"తప్పుకట్టాలా? ఏం చేశామని తప్పుకట్టాలి? తప్పులు చేస్తున్న వాళ్ళంతా తలలెత్తుకు తిరుగుతోంటే ఏం తప్పూ చెయ్యని మనం వీళ్ళందరినీతాగి తందనాలాడమని తప్పు కట్టాలి?"
"తప్పు కట్టద్దు. వీళ్ళందరికీ దూరంగా పారిపోదాం" హడిలిపోయాడు జైహింద్ బాబు.
"అమ్మనూ, చెల్లెళ్ళనూ వొదిలి....."
"అదే బావా!..... అమ్మా, చెల్లి, అన్నా, తమ్ముడు ఇది కుటుంబం..... ఈ కుటుంబం అంటే సంఘంలో ఒక భాగం. సంఘానికీ, వ్యక్తికీ ఉన్న అవ్యక్త సంబంధం మీ కుటుంబం..... ప్రతివాడికి తన కుటుంబం కావాలి. కుటుంబం కావాలనుకుంటే సంఘాన్ని కాదనకూడదు. ఇలా మనకు తెలియకుండానే సంఘానికి బానిసలమయిపోతున్నాం!"
తనకు మనువు కుదిరినప్పటినుంచీ ఈ విషయాలే ఆలోచిస్తోంది చంద్రి. అంచేత అలా మాట్లాడగలిగింది! ఎవరయినా సాహసి అన్నింటికీ తెగించి సంఘాన్ని ఎదిరించినప్పుడు, ఈ సంఘం మారుతుంది. కొత్త ఆచారాలు ఏర్పడతాయి. అలా మన సంఘాన్ని ఎదిరించే శక్తి నాకెప్పటికైనా వస్తుందేమో! ఇప్పుడు లేదు."
"ఏనాటికైనా పరవాలేదు బావా! నువ్వు నావాడివనే ధైర్యం ఉంటే చాలు! నేను నీకోసం ఆగుతాను....."
"ఎలా చంద్రీ! మీ అమ్మ నీకు పెళ్లి చెయ్యకుండా ఆగుతుందా?"
"అవన్నీ నాకు వొదిలెయ్యి. నాకు మాటియ్యి"
"చెయ్యిజాపింది చంద్రి. సంతోషంగా - సంకోచంగా చేతిలో చెయ్యి వేశాడు జైహింద్ బాబు.
తన గుడిసెకు పోయిన చంద్రి తనకు కాబోయే వరుడికి అన్ని విషయాలూ వివరిస్తూ ఉత్తరం రాసేసి రహస్యంగా పోస్టులో వేసింది.
ఆ ఉత్తరం చదువుకున్న పెళ్ళికొడుకు చంద్రిని చేసుకోనని చెప్పేశాడు. కారణం చెప్పకుండా.
నాగమ్మకు మండిపోయింది. ఆమెకోపం ఎవరిమీద చూపించాలో తెలియక "సచ్చినోడు - పెళ్ళి మాటలనుకుంటూ ఉంటే పుటుక్కున తుమ్మాడు, ఈడి మూలంగానే పెళ్ళి సెడిపోయింది" అని వెంకడి మీద విరుచుకు పడింది.
పాపం, వెంకడు బిక్కముఖం వేసుకుని ఆ తిట్లన్నీ తిన్నాడు.
తరువాత రహస్యంగా చంద్రి దగ్గిరకు వచ్చి "చెల్లే! పాపిష్టోణ్ని! నా మూలంగా నీ మనువు సెడిపోనాది" అన్నాడు బాధగా.
చంద్రమ్మ వెంకడిచేతులు పుచ్చుకుని "అన్నా నా పెళ్ళి నీ మూలంగా చెడిపోలేదు. నువ్వు బాధ పడకు. ఒకవేళ నువ్వే నా పెళ్ళి చెడగొడితే నాకు గొప్ప ఉపకారం చేసినవాడివవుతావు. కష్టం కలిగించవు" అంది.
వెంకడు తెల్లబోయి అర్థం కానట్లు చూశాడు. అంతలో అర్థమయి "హోర్నాయనో!" అని గుండె బాదుకున్నాడు.
చంద్రి నవ్వుతూ నోటమీద వేలేసుకుని "హుష్!" అని అదలించింది.
8
సరళ గర్భవతి అయింది. ఆ విషయం ముందుగా నాదమునితోనే చెప్పింది, పరమానందంతో.....
"ఇహిహి! నీకు పాపాయి పుడుతుందా?" అని ఒక పెద్ద నవ్వు నవ్వాడు నాదముని.
తను తన భర్తతో పంచుకోగలిగే ఆనందం అంతమ మాత్రమే! ఉసూరుమని పోయింది సరళ ప్రాణం.....
తన జీవితానికి - తన ఆనందాలకు - తన ఆశలకు.... అన్నిటికీ ఏకైక ఆధారం తనలో ఊపిరి పోసుకుంటోన్న ఆ ప్రాణి..... తన రక్తంలో రక్తం.... తన చిట్టిపాప మాత్రమే!
చివరకు తన ఆనందాన్ని యెవరితోనో, వొకరితో పంచుకోకుండా ఉండలేక ఆ ఇంట్లో తనకాప్తులయిన కమలా, శ్యామలలతోనే చెప్పింది. "మీకొక చిట్టితమ్ముడు వస్తున్నాడు" అని.
కల్లాకపటం తెలియని ఆ పసి మనసులు చప్పట్లు కొట్టి కేరింతలతో నవ్వుతూ "బుల్లిపాపాయి! సరళ పిన్నికి బుల్లిపాపాయి!" అని ఆ వార్త ఇల్లంతా చాటారు.
పార్థసారధి పరమానందంతో "నిజమా. అక్కా!....." అన్నాడు.
"నిజమేరా! ఇన్నాళ్ళకు, ఆదైవం ఈమాత్రం చల్లగా చూశాడు" అంది సరళ.
"అక్కా! నీకు బాబు పుట్టి వాడు కాస్త పెరిగేసరికి, నేను యెలాగైనా బి.ఏ. అయినా పూర్తిచేసి యేదోవొక ఉద్యోగంలో చేరతాను. వాడిని చదివిస్తాను" అన్నాడు సారధి ఉత్సాహంగా.
సరళ వాత్సల్యంగా నవ్వి "అంత మాటన్నావు- అది చాలులేరా! మన బాబుకి లోటేముంది? నేనంటే వెర్రివాడికి భార్యనయి ఇలాదౌర్భాగ్యపు జీవితం గడపవలసి వస్తోంది. కాని, మన బాబు ఆస్తికి హక్కుదారుడవుతాడు.
తను చదువుకుంటాడు. మనను ఆదుకుంటాడు" అంది, ఆశల సౌధాలు ఊహలలో నిర్మించుకుంటూ.
రంగనాయకమ్మ ఈ వార్త విని తెల్లబోతూ "పెళ్లయిన ఇంత కాలానికి ఇదేమిటి?" అంది.
ఎంతైనా ఆడది కనుక, "పోనీలే! మొగుడు వెర్రిబాగులవాడైనందుకు సంతానమైనా వుంటే. కాస్త అండగా వుంటుంది" అని కూడా అంది.
వరదాచారి పైకి ఏమీ మాట్లాడలేదు.
అతని మనసులో మాత్రం అగ్ని పర్వతాలు పగులుతున్నాయి.
పెళ్ళయిన మొదట్లో సరళకి సంతానం కలుగుతుందేమోనని అతడు భయపడ్డాడు. కానీ, ఆ సూచనలు పోవటంతో ఆస్తంతా తనదేనని సంబరపడ్డాడు. ఆ వెర్రాడికింత తిండి పడేస్తే చాలు.... సరళ ఇంటెడు చారికీ చేస్తూ పడివుంటుంది.
కానీ, ఇప్పుడు సరళ గర్భవతి కావటంతో అతని అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. తన ఆస్తిలో భాగం పంచాలి!
ఈ ఆలోచనే సహించలేకపోతున్నాడు వరదాచారి. ఈ భావన వచ్చినప్పుడల్లా అతని మనసులో మంటలు లేస్తున్నాయి.
సరళకంటికి వెంకడు దైవంలాగే కనిపిస్తున్నాడు. ఏం లాభం? ఎంత అభిమానమున్నా, మనసులో ఉంచుకోవలసిందే కాని, వాడికి మరికాస్త పచ్చడి వేసే అధికారమైనా సరళకు లేదు.
మామూలుగా మంచం మీదనుంచి లేవలేకపోయినా. పనివాళ్లకి అన్నాలు పెట్టడానికి మాత్రం రంగనాయకమ్మ అనుమతి లేకుండా మిగిలిపోయినపదార్థాలయినా సరే, పనివాళ్ళకివ్వటానికి వీల్లేదు.
సరళ తన చేతితో ఇస్తే పనివాళ్ళకు ఆమె పట్టు భయభక్తులేర్పడతాయేమోననే భయంతో, యేదయినా రంగనాయకమ్మ తన చేతితోనే ఇస్తుంది.
అంచేత వెంకడికేవైనా తినుబండారాలు పెట్టాలనుకున్నా, పెట్టగలిగే అవకాశం వుండదు సరళకి.
కానీ, ఇటీవల తయారుచేస్తున్న ఫలహారాలలో ఎలాగో కొన్ని అతి రహస్యంగా దాచి, వాటిని ఏదో ఒకసమయంలో రహస్యంగా వెంకడి చేతిలో పడేస్తోంది సరళ!
వాడికి ధన రూపంలో తానేమీ ఇయ్యలేకపోతున్నందుకు ఈ రంకగానైనా రుణం తీర్చుకోవాలని ఆశపడింది.
మొదట్లో వెంకడు భయపడేవాడు.... వద్దని చెప్పాలనుకునేవాడు....
కానీ, వాడు ఆ తినుబండారాలను తను తినకుండా దాచి చంద్రి కిచ్చినప్పుడు, అది తిండిమీద ఆశ కంటె, అన్నను సంతృప్తి పరచాలనే ఆశతో అవి తిని ఎంతో బాగున్నాయని మెచ్చుకొనేది!
అక్కడితో వాడు సరళ తనకేం పెట్టినా ఆశగా అందుకుని చంద్రి కిచ్చేవాడు. చంద్రి అప్పుడప్పుడు తల్లికీ, తండ్రికీ కూడా పెట్టేది.