Previous Page Next Page 
పెంపుడు కొడుకు  పేజి 16

                                 


                                      పెంపుడు కొడుకు         

                                                                          వసుంధర

                                     
         
    
    నాకు పిల్లలు లేరు. బంధువుల పిల్లలయితే చాలా ఇబ్బందులుంటాయని అనాధ శరణాలయం నుంచి ఓ పిల్లాడిని తెచ్చుకొని పెంచుకో సాగాను. నా భార్య మాలతి వాడిని కన్న బిడ్డ కంటే అబ్బురంగా చూసుకునేది. మా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాడి వయసు అయిదు. ఏ ముహూర్తాన వాడు మా యింట్లో అడుగు పెట్టాడో కానీ - వాడు వచ్చిన మూడు సంవత్సరాలలో మాలతి ఓ మగబిడ్డను కన్నది. ఆ పైన మరో సంవత్సరానికి ఆమె ఆడబిడ్డను కూడా కన్నది.
    మాకు పిల్లలు కలిగాక నాకు పెంపుడు కొడుకు రఘు మీద ఆసక్తి తగ్గింది. వాడినేం చేద్దామని మాలతిని అడిగాను.
    "వాడి పాదం మంచిది. వాడికి అన్యాయం చేయకూడదు. వాడూ మన బిడ్డల్లో ఒకడుగా వుంటాడు" అంది మాలతి.
    రఘు ఇప్పటికీ మమ్మల్ని అమ్మా, నాన్నా అని పిలుస్తూ వుంటాడు. ఇంట్లో మేము వాడిని గౌరవంగానే  చూస్తున్నాము పైగా ఇంటి పనులకు వాడెంతో ఆసరాగా వుంటున్నాడు. పిల్లల సంరక్షణ చూడ్డానికి కూడా వేరే మనిషిని ఉంచుకోనవసరం లేకపోయింది.
    పిల్లలు పుట్టేక కూడా రఘు వంటివాడిని ఆదరించ గలుగుతున్న నా విశాల హృదయాన్ని ఎందరో అభినందించేవారు. ఆ అభినందనలు గురించి రఘు వినేలా మాలతికి చెప్పి ఎంతో ఆనందించేవాణ్ణి.
    రఘుకి పన్నెండేళ్ళు. వాడంటే నాకు ద్వేషం లేదు. కానీ చాలా విషయాల్లో వాడి బుద్దులు మంచివి కాదు. ఇది నాకు చాలా బాధగా వుండేది.
    వాడికి మేము తప్ప ఎవ్వరూ లేరు. మేము పొమ్మంటే ఇల్లు వదిలి బయటకు పోవాలి. అడుక్కు తినాలి. నేను వాడికి లోటేమీ చేయటం లేదు. తిండి పెడుతున్నాను. బట్టలు కుట్టిస్తున్నాను. చదువు చెప్పిస్తున్నాను.
    ఇన్ని చేస్తున్నందుకు వాడికి కృతజ్ఞత ;లేదు. పని చెబితే చదువుకోవాలంటాడు. పిల్లల్ని చూడమంటే విసుక్కుంటాడు. వాళ్ళు అల్లరి చేస్తే కొడతాడు కూడా! అలాగని వాళ్ళని ద్వేషించడు. అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తాడు. వాడి ఆటలు చాలా మోటుగా ఉంటాయని మాలతి తిట్టేది.
    ఒకసారి బాబు వాడి నోట్సు చింపేశాడు.  రఘు బాబుని కొట్టాడు.
    మాలతి వాణ్ణి తిట్టింది.
    "వాడు నా నోట్సు చింపేశాడు" అన్నాడు రఘు.
    'కొడితే తెలుస్తుందా వాడికి?" అన్నది మాలతి.
    "మరి నిన్న పాలగిన్నే లాగినందుకు తెలుస్తుందనే కొట్టావా?' అన్నాడు రఘు.
    ఆ విషయం చెప్పినందుకు ఆమెకు కోపం వచ్చి రఘును మళ్ళీ కొట్టి, "నోట్సు దేముంది > మళ్ళీ కొనిపెడతాగా ?" అంది.
    'అందులో రాసుకున్నవి రాసి పెడతావా ?"
    మాలతి వాణ్ణి మళ్ళీ కొట్టింది. ఈ విశేషాలన్నీ తెలిసేక నేను రఘును మరోసారి కొట్టి - "ఏమైనా సాహిస్తాను గాని ఎదిరించడం సహించను నేను " అన్నాను.
    ఆ తర్వాత వాడు మళ్ళీ మాలతిని ఎదిరించలేదు.
    నేను ప్రతిరోజూ వాడి జీవితం ఎంత హీనమైందో , మాతో మంచిగా వుండడం ఎంత అవసరమో వివరించి చెబుతుండే వాడ్ని. క్రమంగా వాడిలో మార్పు వచ్చినట్లే కనబడింది.
    ఆ తర్వాత రఘు బుద్దిమంతుడయ్యాడని మాలతి నాకు చెప్పింది. నేనూ ఏంతో సంతోషించాను.
    అదే మాట కిషోర్ కూడా అన్నప్పుడు ఇంకా సంతోషించాను.
    కిషోర్ నా స్నేహితుని కొడుకు. వాళ్ళు మా ఇంటికి తరచుగా వస్తూ వుండేవారు. కిషోర్ కి, రఘుకీ క్షణం పడేది కాదు. కిషోర్ తలిదండ్రులకు ఆ కారణంగా రఘు అంటే నచ్చేది కాదు. వాళ్ళు రఘుని తిట్టేవారు. నేనూ, మాలతి కూడా వల్లనే సపోర్ట్ చేసేవాళ్ళం.
    అప్పుడప్పుడు వాళ్ళు రఘు అంతస్థును గుర్తు చేసేవారు. రఘుకు చాలా కోపం వచ్చేది. ఒకసారి వాడు వాళ్ళనూ ఎదిరించాడు.
    "మా అమ్మా నాన్నా నన్నే మన్నా ఫరవాలేదు. కానీ మీరెవరు నన్ననడానికి ?"
    కిషోర్ తలిదండ్రులకు చాలా కోపం వచ్చింది. వారికి వాడిపట్ల ద్వేషం కూడా పెరిగింది. కేవలం రఘు కారణంగానే వాళ్ళు మా ఇంటికి రాకపోకలు తగ్గించారు.
    ఎందుకంటె రఘు నాకు పెంపుడు కొడుకు కావచ్చు. కానీ నా ఇంటి పేరు సంతరించుకుని, నాకు అదృష్టం తీసుకొని వచ్చిన పెద్దకొడుకు వాడు. రఘు అన్నట్లు మేమూ మేమూ ఎన్నయినా అనుకుంటాం. కాని బయటివాళ్ళు వాడినెందుకు అనాలి?
    అయితే రఘు కిషోర్ తో స్నేహంగా ఉంటే బాగుండునని మనసులో ఉండేది. వాడితో మంచిగా వుండమని రఘుకి చెప్పేవాడ్ని.
    ఇప్పుడు రఘు కిషోర్ తో కూడా స్నేహంగా ఉంటున్నాడు. కిషోర్ వాడిని రెచ్చగొట్టినా సహిస్తున్నాడు. క్రమంగా కిషోర్ కి వాడికీ మంచి స్నేహం అయింది.
    ఇప్పుడు రఘు అన్ని విధాలా మంచి బాలుడు. ఏ తల్లిదండ్రులయినా గర్వించదగ్గ విధంగా ఉన్నాడు. అందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది.
    ఒకరోజు వాడూ, నేనూ కలిసి బజారు కెళ్ళాం.
    మర్నాడేదో పండగ, చాలా కొనవలసి వుంది. ఇంకా కొనడం మొదలు పెట్టనే లేదు. ఎవరో - 'యాక్సిడెంట్' అని అరిచారు.
    నేను కంగారు పడ్డాను. పక్క సందులో యాక్సిడెంట్ జరిగిందట.
    యాక్సిడెంట్ అనగానే పరుగున వెళ్ళి చూడటం మానవ సహజము. అలాగే నేనూ వెళ్లాను తప్పితే, ఆ యాక్సిడెంట్ కు గురైనది నా స్నేహితుడి కుటుంబం అని నాకు తెలియదు.
    రిక్షాలో ఉన్నారు కిషోర్, వాడి తల్లిదండ్రులు. రిక్షాని ట్రక్కు గుద్దేసింది. రిక్షావాడు అప్పటికప్పుడే చచ్చిపోయాడు. రిక్షాలోని ముగ్గురికి బలంగా దెబ్బలు తగిలాయి. వాళ్ళను హాస్పిటల్ కి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటిలో నేనూ పాల్గొన్నాను.
    ఈ సన్నివేశం నన్ను బాగా కదిలించింది.
    "ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మకు చెప్పిరారా రఘు !" అంటూ రఘు వంక చూసి ఆశ్చర్యపడ్డాను.
    వాడి కళ్ళలో మెరుపు సంతృప్తి !
    అంటే ఈ ప్రమాదానికి వాడు చాలా సంతోషిస్తున్నాడా?
    నేను హాస్పిటల్లో కాస్సేపుండి ఇంటికి వెళ్ళాను.
    "ఎలా వుందండి వాళ్ళకు ?' అన్నది మాలతి.
    రఘు చెప్పలేదా?"
    'చెప్పాడు , కిషోర్ బ్రతక్క పోవచ్చునన్నాడు. వెధవ ఆ వార్త చాలా ఉత్సాహంగా చెప్పాడు?" అన్నది మాలతి.
    'పిల్లల అసూయ చాలా ప్రమాదకరమైనది. వీడు కిషోర్ చావాలని కోరుకుంటున్నాడన్నమాట. కిషోర్ చస్తే తలిదండ్రులు ఏడుస్తారు గదా వీడికి వాళ్ళంటే మంట. అదే కారణమయుంటుంది." అని "వీడు మన పిల్లల మీద అసూయ పడకుండా చూసుకోవాలి మనం" అన్నాను.
    స్నేహితుడి కుటుంబానికి జరిగిన ప్రమాదం కూడా మరచిపోయి నాకు జరగనున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను. స్వార్ధం చాలా బలమైనది.
    సాయంత్రం సకుటుంబంగా హాస్పిటల్ కు వెళ్ళాము. అప్పటికే జరగవలసినది జరిగిపోయింది.
    కిషోర్ బ్రతికాడు. కానీ వాడి తల్లిదండ్రులిద్దరూ పోయారు.
    ఈ వార్త వింటూనే రఘు కెవ్వు మన్నాడు. వాడు భోరున ఏడుపు ప్రారంభించాడు. వాడిని ఆపడం చాలా కష్టమైంది.
    కిషోర్ చనిపోతాడని తెలిసి ఆనందించిన రఘు తనతో శత్రుత్వం నెరసిన కిషోర్ తలిదండ్రులు చనిపోయారని అదే పనిగా ఏడుస్తున్నాడు. అదీ మనసు చలించి పోగా హృదయం కదిలి పోగా తట్టుకోలేక పసివాడు చేస్తున్న ఆక్రందన అది.!
    అప్పుడు నాకో అనుమానం వచ్చింది. రఘు మనసులో వారి చావును చాలాసార్లు కోరుకుని ఉంటాడు. వారు నిజంగా చనిపోగానే తన మూలంగానే వాళ్ళు చనిపోయారా అన్న అనుమానం కలిగి పశ్చాత్తాపంతో బాధపడి పోతున్నాడు . కారణం ?
    అయితే వాడి మనసులో ఇంకా ఎవరి చావును కోరుకుంటున్నాడు ?
    ఆ ప్రయత్నంగా నాలో భయం ప్రారంభమయింది .
    అప్పుడక్కడ చేరిన ఓ ముసలాయన రఘును సముదాయించి 'బ్రతకడానికి అదృష్ట ముండాలి. కిషోర్ అదృష్టవంతుడు బ్రతికాడు. ' అతడి తలిదండ్రులకు ఇంకా బ్రతికే అదృష్టం లేదు" అన్నాడు.
    'అదృష్టం కిషోర్ ది కాదు. పోయిన వాళ్ళది " అన్నాడు రఘు ఇంకా ఏడుస్తూనే.
    'ఎందుకని ?" అన్నాడు ముసలాయన.
    "పిల్లలు లేకుండా పెద్ద వాళ్ళు బ్రతకగలరు. కానీ అమ్మా నాన్న లేకుండా పిల్లలు బ్రతకలేరు. అమ్మా, నాన్న లేని జీవితం పగవాడి కూడా కోరుకోను నేను. పాపం కిషోర్ కిప్పుడు ఎలా? వాడేవరికో పెంపుడు కోడుకై జీవించాలి. ఇంతకాలం వాడేలా బ్రతికాడో నాకు తెలుసు.....కానీ ఇప్పుడు..... వాడికలా సాగదు..... అది నేనూహించుకోలేక పోతున్నాను...." అంటూ మళ్ళీ భోరుమన్నాడు రఘు.
    నేను దెబ్బతిన్నాను.
    స్వర్దాన్నీ, ద్వేషాన్నీ అసూయను అధిగమించి రఘు కిషోర్ పై జాలిపడుతూ అన్న ఆ మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు?
    అవి వాడి అనుభవం లోంచి వచ్చాయా?
    నేను నా ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవలసి ఉన్నది. అయితే ఆ క్షణంలో రఘు నా పెంపుడు కొడుకని ఆ ముసలాయనకు తెలియకపోతే బాగుండునని అనుకున్నాను.

                                               ***

 Previous Page Next Page