Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 25

 

    "నేను మా వూరు వెళ్ళాలి " ఒకరకంగా మోహన్ మీద ఒరిగిపోతూ దీనంగా అన్నాడు మాధవ.
    మాధవను పొదివి పట్టుకున్నాడు మోహన్. ఆ పరిస్థితుల్లో మాధవను ఒంటరిగా వదలటం మంచిది కాదనిపించింది మోహన్ కి.
    "నేను కూడా వస్తాను . మీరు ఒంటరిగా వెళ్ళలేరు. అలా అధైర్యపడకండి. ఫరవాలేదు. మీ అత్తయ్యకు నయమవుతుంది"
    "నయమవుతుందా?" ఆశగా అడిగాడు మాధవ.
    "తప్పకుండా" దృడంగా చెప్పాడు మోహన్.
    ఆ మాట నమ్మడానికే ప్రయత్నించాడు మాధవ. మానవుడేప్పుడూ తన మనసులో కోరుకునేదే ఎదుటివాళ్ళు చెప్పాలని ఆశిస్తాడు. ఆ చెప్పినదాని నిజానిజాలను గూర్చి తన అంతరాంతరాలలో ఎన్ని సందేహాలున్నా , దాన్ని నమ్మితేనే కాని స్థిమితపడలేదు.
    మోహన్ తో కలిసి మాధవ గుమ్మంలో అడుగు పెట్టేసరికి , సర్వమూ ముగిసిపోయింది. తలను కూడా కప్పేసిన ముసుగుతో , తన దగ్గర దీపంతో పడుకున్న కాత్యాయనిని చూడగానే "అత్తయ్యా! అని శవం మీద వాలిపోయాడు మాధవ.
    అతి బలవంతాన మాధవను లేవనెత్తాడు మోహన్. మాధవ కళ్ళూ రెండు ఎర్రగా భగ్గుమంటున్నాయి. జానకి వంక తిరిగి "ఇంత అకస్మాత్తుగా ఎలా ముంచుకొచ్చింది?" అన్నాడు.
    "అకస్మాత్తుగా రాలేదు"
    ఉలికిపడ్డాడు మాధవ.
    "అకస్మాత్తుగా రాలేదా? ఎన్నాళ్ళ నుండి జబ్బుగా ఉందీ?"
    "మీరు వెళ్ళిన నాలుగైదురోజుల తరువాత గుండెనొప్పి ఉదృతంగా వచ్చింది. అప్పటి నుండీ సుస్తీగానే ఉన్నారు."
    "మరి నాకు కనీసం ఉత్తరమైనా ఎందుకు రాయలేదు?"
    "పిన్ని రాయోద్దన్నారు"
    "అత్తయ్య నాకు ఇబ్బంది కలిగించటం ఇష్టం లేక రాయవద్దని ఉంటుంది. నీ తెలివి ఏమయింది. ఓహో! నాకుత్తరం రాస్తే తమకు వ్రతభంగం కాబోలు!"
    ఏమి మానవప్రకృతి ! అంతటి దారుణ దుఃఖంలోనూ జానకి తనకు ఉత్తరం రాయలేదనే విషయం అతణ్ణి బాధిస్తూనే ఉంది. సాధారణ సమయాల్లో నిరాశగా మాత్రమే మనసును కుంగదీసే ఆ విషయం ఈ దుర్భర దుఃఖ సమయంలో కసిగా మారి జానకి మీద విరుచుకుపడింది. అసలే దుఃఖంతో కుంగిపోతున్న జానకి మనసు ఒక్క క్షణం ఆవేదనతో విలవిలలాడింది. అయినా శాంతంగానే చెప్పింది.
    "నేను రాయాలనే అనుకున్నాను. పిన్ని ఎంత మాత్రం వీల్లేదన్నారు"
    'అంతగా అనుకున్నదానివి అత్తయ్యకు తెలియకుండా రాయకపోయావా?"
    "ఎలా? మీకు ఉత్తరం రాయవద్దని తన మీద ఒట్టు పెట్టుకున్నారు. అంత ఖండితంగా చెపుతుంటే ఎలా ఎదిరించగలను? ఈ టెలిగ్రాం కూడా పిన్నికి తెలియకుండానే ఇచ్చాను"
    మాధవ ముఖం పూర్తిగా కళావిహినమయిపోయింది.
    "ప్రాణం మీదికి వచ్చాక కూడా నాకు తెలియ పరచడానికి ఇష్టపడలేదా అత్తయ్య?"
    జానకి తలవంచుకుంది.
    "ఎందుకు?" జానకి ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    జానకి ఒక్కసారి తలెత్తి మాధవ ముఖంలోకి చూసి, అంతలో రెప్పలు వాల్చుకుంది.
    మాధవకర్ధమయింది.
    పశ్చాత్తాపంతో, క్షోభతో , తీరని ఆవేదనతో అతనికి ఒళ్ళు తెలియలేదు.
    పిచ్చివాడిలా జానకి రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఊపుతూ "నువ్వూ.....నువ్వూ కారణం. ఈ అనర్ధానికంతకూ .....పో, శనీ.....ఇక్కడనించి పో...." అరిచాడు.
    మోహన్ బలవంతాన మాధవను జానకి నుండి విడదీసి అతని గదిలోకి తీసుకుపోయాడు.

    
                                                     *    *    *

    కాత్యాయని అంత్యక్రియలన్నీ మోహన్ దగ్గరుండి చేయించాడు. మాధవ యంత్రంలా , మోహన్ ఏం చెయ్యమంటే అది చేసేవాడు. పనులన్నీ జానకి సహకారంతో మోహన్ ఒకడే చూసుకోవలసి వచ్చింది. జానకి నిరాడంబర వేషభాషల వల్లా, ఎప్పుడూ మాధవకి దూరంగా ఉండటానికి ప్రయత్నించటం వల్లా, జానకీ మాధవుల మధ్య భార్య భర్తల సంబంధాన్ని ఊహించుకోలేకపోయాడు మోహన్.
    జానకి కాత్యాయనిని 'పిన్ని' అని సంభోదించడం వల్లా, మాధవ ద్వారా కాత్యాయని ఉదారగుణం విని ఉండటం వల్లా, జానకి కాత్యాయని ఆశ్రయంలో ఉంటోన్న ఎవరో దూరపు బంధువు అనుకున్నాడు.
    మాధవ ఏదీ ఆలోచించలేకపోతున్నాడు. అతని మనసునేదో భయంకర శూన్యం ఆవరించుకుంది. అనాధ దారిద్రబాలుడైన తనను, రక్తబంధువులను కూడా ఎదిర్చి , తన ప్ర్రేమ రంగరించిపోసి ఇంత వాణ్ణి చేసింది. ఏనాడూ పరిహసానికైనా కసురుకోలేదు. తను కావాలాని కోరినదేది కాదనలేదు. తన ఇష్టాన్ని కాదని ఏనాడూ ఏదీ అజ్ఞాపించలేదు. ఆ అమృతమూర్తి తనకిప్పుడు శాశ్వతంగా దూరమయింది. తన బ్రతుకు కాధారమయిన ఆ దేవతను చివరి క్షణాలలో క్షోభకు గురిచేసిన రాక్షసుడు తను. మమతే తప్ప ద్వేషం ఎరుగని  ఆ రాగమయి అంత జబ్బులోనూ , తనకు ఉత్తరం రాయవద్దని శాసించిందంటే తను ఆవిడ మనసు నెంత క్షోభ పెట్టి ఉండాలి! ఆ లోకంలో ఉన్న కాత్యాయనికి ఎలా సంజాయిషీ ఇచ్చుకోగలడు? మరిచిపోతున్న తన మనసునేమని సమాధాన పెట్టుకోగలడు? చివరి క్షణాలలో అత్తయ్య దగ్గర ఉండటానికైనా నోచుకోని తన దౌర్భాగ్యాన్ని  ఏం చూసుకుని మరిచిపోగలడు?
    ఒక నెలరోజులు 'యర్న్ డ్ లీవ్' పెట్టాడు మాధవ. వారంరోజులు మాధవను అంటిపెట్టుకుని తిరిగాడు మోహన్. ఈ వారం రోజులలోనూ , మాధవకే సమయానికేది కావాలో అది మోహన్ కందించేది జానకి. మోహన్ ద్వారా మాధవ కందేది.
    జానకి వడ్డిస్తోంటే మాధవ మోహన్ లు భోజనం చేస్తున్నారు. ఎక్కడికక్కడే పరధ్యానంగా ఆగిపోతున్న మాధవను కసిరి తినిపిస్తున్నాడు మోహన్. "ఇంక నేను సెలవు పెట్టటానికి వీల్లేదు. రేపు వెళ్ళిపోతున్నాను" మాధవతో అన్నాడు మోహన్.
    "రేపేనా?" చటుక్కున కాతరాస్వరంతో అంది జానకి. మాధవ మోహన్ ఇద్దరూ కూడా ఒక మాదిరిగా జానకి ముఖంలోని చూశారు.
    జానకి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది.
    మోహన్ అహర్నిశలూ అంటిపెట్టుకుని ఉంటుంటే మాధవ తన క్షోభను కొంత మరిచిపోగలుగుతున్నాడు. మాధవకు కావలసినవన్నీ జానకి కనిపెట్టి చూస్తున్నా, అందజేస్తున్నదీ మాత్రం మోహన్. ఇతను వెళ్ళిపోతే మాధవ క్షోభనేలా తట్టుకోగలడో ఊహించలేకపోయింది జానకి.
    మాధవ మనసులోని గాయాన్ని మాన్పగలిగే శక్తి తనకుందని అనుకోలేక పోయింది. అందుకే మోహన్ వెళ్తాననగానే అంతగా కదిలిపోయింది.
    మాధవ ఎంత ప్రాధేయపడినా అక్కడ ఇంకా ఉండటానికి వీలు లేకపోయింది మోహన్ కి.
    "నేను వెళ్తున్నాను. మాధవ కాస్త మనుషుల్లో పడేవరకూ కనిపెట్టి చుడండి" జానకితో అన్నాడు మోహన్.
    ఆమె తలవంచుకుంది.
    జానకి ముఖంలోకి చూసి నవ్వాడు మోహన్.
    "మీరిలా మొహమాటపడితే ఎలా? తప్పనిసరి పరిస్థితుల్లో కాస్త సంకోచం వదులుకోవల్సిందే!"
    "మీరు మళ్ళీ ఎప్పుడోస్తారు?"
    "నేను రావటం దేనికి?" సెలవు పూర్తీ కాగానే మాధవే అక్కడికి వస్తాడుగా!"

 Previous Page Next Page