బంగారు రంగు చర్మంపై నల్లటి పొడల్తో, మనిషి మాంసాన్ని తిని పెంచుకున్న బలిష్టమైన శరీర నిర్మాణంతో ఒక చిన్నపర్వతం కదిలి వచ్చినట్టు తెగువగా కాలిబాటను చేరుకుని గర్వాతిశయంతో కరాళ దంష్ట్రల్ని చూపుతూ నిలబడి ఉన్న మేనీటర్!
క్షణాలు గడుస్తున్న కాలం చెల్లిపోతోందని గ్రహించింది నారమ్మ. అంత భయంతో కూడా నారమ్మకు పసికందు గుర్తుకొచ్చాడు. ఒక గాలి కెరటం ఆమెకు తాకి, అమ్మా ఆకలే అని కొడుకు జాలిగా పిలిచినట్టు గుండెల్ని కోసి వెళ్ళిపోయింది.
ఆమె కళ్ళు నీటికుండలయ్యాయి.
పొట్టని నేలకానించి తదేకంగా తనవేపే ఆకలితో చూస్తున్న పులితో పల్లెలోని పసికందుకు పాలుపెట్టి తిరిగివచ్చి నీకాహారం అవుతానని దీనంగా చేతులు జోడించి వేడుకోవాలనుకుంది.
కాని, అప్పటికే నేలపై నాలుగడుగుల దూరం ప్రాకిన పులితో పల్లెలోని పసికందుకు పాలుపెట్టి తిరిగివచ్చి నీకాహారం అవుతానని దీనంగా చేతులు జోడించి వేడుకోవాలనుకుంది.
కాని, అప్పటికే నేలపై నాలుగడుగుల దూరం ప్రాకిన పులి తోకను 'యు' ఆకారంలో పైకిలేపింది. ప్రత్యర్ధిపైనగాని, వేటాడాల్సిన ప్రాణిపైన గాని లంఘించే ముందు పులి తన సంసిద్దతను ఇలాగే వ్యక్తం చేస్తుంది.
జరగబోయేది తెలిసిపోయిన నారమ్మ ఒంటిలోని రక్తమంతా పాలగా మారి కుడి వక్షం బరువెక్కింది. తన ప్రాణాలకంటే పసికందుపై మమకారం పెల్లుబికింది. ఒక్కసారి, చిట్టచివరిసారి పసికందును ప్రేమగా దగ్గరకు తీసుకోవాలని ఒక జీవిత కాలానికి సరిపడ్డంత ఆర్తితో వాడి ఆకలి తీర్చాలని మనసు ఉవ్విళ్ళూరింది.
మరుక్షణం....ఆ నిశ్శబ్ద ప్రకృతి ఓ నిర్భాగ్య స్త్రీ ఆర్తనాదంతో ప్రతిధ్వనించింది. ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డ సూర్యుడు క్షణంపాటు నిశ్చేష్టుడై తర్వాత నిస్సహాయంగా పడమటి కొండలు వేపు కందిన మోహంతో ప్రయాణం కొనసాగించాడు.
పంజా దెబ్బకి నేలకొరిగిన నారమ్మ చివరిక్షణంలో బాధపడింది. ప్రాణాలు పోతున్నందుక్కాదు __ పసికందుకి పాలు కుడపాల్సిన వక్షం పులిరక్కసిపాలై చిరిగిపోయినందుకు, చివికినందుకు!
2
"కూడెలాగూలేదు. గూడుందని సరిపెట్టుకుంటున్నాం. కడుపు మండితేపోయె....కన్నోల్లనైనా మిగుల్చుకుంటే సాలని ఇల్లు కదలకుండా కుల్లి కుల్లి ఎడుత్తున్నాం. మా బతుకులు బండలై పోతున్నాయి. మా గుండెలు మంటతో కమలిపోతున్నాయి. ఎవులికెవలం మిగలకుండా అన్నేయమైపోతుంటే ఏ దేవుడికి సెప్పుకుని ఏడవాలో తెలియక ...." వృద్ధాప్యం మూలంగా గొంతు తడారిపోతుంటే గుండెలోని వేదనకు భాష కూర్చలేక మధన పడుతున్నాడు నారమ్మ తండ్రి....
ఫారెస్టు రెస్టుహౌస్ ముందు నిలబడ్డ కుంతెర్ల గ్రామ ప్రజల్ని చూస్తూ ఉండిపోయిన నట్వర్ సింగ్ రైఫిల్ ను అందుకున్నాడు.
మేనీటర్ ను హతమార్చడానికి ప్రభుత్వంచే ప్రత్యేకంగా డిప్యూట్ చేయబడిన ఫారెస్టు ఆఫీసర్ నట్వర్ సింగ్ కీ రోదనలు కాని, విన్నపాలు కాని కొత్తకాదు. అతడు ఆ ప్రాంతానికి వచ్చిన నెలరోజుల్లో యెన్నో చావుల్ని చూశాడు. ఎందరి వేదనల్నో విన్నాడు. కాని, ప్రతిసారి అతని అనుభవానికి, ప్రయత్నానికి ప్రశ్నగా మారిన పులిని కడతేర్చలేక పోయాడు.
సాధారణమైన పులిలా మేనీటరుకు ఓ క్రమపద్ధతి అంటూ ఉండదు. ఒక రాత్రి సుమారు అరవై మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేస్తూ వేటగాడి అంచనాల్ని తారుమారు చేస్తుంది. అనుకోని చోటు హఠాత్తుగా దర్శనమిచ్చి మనుషుల్ని బలి తీసుకుంటుంది.
ఏటవాలుగా ఉన్న గుట్టపై పశువుల్ని కాస్తున్న ఓ యువకుడు హఠాత్తుగా ప్రత్యక్షమైన పులిని, ఆ పులి నారమ్మను నోట కరుచుకుని పొదల్లోకి లాక్కుపోవడాన్ని గమనించాడు. పరుగున వెళ్ళి గ్రామంలోని పెద్దలకి జరిగింది చెప్పాడు.
కనీసం నారమ్మ శవాన్నయినా చూసే సాహసం లేకపోయింది ఎవరికీ .ఆవేశంగా వెళ్ళబోయిన నారమ్మ మొగుడు రంగయ్యను అడ్డుకున్నారు. రెస్టుహౌస్ కి వచ్చి నట్వర్ సింగ్ కు జరిగింది చెప్పారు.
మాటలతో ఓదార్చలేని నిస్సహాయ స్థితిలోవున్న ఆ ముసలివాణ్ని ఓమారు చూసిన నట్వర్ సింగ్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి బయలు దేరాడు. వెళ్తూ నారమ్మ మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన యువకుణ్ణి మాత్రం వెంటరమ్మన్నాడు. జన్మతః పంజాబీ అయినా, తాతల కాలం నుంచి తెలుగు దేశంలోని సెటిలవడంతో స్వచ్చమైన తెలుగులో మాటాడగలడతను.
గుబురుగా పెరిగిన తుప్పలమధ్యగా సింగ్ తోపాటు కొంతదూరం నడిచిన యువకుడు ఎత్తయిన గట్టుపై నిలబడి వందగజాల దూరంలో దిగువగా వెదురుపొదల్ని ఆనుకుని వున్న కాలిబాటను చూసి ఏదో చెప్పబోతుంటే మాటాడవద్దని సౌంజ్ఞ చేశాడు నట్వర్ సింగ్.
వాసన గుర్తించలేకపోయినా, చిరుసవ్వడినైనా గ్రహించగలదు పులి. తను వేటాడే ప్రాణిని పొంచి గమనించడం తప్ప తన వునికిని తనను వేటాడే వ్యక్తి గుర్తించకుండా చాలా జాగ్రత్తపడుతుంది. తను చంపిన కళేబరాన్ని కూడా మరే ఇతర జంతువు కళ్ళ బడకుండా తుప్పల్ని కొమ్మల్ని పైన ఉంచి రహస్యంగా దాచుకోవడం, తీరుబాటుగా ఆకలి తీర్చుకోవడం దానికి అలవాటు.
సాలోచనగా అక్కడి పరిసరాలను పరిశీలిస్తూ కొంతసేపు నిలబడ్డ సింగ్ ఆ యువకుణ్ని వెళ్ళిపొమ్మని సంకేతాలద్వారా తెలియజేసి అతడు దట్టంగా ఉన్న అరణ్యప్రాంతాన్ని దాటేవరకూ చూస్తూ ఉండిపోయాడు. మనుష్య రక్తానికి అలవాటుపడ్డ పులి అలవాట్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కోమారు ఆకలితో సంబంధం లేకుండా పైనబడి వధించడం, ఏ కాస్తో శరీరంలోని భాగాన్ని తిని వదిలేయడం, ఒక్కోమారు శవాన్ని అలాగే విడిచిపెట్టడం కూడా దానికి అలవాటు. అందుకే ఆ యువకుడు క్షేమంగా అడవి దాటేవరకు తనకార్యక్రమంలో నిమగ్నంకాకుండా ఉండిపోయాడు సింగ్.
మరికొన్ని నిమిషాలలో సింగ్ ఏటవాలుగా వున్న ప్రదేశాన్ని దిగి అడుగులో అడుగు వేస్తూ, చాలా నెమ్మదిగా ప్రమాదం జరిగిన స్థలాన్ని చేరుకున్నాడు. నేలపై జారిపడిన బుంగ, తుప్పల్లోని కొడవల్ని చూశాడు. బాటకు కుడిపక్కగా ఉన్న రెల్లు పొదలు చెల్లాచెదురుగా నేలపై వంగి ఉండటంతో పులి ఆ యువతిని అటు పక్కగా ఈడ్చుకు వెళ్ళినట్టు అర్ధమైంది. నెమ్మదిగా ఏమాత్రం సవ్వడి చేయకుండా పొదల్లో అడుగుంచి కాస్త ముందుకు నడిచాడు. నేలపై ఇసుకలో పులి అడుగుజాడలు కనిపించాల్సిన విధుల్లో ఇది ఒకటి.
పులి అడుగుజాడల్ని పరిశీలిస్తే తప్ప అది ఏ పక్క వెళ్ళిందీ వేటగాడు గుర్తించలేడు.
లెగ్ మార్క్స్ బట్టి అంతకు పూర్వం తనకు పరిచయమైన అడుగుజాడల్ని బేరీజు వేసుకుని అది మేనీటరుగా నిర్ధారణ చేసుకున్నాడతను.
మరికాస్త ముందుకు నడిచాడు. చాలా ఏకాగ్రతగా దిక్కుల్ని పరికిస్తూ ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ,ఊహించని రీతిలో ఏ పొదల మాటునుంచో పైనబడి ప్రాణాలు తీస్తుంది పులి. పులి ఎక్కడ వున్నదీ తెలియనంతసేపు వేటగాడి కిది అగ్నిపరీక్షే! నిర్మానుష్యంగా వున్న అడవిలో అందులోనూ చాలా ప్రమాదకరమైన మేనీటరును ఎదుర్కోవడానికి గుండె నిబ్బరం మాత్రమే కాదు. ఏ చిరుసవ్వడినైనా గుర్తించి వెనువెంటనే తీసుకోవాల్సిన నిర్ణయంపైనే వేటగాడి మేధస్సు ఆధారపడి ఉంటుంది.
రెల్లుపొదలు దాటేక ఇరవై అడుగుల దూరంవరకూ పులి అడుగు జాడలు పడనిరాతి ప్రదేశం కావడంతో ఆగిపోయేడు నట్వర్ సింగ్. అక్కడ నుంచి పులి ఏ పక్క వెళ్ళిందీ వెంటనే నిర్ధారణ చేసుకోలేక పోయాడు.
అతని గుండె చప్పుడు అతనికే చాలా స్పష్టంగా వినిపిస్తోంది చుట్టూ కలియచూశాడు .ఎడమపక్క లోయ ఉండటంతో పులి కళేబరాన్ని అటు తీసుకుపోయే అవకాశంలేదు, కుడిపక్క వందగజాల దూరంలో ఎత్తయిన గుట్ట ఉన్నా, తన ఆహారాన్ని రహస్యంగా దాచుకునే అలవాటుగల పులి గుట్టపైకి వెళ్ళి ఉండదు.