Read more!

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

 

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

 

 

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
                         

సతీదేహ త్యాగము

అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని యిహలోక సంబందము, పరలోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబందములుగ జలసేవ, అన్నసేవ, ఔషధసేవయని యిహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును యిహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గసేవయను మూడును ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.

ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగ యిహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు, విష్ణు, ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు యిష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన యితివృత్తమును వినుము. పార్వతీ! యీ  కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును, ఆనందమును కలిగించును.

పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి "నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను, చంద్రుడు, యింద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు, ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను, పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని యిచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ, భార్యను జూచి భర్త లేచినట్లుగ, సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను, దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు.

కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని, ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే యిట్లనెను. ఓహో! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును, యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును? లోకములు, శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది యితని యైశ్వర్యము. ఇట్టి యీతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. 'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల యితనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు" అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను.

యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.

పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.

యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను.

తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి యిట్లు పలికెను. తండ్రీ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త-లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా? ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి? విధివిధానము వీరికి విముఖమైయున్నదా? అని సతీదేవి పలికెను.

సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను, తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను, శివుని బహువిధముల నిందించెను.

రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి.

వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము