Previous Page Next Page 
ఆపరేషన్ మేడిపండు పేజి 10

    అజేయ్ అటు చూశాడు. ఈసారి స్వరం పైకప్పు నుండి వినబడింది.
    'శత్రువులు చాలా తెలివైనవారు' అనుకున్నాడు అజేయ్. అతడు మైక్రోపోన్ల గురించి పట్టించుకోవడం మానేసి శ్రద్దగా వినసాగేడు.
    "ప్రొఫెసర్ ! నీవు మంచం మీద లేవనీ గదిలో తిరుగుతున్నావనీ స్కానర్ ని బట్టి  అర్థంచేసుకున్నాం. వెళ్ళి మంచంమీద పడుకో. నువ్వు పడుకున్నావని నిర్ధారించుకున్నాక మా సందేశాన్ని అందిస్తాం"
    అజేయ్ కదలకుండా అలాగే నిలడ్డాడు.
    శత్రువులు తనని చూస్తున్నారా? మైక్రోఫోన్లతొపాటు కెమెరాలెన్స్ లు కూడా గదిలోకీ ఏర్పాటు చేయబడ్డాయా?-ఆలోచిస్తున్నాడాయన.
    "ప్రొపెసర్! నువ్వింకా పడుకోలేదు-పడుకుంటేనే సందేశం"
    అజేయ్ కు కోపం వచ్చింది. తను వాళ్లు చెప్పినట్లు ఎందుకు వినాలి? వినకపోతే ఏం చేస్తారు? అలా ఎంతసేపు తనని హెచ్చరిస్తారు?
    ఆయనలా నిలబడే వున్నాడు. హెచ్చరిక ఆగిపోయింది.
    సందేశం-ఏమిటి వాళ్ళు తనకివ్వబోయే సందేశం.
    ఈ గదిలో ఇలా ఎన్నిరోజులు గడపాలో తను. ఆ సందేశం వింటే క్లూ ఏదైనా దొరకవచ్చు. ఆ సందేశం వినాలంటే మంచం మీద పడుకోవాలి.
    పడుకునేందుకు వెళ్ళబోతూండగా అజేయ్ కొ ఆలోచన వచ్చింది.
    తనను హెచ్చరిస్తూనే గొంతు స్త్రీదని తెలుస్తూనేవుంది. ఆమె తనను చూస్తోందా?
    ఆమె స్కానర్ సాయంతో తన ఉనికిని తెలుసుకుంటోంది. అదే నిజమైతే ఆమెకు తానేక్కడున్నాడో తెలుస్తుంది. ఎలా వున్నాడో తెలియదు.
    అజేయ్ ఒకటొక్కటిగా తన ఒంటిమీది బట్టలు  తీయసాగాడు.
    తను కనపడేమాటైతే-ఆమె మాట తడబడి  తీరాలి! ఆమె తడబడని పక్షం కనీసం తనకు తృప్తి-ఏదోవిధంగా కక్ష సాదించానని!
    "ప్రొఫెసర్! అటెన్షన్ ప్లీజ్....నువ్వింకా..." అదే స్వరం.
    అజేయ్ తన ఒంటిమీది బట్టలన్నీ తొలగించాడు. ఇప్పుడాయన ఒంటిమీద మొలత్రాడు తప్ప ఇంకేమీ లేదు.
    "ప్రొఫెసర్! అటెన్షన్  ప్లీజ్-నువ్వింకా పడుకోలేదు"
    ఆ గొంతులో తడబాటు లేదు. చెప్పాలంటే ఇందాకటికీ ఇప్పటికీ ఏ మార్పూలేదు.
    అజేయ్ గది తలుపుదాకా  వెళ్ళాడు. గడియ పెట్టాడు.
    వెనక్కు తిరిగాడు. నెమ్మదిగా  మంచందాకా వెళ్ళాడు. పక్కమీద వాలాడు.
    అంతే! గది తలుపు గడియ దానంతటదే పైకి లేచింది.
    రెండు తలుపులూ బార్లా తెరుచుకున్నాయి.
    గదిలో ఎవరో ప్రవేశించారు. తలుపులు వెంటనే మూసుకున్నాయి.
    అజేయ్ ఉలిక్కిపడి చటుక్కున లేచికూర్చున్నాడు.
    గదిలో అడుగుపెట్టిన యువతి ఆయన్ను చూసింది. ఆమె తడబడలేదు. ఆమె ముఖంలో చిరునవ్వు వెలసింది.
    "ప్రొఫెసర్ అజేయ్....నేనే సందేశాన్ని-వచ్చాను" అందామె. అదే గొంతు.
    ఆడది. అందమైనది. వయసులో వున్నది. తననిలా చూసి తడబడదేం?
    అజేయ్ చటుక్కున మంచంమీద దుప్పటి లాగి తనను కప్పుకున్నాడు.
    ఆ యువతి అతణ్ణి సమీపించింది. నవ్వుతూ అతణ్ణి చూసి, "ప్రొఫెసర్! ఆ దుప్పట్లోకి నేనూ రావాలనుకుంటున్నాను. ఇలా వచ్చేదా, మీకులా వచ్చేదా?" అందామె.
    అజేయ్ ఆమెనే చూస్తున్నాడు. ఆయనకు నోట మాట రావడంలేదు.
    "ప్రొఫెసర్! మీరు పేరుపొందిన శాస్త్రజ్ఞులే కావచ్చు. అయినా మీరూ మనిషే. మీకూ ఆకలి వేస్తుంది. అన్నం కావాలి. అది లభిస్తోంది. పాపం ఎన్నో రోజులుగా ఒంటరిగా వున్నారు. తొడు కావాలనిపిస్తూనే వుంటుంది. అందుకే  నేను  వచ్చాను. ఇక్కడ మీకు  ఏ లోటూ రాకూడదనే  అందరి అభిప్రాయమూ. చెప్పండి-ఇలాగే వచ్చేదా, నేనూ మీకులా మారి వచ్చేదా?" అందామె మళ్ళీ.
    అజేయ్ అతి కష్టంమీద గొంతు చిక్కబట్టుకుని, "ఎవరు నువ్వు?" అన్నాడు.
    "అయామే కాల్ గర్ల్ -మెడికల్లీ టెస్టేడ్ అండ్ అప్రూవ్డ్" అందామె.
    అజేయ్ ఆమెనే చూస్తున్నాడు. క్షణంపాటు ఆయన గతాన్ని మర్చిపోయాడు. భవిష్యత్తు గురించిన  ఆలోచన మానేశాడు.
    వర్తమానం- అదొక్కటే ఆయన బుర్రలో వుంది.
    వర్తమానం - అది తోడును కోరుతోంది.
    సృష్టి విచిత్రమైనది. ఈ భూమ్మీద జీవజాలంలో మెదడు కారణంగా ఉత్కృష్టుడైన మనిషి- సృష్టికార్య సమయంలో మెదడునుపయోగించలేడు. శరీరం మెదడు పై ఘనవిజయం సాధించే ఆ క్షణాల్లో మనిషికీ, జంతువుకూ తేడా వుండదు.
    మనిషిని జంతువు చేసే ఆ క్షణాల రాకకోసం  జరిగే  సంఘర్షణలోంచి ప్రపంచభాషలన్నింటి నుంచీ ప్రేమకావ్యాల పేరిట సాహిత్యం పుట్టుకొచ్చింది.
    ఇద్దరూ ఇష్టపడితే-ఇద్దరికీ సంకోచం లేకపోతే -ఇంకా దాన్ని మోహమనాలా లేక ప్రేమ అనవచ్చా అన్న మీమాంసను విమర్శకులు చర్చిస్తూనేవుంటారు.
    ఆకలి రుచి ఎరుగాదు. కోరిక పేరును వెతకదు.
    ప్రేమ,మోహం, కామం-అది ఏదైనా కావచ్చు-ప్రస్తుతం అజేయ్ అధిగామించాలనుకుంటున్న సంకోచం వాటికి సంబంధించినది కాదు.
    గదిలో వీడియోకెమెరాలున్నాయా-ఎవరైనా ఫిల్మ్ తీస్తారా?
    తీయరని ఆమె అంటోంది. అది ఆయనకు అనిపిస్తోంది.
    ఆకలి రుచి ఎరుగదు. కోరిక తార్కాన్ని చూడదు.
    బిల్ క్లింటన్-పౌలా  జోన్సు-నిజమో,అబద్దమో-కానీ  కోరిక తార్కాన్ని చూస్తే వ్యవహారం ఆరోపణల స్థాయికి ఎదిగేదా?
    అజేయ్ ఇంకా తటపటాయిస్తున్నాడు. కానీ మనసు బలహీనంగా వుంది.
    "ప్రొఫెసర్ -మానవత్వంలో కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని అనుమానించకండి ఇది తప్పుగా మేము భావించడంలేడు కాబట్టి తప్పుగా పదిమంది ముందు వుంచే  ప్రసక్తి లేనే లేదు. ఈ క్షణాలు వ్యక్తిగతం. అందుకు తిరుగులేని రుజువు చూడండి" అందామె.
    గదిలో దీపం ఆరింది.
    చీకటి-కన్ను పొడుచుకున్నా  కానరాని చీకటి-ఇక కెమేరా లెన్సుకేం దొరుకుతుంది.
    అజేయ్ లో సంకోచం తొలగిపోయింది. ఆ తర్వాత....
    తననిక్కడ బంధించిన శత్రువెవరో తెలుసుకోవాలన్న ఆత్రం  ఆయనలో కలిగింది. ఎందుకంటే  వెంటనే అతడిని అభినందించాలని ఆయన అభిలాష!

                                                                   *    *    *
    "నా పేరు సుబ్బరాయడు" అని నాలిక్కరుచుకుని" కాదు కాదు-నారాయడు అన్నాడు ఆ పెద్దమనిషి.
    గజపతి అతణ్ణి పరిశీలనగా చూశాడు.
    ముతకపంచ. ఖద్దరు చొక్కా. బుర్రమీసాలు. బట్టతల.
    అతడు సుబ్బాపురంలోని ప్రముఖ భూస్వాముల్లో ఒకడు.
    "ఈ ఊరు చాలా గొప్పది. సైన్సు పేరు చెప్పి పూర్తి ప్రయోజనాలు పొందింది అన్నాడు గజపతి.
    "అవునండి" అన్నాడు నారాయడు వినయంగా.
    "మీరు మీ పొలాల్లో కూడా సౌరశక్తితో పనిచేసే మోటర్లు వాడి నీరు  తోడిస్తున్నారనివిన్నాను"
    "అవునండి" అదే వినయం.
    "అందువల్ల మీకు కరెంటు ఖర్చు పూర్తిగా ఆదా"
    "అవునండి"
    "నేను మీ పొలాల నుంచే ఇలా వచ్చాను"
    "కోతలైపోయాయ్ కదండీ-పొలాలు బోసిగా వుంటాయి" అన్నాడు నారాయడు.
    "కానీ  మీ మోటార్లు చూశాను. అవి కరెంటుతోనే పనిచేస్తున్నాయి."
    నారాయడు చిరాకు నరిస్తూ, "నేను లేకపోతే అంతేనండి. లేకపోతే మా పని వాళ్ళకిప్పుడు మోటార్ ఆన్ చేయాల్సిన పనేమిటి?" అన్నాడు.
    "మీరు లేరని కాదు-నేనున్నానని ఆ పని  చేశారు. ఆన్ చేయమన్నది నేనే!"
    "దాహమేసిందాండీ?"
    "లేదు. ఈ ఊళ్ళో సౌరశక్తితొ పనిచేసే యంత్రాలేమీ లేవనీ - అది తప్పుడు ప్రచారమనీ తెలిసింది. నిజానిజాలు తెలుసుకుందుకు స్వయంగా వచ్చాను"
    నారాయడు అనుమానంగా , "ఇంతకీ తమరెవరు?" అన్నాడు.
    "నేను దియా నుంచి వస్తున్నాను. మీ  వల్ల మా సంస్థకు చెడ్డపేరు వస్తోంది. మీరు మీ కోసం  మేమిచ్చిన యంత్రాలనెందుకు వాడడంలేదు?" అన్నాడు గజపతి.
    "పాత డైరెక్టరునెవరో ఎత్తుకుపోయారటగా-తమరు కొత్త డైరెక్టరు మనిషా ఏమిటి? ఆయన తన వాటాకు గానీ పంపాడా?" అన్నాడు నారాయడు.
    "వాటాలేమిటి?" అన్నాడు గజపతి కాస్త కర్కశంగా.
    నారాయడు తడబడి, "తమకు తెలియకపోతే సరేలెండి" అన్నాడు.
    "తెలియకపోతే తెలుసుకుంటాను. వాటాలేమిటో చెప్పండి."
    "అవి నేనెందుకు చెప్పాలి? పాత డైరెక్టర్నే అడిగి తెలుసుకోండి."
    గజపతి స్వరం తగ్గించి-
    "మీ ఊళ్ళో సౌర యంత్రాలన్నీ సక్రమంగా పనిచేస్తూండడంవల్లనే  దుండగు లాయన్ను ఎత్తుకుపోయారు. ఇక్కడి యంత్రాలన్నీ వాళ్లే పాడుచేసి వుంటారు. ఇకముందు ఇలాంటి యంత్రాలు చేయకుండా ఆయన్ను బెదిరిస్తారు. లేదా ఆ యంత్రాల తయారీకి  తమ వాటాను కోరతారు. యంత్రాల రేటు పెంచుతారు" అన్నాడు.
    "ఎవరు బాబూ వాళ్ళు" కుతూహలంగా అడిగాడు నారాయడు.
    "వాళ్ళ ఆచూకీ  తెలుసుకుందుకే ఇక్కడికొచ్చాను. ఈ ఊరివాళ్ళ సౌరయంత్రాలు పాడుచేసిందెవరు? భయపడకుండా చెప్పండి"
    "నారాయడు ఆశ్చర్యంగా, "దియానుంచి వస్తున్నానంటున్నారు. తమకీ విషయం తెలియదా?" అన్నాడు.
    "ఏ విషయం?"
    "పాడుచేయడానికి అసలంటూ ఆ యంత్రాలెప్పుడైనా పనిచేస్తే కదా"
    "వివరంగా చెప్పండి. నాకేమీ అర్థంకావడంలేదు" అన్నాడు గజపతి.
    నారాయడు చెప్పడం మొదలుపెట్టాడు.....
    సుబ్రహ్మణ్యం దియాలో సైంటిస్టు. ఎమ్మెల్యే  పోతురాజు అతడికి ఆలితరపు బంధువు. పోతురాజుకు సుబ్బాపురంలో పెద్ద  ఫాలోయింగ్ వుంది.
    సుబ్బాపురాన్ని దియా దత్తత చేసుకుంటుందనగానే ఊరంతా గొడవ పెట్టారు. అప్పుడు పోతురాజు  వారిని సముదాయించి-అందువల్ల ఊరికి రోడ్దు ఏర్పడుతుందనీ, బస్సులు పడతాయనీ, గ్రాంట్లు వస్తాయనీ నచ్చజెప్పాడు. అయితే సౌరయంత్రాలు వాడము అని గ్రామపౌరులందరూ షరతు పెట్టారు డానికి ఒప్పుకున్నాకనే దియా ఆ ఊరిని దత్తత చేసుకోవడం జరిగింది.
    అయితే అసలువిషయం నారాయడికి తర్వాత తెలిసింది.
    అంతకుముందు దత్తత చేసుకుందుకు దియా కొన్ని ఇతరగ్రామాలను ఎన్నుకుంది.
    అయిఒతే అసలు విషయం నారాయడికి తర్వాత తెలిసింది.
    అంతకుముందు దత్తత చేసుకుందుకు దియా  కొన్ని ఇతరగ్రామాలను ఎన్నుకుంది ఆ గ్రామస్థులు కనీసం సోలార్ కుక్కర్లైనా తమకు ఉచితంగా ఇస్తే వాడుకుంటామని పట్టుబట్టారుట. దత్తత ప్రయోజనం  రోడ్లు, బస్సులు వగైరాలే తప్ప సౌరయంత్రాలు కాదని ఎంత నచ్చజెప్పినా ఆ గ్రామస్థులు వినలేదట.
    సుబ్బాపురం ప్రెసిడెంట్ దత్తాత్రేయులూ పోతురాజూ ప్రాణస్నేహితులు. అందువల్ల దత్తాత్రేయులు గ్రామంలోని సామన్యులందర్నీ సౌరయంత్రాలకు వ్యతిరేకంగా తయారు చేయగలిగాడు. సూర్యతేజాన్ని వంటకు వాడితే ఎండలో శక్తి తగిపోయి పంటలు సరిగా పండవని కూడా ఆయన గ్రామస్థుల్ని బెదరగొట్టాడు. ఆయనకిలాంటి ఐడియాలన్నీ  సుబ్రహ్మణ్యమే ఇచ్చాడు.
    మచ్చుకు కొన్ని సౌరయంత్రాలైనా సుబ్బాపురంలో వుంచవచ్చు. కానీ  వచ్చిన  ఇబ్బంది ఏమిటంటే సుబ్రహ్మణ్యం సబ్జక్టు బోటనీ. అతడికి సౌరయంత్రాలా గురించి అవగాహన బొత్తిగా లేదు. అవి పనిచేస్తే -సరేసరి. కానీ పనిచేయనప్పుడు వాటికి జవాబుదారీతనే కావాలి. ఎక్కడైనా కొని సౌరయంత్రాలను తేవచ్చుకదా అని కొందరు సూచించగా "అడుసు తొక్కనేల-కాలు కడుగనేల" అనేశాడు సుబ్రహ్మణ్యం.
    అ విధంగా సుబ్బాపురం దియాకు దత్తత అయింది.
    సుబ్బాపురానికి  గ్రాంట్సు వచ్చాయి. రోడ్లు వచ్చాయి. బస్సులు పడ్డాయి.
    దత్తాత్రేయులు ఊరికి ఉపకారి. ఈ అవకాశం తీసుకుని ఆయన ఊరికిసదుపాయాలు పెంచాలనుకున్నాడు. ఇంటింటా మంచినీటి కుళాయిలు, ఇంటింటికీ సెప్టికి లెట్రిన్లు వుండాలన్నాడు. అవన్నీ సౌరశక్తితొ నడుస్తాయని  సుబ్రహ్మణ్యం సర్టిపై చేయడంతో అందుకు అడిగినంతా  గ్రాంటు వచ్చింది.
    మోటార్లు సౌరశక్తితొ నడుస్తాయనడానికి నిదర్శనంగా- ఎక్కడా కరెంటు  కనపడుకూడదుకదా! అందుకని అండర్ గ్రౌండ్ వైరింగు చేశారు.
    సౌరశక్తితొ మంచినీటి పథకాన్ని మంత్రివర్యులే ప్రారంభం చేశారు. ఆయన కుళాయివిప్పి ఓ గ్లాసుడు మంచినీళ్ళు పట్టి ఎత్తిపోసుకుని తాగి, "సౌరశక్తి కారణంగా  నీరు కాలుష్యవిహీనమైన అద్బుతమైన రుచిని కలిగివున్నది" అని అభినందించారు.
    సౌరశక్తి యంత్రాలు వచ్చేక ఆ ఊళ్ళో కరెంటు వాడకం పెరిగిందనిస్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు గొడవ పెడుతోంది. పెరిగిందంటే  పెరగదూ మరి!
    ప్రతి ఇంట్లోనూ సౌర యంత్రాలున్నాయి. అవి వంటలు చేస్తాయి.పంఖాలను తిప్పుతాయి. దీపాలను వెలిగిస్తాయి. రిఫ్రిజిరేటర్లను చల్లబరుస్తాయి.
    అవన్నీ కరెంటుతోనే పనిచేస్తాయి కాబట్టి స్దానికులే రిపేర్ చేసుకోగలరు. ఆ కరెంటుకు సౌరశక్తి అని పేరు పెట్టారు కాబట్టి ఎ ఇంటికీ కరెంటు చార్జిలు లేవు.
    సౌరశక్తి ప్రయోగానికి అయిదేళ్ళ గ్రాంటు వుంది.
    ఆ అయిదేళ్ళూ  ఫరవాలేదు. గ్రామస్థులకు ఉచిత సదుపాయాలు. ఆ తర్వాత  ఏం జరుగుతుందో కాలానికే తెలియాలి.
    అందుకే గ్రామస్థులకు సుబ్రహ్మణ్యం అంటే ఇష్టం. తమ ఈ తాత్కాలిక సదుపాయాలను శాశ్వతం చేయమని  అతణ్ణి  వారు కోరుతున్నారు.
    సుబ్రహ్మణ్యం కూడా చాలా ఉత్సాహంగా వున్నాడు.
    రీసెర్చి పేరు చెప్పి గ్రాంట్స్ సంపాదించడం ఇంత సులభమని అతడేన్నడూ అనుకోలేదు. తన సబ్జక్టు బోటనీలో కొట్ట తరహా ప్రయోగాలు చేయడానికి గ్రాంట్స్ కోసం అతడు చేసిన విఫల యత్నాలన్నీ అన్నీ కాదు. ఎవరో సౌర యంత్రాలకు గ్రాంట్స్ కోసం అతడు చేసిన విఫల యత్నాలిన్నీ అనీ కాదు. ఎవరో సౌర యంత్రాలకు గ్రాంట్సు కోసం  అతడు చేసిన  విఫల యథ్నాలిన్నీ అన్నీ కాదు. ఎవరో సౌర యంత్రాలకు గ్రాంట్సున్నాయంటే ప్రయత్నించాడు. కనకవర్షం కురిసింది.
    ప్రొఫెసర్ అజేయ్  ఆదిలో సుబ్రహ్మణ్యాన్నంతగా ప్రోత్సహించలేదు. అతడు  సౌర యంత్రాల ప్రాజెక్టును ప్రపోజ్ చేసినప్పుడూ, సుబ్బాపురాన్ని దత్తత అన్నప్పుడూ కూడా ఆయన అంతంతమాత్రంగానే ఉత్సాహపడ్డాడు.ఆ ప్రాజెక్టు నుంచి కనకవర్షం ఆంభం  కాగానే ఆయనకు దాని ప్రాముఖ్యత తెలియవచ్చింది. ఆయన సుబ్రహ్మణ్యం శక్తిసామర్థ్యాలు గుర్తించి ఆ ప్రాజెక్టు విషయంలో పూర్తి స్వాతంత్ర్యాన్నిచ్చాడు.
    తన ప్రాజెక్టు పేరు చెప్పి సుబ్బాపురం గ్రామస్థులకు ఇన్ని ప్రయోజనాలు సిద్దిస్తాయని  ఆరంభం కాగానే ఆయనకు దాని ప్రాముఖ్యత తెలియవచ్చింది. ఆయన సుబ్రహ్మణ్యనికీ తెలియదు.
    ఇప్పుడతడు సుబ్బాపురం గ్రామస్థులకు  దేవుడు.
    సుబ్బాపురం పొందిన  బహుళ ప్రయోజనాలను చూశాక-కొన్ని ఇతరగ్రామాలు కూడా సౌరయంత్రాల గురించి సుబ్రహ్మణ్యం చుట్టూ తిరుగుతున్నాయి.
    సుబ్రహ్మణ్యానికి పోతురాజు బంధువు. పోతురాజుకు దత్తాత్రేయులు ప్రాణ స్నేహితుడు ఇవి జగద్విదితాలు. అందుకని ఎవరికీ సంబంధంలేని నారాయడు గ్రామంలో సౌరశక్తి ప్రాజెక్టుకు ఆధ్వర్యం వహించాడు.
    ఈ కథంతా విన్న గజపతి ఆశ్చర్యంగా, "ఇదా సౌర యంత్రాల కథ!" అన్నాడు.
    "అర్థంచేసుకున్నారు కదా- ఇక  తమరికి పాత డైరెక్టరుగారి అపహరణకూ. దీనికీ  సంబంధమూ లేదని తెలిసిందికదా" అన్నాడు నారాయడు.
    "అయితే మీరింకా ఓ విషయం చెప్పాలి-వాటాల గురించి!"
    "అదా-అది లూజ్ టాక్ లెండి. ఈ రోజుల్లో ఎక్కడే మంచి పని జరిగినా -వాటాల గురించి  అడగడం రివాజైపోయింది. చివరకు కన్నవారు కూతురి పెళ్ళిచేసినా కూడా" అంటూ నవ్వేశాడు నారాయడు.

 Previous Page Next Page