Read more!

హనుమంతుని గంధ, సింధూర విశేషం.

 

 

హనుమంతుని గంధ, సింధూర విశేషం

 

శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ  హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడు .

 

 


శ్రీ రామప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని "భక్తా ఆంజనేయా! సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి, జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద  సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం'' అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకొని, నువ్వుల నూనెతో కలిపి, తన ఒళ్లంతా పూసేసుకొన్నాడు. ఇలా చేస్తే  ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి "ప్రభూసీతారామా! చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా?''అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతా రాముడు నవ్వి ఆనందం తో ''హనుమా! ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం భక్తీతో గంధ, సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు.'' అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.

 

 

సింధూరం గురించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలో మొదటిది విజయుని చరిత్రకు సంబంధించినది. ఆ విజయుడే పాండవ మధ్యముడయిన అర్జునుడు. ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యంతో బయల్దేరాడు. దక్షిణ సముద్రాన్ని చేరి, అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసంగా నవ్వాడు. అక్కడే ఉన్న హనుమకు కోపం వచ్చింది ఇద్దరికీ వాగ్వాదం పెరిగింది. ప్రతిజ్ఞలు చేసుకొన్నారు పంతాలకు పోయారు.అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడికి వచ్చాడు. కిరీటి బాణాలతో సేతువును నిర్మించాడు. దాని కింద ఎవ్వరికీ తెలీకుండా కృష్ణుడు తాబేలు రూపంలో ఉండి సేతువు విరిగి పోకుండా కాపాడుతున్నాడు. హనుమ ఒక్క సారి సేతువు పైకెక్కి కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కు తున్నాడు. సేతువు యే మాత్రం వంగకుండా శిధిలం కాకుండా నిలబడి ఉంది హనుమ అంతటి బలాడ్యుని పాద ఘట్టనానికి తట్టుకొని నిలబడింది. ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు. అర్జునుడు విజయగర్వంతో విర్రవీగాడు. కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు. ఒళ్లంతా రక్తం కారుతోంది. పార్థునితోసహా అందరూ భయపడ్డారు. అప్పుడు పరమాత్మ "అర్జునా! ఈ జయం నీది కాదు. ఆంజనేయుడిది. నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే  అది హనుమ ఒక్క లంఘనానికే విరిగి ముక్కలయ్యేది. నీ పరువు కాపాడటానికి నెత్తురువోడేటట్లు శ్రమించాను. బాధ భరించాను. హనుమకు నేను రాముడిగా, కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం.'' అన్నాడు. అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపపడి హనుమను ఆశ్రయించాడు. హనుమ శ్రీ కృష్ణుని శ్రీ రామునిగా గ్రహించి, ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటిని తన శరీరానికి పట్టించుకొన్నాడు, క్షమాపణ కోరాడు. అప్పటి నుండి ఆంజనేయునికి సింధూర పూజ వ్యాప్తిలో ఉందని తెలుస్తోంది. అర్జునుని రథం మీద జెండాపై హనుమ ఉండి మహాభారతయుద్ధంలో ఆతని విజయానికి కారకుడవుతానని అనుగ్రహించాడు. దాన్నే "కపి ధ్వజం'' అంటారు