మరో రెండు రోజుల్లో పరమేశ్వరం ఢిల్లీ వెళ్ళిపోవాలి. "నువ్వు నాతో వచ్చెయ్యి" అన్నాడు వర్ధనమ్మతో.
"విహారిని ఇక్కడ ఒంటరిగా వుంచా?"
"ఒంటరేమిటి? పాతికేళ్ళు దాటుతున్నాయిగా, పెళ్ళి చేద్దాం..." అంటూ కొడుకువైపు తిరిగి, "ఏం? నీ దృష్టిలో ఎవరయినా వున్నారా" అని అడిగాడు.
విహారి సిగ్గుపడలేదు. "వచ్చే ద్వాదశి వరకూ ఆగండి నాన్నగారూ అన్నాడు.
"ఆ రోజు ఏమవుతుందిరా?" అంది వర్ధనమ్మ ఆశ్చర్యంగా. కొడుకు ఇంత పెద్దవాడయ్యాడని ఆమెకు తెలీదు.
"చెప్తాగా?"
విహారి వివాహం అయ్యేవరకూ వర్ధనమ్మ అక్కడే వుండేట్టూ, కొత్తకాపురం స్థిరపడ్డాక ఢిల్లీ వెళ్ళేట్టూ ఏర్పాటు జరిగింది.
ఆమె లోపలికి వెళ్ళేక పరమేశ్వరం కొడుకువైపు తిరిగి, "ఎవర్రా ఆ అమ్మాయి?" అని అడిగాడు కుతూహలంగా.
తండ్రి ఉత్సుకత చూసి విహారికి నవ్వొచ్చింది. "చెప్తాను నాన్నగారూ కొంచెం ఓపికపట్టండి" అన్నాడు.
"ప్రేమ వ్యవహారాల్లో నా అనుభవం నీకేమైనా పనికి వస్తుందేమో చూడు. ఇప్పుడంటే ఇలా వుందిగానీ, ఆ రోజుల్లో మీ అమ్మ చాలా పొగరుగా వుండేది. అందులోనూ కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురేమో! అసలు కళ్ళుదించి చూసేది కాదు. అటువంటిదాన్నే నేను ప్రేమలో పడెయ్యగలిగాను. కావాలంటే నీకేమైనా సలహాలిస్తాను. ఫీజు మాత్రం చాలా ఇవ్వాల్సి వస్తుంది సుమా-" నవ్వేడు.
"ఇచ్చుకోలేను నాన్నగారూ! అయినా నా కేసులో అలాంటి గర్వాలూ అంతస్థులూ ఏమీ లేవులెండి. కేవలం మనస్తత్వశాస్త్రమే వుంది" నమ్రతగా అన్నాడు విహారి.
"విష్ యు బెస్టాఫ్ లక్ మై సన్."
"థాంక్స్ నాన్నగారూ."
* * *
"బంధాలు బాధ్యతలు వెనక్కు తోశాయా పరమేశ్వరం? లేక కొత్తగా వచ్చిన 'గృహం' పాత అనుగ్రహాల్ని మర్చిపోయేలా చేసిందా?"
"లేదు స్వామీ! ఈ పరమేశ్వరం గురుద్రోహం ఎన్నడూ చేయడు. రెండు మూడు రోజులు అక్కడి వాతావరణం పరిశీలించానంతే ఇంకో ఒకటి రెండు రోజుల్లో ఏదో ఒకటి అమలుచేస్తాను."
"చెప్పానుగా. అతడికేమీ కాకూడదు. కానీ జీవితాంతం కుమిలి కుమిలి పోవాలి."
"అదే ఆలోచిస్తున్నాను."
"ఆలోచన కాదు. ఆచరణ కావాలి...పరమేశ్వరం...! డబ్బున్న అమ్మాయిని వలవేసి ఆస్తి కాజేద్దామనుకున్నావు. చిన్నతనం నుంచి నీ తెలివిని డబ్బు సంపాదన ఎలా? అన్న విషయంమీదే కేంద్రీకరించావు. వివాహంవల్ల అది రాకపోయేసరికి ఆక్సిడెంట్ లో మరణించినట్టు నటించి భార్యని విధవరాల్ని చేశావు. నీ తెలివిని ముందు గుర్తించిన నేను! చెట్టు క్రింద ప్లీడర్ ని గ్రేటెస్ట్ క్రిమినల్ లాయర్ని చేశాను. కోట్లు కమీషన్ ఇచ్చాను. నీలోని క్రిమినల్ లాయర్ తెలివికన్నా, నీ క్రిమినల్ తెలివే నాకు కావాల్సింది. నన్ను అవమానించిన ఒక మనిషి అసలు ఇన్ని రోజులు యింకా ఆనందంగా వున్నాడంటే అవమానం! వెళ్ళు పరమేశ్వరం, రెండ్రోజుల్లోగా నాకు సమాధానం కావాలి. మాటల్లోకాదు చేతల్లో...."
* * *
"ఎవర్రా ఆ ద్వాదశి అమ్మాయి? ప్రవల్లికేనా?" అడిగాడు కొడుకుని.
"కాదు నాన్నగారూ! ఆ అమ్మాయి పేరు సునాదమాల. చాలా భయస్థురాలు."
"ప్రవల్లికతో నీ చనువు చూసి ఆ అమ్మాయిని చేసుకుంటావేమో అనుకున్నాను."
"ఆ అమ్మాయి వివాహం ఎవరో మిలటరీ కల్నల్ తో నిశ్చయం అయిపోయిందండి?"
"లేకపోతే చేసుకునేవాడివా?"
మొట్టమొదటిసారి విహారి సిగ్గుపడ్డాడు.
పరమేశ్వరం ఏదో అడగబోతూంటే పద్మాకర్ హడావుడిగా కార్డ్స్ పట్టుకుని వచ్చాడు. మరుసటిరోజే ప్రోగ్రాం 'ఆఖరి పోరాటం' నాటకం. ముఖ్య అతిధి పరమేశ్వరం.
ముందు అతడు ఒప్పుకోలేదు. కానీ స్నేహితులిద్దరూ కలిసి ఒప్పించారు. "మీరు ముఖ్య అతిధిగా వుంటే అది మాకు గర్వకారణమండీ" అన్నాడు పద్మాకర్ చివరికి వప్పుకున్నాడు.
"రేపు హాలు కిటకిట లాడిపోతుంది అనుకుంటున్నామండీ..... టిక్కెట్లు బాగా అమ్ముడుపోయాయి" అన్నాడు పద్మాకర్ ఉత్సాహంగా.
"ఏమిటి ఈ నాటకం ధీమ్?" ఇన్విటేషన్ కార్టు పరిశీలిస్తూ అడిగాడు పరమేశ్వరం.
"కొత్తరకం కథ. ఒక విప్లవకారుడ్ని మంత్రి చంపెయ్యటం." అన్నాడు పద్మాకర్. "మంత్రి విహారి, విప్లవకారుడు నేను."
"సాహిత్యం వెర్రితలలు వేస్తోందనుకుంటాను."
"లేదు నాన్నగారూ! నిజాన్ని చూపిస్తూంది. దాన్ని భరించలేని భయస్థులూ, అలా వ్రాయలేని రచయితలూ, అది వెర్రితలలు వేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మన పక్కనే కూర్చుని మనతో మాట్లాడేవాడే హార్డు కోర్ టెర్రరిస్టు. అయినా దాన్ని మనం గుర్తించలేని స్థితిలో వున్నాం. అంత భయంకరంగా వున్నాయి..." ఆవేశంగా అన్నాడు విహారి.
పరమేశ్వరం నవ్వి, కొడుకు భుజం తట్టాడు. స్నేహితులిద్దరూ వెళ్ళిపోయాక రామ్ లాల్ కి ఫోన్ చేశాడు. "రామ్ లాల్, రేపు ఆడిటోరియంలో నా పక్కసీట్లో మనవాళ్లు ఎవరన్నా కూర్చునే ఏర్పాటు చెయ్యి."
"అలాగే."
పరమేశ్వరం ఫోన్ పెట్టేసి మరో అనుచరుడికి ఫోన్ చేశాడు. సునాదమాల వివరాలు చెప్పి, "ఆ అమ్మాయి చేతివ్రాత సంపాదించి, అలాంటి అక్షరాల్తోనే కొన్ని ప్రేమలేఖలు వ్రాసి, పద్మాకర్ ఇంట్లో అతడి గదిలో దొరికే ఏర్పాటు చెయ్యి. రేపు రాత్రికి ఇదంతా ఏర్పాటు జరిగిపోవాలి."
అవతలి మనిషి ఇటువంటివి అమలు జరపటంలో ఎక్స్ పర్టు.
"అలాగే" అన్నాడు వినయంగా.
పరమేశ్వరం లేచి విహారి గదిలోకి వెళ్ళాడు. నాటకం వస్తువులన్నీ ఒక బ్యాగ్ లో వున్నాయి, అతడి చెయ్యి వాటిని వెతికింది, రెండు నిమిషాల తరువాత దొరికింది.
డమ్మీ పిస్తోలు. నాటకాల్లో ఉపయోగించేది.
* * *
నాటకం రసపట్టులో సాగుతోంది.
రెండు అంకాలు పూర్తయ్యాయి.
పరమేశ్వరానికి ఒక పక్క వర్ధనమ్మ కూర్చొని వుంది. రెండో పక్క ఒక సూటు వ్యక్తి ఉన్నాడు.
కథ క్లైమాక్స్ కి చేరుతోంది.
పరమేశ్వరం సైగచేశాడు. పక్కవ్యక్తి లేచి కర్టెన్ వెనక్కివెళ్ళాడు. నాటకంలో పాత్రదారులు రంగస్థలంమీదకి తీసుకు వెళ్ళవలసిన వస్తువుల్ని అందుబాటులో పెట్టుకుంటారు. అన్నీ అక్కడే వున్నాయి.
మిగతా పాత్రధారులందరూ, జరుగుతున్న నాటకాన్ని తెరలచాటు నుంచి ఉత్సుకతతో చూస్తున్నారు. సూటు వ్యక్తి నెమ్మదిగా వంగాడు.
డమ్మీ పిస్తోలు తీసి, అచ్చంగా అటువంటిదే మరో పిస్తోలు పెట్టాడు.
తరువాత తన స్థానానికి వచ్చి కూర్చున్నాడు.
నాటకం ముగింపు వచ్చింది. పరమేశ్వరం భార్యవేపు వంగి "ఈ సునాదమాల ఎవరో నీకు తెలుసా" అని అడిగాడు.
"లేదండి" అందామె.
"నా ఉద్దేశ్యంలో ఆ అమ్మాయి ఏదో నాటకం ఆడుతోంది. ఆమెకీ, పద్మాకర్ కీ మధ్య ఏదో గ్రంధం సాగుతోందని నా అనుమానం."
"నిజమా" అంది వర్ధని ఆందోళనతో, "మన అబ్బాయి అంతలా మోసపోతున్నాడా? వాడిని వెంటనే హెచ్చరించాలి."
"అది ఎలాగూ చేస్తామనుకో. కాని వాడు యిదంతా తెలిసి, ఆ అమ్మాయిని కానీ, పద్మాకర్ ని కానీ ఏదైనా చేస్తే?" పరమేశ్వరం మాటలు పూర్తికాలేదు.
"ఢాం" అని పిస్తోలు పేలింది స్టేజిమీద.
మంత్రి వేషంలో వున్న విహారి వికటాట్టహాసంతో తెరపడింది.
ఆడిటోరియంలో చప్పట్లు.
పరమేశ్వరం భార్యతో లేచి స్టేజిమీదకు వెళ్ళాడు. అక్కడ పరిస్థితి బయటిదానికి వ్యతిరేకంగా వుంది. పద్మాకర్ రక్తపు మడుగులో వున్నాడు. ఒక బుల్లెట్ మెదడులోంచి మరొకటి గుండెల్లోంచి వెళ్లిపోయి వుంది. ప్రాణం పోయి ఎంతసేపయిందో తెలీదు. విహారి శిలాప్రతిమలా నిలబడివున్నాడు. చేతిలో పిస్టల్ ఇంకా అలాగే వుంది.
వర్ధనమ్మ కెవ్వున అరిచి ముందుకు పరుగెత్తింది.
పరమేశ్వరం వెళ్ళలేదు. చిన్న స్వరంతో అన్నాడు. "ఒ.కే. అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు- స్టేజిమీద నాటకం ఆడినట్టు నటించి స్నేహితుడిని మర్డర్ చేసిన కోల్డ్ -బ్లడెడ్ హంతకుడు విహారి! మాల ప్రేమలేఖలు పద్మాకర్ గదిలో దొరుకుతాయి!! పద్నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా విహారికి శిక్షపడుతుంది. వెళ్ళు. వెళ్ళి స్వామికి చెప్పు. పరమేశ్వరం చెప్పినమాట నిలబెట్టుకున్నాడని- స్వంత కొడుకు యవ్వన కాలాన్ని జైలుగోడలమధ్య సమాధి చేశాడనీ చెప్పు."
పక్క వ్యక్తి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
పరమేశ్వరం కొడుక్కి దగ్గరగా వెళ్ళాడు. "విహారీ! ఏమిట్రా ఇది" అన్నాడు ఆందోళనగా.
షాక్ నుంచి విహారి అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు "నాన్నగారూ" అన్నాడు.
"ఎంత పని చేశావు విహారీ!"
విహారి చేతిలోంచి పిస్తోలు జారపడింది.
వర్ధని ఏడుస్తోంది- "ఏమండీ! బాబుకి ఏమవుతుందండీ?"
పరమేశ్వరం జవాబు చెప్పలేదు. దేశంలోని ఏ లాయరూ యిక విహారిని రక్షించలేడని అతనికి తెలుసు.
అతడు భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏ క్షణాన్నైనా స్పృహతప్పేట్టు వుందామె. పొదివి పట్టుకుని "ఊరుకో వర్దనీ" అన్నాడు.
పక్కనున్న మరో నటుడు "తొందరగా అంబులెన్స్ కి ఫోన్ చెయ్యండి-" అని అరుస్తున్నాడు.
"అనవసరం. ప్రాణం పోయింది" అంటున్నారు మరెవరో.
పరమేశ్వరం పిస్టల్ వేపు చూశాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి దాన్ని అందుకున్నాడు. పిస్టల్ అందుకుంటూ వుండగా పక్కనుంచి ఎవరో అన్నారు. "ఎందుకు అలా చేస్తున్నారు?"