కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు – 10

 

 

 

కృష్ణా పుష్కరాల సందర్భంగా....కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు – 10
                                                                                              
వేదాద్రి, ముక్త్యాల

 

 

శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం, వేదాద్రి

కృష్ణా నదీ తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి వేదాద్రి.   ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకి సమీపంలో వున్నది.  మిగతా నాలుగూ వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, మంగళగిరి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన ఈ క్షేత్రంలో స్వామి ఆలయం ఎదురుగానే కృష్ణవేణి ప్రవహిస్తూ వుంటుంది.  ఆలయంలోంచే నది దగ్గరకు వెళ్ళటానికి మెట్లు వుంటాయి.  భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి నరసింహ స్వామిని దర్శించి తరిస్తారు. పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిధ్ధికెక్కిన ఈ మహా క్షేత్రంలో స్వామివారు 5 రూపాలలో అవతరించారు.

 

1. శ్రీ జ్వాలా నరసింహస్వామి -- స్వయంభూ -- శిఖర స్ధితి (ఆలయం పక్కనుంచి మెట్లు కనబడతాయి)

2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి -- బ్రహ్మ ప్రతిష్ఠ -- కృష్ణానదిలో (ఆలయంలో నుంచి కూడా చూడవచ్చు)

3. శ్రీ వీర నృసింహ స్వామి -- స్వయంభూ -- గరుడాచలం (ఇక్కడికి 5 కి.మీ.ల దూరంలో)

4. శ్రీ యోగానంద స్వామి – త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించినది --మూలవిరాట్, గర్భాలయం

5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి -- మూలవిరాట్ పీఠం – లోక కళ్యాణార్ధం ప్రతిష్ఠింపబడ్డది.

 

ఈ స్వామిని సేవిస్తే గ్రహబాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయట. గుడిలో స్వామితోబాటు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు వున్నాయి. ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ వుండవు.  బస, భోజనం జగ్గయ్యపేటలో అయితే ఇబ్బందిలేకుండా వుంటుంది. ఇంకొక విషయం. దేవుడికి పూలమాలలు సమర్పించాలనుకుంటే జగ్గయ్యపేటనుంచి తీసుకువెళ్ళండి. అలంకరిస్తారు. గుడి దగ్గర దొరకవు. ఇక్కడ కోతుల బెడద చాలా ఎక్కువ. కవరు కనబడితే పీకేస్తాయి అరటి పళ్ళున్నాయనుకుని.మేము దండలు విడిగా పట్టుకెళ్ళాము.

 

 

శ్రీ కోటి లింగేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల

జగ్గయ్యపేట నుంచి 8 కి.మీ. ల దూరంలో ఉత్తర వాహిని అయిన కృష్ణా నదీ తీరంలో 54 ఎకరాల స్ధలంలో వున్నది ఈ ఆలయం.   ఈ ఆవరణలోవున్న శ్రీ పంచముఖ అమృత లింగేశ్వరస్వామి వారి దేవాలయము సుమారు 55 అడుగుల ఎత్తయిన ఐదు అంతస్తుల విమాన గోపురంతో, 4 ద్వారములతో, 4 ధ్వజస్ధంబములతో అలరారుతోంది. ఏ ద్వారంనుంచయినా స్వామిని దర్శించవచ్చు.   శివాలయానికి ముందు మహా మండపం, అందులో రెండు వైపులా శ్రీ కామాక్షి, విజయ గణపతుల దేవాలయాలున్నాయి. ఇంకా కశ్యప మహర్షి రచించిన కాశ్యప శిల్ప శాస్త్ర ప్రమాణముతో 32 శివ గణ పరివారాలయములు, 27 శివలీల మూర్తులు, 27 శక్తి ఆలయములు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు షట్ గణపతులు, షట్ సుబ్రహ్మణ్యులు వగైరా 108 దేవతా మూర్తులకు గుళ్ళు సిధ్ధమవుతున్నాయి. 

 

 

 ఇవికాక కోటి శివలింగాలని ప్రతిష్ఠిస్తారు. కార్తీక మాసంలో ఒకసారి మేము ఇక్కడ శివ లింగ ప్రతిష్ట చేసి, 108 శివలింగాల దగ్గర దీపారాధన చెయ్యాలనే సంకల్పంతో ఇక్కడ శివ లింగాల దగ్గర  చేశాము. ఈ ఆలయ నిర్మాణం కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని గార్ల శుభ సంకల్పంతో, భద్రాచల వాస్తవ్యులు శ్రీ మందరపు వెకటేశ్వర్లు స్ధపతి ఆధ్వర్యంలో జరుగుతోంది.

 

శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల

ముక్త్యాలలో శ్రీ కోటిలింగశివ క్షేత్రానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది అతి పురాతనమైన శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివలింగం బలి చక్రవర్తిచే ప్రతిష్టింపబడ్డది. పక్కన అమ్మవారి గుళ్ళో శ్రీచక్రంకూడా ప్రతిష్టింపబడివుంది. శివ కేశవులకు బేధం లేదన్నట్లు చెన్న కేశవ స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలోనే వుంది. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని. ఈ క్షేత్రం ఉత్తర కాశీగా పరమ పావన పుణ్య తీర్ధంగా ప్రసిధ్ధికెక్కింది. పలు పురాణాలలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన వున్నది.

 

 

ఈ స్వామిని త్రేతాయుగంలో రామ లక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శింటారుట. ఎఱ్ఱన, శ్రీనాధుడు మొదలగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వారు రాసిన గ్రంధాలలో వున్నది. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటుచేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానంచేసేవారని మార్కండేయ పురాణంలో వున్నది. నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవిట. కృష్ణ ఒడ్డున జంట నందుల విగ్రహాలు వున్నాయి. ఇప్పటికీ నది లోతులో బంగారు శివాలయం వుందని భక్తుల నమ్మకం. ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో వున్న కొండగుహలో తపస్సు చేసేవారుట. అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదిట.

 

 

గుడి తెరచి వుంచు వేళలు ఉదయం 6 గం. ల నుండి మధ్యాహ్నం 12 గం. ల దాకా తిరిగి సాయంత్రం 5 గం. ల నుంచి 8 గం. ల దాకా. మీరు వెళ్ళిన సమయంలో గుడి మూసి వుంటే గుడి మొదట్లో వున్న షాపులో అడగండి. పూజారిగారి ఫోను నెంబరు దొరకవచ్చు. ఆయన ఇల్లు సమీపంలోనే. సరదా వున్న పట్న వాసులు చూడదగ్గ ఇంకో విశేషం బల్లకట్టు. గుడి దగ్గరనుంచి కొంచెం దూరం వుంటుంది. ఈ బల్లకట్టు మీదమనుషులతోపాటు ఒకేసారి మూడు లారీలను ఎక్కించి అవతలి ఒడ్డుకి చేరుస్తారు. కావాలంటే మీరు కూడా మీ వాహనంతో సహా ఆ బల్లకట్టుమీద అవతలి ఒడ్డుకెళ్ళచ్చు.

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి


(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)