Read more!

దేవీ త్రిరాత్ర వ్రతం!!

 

దేవీ త్రిరాత్ర వ్రతం!!

 

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ *'దసరా' లేక 'దేవీ నవరాత్రులు'* అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో *చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి.* విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

*దుర్గాష్టమి*

దుర్గాదేవి  లోహుడు  అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు

*మహర్నవమి*

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

*విజయదశమి*

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.  *'శ్రవణా'* నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి *'విజయా'* అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. *'చతుర్వర్గ చింతామణి'* అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే *'విజయం'* అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

*'శమీపూజ'* చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే *'జమ్మిచెట్టు'.* అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న *'అపరాజితా'* దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. 

తెలంగాణా ప్రాంతంలో శమీపూజ అనంతరం పాలపిట్ట ను చూచే ఆచారం కూడా ఉన్నది. 

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , శమీవృక్ష శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లోకం:-  శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ 
  అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

కొన్ని ప్రాంతాలలో పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు
అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. అలాగే పెద్దలకు జమ్మిచెట్టు ఆకులు ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. 

◆ వెంకటేష్ పువ్వాడ