Read more!

ఉండవల్లి గుహలు

 

ఉండవల్లి గుహలు

 

 

ఉండవల్లి అంటే తెలుగువారందరికీ గుర్తు వచ్చేవి గుహాలయాలు.  వాటిని చూడాలని సరదా పడినా అక్కడేముంది, వెళ్ళటం వేస్ట్ అనే వాళ్ళే ఎక్కువ కావటంతో చాలాకాలం చూడలేక పోయాను.  ఈ మధ్య అలాంటి వాటిని పట్టించుకోకుండా, విజయవాడ రమ్మని ఆహ్వానించిన మా చెల్లెలు విమలకీ, వాళ్ళమ్మాయి నీలిమకీ ముందే కండిషన్ పెట్టాను.  నేను చూడని ఊళ్ళు చూపిస్తానంటేనే వస్తానని.  ఈ మధ్య నా గాలి కొంచెం అందరికీ తగులుతున్నట్లుంది.  వెంటనే ఒప్పుకున్నారు.  పాపం మాట తప్పకుండా 4, 5 ఊళ్ళు చూపించారు.  అందులో ఉండవల్లి కూడా ఒకటి.

మామూలుగా చూసే వాళ్ళకి వీటి కోసం ఇంత దూరం రావాలా అనిపించవచ్చు.  కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు,  దాన్లో దేవతా  ప్రతిమలతోబాటు దాదాపు 20 అడుగుల ఏక శిలా అనంత పద్మనాభస్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతా మూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడ గలిగినవారు అద్భుతం అంటారు.ఒకే పర్వతాన్ని తొలచి 4 అంతస్తులుగా మలచారు ఈ గుహలని. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి.  పైకి వెళ్తున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే వున్నాయి.  కింద అంతస్తులో తాపసులు, భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం వున్నది.  దీని నిర్మాణం అసంపూర్తిగా వున్నది.

 

మొదటి అంతస్తులో నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి వున్నాయి.  స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు వున్నాయి.  రెండవ అతస్తులో 25’  పొడవు 6’  వెడల్పుగలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయనించి వుంటారు.  నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు, పక్కన విష్ణు వాహనమైన గరుక్మంతుడు, తపస్సు చేస్తున్న ఋషులు, ఇంకా అనేక విగ్రహాలున్నాయి.  రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి వుండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత.  ఇక్కడు కొండలో రాతిని మలచి ఈ విగ్రహాన్ని చెక్కారు.  గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం.  వీటిలో విగ్రహాలేమీ వుండవు.

14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7 వ శతాబ్దం నాటి విష్ణుకుండినుల కాలానివనీ, క్రీ.శ. 1343 లో అన్నారెడ్డి కుమారుడు పంచమ రెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చినట్లు తెలుస్తున్నది.  గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు.   పూర్వం ఈ మార్గాలగుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు.   ఇక్కడ వున్న ఒక సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి వుంది.

 

కొంత కాలం క్రితం పురావస్తు శాఖవారు ఈ ప్రాంతంలో త్రవ్వకాలు సాగించినప్పుడు కొన్ని బౌధ్ధమత చిహ్నాలు, శిల్పాలు బయట పడ్డాయి.  దానితో ఒకప్పుడు ఈ కొండపై భాగాన బౌధ్ధారామాలు విలసిల్లాయంటారు.

మార్గం: విజయవాడకి 2 కి.మీ.ల దూరంలో వున్న ఈ గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి – పెనుమాక గ్రామాల మధ్య వున్నాయి.  విజయవాడనుంచి, గుంటూరు నుంచి బస్సు సౌకర్యం వున్నది.  ఆహారం, వసతి విజయవాడ అనుకూలం.

ఇలాంటి అపురూపమైన కళాఖండాలు చరిత్రలో కనుమరుగు కాకుండా కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వానిదీ, ప్రజలదీ.  ప్రభుత్వం ఈ మధ్య కొంత ఆసక్తి చూపించి గుహల చరిత్ర గురించి పర్యాటకులకు తెలిసేటట్లు బోర్డులు పెట్టింది.  నిర్వహణ కూడా కొంత బాగానే వున్నది.  

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)