Read more!

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం

 

 

 

తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురం 

 

 

 



    కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
    మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,
    కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్
    వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్
    మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై
    ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్
    ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్
    తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్


భావం :- గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు. 

    అవతారిక :-

 

 

 

 



స్వామిని కీర్తించటానికి వచ్చామని, తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది. ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా, మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గ కౌగలించి పడకనుంచి లేవనీయకయుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడకయుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         

        (కాపిరాగము - ఆదితాళము)

ప..     తగదిది నీకిది తరుణిరొ వినవే!
    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె!

అ..ప.    తగునా? నీ స్వరూప స్వభావమ్ములకు
    మగని విశ్లేషమును సహింపజాలవె!
    దీప కాంతులెల్లెడళ విరియగా
    ఆ పంచగుణముల పడకను శయనించి
    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత
    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె!
    ఓ పద్మాక్షీ! విభుని లేపవే!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్