వావి వరసలు లేకుండా ఫోన్లు ట్యాప్‌ చేశారు : బండి సంజయ్

  హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు.  ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు.  పార్టీ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో తాను మాట్లాడిన అన్ని కాల్స్ ట్యాప్ చేశారని వివరించారు. టీబీజేపీ చీఫ్‌గా ఉన్న సమయంలో తన చుట్టూ నిఘా పెట్టారని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ కేసు విచారణ చేస్తున్న జడ్జి ఫ్యోన్ కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. గతంలో ఖమ్మం ఎంపీ దగ్గర పట్టుబడిన రూ.7 కోట్లు ఏమయ్యాయి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దొరికిన నగదంతా కేసీఆర్‌ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు.  ఈ కేసును ఇంకా ఎంత కాలం సాగదీస్తారు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో బండి సంజయ్ మాట్లాడిన డేటాకు సంబంధించిన వివరాలను ఆయనకు సిట్ అధికారులు ఈ సందర్భంగా అందజేశారు.  

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డికి.. 41ఏ నోటీసులు

  తెలుగు దేశం పార్టీ నేత విశ్వనాథరెడ్డిని ఇటీవల ఫోన్‌లో బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి కడప జిల్లా పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. కడప జిల్లా పులివెందుల మండలం చెందిన విశ్వనాథరెడ్డి..తాజగా పులివెందుల టీడీపీ ఇంఛార్జీ బీటెక్‌ రవి సమక్షంలో టీడీపీలో చేరారు.  ఈ నేపథ్యంలో భాస్కర్‌రెడ్డి, శివశింకర్‌రెడ్డి, లోక్ సభ్యుడు అవినాశ్‌రెడ్డి సమక్షంలో పీఏ రాఘవరెడ్డి, అదే గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి తదితరులు తీవ్రస్ధాయిలో బెదిరించినట్లు ఫోన్‌కాల్ డేటా ఆధారాలను విశ్వనాథ్‌రెడ్డి పులివెందుల పోలీసులకు అందజేశారు. వీరందరిపై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అయితే వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, వివేనందరెడ్డి హైదరాబాద్‌లో ఉండాలని కండిషన్ బెయిల్ ఉన్నాందున పులివెందుల పోలీసులు అక్కడికి వెళ్లి 41 ఏ నోటీసులు అందజేశారు.   వివేక హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని మర్డర్ చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు న్యాయపోరాటం చేయాలని  సునీత ఆవేదన వ్యక్తం చేశారు.  

పులివెందుల జడ్పీటీసీ గెలవాలి..కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం

  వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గెలవాలని సంకల్పంతో అందరూ పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన పులివెందులను అభివృద్ధి చేద్దామన్నారు. తెలుగుదేశం హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలకు కాపాడినట్టు గుర్తుచేశారు.  కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. జగన్ కూడా చేయని విధంగా పులివెందులను అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను ఇటు అధికారంలోని కూటమి పార్టీలు, అటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. ఇరు పక్షాలకు చెందిన కీలక నేతలు పులివెందులలో మకాం వేసి హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ టెలికాన్ఫరెన్స్ లో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. 

రాహుల్ కు వంత పాడిన శశిథరూర్.. కమలంతో కటీఫేనా?

ఇటీవలి కాలంలో.. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నుంచి కాంగ్రెస్ కు ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నట్లు కనిపించిన ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆశ్చర్యకరంగా యూటర్న్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ విమర్శలకు వంత పాడారు. రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలూ, వ్యక్తం చేసిన సందేహాలూ చాలా చాలా విలువైనవనీ, వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందేననీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అసలు గత కొంత కాలంగా శిశిథరూర్ కాంగ్రెస్ కు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఆయనను దూరం పెడుతూనే వస్తోంది. మోడీపై ప్రశంసలు గుప్పిస్తూ.. తాను కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న సంకేతాలను పలు సందర్భాలలో శశిథరూర్ ఇచ్చారు. అన్నిటికీ మించి ఆపరేషన్ సిందూర్ కు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు విదేశాలకు వెళ్లిన బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక భూమిక పోషించారు. ఆయన పేరుకే కాంగ్రెస్.. కానీ మనిషి, మనసు మొత్తం బీజేపీయే అని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. శశిథరూర్ తీరు, వ్యవహార శైలీ కూడా కమలం కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా కనిపించింది. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ శశిథరూర్ కు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోవడానికి కారణం.. ఆయన పార్టీ విధానానికి అనుగుణంగా బీజేపీ తీరును ఎండగడుతూ ప్రసింగించాలన్న కాంగెస్ హైకమాండ్ సూచనకు అంగీకరించలేదనీ, తాను పార్టీలకు కాకుండా, భారత్ ప్రయోజనాలకు అనుగుణంగానే మాట్లాడతానని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ఇందుకే పార్లమెంటులో సిందూర్ పై చర్చలో శశిథరూర్ కు కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు. అటువంటి శశిథరూర్ ఇప్పుడు  రాహుల్ కు మద్దతుగా గళమెత్తడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది. బీజేపీతో సయోధ్య కోసం శశిథరూర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా అన్న చర్చకు తెరలేచింది.  2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ప్రజలను, ప్రజా తీర్పును మోసం చేశాయంటే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను శశిథరూర్ బలంగా సమర్ధించారు.  ఈ మేరకు శశి థరూర్  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టు రాజకీయంగా అత్యంత ప్రాథాన్యత సంతరించుకుంది.  రాహుల్ లేవనెత్తిన  ప్రశ్నలు చాలా తీవ్రమైనవని శశిథరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా వీటిని పరిష్క రించి తీరాలని డిమాండ్ చేశారు.  భారత ప్రజాస్వామ్యం చాలా విలువైనదనీ,  దాని విశ్వస నీయతను అసమర్థత, నిర్లక్ష్యం  ద్వారా నాశనం కానివ్వకూడదని ఈసీపై విమర్శలు గుప్పిం చారు.  రాహుల్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఆయన ఈసీని డిమాండ్ చేశారు.  

సిట్ పై నమ్మకం లేదు.. బండి సంజయ్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పై తమకు ఇసుమంతైనా నమ్మకం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే కేసులో శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ముందు హాజరు కావడానికి ముందు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం (ఆగస్టు 7) బండి సంజయ్ తో కేంద్ర హోంశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత బండి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  కాగా సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు ఆయన ఆయన ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందజేస్తానన్న ఆయన  బీఆర్ఎస్  హయాంలో తన ఫోన్‌నే ఎక్కువగా ట్యాప్ చేశారన్నారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ కేసులో కీలక ఆధారాలు ఉన్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య దోస్తీ కారణంగా  కేసీఆర్ కుటుంబంలో  ఏ ఒక్కరినీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. అందుకే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదనీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

ట్రంప్ కు మోడీ షాక్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు

 ట్రంప్ టారిఫ్ వార్ కు ఇండియా దీటుగా బదులిచ్చింది. ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేయడానికి ప్రతిగా ఇండియా  బోయింగ్ పీ81 విమానాల కొనుగోలు ఒప్పందం నంచి వైదొలగింది.  సముద్ర గస్తీ విమానాలను కొనుగోలుకు సంబంధించి 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసింది. వాస్తవానికి ఈ ఒప్పందం 2021లో  జరిగింది. ఆరు పీ81 జెట్‌ల  కొనుగోలు కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ అప్పట్లో  2.42 బిలియన్ డాలర్లు.  అయితే ఆ తరువాత దీనిని సవరించి   3.6 బిలియ డాలర్లకు  పెంచారు. ఇప్పుడా ఒప్పందం నుంచి భారత్ వైదొలగింది. 

విశాఖ సాగర తీరంలో ఏపీఎల్ సందడి!

ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ భారత్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఏపీఎల్ సమారానికి తెరలేచింది. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4  శుక్రవారం (ఆగస్టు 8) సాయంత్రం  నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడా వేడుకలు క్రీడాభిమానులను అలరించనున్నాయి. యువ క్రికెటర్లకు వేదికగా, ప్రతిభకు నిలయంగా నిలిచిన ఏపీఎల్ ఈసారి మరింత రసవత్తరంగా ఉత్సాహభరితంగా సాగనుంది. ఈ సీజన్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. మొత్తం పాతిక మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో  21 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లే-ఆఫ్‌లు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. హీరో వెంకటేష్ ఈ సీజన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ప్రత్యేక లైవ్ ప్రదర్శనలతో ఈ వేడుకలు  సందడిగా మారనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో విజయవాడ సన్‌ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, భీమవరం బుల్స్ వంటి జట్లు కూడా బరిలో ఉన్నాయి. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రేక్షకులకు ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పించారు. స్టేడియం గేట్ నెంబర్ 15 నుంచి ప్రవేశం ఉంటుంది. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. విజేత జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.20 లక్షలు బహుమతిగా అందనున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

బనకచర్ల ప్రాజెక్టుపై  12 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు  కేంద్రం ప్రకటించింది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమ అవసరాలకు వాడుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వినియోగానికి సంబంధించిన తగాదాపు పరిష్కరించేందుకు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిపుణుల కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. అలాగే కేంద్రం ఇద్దరు నిపుణులను నామినేట్ చేస్తుంది. ఈ కమిటీ కోసం సభ్యుల పేర్లను పంపాలని కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలనవరుల శాఖ కోరింది.    బనకచర్లపై జూన్ 16న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో  జరిగిన సమావేశంలో  ప్రాజెక్టుపై విభేదాల పరిష్కారంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటోందని ఏపీ వాదించింది. అయితే  తెలంగాణ మాత్రం  తమ రాష్ట్రం నీటి వనరు లను కోల్పోతుందని గట్టిగా వాదించింది. బనకచర్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాజీ రాజకీయ గురువు  చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించడంతో బనకచర్లపై పీటముడి పడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఉద్రిక్తతలూ పెరిగాయి. వాస్తవానికి బనకచర్ల  రాయలసీమలో కరవును పరిష్కారానికి దోహద పడుతుందనీ, తెలంగాణ ప్రయోజనాలకు ఇసుమంతైనా నష్టం వాటిల్లదని ఏపీ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్లపై ప్రతిష్ఠంభన తొలగించే ఉద్దేశంతో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.  

వైఎస్ వారసత్వం అంటే ఒక కులంపై వేధింపులు.. సాధింపులేనా?

ఇరవై ఏళ్ల యుద్ధానికి తెరపడింది. ఇది చూడడానికి ఒక సంస్థపై యుద్ధమే అయినా, దీని వెనుక రాజకీయం, కులం కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగే ఒక వ్యక్తి, ఒక పత్రికపై పరోక్షంగా, ప్రత్యక్షంగా జరిగిన దాడి.  రాష్ట్రంలో  విపరీతమైన ప్రజాభిమానం, విశ్వాసం ఉన్న పత్రిక, దానిని నిర్వహిస్తున్న యజమాని రామోజీరావుగారి మీద జరిగిన కక్షసాధింపు చర్య. సామాన్య, మధ్యతరగతి ప్రజల విశ్వాసం చూరగొన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో  ఫిర్యాదులు చేయించి, ప్రభుత్వం చేత కేసులు వేయించారు. దేశంలో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు, డొల్ల కంపెనీలు నడుస్తుంటే, ఈ సంస్థపైనే కేసు వేయడానికి కారణం రాజకీయమే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్న సామాజికవర్గాన్ని, దానికి మూలస్తంభం లాంటి  వ్యక్తి ఆర్థిక మూలాలు దెబ్బకొడితే రాష్ట్రంలో తనకు ఎదురు ఉండదని భావించారేమో! 2006లోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేత రిజర్వ్ బ్యాంకుకు, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంకు ఫిర్యాదు చేయించారు. 2008లో  రాష్ట్రప్రభుత్వమే కేసు కట్టింది.   వేలాది మంది డిపాజిటర్లలో ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. పరోక్షంగా కొందరిపై ఒత్తడి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అదీ ఆ కంపెనీపై ఉన్న విశ్వసనీయత. అయినా ప్రభుత్వమే కేసు వేయడంతో.. ఈ వ్యాపారాన్ని ఉపసంహరించుకోదలచిన మార్గదర్శి, డిపాజిట్ దారులకు వారి నగదు వాపసు చేయడానికి సిద్ధమైంది. అయితే ఆ ప్రయత్నంలోనూ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. రామోజీ గ్రూపు సంస్థల నిధులు సేకరించడానికి కొన్ని యూనిట్లు విక్రయానికి పెట్టినా.. బ్లాక్ స్టోన్ వంటి కంపెనీని బెదరించి వెనక్కుపోయేలా చేసింది రాజకీయమే. నిమేష్ కంపానీని కూడా అలాగే కేసులు పెట్టి బెదరించే పరిస్థితి రావడంతో, ఆయన అమెరికా వెళ్లి, అక్కడ నుంచి రిలయెన్స్ ద్వారా  రామోజీ గ్రూప్ సంస్థలకు నిధులు సమకూర్చారు.  అయితే డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం కక్ష గట్టి, ఆఫీసులోని చెక్కుబుక్కులు, రశీదు పుస్తకాలతో సహా మొత్తం డాక్యుమెంట్లన్నీ ట్రక్కుల కొద్దీ అప్పటి సీఐడీ అధికారుల చేత దాటవేయించారు. ఈ చర్య డిపాజిటర్లకి నష్టం అని ఆలోచన లేకుండా వైఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేసు కొట్టివేసినా, మళ్లీ సుప్రీంలో కేసు వేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది.  తాజాగా ఈ కేసును కొట్టివేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఎక్కడైనా డిపాజిటర్లు కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు.  కానీ మార్గదర్శి విషయంలో డిపాజిటర్లు కంపెనీ కోసం అనుకూలంగా ఉద్యమించారు.  రాజశేఖరరెడ్డి శకం ముగిశాక, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా అదే ఒరవడిలో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో చట్టబద్ధత లేని చిట్ ఫండ్ కంపెనీల జోలికి పోకుండా, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసులు పెట్టించి, ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆ కంపెనీ వ్యాపారాన్ని స్తంభింపచేశారు.  రిజిష్ట్రార్ లను ఆఫీసులపైకి  తనిఖీలకు పంపి, వారి చేత కేసులు పెట్టించి, సీఐడీ ద్వారా దర్యాప్తు పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ముగ్గరు మార్గదర్శి మేనేజర్లను, ఒక ఆడిటర్ ను అరెస్టు చేసి హడావుడి చేశారు. చివరకు హైదరాబాద్ లో వృద్ధాప్యంతో మంచం మీద ఉన్న రామోజీరావుగారిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటి చుట్టూ పోలీసుల్ని మోహరించారు. అయితే సకాలంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి, అండగా నిలిచింది.  ఒక్క రోజైనా ఆయన్ను జైలులో పెట్టాలన్న జగన్ సంకల్పానికి బ్రేక్ పడింది. అవినీతి కేసులో జైలుకెళ్ళిన జగన్, ప్రత్యర్థుల్ని జైలులో పెడితేగానీ, తన ప్రతిష్టకు కలిగిన భంగం తొలుగుతుందనుకున్నారేమో మొత్తానికి ఆయన దుందుడుకు చర్యలకు వెంటనే వచ్చిన ఎన్నికల్లో ఓటమే ఆయన్ని కట్టడి చేసింది.  మొత్తం మార్గదర్శిపైనా, రామోజీరావుగారిపైనా జరిగిన ఈ వేధింపులు , కేవలం ఒక సామాజికవర్గంపైనా, ప్రత్యర్థి తెలుగుదేశంపైనా జరిగిన రాజకీయ కక్ష సాధింపుగానే సాధారణ ప్రజలు సైతం అర్ధం చేసుకున్నారు. రాజకీయాల్లో అధికారాన్ని వారసత్వంగా కోరుకోవడం సహజం. కానీ తెలుగు రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు వారసత్వం కావడం దురదృష్టకరం.

ఎన్నికల సంఘంపై విమర్శలు.. రాహుల్ తో గొంతు కలిపిన ప్రశాంత్ కిశోర్

ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్న.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమై ఎదురీదుతున్నారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వత్తాసుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత ఎన్నికల కమిషన్ పై ఆటంబాంబు లాంటి ఆరోపణతో విరుచుకుపడుతున్న సమయంలోనే ఆయన అభిప్రాయాలకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేస్తున్నారు.  ప్రజలకు భారత ఎన్నికల సంఘంపై నమ్మకం పూర్తిగా పోయిందని ప్రశాంత్ కిశోర్ తాజాగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పారదర్శకత, పనితీరు, సమర్థత విషయంలో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని అనడమే కాకుండా ఇది చాలా ఆందోళనకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ మాటలను ప్రస్తావించారు. వాటినే మరోమారు వల్లె వేశారు.  ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలనే ప్రశాంత్ కిశోర్ అఅలియాస్ పీకే  చేశారు.  బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను గాంధీ తీవ్రంగా విమర్శించారు, దీని ద్వారా దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఆరోపించిన రాహుల్ గాంధీ, అదుకు సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు బీహాఆర్ లో  ఒకే నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు గల్లంతయ్యాయనీ ఆయన తాజా ఓటరు జాబితాను ప్రదర్శించారు.  ముస్లిం , వలసదారులకు బీహార్ లో ఓటు హక్కు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేశారు. అదే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనీ, ఇది ప్రజాస్వామ్యం ఉనికికే పెనుముప్పు అని పీకే ఆందోళన వ్యక్తం చేశారు.  ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల  పట్ల ఒక విఆధంగా, అధికార పక్షం విషయంలో మరో విధంగా వ్యవహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఇటువంటి చర్యలే ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ప్రశాంత్ కిశోర్ అన్నారు.  

వివేకా హత్యను గుర్తు తెచ్చేలా పులివెందులలో పరిస్థితులు.. సునీత

వివేకా హత్య సీబీఐ దర్యాప్తు ముగిసిందంటూ సీబీఐ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉంది. అలాగే  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జగన్ సొంత నియోజకవర్గంలో రాజకీయం వేడి పెరిగింది.  ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప ఎస్పీతో భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో  గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. తన తండ్రి వివేకా హత్య గుర్తుకు వస్తోందన్నారు. ఈ సందర్భంగానే ఆమె గతంలో తన తండ్రి హత్యకు  ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవిలే కారణమంటూ సంతకం చేయాలంటూ అప్పట్లో తన దగ్గరకు ఒక లేఖ తీసుకుని వచ్చారనీ, కానీ తాను ఆ లేఖపై సంతకం చేయలేదనీ గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సునీత ఎస్పీకీ తెలిపారు. అలాగే.. తన తండ్రి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంటే.. గుండెపోటు అని చెప్పారనీ, ఆ తరువాత తెలుగుదేశం నేతల హత్య చేశారంటూ కథనాలు వండివార్చారనీ, స్థానిక పోలీసులను బెదరించి క్రైమ్ సీన్ ను ట్యాంపర్ చేసి మార్చేశారనీ సునీత పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు పులివెందులలో నాటి పరిస్థితులు గుర్తుకు తెచ్చేలా వాతావరణం ఉందని ఎస్పీకి సునీత చెప్పారు.  తన బంధువు బంధువు సురేష్ పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి  చేశారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా తన తండ్రి వివేకా హత్య కేసు విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాననీ.. , ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  తప్పు చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

భారత్ అంటే ట్రంప్ కు కడుపుమంట ఎందుకో తెలుసా?

అజిత్ ధోవ‌ల్ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా తెలిసిన వార్త ఏంటంటే పుతిన్ భార‌త్ ప‌ర్య‌ట‌న త్వ‌ర‌లో ఖ‌రారు కానుంద‌ని. ఇదిలా ఉంటే,  మోడీ ఐదేళ్ల త‌ర్వాత చైనా ప‌ర్య‌టించ‌నున్నారు.   ఈ రెండు వార్త‌లూ వేర్వేరే అయినా.. ట్రంప్ మాత్రం ఈ ముగ్గురూ క‌ల‌సి ఏదైనా చేస్తారా? అన్న టెన్ష‌న్ తో అల్లాడుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆయ‌న భార‌త్ పై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్ప‌టికే  50 శాతం సుంకాలు పెంచిన ట్రంప్ ఆపై అంత‌క‌న్నా మించి ఉండొచ్చ‌ని హెచ్చ‌రిస్తున్నారు. భార‌త్- అమెరికా, భార‌త్- ర‌ష్యా వీటి మ‌ధ్య గ‌ల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఎంత‌న్న‌ది కూడా ఈ పరిస్థితుల్లో  ఒక చ‌ర్చ‌గా మారింది. ఆపై భార‌త్- ర‌ష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయ‌కుంటే వ‌చ్చే లాభ‌మేంటి? వాటిల్లే న‌ష్ట‌మేంట‌న్న ప్ర‌శ్న‌తెరమీదకు వస్తోంది. ఎవ‌రు అవున‌న్నా,  కాద‌న్నా భారత్ ర‌ష్యాక‌న్నా, అమెరికాతోనే  ఎక్కువ వ్యాపారం చేస్తున్నది. భార‌త్, యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 130 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైమాట‌. ఇక భార‌త్, ర‌ష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ  68 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మేన‌ట‌. ఇందులో మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే, అమెరికాకు భార‌త్ 86 బిలియ‌న్ డాల‌ర్ల ఎగుమ‌తులు చేస్తుంది.. అదే  అమెరికా భార‌త్ కి కేవ‌లం 45 బిలియ‌న్ డాల‌ర్ల ఎగుమ‌తి మాత్ర‌మే చేస్తుంది. ఇదిలా ఉంటే ర‌ష్యా నుంచి మ‌నం ఏటా 9 నుంచి 11 మిలియ‌న్  బేర‌ళ్ల ఆయిల్ గానీ కొన‌కుంటే..  96 వేల కోట్ల మేర న‌ష్టం వాటిల్లుతుంది.  2022 నాటి ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం వ‌ర‌కూ భార‌త్ ర‌ష్యా నుంచి 0. 2 శాతం మాత్ర‌మే ఆయిల్ కొనుగోలు చేసేది. అదే ర‌ష్యా నాటో దేశాల నుంచి ఆంక్ష‌లు ఎదుర్కొనడం మొద‌ల‌య్యాక‌  విప‌రీత‌మైన రాయితీల‌ను ఇచ్చింది. ఈ రాయితీల‌ కారణంగానే భార‌త్ ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు పెంచింది.  ఇప్పుడా  కొనుగోళ్లు  35 నుంచి 40 శాతానికి చేరాయి. ఒక వేళ మూడో అతి పెద్ద చ‌మురు దిగుమ‌తి దారైన భార‌త్ గానీ అంత‌మేర ఆయిల్ ర‌ష్యా నుంచి కొనకుంటే ఆ మొత్తం ఇత‌ర దేశాల మీద ఆధార‌ప‌డ్డం వ‌ల్ల‌.. డిమాండ్ పెరిగి ప్ర‌పంచ వ్యాప్తంగా అమాంతంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగే ప్ర‌మాద‌ముంది. ఇదెంత  విడ‌మ‌ర‌చి చెప్పినా అమెరికాకి అర్ధం కావ‌డం లేదు. అలాగ‌ని మీరు ర‌ష్యా నుంచి ఎలాంటి దిగుమ‌తులు చేసుకోవ‌డం లేదాని ట్రంప్ ని ఆయ‌న వైట్ హౌస్ లోనే అడిగేశారు మీడియా వాళ్లు. ఆ విష‌యం తనకు తెలీద‌న్నారాయ‌న‌.  నిజానికి యూఎస్ ర‌ష్యా నుంచి ఎరువులు యురేనియం వంటి వాటిని 24 బిలియ‌న్ డాల‌ర్ల మేర దిగుమ‌తి చేసుకుంటుంది. నిక్కీ హేలి వంటి వారు మ‌రో ప్ర‌శ్న కూడా సంధించారు.. మ‌రి చైనా మాత్రం భార‌త్ క‌న్నా ఎక్కువ‌గా ర‌ష్యా నుంచి చ‌మురు దిగుమ‌తి చేసుకోవ‌డం లేదా? అని నిల‌దీశారు. మ‌రో విచిత్ర‌మేంటంటే చైనాక‌న్నా భార‌త్ పైనే ట్రంప్ సుంకాలు ఎక్కువ‌గా విధించారు.  ట్రంప్ కి భార‌త్ అంటే ఎందుకంత క‌డుపు మంట అంటే.. ఆయ‌నకి నోబుల్ శాంతి బ‌హుమ‌తి ప్ర‌తిపాద‌న పాక్ చేయ‌గా.. భార‌త్ మాత్రం స‌సేమిరా అంది. దానికి తోడు మా పాల‌న వైట్ హౌస్ నుంచి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ర‌గ‌దు. కావాలంటే పాకిస్తాన్ ని అక్క‌డి నుంచి పాలించుకోవ‌చ్చ‌ని భార‌త్ తెగేసి చెప్పింది.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భార‌త్, యూఎస్ సంబంధాలు మెరుగుప‌డే దారేది? అంటే అందుకు త‌గిన స‌మాధానం దొర‌క‌డం లేదు. ర‌ష్యా నుంచి ఆయిల్ కొన‌డం మాత్ర‌మే ట్రంప్ అభ్యంత‌రం కాదు. ర‌ష్యా, చైనాతో స‌మానంగా భార‌త్ అంత‌కంత‌కూ ఎదుగుతోంది. ఈ మూడు బ్రిక్స్ దేశాలూ క‌లిస్తే ఎక్క‌డ త‌మ అగ్ర నాయ‌క‌త్వానికి ముప్పు ఏర్ప‌డుతుందో అన్న ఆందోళ‌న కార‌ణంగా ట్రంప్ ఇలా భార‌త్ అంటేనే సుంకాల‌తో విరుచుకుప‌డుతున్నార‌ని.. వారికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థ‌లు ఉద్యోగాలు ఇవ్వ‌రాద‌ని అంటున్నార‌ని అంటున్నారు అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు. మ‌రి చూడాలి... ఈ సుంకాల యుద్ధం క్లైమాక్స్ ఎలా ఉంటుందో?  

కృష్ణాన‌గ‌రే మామా!..సినిమా కష్టాల వెత!

తెలుగు సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాతలు! సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాత‌లు అస‌లు గొడ‌వేంటి? పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ  నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ వీరిక‌స‌లు టాలెంటే లేదు. ఐనా ఐటీ ఎంప్లాయిస్కి ఇచ్చే దానిక‌న్నా భారీ వేత‌నాల‌ను ఇస్తున్నామ‌ని అంటున్నారు. మ‌రో ప‌క్క చూస్తే మూడేళ్లు అయ్యింది.  మా వేత‌నాలు పెంచి..  30 శాతం పెంచ‌ండని డిమాండ్ చేస్తున్నారు తెలుగు సినీ కార్మికులు. అయితే యూనియ‌న్ల అక్ర‌మాలు, అవినీతి కార‌ణంగా సినిమా ఫీల్డ్ లోకి నైపుణ్యం గ‌ల వారు రావ‌డం లేదంటూ,  అందుకు ఉదాహ‌ర‌ణగా  డ్యాన్స‌ర్ల వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తెచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. యూనియ‌న్లు ఒక్కో కార్డు కోసం ల‌క్ష‌లాది రూపాయ‌ల మేర డ‌బ్బు వ‌సూలు చేస్తున్నార‌నీ.. మాలాంటి వారు సిఫార్సు చేసినా కార్డు ఇవ్వ‌డం లేద‌నీ.. దీంతో వారికి తెలిసిన వారినే వెంట తెస్తూ.. ఆపై నైపుణ్యం లేని వారిని సినిమా ఫీల్డ్ లోకి తెస్తున్నార‌ని ఆరోపించారాయ‌న‌. దీంతో తాము   డాన్స‌ర్ల‌ను తేవ‌ల్సి వ‌స్తోంద‌నీ, దీంతో  ఖ‌ర్చు త‌డిసి మోపెడౌతోందపీ అంటున్నారు  నిర్మాత విశ్వ ప్ర‌సాద్. ఆ మాట‌కొస్తే ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మ‌మాల పుట్ట అని తానెప్పుడో  చెప్పానని ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాననీ చెబుతున్నారు.  త‌మ‌కంత టాలెంట్ లేకుంటే ఏడు జాతీయ అవార్డులు ఎలా వ‌స్తాయంటారు సినీ కార్మిక సంఘం అధ్య‌క్షుడు అమ్మిరాజు. ఇక బాహుబ‌లి నుంచి పుష్ప వ‌ర‌కూ తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయ స్తాయికి చేరింది, మ‌రి ఇదెలా సాధ్య‌మైంది? మొన్నామ‌ధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌  ఆస్కార్ సాధించింది. ఇందులో ఉన్న‌దంతా తెలుగు వారి ప్ర‌తిభా పాట‌వాలే. అలాగే  మ‌న త‌గ్గేదేలే, బ్రో ఐ డోంట్ కేర్ వంటి మేన‌రిజ‌మ్స్.. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి కదా.. మ‌న పాట‌లు, మాట‌లు వ‌ర‌ల్డ్ వైడ్ ఆడియ‌న్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి..  ఇదంతా తెలుగు వారి ప్ర‌తిభ కాదా?  అని నిల‌దీస్తున్నారు సినీ కార్మికులు. ఒక‌రైతే విశ్వ ప్ర‌సాద్ గారూ మీరు నిర్మాణ సంస్థ  స్థాపించి ఇన్నేళ్ల‌య్యింది. 17 సినిమాల వ‌ర‌కూ తీశారు. అందులో ఓ మూడు నాలుగు త‌ప్ప ఏవైనా పెద్ద‌గా ఆడాయా? మ‌రి  మీకంత టాలెంట్ ఉంది క‌దా? ఎందుకు సాధ్యం కాలేద‌ని నిల‌దీశారు. ఇదంతా అలా ఉంచితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చిన్న సినిమా  నిర్మాత‌లైతే ఇప్పుడిస్తున్న వేత‌నాల్లోంచి 25 శాతం వారే త‌గ్గించుకోవాల‌ని అంటారు. ఆల్రెడీ కార్డున్న వాళ్లే కాదు లేని వాళ్లు కూడా ఫీల్డ్ లోకి వ‌చ్చేలాంటి స్ట్ర‌క్చ‌ర్ రావాల‌ని విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లంద‌రి త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తుంటే.. చిన్న సినిమా నిర్మాత‌ల  త‌ర‌ఫున సీ క‌ళ్యాణ్ వ‌చ్చి ఈ బాంబు పేల్చారు. కొంద‌రు నిర్మాత‌లైతే.. 10 శాతం మేర అయితే పెంచ‌గ‌లంగానీ.. ఇంత పెద్ద మొత్తం త‌మ వ‌ల్ల కాదంటున్నారు. ఫైన‌ల్ గా నిర్మాత‌లు వ‌ర్సెస్ కార్మికుల వ్య‌వ‌హారంలో అస‌లు పేచీ ఎక్క‌డ‌ అని చూస్తే... వారేమో వెంట‌నే 30 శాతం వేత‌నాలు పెంచాల‌ని కోరుతుంటే.. వీరేమో.. మాకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి.. ఇక్క‌డ స‌రైన నిపుణులు లేన‌పుడు బ‌య‌ట రాష్ట్రాల నుంచి టెక్నీషియ‌న్ల‌ను తెప్పించుకునే వెస‌లుబాటు క‌ల్పించాలి. షూటింగ్ ఎక్క‌డ జ‌రిగినా రేషియో అనేది ఉండ‌కూడ‌దు. సెకండ్ సండే, ఫెస్టివ‌ల్స్ లో వ‌ర్క్ కి మాత్ర‌మే డ‌బుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్.. ఈ నాలుగు ప్ర‌తిపాద‌న‌లపై ఫెడ‌రేష‌న్ నిర్ణ‌యం చెబితే.. అప్పుడు వేత‌నాల పెంపు గురించి ఆలోచిస్తామ‌ని అంటున్నారు నిర్మాత‌లు. ఇప్పుడు మ‌రో చ‌ర్చ‌కు కూడా తెర‌లేచింది.. చిరంజీవి, బాల‌కృష్ణ వీరెవ‌రిలో ఇండ‌స్ట్రీ పెద్ద అయ్యే అవ‌కాశ‌ముంద‌న్న చ‌ర్చ‌ సైతం జ‌రుగుతోంది. చిరంజీవి అనేదాన్నిబ‌ట్టీ చూస్తే ఇది నిర్మాత‌లు, కార్మికుల స‌మ‌స్య‌... కాబ‌ట్టి వారే తీర్చుకోవాల‌ని అంటే..  బాల‌కృష్ణ మాత్రం ఇటు నిర్మాతలు,  అటు కార్మికులు ఇద్ద‌రికీ న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. మ‌రి వీరిలో పెద్ద కాద‌గిన అర్హ‌త ఎవ‌రికుంది? అన్న‌దొక స‌స్పెన్స్ గా మారింది. చూడాలి.. ఈ కృష్ణాన‌గ‌ర్ సినిమా క‌ష్టాల వెత ఎక్క‌డి వ‌ర‌కూ వ‌స్తుందో ?

సాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి.

పీ4లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పిలుపు ఎంత సంపాదించినా కలగని తృప్తి మనస్పూర్తిగా సాటి మనిషికి సాయం చేసినప్పుడు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో గురువారం (ఆగస్టు 7)న సమావేశమైన ఆయన పీ4లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  సీఎం పిలుపుతో కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన ఇండస్ట్రియలిస్టులను చంద్రబాబు అభినందించారు. సాయం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం కో స్పాన్సర్ విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.   గతంలో తాను పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరాననీ, ఇప్పుడు పెట్టుబడులతో పాటు  పేదలకు అండగా నిలవాలని కోరుతున్నట్లు చెప్పారు.   సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు చూశాను, చేశాను కానీ,  పీ4   ఇస్తున్న తృప్తి మరేదీ ఇవ్వలేదన్న చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణల ఫలాలను  అందుకుని ఉన్నత స్థాయికి చేరిన వారు.. సమాజంలో అసమానతలను తొలగించే బాధ్యత తీసుకోవాలన్నారు.  చేసే చిన్న సాయం కూడా.. పేదరికంలో ఉన్నవారికి భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వం చేసేది సంక్షేమం అయితే మీరు చేసేది బాధ్యతాయుత సాయం అవుతుందన్నారు. కేవలం పేదలకు అండగా నిలవమని పిలుపునివ్వడంతో సరిపెట్టకుండా.. తాను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ప్రభుత్వ పరంగా పేదల కోసం   పింఛన్లు, తల్లికి వందనం, దీపం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక వేత్తలు కూడా బాధ్యతాయుతంగా అసమానతలను రూపుమాపడానికి కుటుంబాలను దత్తత తీసుకోవాలని, దత్తత కుటుంబాలలో నైపుణ్యాలను పెంచడం ద్వారా  వారి ఆదాయం రెట్టింపు అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. సీఎం పిలుపునకు పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. అదే విధంగా పలువురు ఎన్నారైలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారు.  

నేడు సిట్ ఎదుటకు కేంద్ర మంత్రి బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8)  ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ఎదుట హాజరు కానున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులనే కాకుండా, బాధితులను కూడా విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకుంటున్న సిట్ అందులో భాగంగానే బండి సంజయ్ కూ నోటీసులు పంపింది. ఆ నోటీసుల మేరకు  వాంగ్మూలం ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ఎదుట హాజరుకానున్నారు.   బీఆర్ఎస్ హయాంలో  తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన సీట్ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ఇక పోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెప్పబడుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నది. ఇందు కోసం కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం నాడు వీరు కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారులతో భేటీ  అయ్యారు. 

విశ్వనగరం కాదు విశ్వనరకం!

విశ్వనగరంగా ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరం గురువారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షానికి విశ్వనరకంగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు నానా యాతనలూ పడ్డారు.   గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీ,  పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ తాలలో వాహనాలు నిలిచిపోయి చీమలబారును తలపించాయి.   ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గురువారం (ఆగస్టు 7) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.3 సెంటీమీటర్లు,  రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 14, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 13.2,  వలిగొండ వెంకటపల్లెలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 12.7 సెంటీమీటర్లు,  సరూర్‌నగర్‌లో 12.8, ఖైరతాబాద్‌లో 12.6, గండిపేటలో 12.2, యూసుఫ్‌గూడలో 12.4 సెంటీటర్లు, అదే విధంగా  ఉప్పల్‌లో 11.7, ఎల్బీనగర్‌లో 11.3,   అమీర్‌పేటలో 11.1, షేక్‌పేటలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. వారాంతాలలో అయితే తిరుమల కొండ భక్త జన సముద్రాన్ని తలపిస్తుంటుంది. శుక్రవారం ( ఆగస్టు 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.  ఇక గురువారం (ఆగస్టు 7) శ్రీవారిని మొత్తం 65 వేల 234 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 133 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.  

హైదరాబాద్‌లో రికార్డు స్ధాయి వర్షం..జనజీవనం అస్తవ్యస్తం

  హైదరాబాద్‌ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టుప్రాంతాల్లో వరదనీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడ్డారు.  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్ పేట్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. బంజారాహిల్స్ లో భారీ వర్షం కురవడంతో దేవరకొండబస్తీ లో సంతలో కూరగాయలు, వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. సైబర్టవర్స్ నుంచి నీరూస్ జంక్షన్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లో వెళ్లే వెహికల్స్కు రోడ్డు బ్లాక్ అయింది. ఇనార్బిట్ మాల్నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్‌తో ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.  బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అయితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం‌.. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, జలమండలి (హైడ్రా) అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లోని ఈ ఫోన్ నెంబర్ 040 2302813 / 7416687878 కి కాల్ చేయాలన్న ప్రజలకు జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అలాగే అధికారులందరూ అందుబాటులో ఉంటూ.. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన గట్టిగా సూచించారు. గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద అత్యధిక వర్షపాతం నమోదైంది. 123.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. ఆ తర్వాత శ్రీనగర్‌ కాలనీలో 111.3 మి.మీ, ఖైరతాబాద్‌లోని సెస్‌ వద్ద 108.5 మి.మీ, యూసఫ్‌గూడ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం సమీపంలో 104.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

  ఏపీలో  ట్రైబల్ శాఖలో  ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) అబ్బవరపు శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్‌సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.