అబోధోపహశ్చాన్య జీర్ణమంగే సుభాషితమ్ ||
పండితులు ఈర్ష్యళువులు. ప్రభువులు గర్వంధులు. ఇతరులు అజ్ఞానవంతులు. కావున నా నీతులు నాలోనే తరిగిపోయాయి.
సాయణుని వ్యాఖ్య మధ్యలోనే బుక్కరాయలు అస్తమించాడు. రెండవ హరిహర రాయలు తండ్రివలెనే సాయణాచార్యుల వేదవ్యాఖ్య బృహత్కార్యానికి సకలవిధాల తోడ్పడ్డాడు. రెండవ హరిహరుని కాలంలోనే ఆచార్య సాయణుడు అథర్వ వేద భాష్యం పూర్తి చేశాడు.
"అభూద్ హరిహరో రాజా క్షీరాబ్ధేరివ చంద్రమా;
తన్మూలభూతం ఆలోచ్య వేదమాధర్విణామిదమ్
ఆదిశత్ సాయణాచార్యం తదర్థస్య ప్రకాశనే"
అన్నాడు సాయణుడు అథర్వ వేద వ్యాఖ్యలో.
సాయాణాచార్యులు వేద సంహితలనే కాక మరి కొన్నింటికి వ్యాఖ్యలు రచించాడు. అవి అరణ్యకం 5. శతపథ బ్రాహ్మణం 6. తాండ్య బ్రాహ్మణం 7. సద్వంశ బ్రాహ్మణం 8. సమవిధాన బ్రాహ్మణం 9. ఆర్షేయ బ్రాహ్మణం 10. దేవతాధ్యాయ బ్రాహ్మణం 11. ఉపనిషద్ బ్రాహ్మణం 12. సంహితోపనిషద్ బ్రహ్మణం 13. వంశ బ్రాహ్మణం.
ఆధునిక వ్యాఖ్యాతలు
వేదాన్ని అధ్యయనం చేసి వాళ్ల పద్ధతిలో వ్యాఖ్యానించిన పాశ్చాత్య విద్వాంసులు.
1. మాక్స్ ముల్లర్ 2. కీత్ 3. గ్రిఫిత్ 4. పిశల్ 5. గ్లేడ్నర్, 6. త్సరర్ 7. వేవర్ 8. ఓల్డన్ బర్గ్ 9. బ్లూంఫీల్ మున్నగు వారు. వారంతా సాయణుని వ్యాఖ్య ఆధారంగానే వేదాన్ని అర్థం చేసుకున్నారు. ఆ వ్యాఖ్య తమకు అనుకూలం కానపుడు సాయణుని దూషించారు. అన్నీ తమకు అనుగుణంగా ఉండాలనేది తెల్లదొంగల దురహంకారం!
ఆధునిక భారతీయ వ్యాఖ్యాతల్లో మహర్షి దయానందుడు అగ్రగణ్యుడు. మహర్షి వేదాన్ని వ్యాఖ్యానించి మిన్నకుండలేదు. వేదాన్ని గురించి అంతకు ముందు ఎరుగనంతటి ప్రచారం చేశాడు. దయానందుడు గొప్ప సంఘ సంస్కర్త. వర్ణ వ్యత్యాసం లేకుండా సకల జనులకూ వేదం ఉపదేశించారు. ఆర్య సమాజం స్థాపించారు. ఆసేతు హిమనగం అనేకులను బ్రాహ్మణులను చేశారు.
దయానందుడు, తన జీవితకాలంలో అనుకున్నట్లే ఆర్యసమాజం ఒక కులం, ఒక మతంగా, ఒక మూర్ఖత్వంగా ఒక దురహంకారంగా మారి పోయింది. నేటి ఆర్య సమాజీయులకు వేదం ప్రమాణం కాదు. దయానందుడు ప్రమాణం!
మహర్షి దయానందుని సిద్ధాంతం మీద ఇస్లాం, క్రైస్తవ ప్రభావం ఉందని ణా అభిప్రాయం. అతఃదు ముస్లిములకు తలదన్ని విగ్రహారాధనకు ప్రాధాన్యత లేదు. మరి నిరసన లేల?
ఇస్లాం, క్రైస్తవం వలె భారతీయులకు ఒకే గ్రంథం వేదం. ఒకే ఈశ్వరుడు ఉండాలని ప్రయత్నించారు దయానందులు. భారత ధర్మం అచ్చం గ్రంథం మీద ఆధారపడిలేదు. సదాచరాలూ, సంప్రదాయాలు దీనికి మూలాధారం. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంప్రదాయం. ఆది శంకరుడు సహితం అద్వైతం ద్వారా ఏకేశ్వర ప్రతిపాదన చేసి సరిదిద్దుకున్నారు.
` దయానందుడు వేదాన్ని కర్మమార్గంగా అంగీకరించారు. వేదం జ్ఞానమార్గమనీ, ఆధ్యాత్మిక ఔన్నత్యమనీ వాదిస్తారు.
వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణులు, పురాణాలు, కావ్యాలూ, ఇతిహసాలూ, విభిన్న తాత్వికతలనూ, సిద్ధాంతాలనూ ప్రతిపాదిస్తాయి. అయినా సహజీవనం చేస్తాయి. భారతీయుడు ఇవన్నీ నాకేనని గర్విస్తాడు. సిగ్గుపడడు. ణా సంపదలు ఏకం కాదు. అనేకం!!
ఒక్కటి భారత సిద్ధాంతం కాదు. పెక్కులు మనతత్వం - ప్రకృతి తత్వం.
భిన్నత్వంలో ఏకత్వం మన జీవన విధానం.
వేదాలకు భిన్నములైన జైన, బౌద్ధ, చార్వాకాలతో మనం సహజీవనం చేశాం. ఇస్లాం, క్రైస్తవంతో సహజీవనం చేస్తున్నాం.
అన్యమత ప్రవక్తలు, తామే భగవంతులమని ప్రకటించుకున్నారు. గతాన్ని ధ్వంసం చేశారు. తాము చెప్పిందే గతం అన్నారు. తమ తరువాత మహా ప్రవక్త ఉండరాదని నిరంకుశంగా శాసించారు.
భారత ధర్మం, సిద్ధాంతం, తాత్వికత గతాన్ని ధ్వంసం చేయదు. భవిష్యత్తును శాసించదు. సకల ఆలోచనా విధానాలతో నాటి - నేటి కాదు. గంగా ప్రవాహం వలె నిరంతరం పవిత్రంగా ప్రవహిస్తుంటుంది.
భారతీయులంగా మనం బహు దేవతారాధకులం. ఇది నా మతం. నా జాతి స్వభావం నా నాగరకత. నా సంస్కృతి. వేరికరిని సంతోషపెట్టడానికి నేను దాన్ని మార్చుకోను.
నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు పోచమ్మ, మరిడమ్మ, సంతోషిలను కూడా ఆరాధిస్తాను.
వేదాన్ని వ్యాఖ్యానించిన మరొకరు అరవిందులు, వారు పాశ్చాత్యుల కువ్యాఖ్యానాలకు భారత ప్రమాణాలతో సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. వేదానికి అంతరార్థాలు వెలికి తీసే ప్రయత్నం చేశారు.
శుక్ల యజుర్వేద సంహిత
ఈ వేదపు పూర్తి పేరు శ్రీమద్వాజసనేయి మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత. దీనికి ఈ పేరు రావడాన్ని గురించి మహీధర భాష్యం వివరించింది-
"తత్రాదౌ బ్రహ్మ పరంపరయా ప్రాప్తం వేదం వేదవ్యాసో మన్దమతీన్మనుష్యాన్విచింత్య తత్కృపయా చతుర్థావ్యస్య ఋగ్యజుః సామాధర్వాభ్యాం శ్చతురోవేదాన్ పైల, వైశంపాయన, జైమిని, సుమన్తుభ్యః క్రమాదుపదిదేశ తేచ స్వశిష్యేభ్యో| ఏవం పరంపరా సహస్ర శాఖో వేదో జాతః| తత్ర వ్యాస శిష్యో వైశంపాయనో యాజ్ఞ్యవల్క్యం ప్రత్యువాచ మదధీతం త్యజేతి| సయోగసామర్థ్యామ్మార్తాం విద్యాం విధాయోద్వవామ| వాంతాని యజూంషి గృహ్ణేతీతి గురూక్తా అన్యే వైశంపాయన శిష్యాస్తిత్తరీయో భూత్వా యజూంష్యభక్షయన్ |తాని యాజూంషి బుద్ధిమాలిన్యాత్కృష్ణాని జాతాని| తతో దుఃఖితో యాజ్ఞ్యవల్క్యః సూర్యమారాధ్య అన్యాని శుక్లాని యజూంషి ప్రాప్తవాన్ | తానిచ జాబాలి బౌధేయ, కాణ్వ, మాధ్యందినేన మహర్షిణా లబ్ధొ యజుర్వేద శాఖా విశేషో మాధ్యిందినః|
తొలుత వేదం బ్రహ్మ నుంచి పరంపరగా లభించింది. వ్యాసమహర్షి మనుష్యుల మందమతిత్వాన్ని గురించి ఆలోచించాడు. వేదాన్ని నాలుగుగా విభజించాడు. అవి ఋగ్యజుస్సామాథర్వణ వేదాలు. ఆ వేదాలను వేద వ్యాసుడు క్రమంగా పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించాడు. వారు వారి శిష్యులకు ఉపదేశించారు. ఆ విధంగా పరంపరంగా వేదం సహస్రశాఖలది అయింది. తదుపరి వ్యాస శిష్యుడగు వైశంపాయనుడు యాజ్ఞ్యవల్క్యాదులగు తన శిష్యులకు యజురేద్వం ఉపదేశించాడు. ఒకప్పుడు వైశంపాయనునికి దైవికంగా- ఏదో కారణంగా- కోపం వచ్చింది. అప్పుడు యాజ్ఞ్యవల్క్యుని తన శిష్యత్వం నుంచి బహిష్కరించాడు. యజ్ఞ్యవల్క్యుడుడు యోగబలం కలవాడు. అతడు తను నేర్పిన విద్యను వాంతి చేశాడు - కక్కాడు. గురువు ఆజ్ఞాపించాడు. వైశం పాయనుని ఇతర శిష్యులు తిత్తిరి పక్షులు అయినారు. యజ్ఞ్యవల్క్యుడు వాంతి చేసిన విద్యను భుజించారు. ఆ యజుస్సులో బుద్ధిమలినములు. అందువలన కృష్ణ యుజస్సులు అయినవి. అప్పుడు యజ్ఞ్యవల్క్యుడు బాధ పడ్డాడు. అతడు సూర్యుని ఆరాధించాడు. సూర్యుని నుండి శుక్ల యజుస్సులను అందుకున్నాడు. ఆ యజుస్సులను జాబాలి, బౌధేయ, కాణ్వ, మధ్యందినాది పదిహేను మంది శిష్యులకు బోధించాడు.
వాజసని పుత్రుడు యజ్ఞ్యవల్క్యుడు. కావున వాజసనేయి అయింది. మధ్యందిన మహర్షికి లభించినందున మధ్యందిన అయింది.
ఆవిధంగా ఈ వేదం శ్రీమద్వాజసనేయి మధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత అయింది.
యజుర్వేదం - యజ్ఞయాగాదులు
దేవతలను స్తుతించేది ఋగ్వేదం. యజ్ఞ, యాగాది క్రతువులు- వాటి విధి విధానాన్ని నిర్దేశించేది యజుర్వేదం. ఋగ్వేదంలోని మంత్రాలను 'ఋక్కులు' అంటారు. యజుర్వేదంలోని మంత్రాలను 'యజుస్సులు' అంటారు.
యజ్ఞం ఒక బృహత్కార్యం అవుతుంది. సత్కార్యం అవుతుంది. సమాజ కళ్యాణ కార్యం అవుతుంది.
యజ్ఞం ఒక బృహత్కార్యం. ఒక్కనికి సాధ్యం కానిది. పెక్కురు అవసరం అయింది. యజ్ఞం కోసం కొందరు జనులు ఏకం కావాలి. యజ్ఞం ఐకమత్యం నేర్పుతుంది. నలుగురు కలిసి చేసిన బృహత్కార్యం యజ్ఞం అవుతుంది.
యజ్ఞం ఒక బృహత్కార్యం. అందుకు ఎవరో పదిమంది కలుస్తే సరిపోదు. నిపుణులు, ప్రత్యేక విద్యలో నైపుణ్యం కలవారు - కలవాలి. కలసి పనిచేయాలి. అట్లాచేసింది యజ్ఞం అవుతుంది.
యజ్ఞం అనగానే మనకు అమాంతంగా స్ఫురించేది యజ్ఞ కుండం యజ్ఞవాటికి మున్నగునవి.
యజ్ఞ కుండానికి గుంత త్రవ్వే వారు కావాలి. కుండ నిర్మాణానికి ఇటుకలు కావాలి. ఇటుకలు చేసేవారు, ఇటుకలు తెచ్చే బండి, బండికి కట్టిన పశువులు, బండి తోలే వాడు కావాలి. ఇటుకతో కుండ నిర్మించే వాస్తు శిల్పి కావాలి. ఇప్పటికి కుండం మాత్రమే సిద్ధం అయింది.
యజ్ఞానికి సమిధలు కావాలి. సమిధలు అంటే చెక్కపేళ్లు, అన్ని చెక్కపేళ్లు యజ్ఞానికి తగవు. యజ్ఞానికి తగిన సమిధలు నిర్ణయించే శాస్త్రజ్ఞులు రావాలి. ఎంచేతంటే అన్ని కర్రల పొగ ఆరోగ్యవంతం కాదు. యజ్ఞం అనారోగ్యకారకం కారాదు. యజ్ఞం సామాజిక కార్యం. ఇది సమాజానికి ఉపకరించేది కావాలి. వేదం మోదుగు, రావి మున్నగు కొన్ని సమిధలు మాత్రమే యజ్ఞానికి విధించింది. వాటి ధూమం వ్యక్తికి, సమూహానికీ, గ్రామానికీ ఆరోగ్యకరం, హితకరం అవుతుంది.
సమిధలు తేవడానికి అడవికి వెళ్లేవారు కావాలి. వారు చెట్లను గుర్తించేవారు కావాలి. వలసినంతే కొట్టాలి. కొట్టేటప్పుడు చెట్టును ప్రార్థించాలి. ఆ మంత్రాలు వేదంలో ఉన్నాయి. వృక్ష మహిమను వేదం గుర్తించింది. వృధాగా కొట్టరాదని శాసించింది.
ఆధునికం - సైంటిఫిక్ - అని చెప్పుకుంటున్న నేటి నాగరకత ముందు అడవులను క్షవరం చేసింది. ఇప్పుడు చెట్లు పెంచమని ప్రజలను కోరుతున్నది. ఏనాడో వేదం గుర్తించిన వృక్ష, అరణ్య మహిమను ఇంకా రక్కసి నాగరకత గుర్తించలేదు. వట్టి కొంగ జపం చేస్తున్నది. వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్నది. ప్రజలకు నీతులు బోధిస్తున్నది. అడవులను పచ్చి స్వార్థపరులు కొట్టారు. సంపదను కొల్లగొట్టారు. తిరిగి అడవులు నాటమని ప్రజలకు బోధిస్తున్నారు. ఏనాడో వేదం చెప్పింది సహితం ఈ సైంటిస్టులు అనిపించుకునే వారు గుర్తించలేకున్నారు! వీరు వినాశనానికి పనికి వస్తారు. వ్యాపారానికి పనికి వస్తారు. నిర్మాణానికి పనికిరారు!