"ఓహ్! చిరంజీవ!" చెయ్యెత్తి ఆశీర్వదించాడు.
"స్వామీ! రుద్రుడు మీకేమని సెలవిచ్చాడూ?"
"ప్రమాదం! ప్రమాదం! స్పష్టంగా కనిపిస్తోంది ప్రమాదం!"
"హమ్మ బాబోయ్! ఏం ప్రమాదం స్వామీ?"
"నీ చదువు పాడయిపోతుంది. నువ్వు అమ్మలక్కల్లో ఒకదానివి అయిపోతావు..."
పొంగివచ్చే నవ్వు ఆపుకుంది ఇళ....
"అందుకు పరిహారంగా ఏయే హోమాలు చెయ్యాలి? ఎలాంటి శాంతులు జరిపించాలి?"
"నలుగురి ముందూ నాకు ఏ మహత్తులూ లేవు. నేను మామూలు మనిషిని అని ఎలుగెత్తి చాటుకోవాలి! తరువాత మామూలుగా పుస్తకాలు తీసుకుని బడికి వెళ్ళాలి!"
ఇళ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ముఖం గంభీరంగా అయింది. మాట్లాడలేదు.
"ఇళా! నీతో చాలా విషయాలు చెప్పాలని వచ్చాను. ఇవాళ జరిగింది..." చెయ్యెత్తి అతడి నోరు మూసింది ఇళ.
"వద్దు చిచ్చూ! ఇవాళ జరిగిన దాన్ని గురించి నువ్వేమీ మాట్లాడకు! దేవి కృప నీకు చెప్పినా అర్థంకాదు. అనుభవించిన వాళ్ళకే అది అర్ధమవుతుంది. నామాలయ్య భార్య నాకు పట్టు పరికిణీ ఇచ్చింది. ఇంతవరకు నాకు పట్టు పరికిణీ ఒక్కటి కూడా లేదు తెలుసా? నామాలయ్య నాన్నగారికి భారీ సంభావన ఇచ్చాడు. అంతేకాదు, స్వయంపాకం కూడా పదిమందికి సరిపోయేలా ఇచ్చాడు. నిన్న ఇంట్లో అందరం కడుపునిండా అన్నం తిన్నాం. అమ్మ రేపు గారెలు చేస్తానంది. గారెలంటే చిన్నికి చాలా ఇష్టం. ఇదంతా దుర్గాదేవి కృపకాక మరేమిటి? నాన్న ఎంత కష్టపడ్డా అన్ని బియ్యం సంపాదించేవాడా?"
చైతన్య మాట్లాడలేదు. అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. దుర్గాదేవి కృప అర్థం చేసుకోవటం వల్ల కలిగిన పారవశ్యం కాదది. మొదటిసారిగా ఇళ నోట ఆ కుటుంబం అనుభవిస్తోన్న దుర్భర దారిద్ర్యం వినటం వల్ల కలిగిన ఆవేదన తనకి తెలియకుండా ఇళ చాలా సంగతులు చెప్పేసింది. అంతకుముందు ఇళతో ఏదో చెప్పాలని తన నోట్ బుక్ తెరిచాడు చైతన్య. ఇళ మాటలు విన్నాక నోట్ బుక్ మూసేశాడు.
ఇళని వెతుక్కుంటూ అచ్యుతమ్మ అక్కడికి వచ్చింది. చైతన్యని అసహనంగా చూసి "నువ్విక్కడున్నావా! పద! మనింట్లో అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు!" అంది.
"దేనికి?" అడిగింది ఇళ.
"చేతబడి అత్తగారు వచ్చింది. ఆవిడకి ఎవరో పూజలో జరిగింది చెప్పారు. నువ్విచ్చిన తీర్థం తీసుకోవాలని వచ్చింది. త్వరగా రా! దొడ్డి దారిన రా!"
"నువ్వెళ్ళు! నేను తర్వాత వస్తాను"
"వెధవ్వేషాలు వెయ్యకు. ఇంత పెద్దదానివయ్యావు. ఇంకా మగపిల్లలతో ఆటలేమిటి నీకు? ఇంటికి నడు. అసలు ఇంత పొద్దుపోయాక బయట తిరగడమేమిటి?
"వెన్నెల రాత్రుళ్ళలో ఆరుబయట వెన్నెల్లో ఆడుకోవటం ఆ ఊళ్ళో పిల్లలందరికీ అలవాటే! వయసు తెచ్చిన పెళ్ళికాని ఆడపిల్లలు కూడా ఒప్పులకుప్ప, చిన్నీ-చిన్నీ, వెన్నెలకుప్ప లాంటి ఆటలు ఆడుకుంటారు. అలాంటిది తల్లి తనని పొద్దుపోయాక బయట తిరగొద్దని అనటం వింతగా అనిపించింది ఇళకి. ఈ కొత్త నిర్భంధం నచ్చలేదు కూడా.
"నేను రాను పో!" అంది పెంకిగా. తగ్గింది తల్లి.
మా అమ్మకదూ! చేతబడి అత్తగారు నీకోసం ఏదో దక్షిణ కూడా తెచ్చినట్లుంది. అంతా దేవి కృప. ఈవిడకి కూడా నాయమయితే మన అదృష్టం పండినట్లే! రా అమ్మా!"
తల్లి అలా బతిమాలితే రానని అనలేకపోయింది ఇళ.
"చిచ్చూ! నువ్వు రేపురా!" అని తెల్లి వెనకాల వెళ్ళింది. చిచ్చు ఇంటికి వెళ్ళలేదు. తిన్నగా యోగానాథశాస్త్రి ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడ చేతబడి అత్తగారు కొయ్యకుర్చీలో కూచుని ఉంది. ఆవిడ కాక మరో పదిమంది అమ్మలక్కలు కూడా ఉన్నారు. చేతబడి అత్తగారంటే చేతబడులు చేసే, అత్తగారని అర్థంకాదు. తనకి ఎవరో చేతబడి చేశారని అంటున్న అత్తగారు. ఆవిడకీ పెద్ద కోడలికి పడదు. పెద్దకోడలి పుట్టింటివారే తనమీద చేతబడి చేశారనీ, అందుకే ఏ రోగమూ లేకపోయినా తను మంచంమీదినుంచి కదలలేకపోతున్నాననీ, ఆవిడ ఆరోపణ! ఈ విషయం ఆవిడ వ్యంగ్యంగా పెద్దకోడలి ముందు చాలాసార్లు అనడమూ, అక్కడితో కోడలు రెచ్చిపోవటమూ, అత్తాకోడళ్ళకి పెద్ద పోట్లాట జరగటమూ మామూలే!
చేతబడి అత్తగారు ఆపసోపాలు పడుతూ కుర్చీలో కూచుని చుట్టూ ఉన్నవాళ్ళతో చెప్తోంది. "నాలుగు రోజులనాడు నాకో కలొచ్చిందమ్మా! సాక్షాత్తు దుర్గామాత కల్లో కనిపించి "నేను మీ ఊళ్ళోకి వస్తున్నాను. నీ చేతబడి తిప్పికొట్టిస్తాను" అంది. నిత్యం ఉభయ సంధ్యల్లోనూ దుర్గపూజ చేస్తాను కదూ! అంచేత దుర్గామాత నాకు తరచు కల్లోకి వస్తూ ఉంటుంది. దుర్గామాత ఊరికి వస్తోందని తెలుసు. మన ఇళ మీదికి వచ్చిందని ఇవాళే విన్నాను. అచ్యుతమ్మ అదృష్టం." అలాంటి మాటలు అంటు జబ్బులాంటివి. క్షణంలో శ్రోతలందరికీ వ్యాపించింది ఈ ధోరణి. వెంకటసుబ్బమ్మ అందుకుని నా కల్లోకి సత్యనారాయణస్వామి వస్తారు. సుబ్బమ్మా! నా వ్రతం చెయ్యి అని అడిగి మరీ చేయించుకుంటారు ఆ స్వామి!" అంది. వీరహనుమాయమ్మ తోసుకొచ్చి "నాకు షిరిడీ సాయిబాబాలో నమ్మకం! సాయిరాం నా కల్లో కనిపించి జరగబోయేవన్నీ ముందుగానే చెప్తారు. ఆ మధ్య గోపాలకృష్ణగారింట్లో దొంగలు పడ్డ సంగతి నేను ముందుగానే కల్లో చూశాను. కామాక్షమ్మ కాసుల పేరు దొంగలెత్తుకుపోవటం, అద్దంలో చూసినంత స్పష్టంగా కనిపించింది. ముందుగానే హెచ్చరిద్దామనుకున్నాను. కావాలంటే ఈ సంగతి జానకమ్మకి చెప్పానో లేదో ఆవిడనే కనుక్కోండి!" అంది సాక్ష్యం కూడా చూపిస్తూ. జానకమ్మ గాభరాగా తలూపేసింది. ఎందుకంటే, వీరహనుమాయమ్మకి ఎప్పుడూ ఊళ్ళో ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడ్డట్టు కల వస్తూనే ఉంటుంది. ఆ కలలన్నీ ఎవరో ఒకర్ని పిలిచి కూచోబెట్టి చెప్తూనే వుంటుంది. అలా వీరహనుమాయమ్మ పాలబడ్డ శ్రోతల్లో జానకమ్మ ఒకర్తె. చిన్న చిన్న చేతి బదుళ్లకోసం చచ్చినట్టు ఆ కలలు వింటుంది. గోపాలకృష్ణయ్య గారింట్లోకి దొంగలు పడ్డందుకు వీరహనుమాయమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. తన కలల్లో ఒకటైన నిజమైనందుకు- వింటున్న చిచ్చు "టూట్" అనుకున్నాడు నవ్వుకుంటూ.
దొడ్డి దారినుంచి వచ్చిన ఇళ కాళ్ళూ చేతులూ కడుక్కుని పట్టు పరికిణీ పట్టుకుని పూజ గదిలోకి వచ్చింది. చేతులు జోడించి పీటమీద కూచుంది. యోగానాథశాస్త్రి దుర్గాష్టోత్తరాలు చదివి పూజ చేశాడు. పూజ పూర్తయ్యాక ఇళ లేచి తన చేత్తో తీర్థం ఇచ్చింది. చేతబడి అత్తగారికి తీర్థం నోట్లో పడగానే, అప్పటివరకూ సగమే చాచిన తన కుడిచేయి పూర్తిగా చాపింది! చేతబడి అత్తగారు_వేతనే "నా కుడిచెయ్యి సాగింది! అమ్మా! దుర్గాదేవి! నీ మహిమ వర్ణించటం ఎవరితరమూ కాదు. ఇళాదేవి నువ్వు సాక్షాత్తూ దుర్గాదేవి అవతారానివే! కాకపోతే చిన్నారి చేతుల్లో ఇంత మహత్తు ఉండదు!" అంది భక్తితో కళ్ళు మూసుకుంది. ఇళ చుట్టూ చేరిన జనం గోలగోలగా అందరూ ఒకేసారి రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. చేతబడి అత్తగారు ఇళాదేవి దోసిట్లో యాభై రూపాయల నోటు సమర్పించుకుంది.
"దుర్గా! దయచూడు తల్లీ! నేను పూర్తిగా లేచి తిరిగేలా కటాక్షించు!" అని మొక్కుకుంది.
"టూట్! టూట్, టూట్!" కసిగా అన్నాడు చిచ్చు.
జనం గోలలో అతడి మాటలు ఎవరికీ వినిపించలేదు.