి ఏమీ మాట్లాడలేకపోయింది. చేతిలో వున్న నోట్ బుక్ మీద పెన్సిల్ తో గుండ్రంగా గీతలు గీస్తూ వుండి పోయింది.
    అతడే అన్నాడు. "నే నెవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నిన్న నీలాంటివాళ్లు చాలామంది వచ్చారు..... మగ రాబందులు."
    మామూలు మనుష్యులైతే అతని మాటలకి లేచి గుడ్ బై చెప్పేసి వచ్చేసి వుండేవారు. అక్కడే వైజయంతికీ మిగతావారికీ తేడా. విలేఖరులు రకరకాల వ్యక్తుల్ని కలుసుకోవలసి వుంటుందనీ వారిలో కోపిస్టులూ, మూర్ఖిస్టులూ, ఇరిటేట్ అయ్యేవారూ, అహంభావంతో మిడిసిపడేవారూ వుంటారని ఆమెకు  అనుభవపూర్వకంగా తెలుసు. ఎవరిని  ఎలా హాండిల్ చెయ్యాలో తెలుసుకున్నవాడే మంచి విలేఖరి. ఆమె నెమ్మదిగా అన్నది- "చూడండి పట్నయాక్ గారూ! మీరు అనవసరంగా మా మీద ద్వేషం పెంచుకున్నారు. మీ పరిస్థితికి మేము చింతిస్తున్నాం. ఇదేదో నాలుక చివరిమాట కాదు, మనస్ఫూర్తిగా నా మటుకు నేను చెప్తున్నాను నమ్మండి. మీరన్నట్టు మిమ్మల్నీ, మీ పరిస్థితినీ కాష్ చేసుకోవడానికి కాదు నేను వచ్చింది. మీరో గొప్ప సైంటిస్టు. మీ మనసులో ఎన్నో భావాలు వుండవచ్చు. మీవి అపూర్వమైన తెలివితేటలు. కానీ దురదృష్టవశాత్తూ అవి రేపు తెల్లవార్నే మూగపోతున్నాయి. మీరేదైనా చెప్పదలుచుకుంటే, మీ  మనసులో భావాలు ప్రజలకి అమ్దివ్వదల్చుకుంటే ఇది మీకు అపూర్వ అవకాశం. మీ అభిప్రాయాల్నీ కోర్కెల్నీ యధాతధంగా ప్రచురిస్తామని నేను హామీ ఇస్తున్నాను. మీకూ ప్రజలకీ మధ్య వారధిలా ఉపయోగపడటం కోసమే మా పత్రికలున్నాయి. ఈ వారధి అనే మీడియమ్ ని మీరు ఉపయోగించుకొమ్మని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి....."
    ఆమె వేసిన బాణం తగలవలసినచోట తగిలింది. ఇంగ్లీషులో ఆమె నెమ్మదిగా, స్ఫుటంగా మాట్లాడిన ఒక్కోమాటా అతడిని కొద్దికొద్దిగా కన్విన్స్  చేసింది. అతడి మొహంలో మార్పువచ్చింది.
    "సరే, నా మనసులో మాట ప్రజలకి చెప్పటం మీ ఆశయం అన్నావ్ కదూ. వ్రాసుకో. నాదోకే కోర్కె ఒకడ్ని చంపటం! అది తీరకుండానే చచ్చిపోతున్నాను- అదొక్కటే నాకు విచారం."
    ఆమె విస్తుపోయి, తన విస్మయాన్ని ప్రకటించకుండా రాసుకుపోతూ "ఎవర్ని?" అని అడిగింది.
    "అది మాత్రం చెప్పను."
    "ఎందుకు మీరు అతడిని చంపాలనుకుంటున్నారు?"
    "ప్రొఫెసర్ రామన్ ని నేను చంపాలనుకునేటంతగా నన్ను రెచ్చగొట్టినందుకు..."
    ఆమె చకచకా రాసుకుంటూ పోతూంది.
    "మిమ్మల్ని అలా రెచ్చగొట్టటం వలన అతడికి వచ్చే లాభం?" తలెత్తకుండా అడిగింది.
    "నాకు తెలీదు."
    "మీరు కనుక్కున్నా ఈ 'ట్రూత్ టెల్లర్' ఫార్ములానీ మీతోపాటే ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు?"
    "ప్రజలకి దాన్ని ఇవ్వటం అనవసరం."
    "మరి అటువంటప్పుడు దాన్ని కనుక్కోవటానికి ఇంత కాలం ఎందుకు కష్టపడ్డారు?"
    వైజయంతి గొప్పదనం అదే! చాలా మామూలుగా ప్రశ్నలు వేస్తున్నట్టే కనబడుతూ, అవతలివారిని ఒక పొజిషన్ కి తీసుకెళ్ళి నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నప్పుడు, హఠాత్తుగా కావలసిన ప్రశ్న వేసి సమాధానం రాబట్టుకోవటం!
    పట్నాయక్ ఆ ప్రశ్నలకి  వెంటనే సమాధానం చెప్పలేక పోయాడు. కాస్త  ఆలోచించి అన్నాడు- "నాకు బయట ప్రపంచం గురించి ఎక్కువ తెలీదు. నా  రిసెర్చి ఏదో నేను చేసుకుపోతూ వుండేవాణ్ణి. రామన్ హత్య కేసుతో ప్రపంచం ఒక్కసారిగా నాకు కనబడింది. ఈ ప్రపంచానికి ట్రూత్ టెల్లర్  ఇవ్వటం ఎంత  పొరపాటో అర్థమయింది."
    "ఎలాగో మీరు ట్రూత్ టెల్లర్ ని ప్రపంచానికి మీ తరపునుంచి ఇవ్వదల్చుకోనప్పుడు, ఎవరో రామన్ తనే దాన్ని కనుగొన్నానంటే మీకేమిటి నష్టం?"
    "నీకు పెళ్ళయి- నవమాసాలూ నిండి ఒక పాపని కన్నప్పుడు- ఇంకెవత్తో వచ్చి ఆ పాప తనదేనంటే నీకేమిటి నష్టం? పద్దెనిమిది సంవత్సరాల తర్వాత  ఎలాగో నీ కూతురు కూడా అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా!"
    వైజయంతి రాయటం ఆపి తలెత్తింది. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడలేదు. అతడి సమాధానికి ఆశ్చర్యపోయింది. ఎంతో  స్పాంటేనియటీ వుంటేగానీ ఆ సమాధానం చెప్పటం కష్టం. అతడిని కోల్పోవటం ప్రపంచం చేసుకుంటున్న దురదృష్టం!
    "ప్రొఫెసర్ రామన్ 'ట్రూత్ టెల్లర్' తనదేనని, అందుకు సాక్ష్యాధారాలు తన దగ్గిర వున్నాయని అన్నాడు కదా."
    "అనటం వేరు. చూపించటం వేరు. అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంతమంది చదివారు కదా. అందులొ ఒక్కరికి-  ఒక్కరంటే ఒక్కరికి అనుమానం వచ్చిందా? కనీసం ఒక్కసారైనా ఆ సాక్ష్యాధారాలు ఏమిటో చూపించమని అతడిని నిలదీశారా? అందుకే ఈ ప్రజలకి నా పరికరం అనవసరం."
    "కానీ ఆ వ్యాసం ప్రచురించిన తరువాత మా పత్రికకి చాలా ఉత్తరాలు వచ్చినయ్ పట్నాయక్ గారూ!"
    అతడిలొ అకస్మాత్తుగామార్పొచింది.
    "నీది -నీది ఆంధ్రశోభ పత్రికా?" అని అడిగాడు.
    "అవును."
    అప్పటివరకూ నెమ్మదిగా వున్న అతడి ప్రవర్తన సడెన్ గా మారిపోయింది. సివంగిలా ముందుకి దూకి ఆమె చేతిలో షార్ట్  హాండ్ బుక్ లాగి, కాగితాన్ని చింపేసి, "గెటవుట్" అని అరిచాడు.
    "ఈ హఠాత్ పరిణామానికి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ గొడవలకి సెంట్రీ పరుగెత్తుకు వచ్చాడు. పట్నాయక్ బుసలు కొడుతున్నట్టు "ఈమెని వెంటనే బయటికి పంపించండి- లేకపోతే ఇక్కడే మరో హత్యా జరుగుతుంది" అని అరవసాగాడు. ఆమె ఏదో మాట్లాదబోయిందిగానీ సెంట్రీ ఆమెని బలవంతంగా బయటికి తీసుకొచ్చాడు. లోపల్నుంచి ఏదో ఫిట్స్ లొ వున్నట్లు పట్నాయక్ ఇంకా అరుస్తూనే వున్నాడు.
    బయటికి వచ్చిందేగానీ ఆమె గుండెదడ  ఇంకా తగ్గలేదు. ఎలాగో ఆఫీసుకి చేరగలిగింది. ఇంటర్వ్యూ తాలూకు మాటర్ వెంటనే కంపోజు అయి వెళ్ళిపోవాలి. పట్నాయక్ ఉరి, ఈ ఇంటర్వ్యూ పక్క పక్కనే రావాలి.
    కాగితమూ- కాలమూ తీసుకొని ఆమె బల్లముందు కూర్చుంది.
    నిజానికి ఒక సెన్సేషనల్ వ్యాసం రాయొచ్చు.
    అతడు వెల్లడించిన సత్యాలూ, చివరలో అతడు దాదాపు మృగంలా మారటం, ఇవన్నీ వ్రాసి సెన్సేషన్ తయారు చెయ్యవచ్చు. అతడికి మరణశిక్షే సరియైనది అని పాఠకుల్ని కన్విన్స్ చెయ్యవచ్చు.
    ఈ ఆలోచనలతో ఆమె వ్యాసం మొదలుపెట్టబోయి, ఆగిపోయింది. ఎందుకో అలా ఆమెకి వ్రాయాలనిపించలేదు. అతడి కళ్ళలొ ఆర్తి, అతడు చెప్పినదానిలో నిజాయితీ ఆమెని కట్టిపడేశాయి. ఆత్మవంచన చేసుకోలేకపోయింది. మొత్తం వ్యవహారాన్నంతా అతడి కోణంలోంచి ప్రజంట్ చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రాగానే ఆమె కుర్చీలో నిటారుగా అయింది.
    అవును, అలా చేస్తే ఎలా వుంటుంది?
    అతడు ఎలాగూ చచ్చిపోతున్నాడు కాబట్టి ప్రజల సానుభూతి అతదిమీదే వుంటుంది. అతడు వెల్లడించిన విషయాలూ, మరణానికి ముందు అతడు పడిన మనోవ్యధా ఒక విభిన్నమైన కోణంలో వ్రాసి, ప్రజల్నుంచి అతడి మరణంవల్ల విచారాన్ని రేకెత్తించ గలిగితే, అతడి ఆత్మకి సానుభూతన్నా లభిస్తుంది. అతడికి తాను చెయ్యగలిగింది ఆమాత్రం సాయపడటం! స్వామినాయుడు కూడా దీన్ని కాదనడు. అతడికి కావల్సింది ఒక మంచి ఇంటర్వ్యూ, వ్యాసం మాత్రమే.

 Previous Page Next Page