Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 21


                    పట్నాయక్ చెప్పిన కథ:ట్రూత్ టెల్లర్
    ఆంధ్రశోభ పత్రికాఫీస్ రెండో అంతస్తులో ఎడిటర్ గదికి పక్కనే అనుకుని వున్న ఎయిర్ కండిషన్డ్ ఛాంబర్ లో, పొడవాటి బల్లకి ఇరువైపులా కూర్చుని వున్నారు జర్నలిస్టులు, మొత్తం పదిమంది. రెండు వరుసలూ కలిసేచోట ఒకపెద్ద కుర్చీలో ఆసీనుడై వున్నాడు- శోభా ప్రైవేట్ లిమిటెడ్ మానేజింగ్ డైరెక్టర్. ఆంధ్ర శోభ ఎడిటరూ అయిన స్వామినాయుడు.
    "ఫ్రెండ్స్" అన్నాడు నాయుడు. అందరూ అతడివైపు తిరిగారు. వారందరూ అతడి ఆఫీసులో పనిచేసే విలేఖరులు.
    ఆంధ్రశోభ రెండు సంవత్సరాల క్రితం దాదాపు దివాలాతీసే పరిస్థితుల్లో తండ్రినుంచి తీసుకున్నాడు స్వామినాయుడు. బూజు పట్టిన పాత మానేజిమెంటు పద్ధతులన్నీ మార్చటానికి అతడికి సంవత్సరం పట్టింది. అతడు చేసిన ముఖ్యమైన పనేమిటంటే, చాలామంది పత్రికాధిపతుల్లాగా తమ పేరు ఎడిటర్గా వేసుకుని, వ్యవహారమంతా అసిస్టెంట్ల చేతిలో పెట్టకుండా, తనే ఆఫీసులో కూర్చుని పత్రికని చూసుకోవటం. అతడు చేసిన ఈ పని వెంటనే రిజల్టు యిచ్చింది. దిన దిన గండంగా వున్న పత్రిక నెమ్మదిగా కష్టాలస్టేజి దాటి వేగం పుంజుకుంది. వైద్య విజ్ఞానం పేరిట హస్తమైధున సమస్యలూ, లేడీ డాక్టర్ తో కబుర్లు అన్న పేరిట డి.ఎన్.సి. సమస్యలూ చర్చించాడు. మూఢచారాల్ని పారద్రోలండి అన్న శీర్షిక పెట్టి పూర్వకాలంలో పిల్లలు పుట్టడం కోసం పౌర్ణమి రోజు స్త్రీలు ఎలా నగ్నంగా నృత్యం చేసేవారో ఫోటోలు ప్రచురించాడు. బెస్ట్ కాన్సర్ పేరిట  స్త్రీ రొమ్ముల్ని  ప్రదర్శించాడు. స్పోర్ట్సు కాలంలో విజయ్ అమృత్ రాజ్, పీలే, ప్రకాశ్ పడుకునే నిలువెత్తు బొమ్మలు వేసి కుర్రవాళ్ళ గదిగోడల మీదకు ఎక్కాడు. వరకట్న సమస్యమీదా, ఆస్థిహక్కుల సమస్య మీదా సోదరీమణుల నుంచి వ్యాసాలు ఆహ్వానించి వంటింటి ఆడవాళ్ళని ఆకట్టుకున్నాడు. రాజకీయ వార్తల్ని తాజాగా వేయించి, మనస్సు స్పందించే మసాలా జల్లి ప్రజల ముందుంచాడు. ఇలాంటి మార్పులు చేసీ చేసీ.....తమకి ఏ నెలకానెల జీతం సరికల్లా బోనస్  ప్రకటించాడు-
    స్వామినాయుడు!
    అతడి కళ్ళలో తెలివితేటలు ప్రస్ఫుటిస్తూ వుంటాయి. వాటి లోతెంతో ఎవరికీ తెలియదు. అతడి పెదవులమీద చిరునవ్వునాట్యం చేస్తూ వుంటుంది. దాని వెనుక ఏ ఆలోచనుందో ఎవరికీ తెలియదు.
    "ఫ్రెండ్స్" అన్నాడు. అతడిది అది మరో ట్రిక్కు. ఆఫీసులో తన క్రింద పనిచేసే వాళ్ళని తనతో సమానంగా చూడటం!! ఇది పే చేస్తుందని అతడికి తెలుసు.
    అందరూ అతడివైపే ఉత్సకతతో చూస్తున్నారు. అతడు అగ్నిలో దూకమంటే దూకేలా వున్నారు వాళ్ళు. అలా అనటం కంటే వాళ్ళని అలా తయారుచేశాడు అంటే బావుంటుంది. దేశంలోని ఎక్కడెక్కడి సమాచారాన్నీ వాళ్ళు చిటికెలమీద సంపాదిస్తారు. అదీ వాళ్ళ ప్రత్యేకత.
    "ఫ్రెండ్స్" అన్నాడు స్వామినాయుడు. "మీ అందరి అగ్నిలో దూకమంటే దూకేలా వున్నారు వాళ్ళు. అలా అనటం కంటే వాళ్ళని అలా తయారుచేశాడు. అంటే బావుంటుంది. దేశంలోని ఎక్కడెక్కడి సమాచారాన్నీ వాళ్ళు చిటికెలమీద సంపాదిస్తారు. అదీ వాళ్ళ ప్రత్యేకత.
    "ఫ్రెండ్స్" అన్నాడు స్వామినాయుడు. "మీ అందరి సహకారంవల్లా మన  పత్రిక మళ్ళీ దార్లో పడింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగాలి అని నేను కోరుకుంటున్నాను. మనమేదో సాధించాం కదా అని సంతృప్తిపడితే, అక్కణ్ణుంచే మన సేల్స్ పడిపోతాయి. కృషి అనేది నిరంతరంగా సాగుతూ వుండాలి అని నేను నమ్ముతాను."
    ఎవరూ మాట్లాడలేదు. అతడో ప్రశ్న వేసేడు.
    "- ఈ ప్రపంచంలో ఒకప్పుడు అన్నిటికన్నా విలువయిందీ- మరుక్షణమే తన విలువ కోల్పోయేదీ ఏదో చెప్పగలరా?"
    ఒకర్నొకరు చూసుకున్నారు. నిశ్శబ్దంగా ఆవరించింది. వారిని చూసి అతడు నవ్వాడు. "ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువయింది వార్త- మై ప్రెండ్స్! దానికిమించి విలువయింది మరొకటి లేదు. కానీ ఆ వార్తే కొన్ని గంటలు  గడిచాక తన ప్రాముఖ్యత కోల్పోతుంది. ఈ రాత్రి కెన్నడీ చచ్చిపోతే పొద్దున్నకల్లా అది  పేపర్ లో రావాలి దానికున్నంత ప్రాముఖ్యత మరే వార్తకీ వుండదు. కొన్ని  కోట్లమంది- కొన్ని బిలియన్స్ జనం దాన్ని ఆతృతగా చదువుతారు. అదే ఆ రోజు  విడిచి మరుసటిరోజు పెద్ద హెడ్ లైన్స్ లో వేసినా దానికి ఏ విలువా వుండదు. అంటే కెన్నడీ చనిపోయిన తరువాత రెండు రోజులకి ఎలా చనిపోయిందీ నాలుగు పేజీలు వ్రాసినా జనానికి ఇంటరెస్టు వుండదన్నమాట. చనిపోవటం అనే న్యూసే వారికి థ్రిల్ కలగజేస్తుంది. మనం ఇవ్వగలిగినంత న్యూస్ మొదటిరోజే ఇవ్వాలి. ఈ చిన్న  రహస్యం దృష్టిలో పెట్టుకున్న జర్నలిస్ట్ జీవితంలో పైకి రాగలడు. అలాంటి వాళ్ళనే ఆంధ్రశోభ ప్రోత్సహిస్తుంది"
    వైజయంతి ముందుకు వంగి అతడి మాటలు ఉత్సాహంగా వింటూంది. ఆమె స్వతహాగా చురుకైనదీ, కొత్తగా ప్రొఫెషన్ లోకి వచ్చింది అవతంచేత ఏదో సాధిద్దామని ఉవ్విళ్ళూరుతుంది. గ్రాడ్యుయేషన్ అయిన తరువాత ఆమె జర్నలిజంలో డిప్లోమా చేసింది. ఆమె తండ్రికి స్వామినాయుడు తెలుసు. అందుకని సులభంగానే ఆమెకి ఆ ఆఫీసులో ఉద్యోగం దొరికింది.
    "నేను ఇరవయ్యో ఏట క్రికెట్ అంటే చాలా ఉత్సాహం చూపించేవాణ్ణి" అన్నాడు స్వామినాయుడు. "అప్పుడు భారత జట్టు వెస్టిండీస్ పర్యటన కెళ్ళింది. మీకు తెలుసుగా- అక్కడ పగలు అంటే మనకు రాత్రి. అందువల్ల ప్రొద్దున్న అన్ని పేపర్ల లోనూ కేవలం లంచ్ టైమ్ స్కోర్ వచ్చేది. ఒక్క పేపరు మాత్రం టీ టైమ్ స్కోర్ వేసేది. నేను మా నాన్నతో దెబ్బలాడి, అప్పటి వరకూ తెప్పిస్తున్న పేపరు మానేసి ఈ పేపరు తెప్పించమని వేధించి, చివరకు సాధించాను. ఇలా ప్రతి కుర్రాడూ, ప్రతి గృహిణి, ప్రతి పురుషుడు మన పేపరే కావాలని కోరుకునే స్థితికి మనం తీసుకెళ్ళాలి. అదీమన గమ్యం. అదే మన లక్ష్యం."
    ఆ తరువాత అతడు మిగతా  విషయాలు చాలా మాట్లాడాడు. ఏరియాల ప్రకారం పోగ్రెస్ రిపోర్టులు చూశాడు. సాధక బాధకాలు అడిగాడు. దాదాపు గంట గడిచాక ఉపన్యాసం ముగిసింది. ఒక్కరొక్కరే వెళ్ళిపోతూంటే అతనన్నాడు "వైజయంతీ! నువ్వు కాస్త ఆగు- మాట్లాడాలి"
    ఒక్కొక్కరే అతడి దగ్గిరకు వచ్చి శలవు తీసుకుని వెళ్ళిపోయారు. రెండు మూడు నిమిషాల్లో  గది ఖాళీ అయింది.
    వైజయంతి అతడి దగ్గిరగా వున్న కుర్చీలో వచ్చి కూర్చుంది.
    "రేపటి న్యూస్ ఏమిటి?"
    ఆమెకి అతడి ప్రశ్న అర్థంకాక "బెగెపార్డిన్, సర్?" అంది.
    "రేపో, వార్త ప్రముఖంగా రాబోతూంది, ఏమిటది?" అని అడిగాడు.
    ఆమె ఆలోచనలు వేగంగా పరుగెత్తినయ్. కానీ ఎంత ఆలోచించినా ఆ  వార్త ఏమిటో గుర్తు రాలేదు. రాజకీయాలు, స్పోర్ట్స్ , గేమ్స్ అంతర్జాతీయ వార్తారంగం - ఉహూ- ఏ ఒక్క విశేషమూ కనబడలేదు.
    ఆమె ఆలోచనలు పసిగట్టినట్టు నవ్వి- "రేప్రోద్దున్న ఒక ఖైదీ ఉరితీయ బడుతున్నాడు- తెల్లవారుఝామున అయిదింటికి" అన్నాడు.
    ఆమెకు అప్పుడు జ్ఞాపకం వచ్చి "అవును" అంది.
    కానీ అందులో ఆమెకి ఏ విశేషం వుందో అర్థం కాలేదు.
    "మనం ఒక వ్యాసం ప్రచురించాం అనుకో- ఎలా వుంటుంది?"
    "దేని గురించి?"
    "ఆ ఖైదీతో ఇంటర్వ్యూ చేస్తాం. 'మరణానికి ముందు నా మనోభావాలు అన్నటైటిల్ పెట్టి దాన్ని ప్రచురిస్తాం. అది రేపు పత్రికలో వస్తుంది. ఇరవై గంటల్లో చచ్చిపోబోయే వ్యక్తితో ఇంటర్వ్యూ కాబట్టి ప్రతీ పాఠకుడూ ఇంటరెస్టుతో చదువుతాడు రేపటి పత్రికలోనే అతడి మరణవార్త కూడా వస్తుంది కాబట్టి- రెండూ పక్క పక్కనే  వుంటాయి కాబట్టి- చాలా గొప్పగా వుంటుంది. చచ్చిపోబోయే ముందు ఒక మనిషి చెప్పిన విషయాలు అంటే అందరికీ ఇంటరెస్టేకదా, అందులోనూ హంతకుడు....."
    వైజయంతి కళ్ళెత్తి అతడివైపు చూసి మనసులో అనుకొంది, "అందుకే ఇతడు పత్రికా సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజు అయ్యాడు. మనిషి చచ్చిపోవటంలాంటి విషాదకరమైన వార్తల్లోంచి కూడా పాఠకులకి ఉత్సాహపూరితమైన వార్తని  సృష్టించగలడు. ఇతడి క్రింద పని చెయ్యటమే నా అదృష్టం"
    స్వామినాయుడు ఒక కవరు ఆమె ముందుకు తోసి, "ఇది జైల్లోకి వెళ్ళడానికి పాసు. ఖైదీతో మాట్లాడటానికి అనుమతి కూడా మనకు దొరికింది. రేప్రోద్దున్నే ఉరి కాబట్టి ఈ రాత్రే అతనితో బయటివాళ్ళు మాట్లాడటాన్ని బంద్ చేస్తారు. మీరు ఇప్పుడే వెళితే మంచిది" అన్నాడు.
    ఆమె ఉత్సాహంగా - "వెళతాను" అంది. ఇది చాలా సెన్సేషనల్ ఇంటర్వ్యూ అవబోతూంది అని ఎందుకో మనసు చెపుతూంది.
    వైజయంతికి చిన్నతనం  నుంచీ గేమ్స్ అన్నా. స్పోర్ట్సు అన్నా చాలా ఇష్టం. చదువులో వెనకపడక పోయినా ఆటల్లో ముందుండేది. అందుకే వృత్తిలో కూడా ఆమె జర్నలిజాన్ని ఎన్నుకుంది. బల్లముందు కూర్చుని టెలిప్రింటర్ మీద వచ్చిన వార్తల్ని తెలుగులో అనువదించి వేసేవాళ్ళంటే ఆమెకు అయిష్టం. విలేఖర్లు అంటే  కదనరంగంలో కూడా దూసుకు వెళ్ళి వార్తల్ని స్వయంగా సేకరించగలగాలి అని ఆమె ఉద్దేశ్యం. ఆమెకి ఈ ఉద్యోగం బాగా సంతృప్తి ఇస్తూంది. అందులోనూ ఆంధ్రశోభలో ఉద్యోగం...
    ఆమె అతడు అందించిన కవరు తీసుకొని, "వెళ్ళొస్తాను సార్" అంది.
    "విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"
    ఆమె తన సీటు దగ్గరికి వచ్చి దాదాపు సంవత్సరం క్రితానివి పాత పేపర్లు- అన్నీ తెప్పించి చూసింది. అసలీ మనిషి ఎవరు-? వగైరా అన్నివివరాలు ముందుగా  తెలుసుకోవాలని ఆమె అభిప్రాయం. ఇంటర్వ్యూకి వెళ్ళేముందు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవటం ముఖ్యం. అప్పుడే అతడినుంచి మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవటం సాధ్యమవుతుంది.
    అక్కడే మిగతావారికీ, వైజయంతికీ తేడా!
    మిగతా వారయితే మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి వుండేవారు.
                       *    *    *
    దాదాపు గంట పట్టింది ఆమెకు అంతా చదవడానికి.
    హంతకుడి పేరు పట్నాయక్.
    అతడు 'ట్రూత్ టెల్లర్' అన్న మిషన్ ని కనుక్కొన్నాడు. చేసిన తప్పల్లా తను కనుకున్న విషయాన్ని ప్రొఫెసర్ రామన్ కి చెప్పటమే. దాంతో ప్రొఫెసర్ రామన్ ఈ ఫార్ములా తనదేననీ, తననుంచే పట్నాయక్ దాన్ని కాపీ కొట్టాడనీ, కనీసం తన పేరు కూడా ఎక్కడా అనలేదనీ, ఈ విషయంలో తను కోర్టుకు వెళ్ళదలచుకున్నాననీ పేపర్ స్టేట్ మెంటు ఇచ్చాడు. పట్నాయక్ ఈ న్యూస్ చూసి అవాక్కయ్యాడు. తను అంత కష్టపడి కనుక్కున్నా, తయారు చేసుకున్న ఫార్ములాని ఎవడో అనామకుడు వచ్చి అతనిదే అనటం......
    కేవలం రామన్ యొక్క సామర్థ్యం మీద నమ్మకం వుండి తను అతడికి రీసెర్చి పేపర్లు చూపించాడంతే. ఇంత దానికి రామన్, పేటెంట్ల మీద వచ్చిన రాయల్టీలో షేరు అడుగుతాడనుకోలేదు.
    పట్నాయక్ దాదాపు పిచ్చివాడై పోయాడు.
    ఆ పిచ్చిలోనే రామన్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, రామన్ తలుపు తీయగానే నాలుగయిదు పోట్లు పొడిచి పారేశాడు. అరెస్ట్ చెయ్యడానికి వచ్చిన పోలీసులని కూడా రెండుపోట్లు పొడవటంతో అతడికి ఉరిశిక్ష పడింది.

 Previous Page Next Page