మనీషి-మనీ = షి (?)
"ఫ్రెండ్స్..... అర్ధంలేని ఆచారాలతోనూ.... ..... ......వాటిలోని బలహీనతలతోనూ నానాటికీ కుళ్ళిపోతూ వున్న ఈ సాంఘిక వ్యవస్థనీ కట్టుబాట్లనూ చేదించుకొని ప్రగతిపధంవైపు అడుగు వేస్తున్న ఈ ఆదర్శ వివాహం ఈ కొత్త దంపతులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను."
హాలంతా చప్పట్లతో నిండింది.
రాజు వైపు గర్వంగా చూసింది శైలజ. ఆ కళ్ళలో అడ్మిరేషన్..... ఆ క్షణం రాజు హీరోయే అయ్యాడు.
అలా చాలాసార్లు హీరో అయ్యాడు.
ఆ రోజు .... అందమైన సాయంత్రం... సూర్యకళామందిర్ గ్రీన్ రూమ్ లో శైలజ మర్యాదగా "గ్రీట్" చేస్తున్నప్పుడు అతడి కళ్ళల్లో కనబడిన హుందాతనం-మాటల్లో వినబడిన మంచితనం -
ఆ పైన సరిగ్గా పదిరోజుల తర్వాత - ఇంకో అందమైన సాయంత్రం, ఒంటరిగా బీచ్ లో - ఆమె పెదవుల్ని సుతారంగా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు - అతడి చేతుల్లో కనబడిన వణుకూ - చేతల్లో కనబడిన చురుకూ -
ఆ తర్వాత నాల్గు నెలలకి ఆమె తనని తండ్రిని చేయబోతోందని తెలిసినపుడు ఆ కళ్ళల్లో కనబడిన చెదరని నిశ్చలత్వం -
ఇవన్నీ చాలాసార్లు రాజుని శైలజ దృష్టిలో హీరోని చేసినయ్. ఆమె కళ్ళల్లో అడ్మిరేషన్ కనబడిందీ అంటే దానిక్కారణం వుంది.
ప్రేమించటం గొప్పదనం కాకపోవచ్చు. కాణీ కట్నం లేకుండా ప్రేమించిన అమ్మాయిని - అందులోనూ, ఆమెలో ఇంక "థ్రిల్ ఏమీ లేదని" తెలిసిన తర్వాత కూడా...... పెళ్ళి చేసుకోవటానికి అతను ఇష్టపడ్డాడు అంటే..... ఆమె కళ్ళల్లో ఆ మెచ్చుకోలు కనబడకేం చేస్తుంది?
ఎలాగైనా శైలజ అదృష్టవంతురాలు!
ఆమె తండ్రి తల తాకట్టు పెట్టినా రాజులాంటి వరుణ్ణి కూతురికి కొనిపెట్టి యివ్వలేడు.
ఈ కథలో హీరో రాజు అంటే నాకేమీ ఈర్ష్య్తాద్వేషం లాంటివి లేవు.
ప్రేమించడం తప్పుకాదు.... పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం కలుగకపోయినా ప్రేమించేసేయటం మగవాడి జన్మహక్కు.
తెలుగు నవల్లో హీరోకి వుండవలసిన లక్షణాలు అన్నీ రాజుకి వున్నాయ్! కానీ రాజు హీరో అవటానికి కారణం శైలజ కాదు...... రంగనాధంగారి ఓటమి!
ఇంతలా మెరిసిపోతున్న అద్దం వెనుకవైపు నుంచి చూస్తే....
* * *
కొద్దికొద్దిగా ఒరిగిపోతున్న వసారాలో చేతులు వెనుకగా కట్టుకొని రంగనాధం పచార్లు చేస్తున్నాడు. జీవితంలో పడిన కష్టాల్ని నుదుటిమీద గీతలు ప్రస్ఫుటపరుస్తూ వున్నాయ్! ఆ కళ్ళల్లో ప్రతిబింబిస్తున్నది ఆవేదన కాదు నిస్పృహ కూడా.
ఆయన ఓడిపోయారు!
చిత్తుగా ఓడిపోయారు!!
రాజు వేసిన ఒక ఎత్తుతో ఆయన ఆట కట్టు అయింది. ఒక్కో అంతస్తూ నిర్మించుకొంటూ వచ్చిన ఆయన కలల భవంతి పునాదుల్తో సహా కూలిపోయింది. సమాధి అయిపోయిన ఆశల తాలూకు నీడలా ఆయన మిగిలేడు. ఆయనకు తోడుగా శారద!!
ఆ వసారాలోనే ఒక మూలగా కూర్చొని వుంది శారద. ఆమె కళ్ళల్లో ప్రశాంతత.
తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతత.....
అన్నయ్య పెళ్ళి తండ్రికి ఎంత పెద్ద దెబ్బో శారదకు తెలుసు. రాజులో తన ఆశల స్వరూపాన్ని చూసుకోవడం కోసం, ఉన్నదీ- సంపాదించినదీ అంతా కొడుకుమీదే పెట్టుబడి పెట్టేరు. అందులో ఆయన స్వార్ధం లేదు. రాజు పెద్ద ఆఫీసరైతే ఎక్కువ కట్నం వస్తే ఆ కట్నంతో శారదకు ఇంకో ఆఫీసర్ని సంపాదించవచ్చు. ఉన్న ఒక్క కూతురూ - కొడుకూ తనకన్నా ఒక అంతస్తు పైకి చేరుకుంటారు.
లెక్కల మాస్టారు రంగనాధం లెక్క తప్పని సగం చేసిన తర్వాత తేలింది.
అసలు ఆయన ఒకలా చేసి వుండవలసింది. సంపాదించిందంతా కొడుకుమీదే 'ఇన్వెస్ట్' చేయకుండా కూతురికోసం ముందే సగంతీసి ఉంచవలసింది. అలా చేసివుంటే రాజు చదువు మెట్రిక్యులేషన్ తో ఆగిపోయి అతడో గుమాస్తా అయివుండేవాడు. శారదకు ఇంకో గుమాస్తా భర్త అయివుండేవాడు. అప్పుడు రంగనాధానికి తన కోడలు "ఏం తెచ్చిందీ?" అన్న ప్రశ్నే ఉదయించేది కాదు.
కొడుకుని పెద్ద హోదాలో వుండగా చూసుకోవాలని అనుకోవడం, కూతుర్ని పెద్దింట్లో పడేయాలని అనుకోవటం అత్యాశ కాదు. తండ్రిగా ఆయన చేసింది (శారద దృష్టిలోంచి చూడకపోతే) తప్పేం కాదు. కాని తప్పు చేసినవాడికే శిక్ష అని ఎక్కడా రూల్ లేదుగా.
ఏది ఏమయినా ఆయన ప్రస్తుతం అశక్తుడు. ఇంక అంత బరువైన బాధ్యతని ఆయన మోయలేడు.
ఒక ముహూర్తాన రంగనాధం- ఈ కధ నుంచీ - లోకం నుంచీ తప్పుకొన్నారు.
* * *
ఇక మిగిలింది శారద.
ఆమెకు అర్ధమయింది ఒక్కటే.
ప్రేమ ఈజ్ ఈక్వల్ టు పెళ్ళి మైనస్ కట్నం!!
ఎదురింటి రూమ్ లో బి.ఎ. అయిదో సంవత్సరం చదివే సుబ్బారావులో రాజు తాలూకు చాయలు వెతుక్కోవటానికి ట్రై చేసింది శారద. శైలజ తన మార్గదర్శి అనుకొంది.
ఆ రోజు అందమైన సాయంత్రం.... పెరటిగోడ దగ్గర శారదతో మొదటిసారి మాట్లాడిన రోజు.... సుబ్బారావు ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశాడు.
ఆపైన సరిగ్గా మూడు రోజుల తర్వాత-
అదే స్థలంలో .....
అర్దరాత్రి పన్నెండు గంటలకి.....
"నిన్ను ప్రేమిస్తున్నా శారదా" అని మత్తుగా అన్నాడు.
ఆ మరుసటిరోజే ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పార్టీ ఇచ్చేడు సుబ్బారావు.
ఆపైన నాలుగు నెలలకి మళ్ళీ అదే స్థలంలో - అదే స్వరంతో....
"పెళ్ళి చేసుకుంటాననలేదుగా" అనేసి తన వళ్ళో తల పెట్టుకొని కొంచెంసేపైనా ఆమెని ఏడవనివ్వకుండా వాడిగా లేచి పోయేడు.
తన విషయంలో పై థియరీ ఎందుకు తప్పిందో అర్ధం కాలేదు శారదకు ఆలోచించే టైమ్ కూడా లేదు. అర్జంట్ గా ఆత్మహత్య చేసుకోవాలి. ఆమె బ్రతికివుంటే - ఇంకో ఆర్నెల్లలో మరో సుబ్బారావుని ఈ భూమ్మీదకు తేవడం తప్పని సరయ్యేది.
(ఆ తరువాత సుబ్బారావుకి ధర ఎంత పలికిందీ మనకనవసరం. రెండ్రోజుల క్రితమే అతడికి డాడీ దగ్గర్నుంచి "ఆరెకరాల మాగాణి ఇచ్చే అమలాపురం సంబంధం చేసుకుంటావా? ఇరవై వేలూ, స్కూటరూ ఇచ్చే తెనాలిది చేసుకుంటావా?" అని ఉత్తరం వచ్చింది.)
* * *
అంతే.
కథ అయిపోయింది.
"రాజు శైలజని ప్రేమించటం తప్పుకాదు" అనుకుంటే అంతవరకు సమర్ధించుకోగలిగితే..... అతడు ఆ తరువాత ఆమెని పెళ్ళి చేసుకోకుండా ఉండి వుంటే తప్పకుండా విలన్ అయివుండేవాడు.
శారద మామూలు అమ్మాయి. నవలలు చదివి- భావాలు పెంచుకున్న మామూలు అమ్మాయి. తనచుట్టూ జరుగుతున్న సంఘటనలలో తనను ఊహామాత్రంగా చిత్రించుకొని దానిని వాస్తవం చేసుకోవాలనే ఆశతో, ఆశల భవంతుల కింద సమాధి అయిపోయిన సాధారణ స్త్రీ!
శైలజ ప్రేమని చూసి హర్షించి చప్పట్లు కొట్టిన లోకం-ప్రేమకు సంబంధించినంతవరకూ) శారద ప్రేమని ఎందుకు హర్షించదో.....?
కూతురి పెళ్ళి ఇంత సులభంగా జరిగినందుకు శైలజ తండ్రి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి వుండవచ్చు. కానీ అదే క్షణంలో శారద తండ్రి సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.
ఎంత సమర్ధించుకొందామన్నా ఇది సుఖనతమని నాకు అనిపించటంలేదు.
ఇంకొక్క మాట.....
ఒక దృశ్యం గురించి ఎక్కువగా చెప్పాలంటే కొద్దిగా వర్ణించి వదిలేయటం మంచిది. అప్పుడు ఎదుటివ్యక్తి తన ఆలోచనలు సాగిన రీతిలో దాన్ని వూహించుకొంటాడు.
నిజానికి ఈ సమస్య తేలదు.
ఒక ఉమ్మడి కుటుంబంలో తండ్రి - కూతుళ్ళ పెళ్ళికోసం కొడుకుల మీద ఇన్వెస్టు చేసిన డబ్బుకోసం ఆధారపడటం తప్పా?
"తప్పు" అని గుండెలమీద చేయివేసుకొని చెప్పగలగాలీ అంటే ఈ లోకంలో యింకా - యింకా- అందరూ రాజులే వుండాలి. మచ్చుకి ఒక సుబ్బారావు కూడా వుండకూడదు.
ఏమైనా నూతనత్వంవైపు పరుగులెత్తుతున్న యీ రథచక్రాల క్రింద యింకా కొంతమంది శారదలు బలికాక తప్పదు.
--* * * *--