Read more!

వినాయకుని ఆసనంలో అంతరార్థం

 

వినాయకుని ఆసనంలో అంతరార్థం

 

 

తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడా! ఆయన భంగిమ‌ల‌ను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. అదెలాగంటే...

లలితాసనం:-  చాలా ప్ర‌తిమ‌ల‌లో వినాయ‌కుడు త‌న ఎడ‌మ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కింద‌కి ఉంచి క‌నిపిస్తాడు. దీనినే యోగ‌శాస్త్రంలో ల‌లితాస‌నం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్ర‌తిబింబ‌మైన ల‌లితాదేవి కూడా ఈ ఆస‌నంలోనే క‌నిపిస్తుంది. భార‌తీయ ప్ర‌తిమ‌ల‌లో ఇది కాస్త అరుదైన‌ప్ప‌టికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆస‌నాన్ని సూచిస్తుంటాయి. ఒక ప‌క్క ప్రశాంతంగా ఉంటూనే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే త‌త్వానికి ఈ ఆస‌నాన్ని ప్ర‌తీక‌గా భావిస్తారు. క‌ర్మ‌యోగుల‌కు ఈ రెండూ అవ‌స‌ర‌మే క‌దా! ఒక ప‌క్క జీవితంలో ఎదుర‌య్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మ‌న‌సుని స్థిరంగా నిలుపుకోగ‌ల‌డ‌మే మాన‌వుల‌కి నిజ‌మైన స‌వాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నాన‌ని గ‌ణేశుడు చెప్ప‌క‌నే చెబుతున్నాడ‌న్న‌మాట‌. త‌న‌ను కొలిచే భ‌క్తుల విఘ్నాల‌ను తొల‌గించి వారిని కూడా పరిపూర్ణ‌మైన వ్య‌క్తులుగా తీర్చిదిద్దుతాన‌ని హామీ ఇస్తున్నాడు. అందుక‌నే భ‌క్తులు ఎక్కువ‌గా ల‌లితాస‌నంలో ఉన్న వినాయ‌కునికే పూజ‌లు చేస్తుంటారు.

 

 

అభంగం:- స‌్థిరంగా నిల్చొని ఉన్న గ‌ణ‌ప‌తి రూపాన్ని `అభంగ‌` అంటారు. కాసేపు నిల్చొని ఉంటే `ఇక చాలు కూర్చుందాం` అని ఎవ‌రికైనా అనిపిస్తుంది. కానీ తాను నిల్చొని ఉన్నాన‌న్న బాధ‌ను కూడా జ‌యించి మ‌న‌సుని స్థిరంగా ఉంచుకోగ‌ల‌డ‌డం ఈ భంగిమ‌లోని ప్ర‌త్యేక‌త‌. జైనుల ధ్యాన ప‌ద్ధతుల‌లో ఈ భంగిమ‌ను పోలిన‌ `కాయోత్స‌ర్గ‌`కు గొప్ప ప్రాముఖ్య‌త ఉంది. తాను చూడ‌టానికి భారీకాయంతో ఉన్నా త‌న మ‌న‌స్సు ఆ శారీర‌క ప‌రిమితుల‌కు లోబ‌డ‌ద‌ని గ‌ణేశుడు ఈ భంగిమ‌లో మ‌న‌కి సూచిస్తున్నాడు. త‌న ద‌రికి చేరిన భ‌క్తుల‌కు విజయాన్ని చేకూర్చేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని కూడా ఆ విఘ్న‌నాయ‌కుడు తెలియ‌చేస్తున్నాడు. భ‌క్తుల‌ను కూడా దృఢ‌సంక‌ల్పంతో ఉండ‌మ‌ని ప్రోత్స‌హిస్తున్నాడు. ఈ భంగిమ‌లోని కొద్దిపాటి మార్పులని బ‌ట్టి ద్విభంగ‌, త్రిభంగ భంగిమ‌లు అంటారు.

 

నాట్య గణపతి:- నాట్య భంగిమ‌లో ఉన్న గ‌ణేశుని విగ్ర‌హాలను ఇళ్ల‌లోకి అలంకారంగా ఉంచుకునేందుకు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. త‌న త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టేందుకు గ‌ణేశుడు వారి ముందు నాట్యం చేసేవాడ‌ట‌. ప‌ట్ట‌రాని సంతోషం క‌లిగిన‌ప్పుడు ఎవ‌రికైనా నాట్యం చేయాల‌ని ఉంటుంది. అలా భ‌క్తుల‌కు అంతులేని ఆనందాన్ని అనుగ్ర‌హిస్తాన‌ని ఈ భంగిమ సూచిస్తుంది. మ‌న‌సులోని భావాల‌కు అనుగుణంగా ల‌య‌బ‌ద్ధమైన అడుగులు వేయ‌డం మ‌న భార‌తీయ నాట్య‌శాస్త్రంలోని ప్ర‌త్యేక‌త‌. మ‌నసు, శ‌రీరం రెండూ ఒక‌దానికొక‌టి అనుగుణంగా సాగే ఈ ఆనంద తాండ‌వంలా మ‌న అంద‌రి జీవిత‌మూ హాయిగా సాగిపోవాల‌ని ఆ గ‌ణేశుడు సంక‌ల్పిస్తున్నాడ‌న్న‌మాట‌. మ‌రికొన్ని అరుదైన సంద‌ర్భాల‌లో శ‌య‌న గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలు కూడా పూజ‌లందుకుంటూ ఉంటాయి. భంగిమ ఏదైనా త‌న భ‌క్తులకు స‌క‌ల విజ‌యాల‌నూ క‌లిగించ‌డ‌మే ఆ విఘ్న‌నాయ‌కుని ల‌క్ష్యం! ఆయ‌న‌ను కొలుచుకుని కోరుకున్న విజ‌యాల‌ను చేరుకోవ‌డం భ‌క్తుల‌కు నిత్యానుభ‌వం!

- నిర్జ‌ర‌.