"ఆయన్ని నేను ఎప్పుడు తీసుకు వెళ్ళిపోవచ్చు?"
డాక్టరు తడబడి, "జోకుల కిది సమయం కాదు" అన్నాడు.
"నేను జోకు చెయ్యటం లేదే?"
"దాన్ని కదపటానికి వీల్లేదు."
"దాన్నికాదు, 'ఆయాన్ని' అనండి. ఆయన నా భర్త."
డాక్టరు పరకాయించి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె మొహంలో అతడికి ఒక అనూహ్యమైన భావం కనబడింది. ఒక రకమైన దృఢత్వం.....
"మనం నా రూమ్ కి వెళ్ళి మాట్లాడుకుందామా?"
"సరే" అని ఆమె బేసిన్ దగ్గరికి వెళ్ళి తల పైకి పెట్టి కిందికి చూస్తూ "మీరేమీ బాధపడకండి. నేను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. మనల్ని ఎవరూ విడదీయలేదు" అని డాక్టరుతో పాటు కదిలింది.
"చాలా ఇబ్బందికరమైన కోర్కె మీది" అన్నాడు డాక్టరు తన గదిలోకి ప్రవేశించాక.
"ఇబ్బంది ఏమీలేదు డాక్టర్ గారూ! మీరు మీ ప్రయోగాలు నా ఇంటిలోనే చేసేకోవచ్చు. ఎవరొచ్చి చూస్తానన్నా నేను కాదనను. నేను కోరేదల్లా 'మా ఇంటిలో మేం' వుండాలని- అంతే! నాడి చాలా న్యాయబద్ధమైన కోర్కె అనుకుంటాను."
డాక్టరు తటపటాయించి, "అవును అరుంధతిగారూ! మీ హక్కుని ఎవరూ కాదనలేరు" అన్నాడు.
* * *
నలుగురు వ్యక్తులు జాగ్రత్తగా దాన్ని లోపలి మోసుకొచ్చారు. డాక్టర్ విలియమ్స్ అతి సున్నితంగా ప్రతి కదలికా గమనిస్తూ సూచనలు ఇస్తున్నాడు.
మధ్య హాల్లో దాన్ని అమర్చారు.
అప్పటివరకూ బ్యాటరీతో ఆపరేట్ చెయ్యబడుతున్న రక్తప్రసరణ యంత్రం తిరిగి కరెంట్ కి కనెక్ట్ చేయబడింది. ఎన్ సిఫలో గ్రాఫ్ ని చూసి, ఆ ఏర్పాట్లపట్ల సంతృప్తి చెంది, డాక్టరు విలియమ్స్ అరుంధతివైపు తిరిగి "అంతా సరిగ్గానే వుంది. మీ భర్తను మీకు అర్పించాను, వెళ్లోస్తాను" అన్నాడు.
అప్పటివరకూ మౌనంగా జరుగుతున్నదంతా చూస్తున్న అరుంధతి కదిలి "థాంక్స్ డాక్టర్ గారూ" అంది.
అందరూ వెళ్ళిపోవటంతో ఆ గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆమె వెంటనే కదల్లేదు. బేసిన్ వైపు అలా చూస్తూ నిలబడింది. తరువాత కదిలి, ముందుగది తలుపు వేసి లోపలికి వచ్చింది.
ద్రవంలో భర్త కన్ను భరిణిలో పై కప్పుకేసి చూస్తూంది. జాగ్రత్తగా భర్తకి ఏ మాత్రం బాధ కలక్కుండా భరిణని పక్కకి తిప్పింది.
ఇప్పుడు కన్ను సొఫాని చూస్తూంది.
ఆమె వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఆమె పక్కన వక్కపొడి పొట్లం వుంది. కాగితం మీద ముందే వ్రాసి పెట్టుకున్న నాలుగు వాక్యాల్ని కన్నుముందు పెట్టి చదివింది. "ఇన్నేళ్ళు నన్ను నాలుగ్గోడల మధ్యా ఉంచి మానసికంగా చిత్రహింసలు పెట్టారు. పైకి కనబడకుండా ఆడదాన్ని భర్త ఎంత బాధపెట్టగలడో అంతబాధ అనుభవించేలా చేశారు. అన్నీ మౌనంగా అనుభవించాను. ఇప్పుడిక నా వంతు నన్ను క్షమించండి."
ఆమె వక్కపొడి చేతిలో పోసుకుని పొట్లం కనబడేలా పట్టుకుని, నమలటం ప్రారంభించింది. పళ్ళమధ్య ఇరుక్కున్న ముక్కల్ని నాలుకతో తీస్తూ, దవడల్ని కదిలిస్తూ, తృప్తిగా, తాపీగా, హాయిగా తింటూంది.
ఎలక్ట్రో ఎన్ సిఫ లో గ్రాఫ్ లో తరంగాలు కొట్టుకుంటున్న కొద్దీ ఆమెకు మరింత సంతృప్తిగా వుంది.
* * *
నేను కథ చెప్పటం పూర్తిచెయ్యగానే ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. దూరంగా బేరర్ పెడ్తూన్న ప్లేట్ల చప్పుడు తప్ప మరేమీ వినిపించటంలేదు. నేను చెప్పిన కథ మిగతావారందరూ చెప్పినదానికంటే థ్రిల్లింగ్ గానూ, సస్పెన్సుతోనూ వుందని తెలుసు. అందుకే గర్వంగా వాళ్ళవైపు చూశాను. కానీ నా అంచనాని ఒక్కసారిగా తారుమారుచేస్తూ విజ్జీ "ఏమిటి ఈ కథలో నువ్వు చెప్పదల్చుకున్నది?" అన్నాడు.
తెల్లబోయాను. ఈ కరమైన ప్రశ్న వస్తుందని వూహించలేదు. అయినా తమాయించుకొని, "మన పందెం ఎవరు మంచి సస్పెన్సుతో కథ చెప్తారా అన్నది కాదు" అన్నాను కోపంగా.
?"ఇది చాలా సూడో సైంటిఫిక్ గా వుంది. ఎక్కడా హేతువుకు అందటం లేదు. ఈ విధంగా నీకు తెలియని విషయాల్ని అందంగా చెప్పి మమ్మల్ని మోసపుచ్చలేవు."
"నేను చెప్పింది ఫాంటసీ"
"కానీ ఇది నీ కథలాగే ఉత్తమ పురుషతో చెప్పావు" అన్నాడు వెంకూ."..... అదీగాక నీకూ సంవత్సరం క్రితం మెదడు ఆపరేషన్ జరిగింది. పైగా ఈ కథలోలాగే నువ్వూ రచయితవే కూడా. ఈ కథే నిజమైతే నువ్వు చచ్చిపోయి వుండాలి. కానీ అందేం జరగలేదే. కేవలం పాఠకుల- ఐ మీన్- శ్రోతలైన మమ్మల్ని థ్రిల్ లో ముంచటానికి ఒక కొసమెరుపు సృష్టించావు. అసలీ కొసమెరుపు ముగింపుల వల్లే మన సాహిత్యం పాడవుతుందని నా ఉద్దేశ్యం."
నేను ఉక్రోషంగా కుర్చీలోంచి లేవబోయి, తమాయించుకుని అన్నాను. "........ఈ కాలపు రచయితల భార్యలూ, రచయిత్రుల భర్తలూ తమ జీవిత భాగాస్వాములపట్ల మనసులోనే ఎంత కోపాన్నీ, కసినీ పెంచుకుంటున్నారో చెప్పటమే నా లక్ష్యం. సాహితీ చర్చలన్న పేరుతో నలుగుర్నీ పోగేసుకుని ఇంటిలోనే ఒక రచ్చబండ ఏర్పాటు చేసే రచయితని..తిట్టుకోని భార్య వుండదు. తన తెలివితేటలకి సరయిన జోడీ తన భర్త కాదు అన్న ఆలోచన వస్తే ఇక ఆ రచయిత్రి భర్తకి ఇల్లో నరకమే. భార్య సాహిత్య అభిరుచిని నిస్సహాయంగా గమనిస్తూ, మన్నిస్తూ వుండటం తప్ప ఇంకేమీ చెయ్యలేడు. ఇలాటి వాళ్ళకి అవకాశం వస్తే తమ కసినీ, కోపాన్నీ ఎలా తీర్చుకుంటారో నా కథలో చెప్పాను"
శివ లేచి, "టాయ్ లెట్ ఎక్కడ?" అని అడిగాడు. గౌహతీ విమానాశ్రయం గమ్మత్తుగా వుంటుంది. ఆ ప్రదేశానికి సంబంధించిన వాడిని కాబట్టి నాకు దాని టోపోగ్రఫీ తెలుసు. అది తెలియకపోతే అక్కడ కనుక్కోవటం కష్టం. నేను చెప్పబోయేంతలో శేషూ లేచి, "నేను చూపిస్తాను పద" అంటూ అతడితో కలసి వెళ్ళాడు.
"మా విమానం ఎప్పుడో కనుక్కొని వస్తాను" అంటూ లేచాడు వెంకూ. వాణ్ణి ముద్దుగా 'అప్పూ' అంటాం. డబ్బులు పైసా ఖర్చుపెట్టడు. వాడు లేస్తూ వుంటే విజ్జూగాడు కూడా లేచి, "నేనూ దిబ్రూగడ్ గురించి కనుక్కోవాలి" అన్నాడు.
వాళ్ళు వెళ్లిపోయాక నేనొక్కడ్నే మిగిలాను. ఈ లోపులో బేరర్ బిల్లు తెచ్చిపెట్టాడు. దాన్ని చూడగానే నా గుండె ఆగినంత పని అయింది. ఎనిమిదొందల చిల్లర అయింది. ఒకవేళ ఈ పందెంలో నేను ఓడిపోతే కష్టాల్లో పడాల్సి వస్తుంది న దగ్గర ఆరొందలే వుంది.
ఈ లోపులో వెంకూవాళ్ళూ వచ్చారు. "విమానం ఆరింటికట. ఇంకా గంటపైనే గడపాలి. ఎలాగ?" అన్నారు.
"ఇంక ఈ తాగుడు చాలు. మరీ ఓవర్ అయిపోతుంది" అన్నాను.
"ఫారెస్టాఫీసరుకి ఓవర్ అయిపోతుంది" అన్నాను.
"ఫారెస్టాఫీసరుకి ఓవర్ ఏమిటి?" అన్నాడు.
మేం మాట్లాడుకొంటూ వుంటే టాయిలెట్ నుంచి మిగతా ఇద్దరూ వచ్చారు.
"బిల్లు తెప్పించేశాను. ఇక తాగింది చాలు" అన్నాను. దాన్ని చూస్తూ "మైగాడ్......ఎనిమిదొందలా" అన్నాడు విజ్జూ. "పాపం ఎవడో పూర్ ఫెలో మనలో దీన్ని ఇవ్వబోతున్నాడు."
ఎవరూ మాట్లాడలేదు.
వెంకూ నాయకుడిలా, "మనలో ఎవరు తక్కువ సస్పెన్సున్న కథ చెప్పారో ఎలా నిర్ణయించటం?" అన్నాడు. "దుప్పట్లో మిన్నాగు' కథ చెప్తూ శివ సగంలో ఆపుచేసినప్పుడు మనందరం అదేం కథ అని తిట్టాం. అలాగే విజ్జూ 'ఓడ ప్రయాణం' కథ చెప్పినప్పుడు ఆ సముద్రంలో దూకినవాడు ఏమయ్యాడా అని అందరం ఆత్రుత చెందాం. 'మానవాతీత వ్యక్తి' కథలో కూడా అలాగే జరిగింది. శేషూ తన కథ చెప్తూ తను వరండా కుర్రాడో రాధ భర్తో చెప్పలేదు. నేను చెప్పింది పూర్తీ అబ్సర్డు కథ అని కొట్టి పడేశారు. దీన్నిబట్టి తేలిందేమిటంటే ఒకరు చెప్పిన కథ నలుగురికీ అంతగా నచ్చలేదన్నమాట. అసలు మన అయిదుగురమే పాఠక ప్రపంచం అనుకుంటున్నాం. ఒకరికి సామాజిక స్పృహవున్న కథ కావాలి. ఒకరికి వరండా కుర్రాడు లాంటి రొమాన్సు కథ కావాలి. మరొకరికి అంతర్నేత్రంలాంటి సైంటిఫిక్ కావాలి. ఏది చెప్పినా మిగతా ఎనభై వంతుల వారికి వ్యతిరేకులమవటం ఖాయం" అన్నాన్నేను ఆవేశమూ, బాధా మిళితమైన స్వరంతో.
"కాని ఎంత ఎక్కువమందిని కూడగట్టుకుంటే అంది అంత మంచి కథ. అందువల్ల మనం మార్కుల పద్ధతిన ఏది మంచికథో నిర్ణయించాలి" అన్నాడు విజ్జూ. వాడు లెక్కల్లో దిట్ట. మీదున్న హొటల్ కాగితపు నాప్ కిన్ లు అయిదుగురికీ ఇచ్చి "వరుసగా, ఇప్పుడు మనం చెప్పిన కథల పేర్లు వ్రాయండి" అన్నాడు అందరం అలాగే వ్రాసుకున్నాం. నా కాగితం మీద నేను-
శివ చెప్పిన కథ : దుపట్లో మిన్నాగు
విజ్జి చెప్పిన కథ : ఓడ ప్రయాణం
వెంకు చెప్పిన కథ : మానవాతీత వ్యక్తి
శేషు చెప్పిన కథ : వరండా కుర్రాడు
నేను చెప్పిన కథ: అంతర్నేత్రం
అని వ్రాసుకున్నాను. విజ్జీ చెప్పటం కొనసాగించాడు. "మీ మీ కథలు ఎలాగూ మీకు బావుంటాయి. డానికి మీరు అయిదు మార్కులు వెయ్యండి అంటే దాన్ని పరిగణన లోకి తీసుకోము అన్నమాట- అందరికీ ఆ అయిదు పడతాయి కాబట్టి!"
నేను నా కథ 'అంతర్నేత్రం' ముందు అయిదు అంకె వేశాను. అలాగే ఎవరి కథ ముందు వారు అయిదు వేసుకున్నారు. విజ్జు చెప్పటం సాగించాడు.
"ఇకపోతే నాలుగు కథలు మిగిలి వుంటాయి. అన్నిటికన్నా బాగా నచ్చిన కథకి నాలుగు మార్కులు వెయ్యండి. దాని తరువాత నచ్చిన డానికి మూడూ రెండూ, ఒకటి అలావేసుకుపోండి. అన్నీ కలిపి మొత్తం కూడదాం. ఎవరికీ తక్కువ వస్తే వాళ్ళు బిల్లు ఇవ్వాలి" అన్నాడు. ఈ పద్ధతి బాగానే వుందనిపించింది. మా కథలకి మేమే జడ్జీలం అన్నమాట.
"ఇంకొకరి కథ నా కథ అంత బావుంటే!" అడిగాడు శేషు. వాడికి అనుమానం జాస్తి.
"దానికి అయిదు మార్కులు వెయ్యండి" అన్నాడు. "మీరు వేసుకున్నట్టే."
"అసలేమీ బావోలేకపోతే"
"సున్నా వెయ్యండి."
అందరం మార్కులు వెయ్యటం ప్రారంభించాం. మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నేను ఆలోచనలో పడ్డాను. మొట్టమొదటి కథ దుప్పట్లో మిన్నాగు. మేం ముందు అనుకున్న షరతు ప్రకారం ప్రతీ వాక్యంలోను సస్పెన్సు - థ్రిల్ గా వుండాలి కాబట్టి ఆ అర్హతలన్నీ దానికి వున్నాయి. దానికి నాలుగు మార్కులివ్వాలి. ఓడ ప్రయాణం కథలో ఏ సస్పెన్సూ లేకపోయినా మొత్తం కథగా తీసుకుంటే ప్రధానపాత్ర మీద సానుభూతి కలగకమానదు. ఆశ మనిషిని ఎలా దెబ్బ తీస్తుందో చెప్పేకథ. మేం చెప్పిన అయిదు కథలలోనూ నీతివున్న కథ అదొక్కటే. దానికీ నాలుగు మార్కులు వెయ్యాలి. వరండా కుర్రాడులో టెక్నిక్ బావుంది. స్త్రీ మానసిక సంచలనం గురించి ఒక క్రొత్త దృక్పథంలో చెప్పాడు శేషూ. వాడికీ నాలుగు మార్కులు ఇవ్వాలి. ఇక మిగిలింది వెంకూ (అప్పూ) ఒక్కడే. వాడివైపు చూస్తే జాలేసింది. వాడికి మాత్రం ఎందుకు తక్కువ వెయ్యాలని వాడికీ నాలుగు మార్కులు వేశాను.