Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 18


    మొత్తం అందరి కాగితాలు విజ్జూకి అందించాం. అతడు మరో కాగితం తీసుకుని ఒక్కొక్క కథకీ  వచ్చిన  మార్కులు లిస్టులాగా వెయ్యసాగాడు. రెండు నిముషాల్లో ఆపని పూర్తిచేసి, మొత్తం కూడాడు. తరువాత మా అందరి మొహాల్లోకి తాపీగా చూచి, ఆ కాగితాన్ని ఎత్తి ఒక్కొక్క కథకి వచ్చిన మార్కులు చదవటం ప్రారంభించాడు.
    "దుప్పట్లో మిన్నాగు కథకి పదిహేను మార్కులు, ఓడ ప్రయాణం కథకి....."
    అందరం వూపిరి బిగపట్టి వింటున్నారా, లేదా అన్న విషయం నిర్దారణ చేసుకుని, తిరిగి చదవటం ప్రారంభించాడు.
    "దుప్పట్లో మిన్నాగు కథకి పదిహేను మార్కులు.....ఓడ ప్రయాణం పదిహేను మార్కులు.... మనవతీత వ్యక్తి పదిహేను మార్కులు...." వాడు చదువుతూ వుంటే అందరికీ ఆశ్చర్యంగా వుంది. అందరికీ సమానంగా మార్కులు రావడం!! ఒక్కొక్కరి మొహమూ వికసిస్తూ వుంది కూడా. నాకు మాత్రం  ఇది గొప్ప కో- ఇన్సిడెన్స్ గా కనబడింది. ఈ లోపులో విజ్జి "వరండా కుర్రాడు- పదిహేను మార్కులు" అన్నాడు. నేను వూపిరి బిగాపట్టాను. నాకుకూడా పదిహేను మార్కులు వస్తే అందరం బిల్లుని సమానంగా పంచుకోవచ్చు. డబ్బు గురించి కాకపోయినా, అందరం సమానమైన విలువగల కథలు చెప్పామన్న సంతృప్తి వుంటుంది.
    నేను ఆలోచనలో వుండగానే అతడు కుర్చీ వెనక్కివాలి, చేతిలో కాగితాన్ని బల్లమీద పడేస్తూ ఆఖరి మాట అన్నాడు-
    "అంతర్నేత్రం కథకి అయిదు మార్కులు"
    ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
    ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు చివరికి ఇది తిరిగి తిరిగి నా మీద కొచ్చి పడ్డదన్నమాట. నేను దిగులుగా, మేము మార్కులు వేసిన కాగితంవైపు చూశాను. మిగతా వాళ్ళందరూ నావైపు సానుభూతిగా చూస్తున్నారని నాకు తెలుసు. నా బాధ బిల్లు గురించి కాదు. నేను మంచి కథ చెప్పానని ఇంతసేపూ అనుకుంటున్నాను. ఇంత దారుణంగా ఓడిపోతాననుకోలేదు......అదీ ఇంత తేడాతో..... "చెప్పినంతసేపూ నీ కథ బాగానే వుందిగానీ, మరీ ఫాంటసీలా వుంది" అన్నాడు విజ్జి నావైపు చూస్తూ. మా పందెంలో (సాహిత్యంలాగే) ఫాంటసీలు వ్రాయకూడదని రూలులేదు. సాహిత్యం ప్రజల్ని ఆహ్లాదపరచినట్లు ఈ రాత్రి నా మిత్రుల్ని ఆహ్లాదపరచడం కోసమే నా కథ వుద్దేశింపబడింది తప్ప- సాహితీ ప్రయోజనాన్ని ఆశించి కాదు. ఆ మాటే వాళ్ళతో అన్నాను. వెంకూ గాడు నవ్వాడు. "సాహితీ ప్రయోజనం లేని కథ వుద్దేశింపబడింది తప్ప- సాహితీ ప్రయోజనాన్ని ఆశించి కాదు. ఆ మాటే వాళ్ళతో అన్నాను.
    వెంకూ గాడు నవ్వాడు. "సాహితీ ప్రయోజనం లేని కథ కథకాదు మిత్రమా! అందుకే నీకు అందరికన్నా తక్కువ మార్కులు వచ్చినయ్" అన్నాడు వ్యంగ్యంగా.
    'మానవాతీత వ్యక్తి' లాంటి కథ చెప్పిన వెంకూ సాహితీ ప్రయోజనం గుర్చిమాట్లాడటం చూస్తే నవ్వు వచ్చింది నాకు. అన్నీ ప్రేమ కథలే వ్రాసిన రచయిత్రి 'రచనలవల్ల సమాజంలో గొప్ప మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను' అని ఇంటర్వ్యూలో చెప్పినట్టు వుంది ఆ పోలిక. ఈ ప్రపంచంలో రచయిత (త్రు) లంత పేరనాయిడ్స్ ఇంకొకరు వుండరనుకుంటాను. దురదృష్టం అంతా- ఈ మాటలు నమ్మి మోసపోతున్న ఫాలోవర్స్ ది.
    నా వాదనని వాళ్ళు ఒప్పుకోరని తెలుసు. అయినా నేను వివరించడానికి ప్రయత్నించాను. "సమాజం ఎప్పుడూ మామూలుగానే నడుస్తూ, ఒక మార్పు వైపు సాగిపోతూ వుంటుంది. అందులోని వ్యక్తులు తమ తమ ఇబ్బందులకు రియాక్టు అవుతూ ఆ మార్పుని అభిలాషిస్తూ వుంటారు. ఇబ్బందియొక్క తీవ్రతనుబట్టి మార్పు యొక్క వేగం నిర్ణయించబడుతుంది. అప్పుడు సంఘ సంస్కర్తలు ఉద్భవిస్తారు. లేదా రక్తపాతంతో కూడిన విప్లవం వస్తుంది. మనిషి తనే  పరిస్థితిలో వున్నాడో తెలుసుకునే సెల్ఫ్ రియలైజేషన్ కోసమే సాహిత్యం వుపయోగపడుతుంది. అంతే తప్ప ఏకంగా మార్పుని తీసుకురాదు. దట్టంగా కూరబడి వున్న మందుకు 'వత్తి' అయి, బ్లాస్ట్ చేస్తుందే తప్ప- తనే బాంబుగా మారదు. 'రచన' మనిషి మనిషినీ ప్రత్యేకంగా స్పృశించి సెన్సెస్ కి అప్పీలు చెయ్యాలి. అంతేకాని నినాదపరంగా వుండకూడదు అని భావిస్తున్నాను. వరకట్నం పోవాలని ఎలుగెత్తి చాటే నవలకన్నా, స్త్రీలో తన కాళ్ళమీద తాను నిలబడే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రచన మనిషికి ఎక్కువ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను."
    "ఒకవేళ నువ్వు చెప్పిందంతా నిజమే అనుకున్నా నీ కథలో అలాటి సందేశమే లేదే.."
    "సమాజాన్ని ఉద్దరిద్దామన్న ప్రయత్నంలో, ఒక రచయిత తనని తను సంస్కరించుకోలేకపోవడాన్ని నా కథలో వివరించానని నా ఉద్దేశ్యం. సాహిత్యగోష్టి పేరిట తాగుతూ, అర్థరాత్రి వరకూ తిరుగుతూ, భక్తబృందం చర్చలతో ఒక ఇల్లాల్ని నరకయాతన పెడితే, విప్లవం మాట దేవుడెరుగు-ఆ స్త్రీ  గుండెల్లో మంట ఎంత దారుణంగా ప్రజ్వరిల్లుతుందో- భర్త పట్ల ఎంత దారుణమైన కసి ఏర్పడుతుందో...... ఆ థీమ్  ని చక్కటి ఫాంటసీ ఫ్రేములో బిగించి చెప్పటమే నా ఉద్దేశం. తమ మెదడు చుట్టూ ఏముందో సైటింఫిక్ గా చాలామందికి తెలియదు. నా కథలో నాకు తెలిసిన విషయాలు చెప్పటం కథకి మార్కుల్ని తగిస్తుందని అనుకోను. ఏమీలేని 'వరండా కుర్రాడు' లాటి కథకన్నా-"
    నా మాట పూర్తికాకుండానే "ఐ ఆబ్జెక్ట్" అని అరిచాడు శేషూ. "నీ కథ గురించి నువ్వెంత డబ్బా కొట్టుకున్నా
నేను వూరుకుంటాను గాని నా కథని విమర్శించే హక్కు నీకులేదు."
    "నేను చేస్తున్నది సాహితీ విమర్శ-"
    అప్పుడు వాడున్నాడు : "సాహిత్యాన్ని సృష్టించేవాడికి విమర్శించే హక్కు లేదు. నువ్వు చెప్పిన కథ నీకు ఎంత బావుందో, నా కథ నాకూ అంతే బావుంది. కథలన్నింటిని వివరిస్తే టైమ్ వేస్టు కాబట్టి కథ వరండా కుర్రాడినే తీసుకో. నన్ను నేను సమర్థిస్తున్నానను కోకపోతే కొంత వివరిస్తాను విను.
    1. నాలో ఒక నేను- నాలో ఇంకో నేనుతో ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటాను. ఇలాంటి నేనులు నాలో ఎందరో వున్నారు. అంతమంది నేనుల్లో నేనెవరో నాకే తెలీదు. నా కథలో రాధ పాత్ర ఈ విధమైన మల్టిట్యూడ్ అటీట్యూడ్ తో బాధ పడుతూంది.
    2. మనిషి ఆనందంగా బ్రతకాలి. అయితే అలా తను ఆనందంగా బ్రతకటం కోసం ఇతరుల్ని బాధ పెట్టకూడదు. తను బాధపడకుండా వీలయితే ఇతరులకి ఆనందం కలిగించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది- తన ప్రస్తుత ప్రవర్తనలవల్ల తాను గిల్టీకాన్షన్ గా ఫీలవకూడదు. భవిష్యత్తులో ఆత్మ విమర్శ చేసుకొనే పరిస్థితి రాకూడదు. ఈ నాలుగు సూత్రాలూ జీర్ణించుకున్న మనిషి పైకి ఎంతో గొప్ప వాడిగా కనపడేవాడికన్నా..... ఎంతో ఎంతో  గొప్పవాడు అవుతాడు. వాడు తాగనీ, స్త్రీలోలుడవనీ, రేసుల్లో డబ్బు యావత్తు పోగొట్టుకోనీ..... వాడి మొహం మీదనుంచి చిరునవ్వు చెరగదు. అతడికి బాధ వుండదు. ఉన్న తన బాధతో, ఆలోచనలతో ఇతరుల్నీ బాధపెట్టడు. నేను చెప్పిన మొదటి పాయింటుకి రాధపాత్ర సరిగ్గా వ్యతిరేకం. ఆమెకేం కావాలో ఆమె ఎప్పుడూ తేల్చుకోలేకపోయింది.
    3. మనుష్యులు తాము ఎంత గొప్పగా బ్రతకవచ్చో తెలుసుకుని కూడా అంత గొప్పగా బ్రతకరు. తమ చర్యల్ని ఆ 'గొప్పగా బ్రతకటం' అనే  వూహకి అన్వయించుకుని, అది ఆత్మవంచన అన్న విషయం కూడా మర్చిపోయి, తమ  చర్యల్ని, వూహల్నీ 'ఎల్లప్పుడూ' సమర్థించుకో జూస్తారు. నాకథలో నాకానొక స్టేజిలో రాధ పాత్రలో ఈ సెల్ఫ్ - కాంట్రాడిక్షన్ పోయిందందుకే!
    4. మనిషి తన మనసు చీకటి గదుల్లో నిరంతరం జరిగే ఆలోచనని ఇంకొకరు బైట పెట్టటాన్ని ఒప్పుకోడు. పాఠకులు కూడా అంతే. రచయితగా నేను చేసుకున్న ఆత్మవంచన ఇక్కడే, ఈ కథ ముగింపులోనే..... రాధ వెళ్ళి వరండా కుర్రాడితో, తన మునుపటి ఆలోచన్లకి గుడ్ బై చెప్పేసి, దాదాపు అతడిని 'తమ్మూడూ' అని పిలిచేసరికి పాఠకుడికి ఈగో సంతృప్తి అది. దాంతో ఇక ఇది మంచి కథ అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. ముగింపు సత్యదూరమైనా సరే!
    డబ్ల్యూ పెన్ ఫీల్డ్ అన్న శాస్త్రవేత్త వేర్వేరు స్త్రీలమీద ఈ పరీక్ష జరిపాడు. పాయింట్19 దగ్గిర  కుడివైపు టెంపోరల్ లోబ్  యొక్క మొదటి కన్ వల్లన్ లోకి స్టిమ్యూలేషన్ ని పంపిస్తే......70 శాతం స్త్రీలు తమ భర్తల పట్ల అసంతృప్తి దారుణంగా బయటపెట్టారు. ఇలాటి చేదు నిజాన్ని పాఠకులు భరించలేరు. అందుకే చక్కటి ముగింపు ఇచ్చాను. ఇంత అనాలిసిస్ వుండటంవల్లే నా కథకి పదిహేను మార్కులువచ్చినయ్. కేవలం గాలిపోగుచేసి చెప్పటంవల్ల కాదు."
    నేను అవాక్కయి వినటం తప్ప ఏమీ చేయలేకపోయాను.  వీడు ముందు చెప్పిన కథకన్నా ఇప్పుడు చెప్పిన "కథ తాలుకు గొప్ప తనుపు" వివరణ బావుంది. ఇకనుంచీ ప్రతివాడూ తన కథ వ్రాసి, అందులో ఏం గొప్ప వుందో, అది వ్రాయటానికి తనెంత కష్టపడ్డాడో క్రింద పుట్ నోట్సులా ఇవ్వాలన్నమాట. నాకు  వాడిని లాగి తన్నాలనిపించింది. ఫ్రాయిడ్ నీ, డాక్టర్ పెన్ ఫీల్డ్ ని కూడగట్టుకుని తన కథ విలువల్ని పెంచడానికి చూస్తున్నాడు. ఆమాటే వాడితో అన్నాను. మా ముగ్గురు మిత్రులూ మా వాదనని చిరునవ్వుతో పరికిస్తున్నారు.
    వాడు నా మాటలకి నవ్వాడు. "పెద్ద పెద్ద మాటలు వాడింది నేను కాదు నువ్వు! తెలుగు పాఠకుల్లో ఎంతవరకు డ్యూరామాటర్ గురించి, రింగర్స్ సొల్యూషన్ గురించి తెలుసు? సగటు తెలుగు పాఠకురాలి ఐ క్యూ.... ఎనిమిదో తరగతి కన్నా ఎక్కువేం లేదని మొన్నేగా సర్వేలో బయటపడింది. అలాటి వాళ్ళని ఆకట్టుకొని చదివించాలంటే నవరసాల్లోకి ముఖ్యమైనవి బెస గా తీసుకోవాలి. అన్ని రసాల్లోకి మనుష్యులు తొందరగా స్పందించేది శృంగారానికి. తర్వాత భయానక రసానికి. అందుకే ఎంత కష్టతరమైన విషయాన్నాయినా శృంగారపు బ్యాక్ డ్రాప్ తో గానీ, మంత్ర తంత్రాల ఫ్రెమ్ తో గానీ ఆసక్తితో చదువుతారు, శృంగార.... భయానక... అద్భుత.... భీభత్స రసాలు బేస్ గా దే వరుసక్రమంలో చెప్పబడిన వరండా  కుర్రాడు, దుప్పట్లో మిన్నాగు, ఓడ ప్రయాణం, మానవాతీత వ్యక్తి కథలు ఎక్కువ మార్కులు సంపాదించగలిగింది అందుకే. నీ కథలో ఉట్టి సైన్సు తప్ప మరేమీ లేదు. అందుకే నీకు తక్కువ మార్కులు వచ్చినాయి."
    చాలా దారుణమైన వాదన ఇది. మిగతా కథల సంగతి ఏమో కాని, ఓడ ప్రయాణం కథలో అద్భుతరసమేమీ నాకు కనబడలేదు. కానీ యితడి వాదన  వింటూంటే, నిజంగా నాది ఇంత పేలవమైన కథ అన్న అనుమానం నాకే వచ్చేట్టు వుంది. ఎక్కడో ఏదో మోసం జరిగింది. నా మిత్రుల్లో ఎవరో ఏదో కిటుకు చేశారు. ఎవరి కథ వాళ్ళకి బాగానే వుండొచ్చు. కాని నిశ్చయంగా నాది మంచి కథ.
    అయినా ఏం చెయ్యను?
    బిల్లు ఇచ్చేయ్యాలి. తప్పదు. కానీ నా దగ్గర అంత డబ్బులేదు. వీళ్ళని అడగటానికి మొహమాటమేసింది. అలాగే గాలిలో కలిసిపోతే ఎంత బావుణ్ణు అనిపించింది. కానీ మొహమాటపడ్డాను. అసలు జేబులో ఎంత వుందో? ముందు అది లెక్కపెడితే తర్వాత మిగతా పైకం సంగతి చూసుకోవచ్చు.
    జేబులో చెయ్యి పెట్టి పర్సు తియ్యబోతూవుంటే అకస్మాత్తుగా నా దృష్టి తలుపుమీద పడి ఆ దృశ్యం చూసి ఉలిక్కిపడ్డాను.
    పెద్ద పొగ!
    క్రమక్రమంగా ఆ పొగ ఒక ఆకారంగా మారుతోంది. రూపు సంతరించు కుంటూంది.మిగతా వాళ్ళెవరూ గమనించటంలేదు. నా మొహంలో రక్తం ఎవరో  తోడేస్తున్నట్టు అవుతూంది. ఒళ్ళు జలదరించింది.
    ఆ ఆకారం గాజు అద్దాల తలుపు తోసుకుని లోనికి ప్రవేశించింది. మా వైపే రాసాగింది.
    ఆ ఆకారం నా దగ్గరగా వచ్చి నిలబడి, "హల్లో" అంది.
    నా భ్రమకి నేనే నవ్వుకున్నాను. బయట మంచులోనుంచి రావటంవల్ల పొగ ఆకారంలో కనబడింది. దగ్గర కొచ్చేకొద్దీ ఆకారం స్పష్టంగా తెలుస్తూంది.
    కానీ వచ్చింది పట్నాయక్. ప్రొఫెసర్ పట్నాయక్!

 Previous Page Next Page