లోకేష్ నీ బాడీని గ్యారేజ్ లో చూపించుకో.. మతిస్థిమితం లేని మంత్రి!!

 

'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.
 
కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు.

అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.

అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ ఆల్ ఫ్రీ సర్వీస్ గా మారనుందా?

త‌మిళ‌నాడులో  ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ పెద్ద యాక్టివ్ గా లేదు.   జ‌య‌ల‌లిత మరణం తరువాత అన్నాడీఎంకేలో  ఆ స్థాయి చ‌రిష్మా గ‌ల నాయ‌క‌త్వం లేదు. జ‌య ఉన్న స‌మ‌యంలో అజిత్ రూపంలో ఒక వార‌స‌త్వాన్ని త‌యారు చేయాల‌ని ఆమె ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో జయలలిత మరణం తరువాత ఆ పార్టీ దాదాపుగా అనాథగా మిగిలిపోయింది.  అయితే ప్ర‌స్తుతం ఈ పార్టీలో ఈపీఎస్, ఓపీఎస్ అంటూ పార్టీపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అదలా ఉంచితే వారిలో  ప‌ళ‌ని  స్వామి నాయ‌క‌త్వంలో ప్ర‌స్తుతం పార్టీ  అంతంత మాత్రంగా ఉందని చెప్పాలి.  కాగా ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నా డీఎంకే వ్యూహాత్మకంగా ఒక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో పురుషులకూ ఫ్రీ బస్ ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. దీంతో   ఫ్రీ  బ‌స్ వ్య‌వ‌హారం  మరో సారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఇప్ప‌టికే  క‌ర్ణాట‌క‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం పథకం అమలులో ఉంది. ఈ పథకాన్ని ప్రకటించిన పార్టీలు ఆయా రాష్ట్రాలలో విజయం సాధించాయి. దీంతో అన్నాడీఎంకే మహిళలకే కాదు, పురుషులకూ ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం పథకాన్ని ప్రకటించి ఎన్నికలలో విజయం కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లు భావిస్తోంది.   వాస్తవంగా చూస్తే తమిళనాట అన్నాడీఎంకేకు గెలుపు అవకాశలు పెద్దగా లేవు.   ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న  డీఎంకే  స్టాలిన్ నాయ‌క‌త్వంలో బ‌లంగా క‌నిపిస్తుండ‌గా,  ఈ మ‌ధ్యే పొలిటికల్ అరంగేట్రం చేసిన నటుడు విజ‌య్ సార‌ధ్యంలోని  త‌మిళ వెట్రి క‌ళ‌గం (టివీకే) ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.  ఈ నేపథ్యంలో పరిశీలకులు పోటీ మొత్తం డీఎంకే, టీవీకే మ‌ధ్యే అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో  సర్వేలు నిర్వహించిన కొన్ని సంస్థలు డీఎంకేకే మళ్లీ అధికారం అని చెబుతున్నాయి.  ఈ క్ర‌మంలో మేము సైతం అంటూ అన్నాడీఎంకే పురుషులకూ ఫ్రీబస్ ప్రయాణం అంటూ సడన్ గా రేసులోకి దూసుకువచ్చిందని అంటున్నారు.   ఇది  చూసి ఇత‌ర రాఫ్ట్రాలలో కూడా  ఆర్టీసీ ఫ్రీ ఫ‌ర్ ఆల్ అనే ప్ర‌చారం మొద‌లు పెట్టినా  ఆశ్చ‌ర్యం లేదంటున్నారు పరిశీలకులు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే రోజుల్లో ఆర్టీసీ బ‌స్సులు ఫ్రీఫర్ ఆల్ అన్నట్లుగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే త‌మిళ‌నాడు ఆర్టీసీ చాలా  యాక్టివ్ గా ఉంటుంది. త‌క్కువ ధ‌ర‌తో ఏ  రాష్ట్ర బ‌స్టాండ్ల‌లో అయినా స‌రే ఆక్యుపెన్సి పెంచుకుంటూ వ‌స్తోంది. సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తుంటారు. వ‌చ్చే రోజుల్లో ఆల్ ఫ్రీ కార‌ణంగా  వారిలో కూడా ఈ పోటీ త‌త్వం న‌శించిపోయేలా  క‌నిపిస్తోంది. మొత్తం మీద  రాజకీయపార్టీలు అధికారం కోసం ఆర్టీసీని ఆల్ ఫ్రీ ట్రావెల్ సర్వీసుగా మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. 

విజయసాయికి ఈడీ నోటీసులు.. జగన్ కు ప్రమాద ఘంటికలేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదులను కదిపే దిశగా సాగుతోందనడానికి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు పంపడమే తార్కాణమంటున్నారు పరిశీలకులు. ఔను మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని ఈ నెల 22న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. అది మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ విజయసాయిని ప్రశ్నించనుంది. ఇప్పటికే ఇదే కేసులో విజయసాయి రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారించింది. ఆ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినది. అయితే ఈడీ మాత్రం కేంద్ర పరిధిలోది. ఇక్కడే అంటే ఈడీ విజయసాయిని మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడమే జగన్ కు ప్రమాదఘంటికలు మోగినట్లేనా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.  ఎందుకంటే సిట్ విచారణ సందర్భంగానే విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఎలా జరిగిందో, వైసీపీలో ఎవరెవరు ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించారో పేర్లతో సహా పూస గుచ్చినట్లు చెప్పేశారు.  అప్పట్లో విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలను వైసీపీయులెవరే కూడా గట్టిగా ఖండించడానికి ముందుకు రాలేదు.  విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు ఇలాంటి కేసుల నుంచి రక్షణ కోసమే ఆ పని చేశారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆయనకు   ఈడీ నోటీస్ అందడం చూస్తుంటే.. కేంద్రం నుంచే ఈ కేసు విషయంలో అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చాలన్న ఒత్తిడి వస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి కాలు బయటకు పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని రప్పారప్పా ఆడిస్తానంటూ విమర్శలు గుప్పించడమే కాదు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వారి మధ్య చర్చ ప్రభుత్వ ప్రగతి, సంక్షేమ పథకాలకు జగన్ అడుగడుగునా అడ్డుపడటంపైనే సాగిందని కూడా అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.  ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో  విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే ఈడీ నోటీస్ పంపడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  విజయసాయికి ఈడీ  నోటీస్ పంపడాన్ని ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా లేదా? అని కనుగొనేందుకు మాత్రమే కాక.. మరేదో కారణం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం.  ఆయన నోట మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు దిశగా కీలక ముందడుగు పడటానికి విజయసాయిరెడ్డి విచారణ కీలకంగా మారనుందన్న అభిప్రాయమూ గట్టిగా వినిపిస్తోంది.  ఏది ఏమైనా విజయసాయికి ఈడీ నోటీసులు జగన్ రెడ్డికి ప్రమాదఘంటికలు మోగడమే అంటున్నారు. 

తమిళనాట కొత్త పొత్తు పొడుపు?

జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు  క‌రూర్  తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.   అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు.   విజ‌య్ పై  వేధింపుల‌కు పాల్ప‌డ్డం అది త‌మిళ సంప్ర‌దాయాల‌ను భంగ‌ప‌ ర‌చ‌డ‌మే  అవుతుంద‌ని రాహుల్ విమర్శించారు.  దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది.  ఇప్పటికే విజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ పార్టీ  ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. త‌మ‌కు డీఎంకేతో స్థానిక రాజ‌కీయ విబేధాలుంటే, కేంద్ర‌ంలోని  బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ స‌డెన్ గా విజ‌య్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది.  తొలి నాళ్ల‌లో త‌మిళ‌నాట‌ కాంగ్రెస్ పార్టీ బ‌లంగానే ఉన్నా.. ఆ త‌ర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్క‌డ అధికారం పాల్పంచుకుంటూ వ‌స్తున్నాయి.  కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ  ఎంతో ఇష్టం. త‌న కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీష్ కూడా ఇలాగే రెండుగా  చీలి.. ఇక్క‌డ అధికారం ఎవ‌రో ఒక‌రు పాల్పంచుకోవాల‌ని ఆశిస్తారాయ‌న‌.  అంత‌గా తమిళనాట స్థానిక రాజ‌కీయాలు గ‌త కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే త‌ర్వాతి త‌రానికి కూడా బ‌లంగా  క‌నిపిస్తున్నా అన్నాడీఏంకేకి జ‌య‌ల‌లిత త‌ర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శ‌శిక‌ళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ  కార‌ణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ  స్థానంలో ఇక్క‌డ బీజేపీ  పాతుకుపోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటే మ‌ధ్య‌లో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్.   టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం.  దానికి తోడు విజ‌య్ కూడా మెర్స‌ల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్య‌తిరేక వాణి వినిపించిన ప‌రిస్థితి గ‌తంలో ఉంది.  వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే పోటీ  చేయ‌నుండ‌టం.. బీజేపీతో ఎలాంటి  పొత్తు ఉండ‌ద‌ని విజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. ఆయ‌న‌ను వీలైనంతగా త‌మ దారిలోకి తెచ్చుకోడానికి  బీజేపీ అగ్రనాయకత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది?  తేలాల్సి ఉంది.

జేపీ, లక్ష్మీనారాయణ బాటలో ఏబీవీ!

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించారు. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.గతంలో అంటే 2014-2019 మధ్య కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ కాలంలో  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించి జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచీ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) వేధింపులను ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది.   అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. క్యాట్, హైకోర్టు,  సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఆయన తిరిగి సర్వీసులో చేరారు. అదీ సరిగ్గా పదవీ విరమణ రోజు.   ఆ తరువాత ఆయన  జగన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.  ప్రెస్ మీట్లు నిర్వహించారు.  డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లలో కూడా చురుగ్గా ఉంటూ.. జగన్ హయాంలో జరిగిన అన్యాయాలూ, అక్రమాలు, ఆర్థిక అవకతవకలను ఎండగట్టారు.   అది పక్కన పెడితే 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత..  ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించింది. ఆయనపై జగన్ సర్కార్ తీసుకున్న క్రమశిక్షణ చర్యలను రద్దు చేసింది. అలాగే..  ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. అయితే తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి  ముందుకు సాగుతాననీ,  పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాననీ కూడా ఏబీవీ చెప్పారు.  అయితే ఇక్కడే ఆయన రాజకీయ అడుగులు ఏ మేరకు సక్సోస్ అవుతాయన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిస్సందేహంగా ఏబీవీ నిజాయితీగల అధికారిగా విధినిర్వహణలో గుర్తింపు పొందారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఆ గుర్తింపు, ఆ అభిమానం ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా లక్ష్యం దిశగా నడిపించేందుకు సరిపోతాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏబీవీలాగే  మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కు కూడా నిజాయతీ పరుడైన అధికారిగా పేరు ఉంది. ఆయన సర్వీసులో ఉండగానే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సొంతంగా పార్టీ పెట్టారు. ఎన్నికల రణరంగంలోకి కూడా దిగారు. కానీ ఒకే ఒక ఎన్నికలో 2014లో ఆయన లోక్ సత్తా పార్టీ తరఫున పోటీ చేసిన అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఆయన ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. అది పక్కన పెడితే.. ఆ తరువాత ఆయనా, ఆయన పార్టీ కూడా క్రియాశీల రాజకీయాలలో పూర్తిగా కనుమరుగయ్యారు. ఇక ఆయన తరువాత  సీబీఐ మాజీ జేడీ  కూడా నిజాయతీగల అధికారిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జయప్రకాశ్ నారాయణ, లక్ష్మీనారాయణలకు ఏబీవీ కంటే ఎక్కువ గుర్తింపే ప్రజలలో ఉంది. అయితే క్రీయాశీల రాజకీయాలలో వారు తేలిపోయారు. ఉనికి మాత్రంగా మిగిలిపోయారు.  ఈ నేపథ్యంలోనే ఏబీవీ రాజకీయపార్టీ అనగానే పరిశీలకులు ఆయన ఏ మేరకు రాణిస్తారు అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే!

తెలంగాణ  మునిసిపల్ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎన్డీయేతో తెలంగాణ ఎన్నికలలో పొత్త ప్రశక్తే లేదని తెలంగాణ బీజేపీ ప్రకటించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    సహజంగానే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ అనగానే బీజేపీతో పొత్తు ఉంటుందని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన బిజెపి, టిడిపిలతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే తెలంగాణలో కూడా అదే కూటమి కొనసాగుతుందని అంతా భావించారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా  పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు. రామచంద్రరావు ప్రకటనకు కొద్ది సేపు ముందే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజకీయవర్గాలలో  పొత్తులపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. అయితే ఎన్డీఏ తరహా కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమనీ, ఇది తెలంగాణలో కొనసాగే అవకాశం లేదనీ రామచంద్రరావు ప్రకటనతో తేటతెల్లమైంది.  ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ వేడి రగులుస్తున్న జలవివాదాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ జలవివాదాల కారణంగానే.. ఆంధ్రప్రదేశ్‌లో   సన్నిహిత సమన్వయం ఉన్నప్పటికీ,  తెలంగాణలో పార్టీల మధ్య పొత్తుకు అవకాశం లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.  ఆ కారణంగానే తెలంగాణలో  బీజేపీ, జనసేన పార్టీలు మునిసిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు.  

అమ‌రావ‌తి విష‌యంలో...జ‌గ‌నాసురుడి అస‌లు స్కెచ్ అదేనా?

  అమ‌రావ‌తి అంటే అర్ధ‌మేంటి? అని చూస్తే అమ‌రులుండే  ప్ర‌దేశం. దీనికి  మ‌ర‌ణం లేదు అని అర్ధం. ఇంకా చెబితే ఇంద్రుడి రాజ్యాన్ని కూడా  అమ‌రావ‌తీ అనే  అంటారు. ఇక బుద్ధుడు కాల‌చ‌క్ర బోధ‌న‌లు చేసిన ప్రాంతం కూడా ఇదే. ఇంత‌టి ఆధ్యాత్మిక‌, చారిత్ర‌క ప్ర‌దేశం కాబ‌ట్టే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి ఈ  పేరు పెట్టారు. ఇంద్రుడి  రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూడా ఎన్నోసార్లు రాక్ష‌సులు దాడులు చేశారు. అప్పుడా దేవ‌త‌లు శ్రీమ‌హావిష్ణువును వేడుకోగా ఆయ‌న ద‌శావ‌తారాల ద్వారా ఈ రాజ‌ధానిని కాపాడిన ఉదంతాలు ఆధ్యాత్మికంగా  కోకొల్ల‌లు.ఆనాడు రాక్ష‌సులు ఎలా అమ‌రావ‌తిని అంతం చేయాల‌ని భావించారో.. ఇప్పుడు కూడా జ‌గ‌నాసురుడి వంటి రాక్ష‌సుల‌ తాకిడి ఎదుర్కుంటూనే ఉందీ రాజ‌ధాని.  తాజాగా  కూడా  రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని  నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి. ఆయ‌న ఇంగ్లీష్ లో చెప్పినా  దాని అర్ధం అమ‌రావ‌తి  నిర్మాణం త‌న‌కు ఇక్క‌డ ఇష్టం లేద‌ని చెప్ప‌డ‌మే. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి మాజీ స‌క‌ల శాఖ‌ల మంత్రి స‌జ్జ‌ల రంగ ప్ర‌వేశం చేసి.. అమ‌రావ‌తి అంటే త‌మ‌కెలాంటి బేధాభిప్రాయాలు లేవ‌ని అన్నారు.  అయితే జ‌గ‌న్ చెప్పిన దానికీ దీనికి  చాలానే తేడా  క‌నిపిస్తోంది. అంటే అధినేత  ఇక్క‌డ అమ‌రావ‌తి నిర్మించ‌డ‌మేంట‌ని అంటే ఇక వెంట‌నే  ఆ అధినేత బంటు వ‌చ్చి తూచ్ అలాంటిదేదీ లేద‌ని చెప్ప‌డంలో ఒక మ్యాజిక్ దాగి ఉంద‌నే చెప్పాల్సి ఉంటుంది. అదెలాంటిదో చూస్తే.. గ‌తంలో నాని, ఆపై జోగి, నేడు స‌జ్జ‌ల వీరంద‌రి చేత అమ‌రావ‌తి అంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పించ‌డం. దీంతో జ‌గ‌న్ పార్టీ అమరావ‌తిపై ఎలాంటి వ్య‌తిరేక‌ఖ‌త లేద‌ని జ‌నం గంపగుత్త‌గా  ఓట్లు వేస్తార‌న్న వ్యూహం ఇందులో దాగి ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇదే అమ‌రావ‌తిపై జ‌గ‌న్ ఇంగ్లీష్ లో  వ‌ద్ద‌ని చెప్ప‌డంలో ఇంకో వ్యూహం దాగి ఉంది.గ‌తంలో అమ‌రావ‌తి అంటే త‌న‌కెలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా తెలుగులో అది  కూడా అసెంబ్లీ వేదిక‌గా చెప్ప‌డం వ‌ల్ల‌.. గ‌త ఐదేళ్ల వైసీపీ  జ‌మానాలో ఎలాంటి న‌ష్టం జ‌రిగిందో తెలిసిందే. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఒప్పుకున్నాడు క‌దా? అనే మాట  ప‌దే ప‌దే వినిపించింది. అదే ఇప్పుడు త‌న వారంద‌రి చేత అవున‌నిపించి తాను మాత్రం కాద‌న‌డం వ‌ల్ల అది కూడా ఆంగ్లంలో.. ఇదొక స్కెచ్ గా  తెలుస్తోంది. ఈ  స్కెచ్ ద్వారా వ‌చ్చే రోజుల్లో ఆంధ్రుల క‌ర్మ‌గాలి పొర‌బాటున  ఫ్యాను గాలి వీస్తే.. ఆపై తాను ఆనాడే చెప్పాన‌ని త‌ప్పించుకునేలా ఒక వెస‌లుబాటు క‌ల్పించుకున్నారు జ‌గ‌న్. అంతే  కాకుండా ఆయ‌న ద‌గ్గ‌ర ఇంకో థియ‌రీ కూడా రెడీగా  ఉండ‌నే  ఉంది. తాను ఎక్క‌డుంటే అదే రాజ‌ధానిగా  ఆయ‌న ఇది వ‌ర‌కే స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో తాను రిషికొండ ప్యాలెస్ లో కూర్చుని... ముందే చెప్పానుగా ఇదే మ‌న రాజ‌ధాని అంటూ ఆయ‌న ప్లేటు ఫిరాయించ‌డానికే ఇదంతా అన్న సంకేతాలు స్ప‌ష్టంగా అందుతున్నాయ్. కాబ‌ట్టి... బీఅవేర్ ఆఫ్ జ‌గ‌నాసుర! అన్న హెచ్చ‌రిక‌లు సైతం అంతే  స్థాయిలో సైర‌న్ మోగుతోంది.

చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ

భూమికి పచ్చని రంగేసినట్లు హరిత శోభతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు చమురు మంటల వేడి సెగలకు మాడిపోతోంది. పచ్చదనం పలచబడిపోతోంది.  కోనసీమ తీర ప్రాంతంలో అపార చమురు, సహజవాయు నిక్షేపాలున్నయన్న సంగతి వెలుగు చూసినప్పటి నుంచీ ఇక్కడి పచ్చదనానికి శాపం తగిలిందోమో అనిపిస్తుంది. ఓఎన్జీసీ చమురు, సహజవాయు అన్వేషణ ప్రారంభించిందో  అప్పటి నుంచే కోనసీమ పచ్చదనం పలచబడిపోవడం మొదలైంది. ఢ్రిల్లింగ్ పేరుతో తీర ప్రాంతంలో ఇష్టారీతిగా రిగ్గులు వేసేసిన ఓఎన్జీసీ.. అప్పటి నుంచే కోనసీమ వాసుల ఆరోగ్యంపై ప్రభావం పడటం మొదలైంది. తీర ప్రాంత గ్రామాల వారు కాలేయ సంబంధిత వ్యాధులకు గురి కావడం మొదలైంది. ఇదంతా చమురు, సహజవాయువు అన్వేషణ పేరుతో ఎఎన్జీసీ చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఫలితమే అంటున్నారు వైద్య నిపుణులు, పర్యావరణ ప్రేమికులు.   సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని  పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పచ్చని కొబ్బరి చెట్లు మూడు నాలుగు నిలువుల బొగ్గు చెట్లుగా మారిపోయాయి. కోనసీమలో భోగి మంటను ఓఎన్జీసీ ముందే వేసేసిందనీ, సంక్రాంతి పండగకు ముందు జరుపుకునే భోగి భోగభాగ్యాలను తీసుకువస్తుందంటారు. కానీ.. ఓఎన్జీసీ వేసిన ఈ భోగి మంట భోగభాగ్యాలను తుడిచేస్తోందనీ ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఓఎన్జీసీ ఈ బ్లోఔట్ ను ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. మంటలు ఎగసిపడుతున్న బావిని శాశ్వతంగా మూసేయడమే మర్గమని నిర్ణయించింది. మూడు దశాబ్దాల కిందట పాశర్లపూడి బ్లో ఔట్ సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ బ్లో ఔట్ సంభవించిన బావిని మూసేయాలంటే   భారీ మడ్ ఫిల్లింగ్ యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించడానికి పచ్చటి పొలాలకు అడ్డంగా భారీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఓఎన్జీసీ ఇప్పటికే ఆ పని మొదలెట్టేసింది. మొత్తంగా కోనసీమ చమురు, సహజవాయువుల నిక్షేపాల గని అని సంబరపడటానికి లేకుండా, వాటి వెలికితీత, అన్వేషణ చర్యల కారణంగా నిత్య రావణకాష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కేటీఆర్ క్లూలెస్.. కవిత డామినేట్స్!

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ను కవిత విమర్శలు ఫేడౌట్ చేస్తున్నాయా? ఆమె విమర్శలకు దీటుగా బదులివ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందా? సొంత అన్నపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధిస్తున్నా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మౌనం ఆ పార్టీ రాజకీయ పునాదులను కదిపేస్తోందా? అంటే ఔననే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మండలి వేదికగా కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని సభలో బీఆర్ఎస్ సభ్యులు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోవడం, మండలి చైర్మన్ సైతం సమయ నియమాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్నికొనసాగించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన వారైనప్పటికీ.. ఆ పార్టీని విమర్శలతో చెండాడేస్తున్న కవితను కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అదే సమయంలో కవిత తన భావోద్వేగ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీలో తాను ఎలా అవమానాల పాలైనదీ, తనను ఎలా పక్కన పెట్టేశారు. ఎలా బయటకు పంపేశారు అన్న విషయాన్ని చాలా చాలా ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలనూ ప్రస్తావించారు.  ఆమె ఎమోషనల్ గా చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆమెకు సానుభూతి మరింత పెరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ సభ్యులు మౌనం వహించి ఉంటారని అంటున్నారు. అయితే సభలో తన చివరి ప్రసంగం చేసి ఇప్పుడు వ్యక్తిగా ఒంటరిగా వెడుతున్నా.. కానీ ఒక శక్తిగా మళ్లీ తిరిగొస్తానంటూ ఆమె సభను వీడారు. ఇక మండలిలో ఇదే ఆమె చివరి ప్రసంగం అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రసంగం ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు.   అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని వేలెత్తి చూపుతుంటే.. దానిని ఖండించడం మాని.. కవిత కూడా అవినీతికి పాల్పడ్డారన్నకోణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ హయాంలో కవిత చెప్పినట్లుగా అవినీతి జరిగిందని అంగీకరిస్తున్నటుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా కవితను ఎలా ఎదుర్కొనాలన్న విషయంలో పార్టీలో  గందరగోళం నెలకొందన్న విషయాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోందని   విశ్లేషిస్తున్నారు. ఇక కేటీఆర్ పై నేరుగా కవిత విమర్శల వర్షం కురిపిస్తున్నా ఆయన నేరుగా స్పందించకపోవడం పొలిటికల్ గా కవితకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత విషయంలో కేటీఆర్ క్లూ లెస్ గా ఉంటే.. కవిత మాత్రం బీఆర్ఎస్ ను డామినేట్ చేసి పోలిటికల్ మైలేజ్ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భోగాపురం ఎయిర్ పోర్ట్.. క్రెడిట్ వార్.. వాస్తవమేంటంటే?

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితరులు ప్రయాణించారు.   భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  పాటు  భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థ జీఎంఆర్ జూన్ నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండిగ్ ఒక మైలు రాయిగా చెప్పొచ్చు. అయితే ఈ విమానాశ్రయం ఘనత తనదేనంటూ వైసీపీ క్రెడిట్ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒక రాజకీయ చర్చకు దారి తీసింది.   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ విమానాశ్రయానికి అవసరమైన కీలక అనుమతులన్నీ తన హయాంలోలో వచ్చాయని చెప్పుకుంటున్నారు. అలాగే  ఈ విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ కోసం తన హయాంలోనే దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేశామని అంటున్నారు.  అయితే వైసీపీ అధినేత జగన్ మాటలను టీడీపీ కొట్టి పారేస్తోంది. భోగాపురం విమానాశ్రయం 2015లోనే  అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడి హయాంలోనే ప్రణాళికలు రూపొందాయనీ, దీనికి కేంద్ర అనుమతులు, భూ సేకరణ, ప్రాథమిక నిర్మాణాలూ చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయనీ చెబుతోంది.  అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పడకేసిందనీ, జగన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగం పుంజుకుందనీ చెబుతోంది.   ఈ రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలూ పక్కన పెడితే.. అసలు వాస్తవమేంటంటే.. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం, ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, వచ్చే జూన్ నాటికి  ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులో రావడానికి ప్రధాన కారణం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నది నిర్వివాదాంశం. శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యంవహిస్తున్న ఆయన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి,  నిర్దుష్ట వ్యవధిలో పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో  ముందుకుసాగడం వల్లనే  ఇంత వేగంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన చొవర, వ్యక్తిగత పర్యవేక్షణ కారణంగానే గత ఏడాది కాలంగా భోగాపుర విమానాశ్రయ నిర్మాణ పనులు రోజూ మూడు షిప్టులలో నిరంతరాయంగా జరిగాయని అంటున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా భోగాపురం విమానాశ్రయం రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలను ఆరంభించేందుకు రెడీ కావడం ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి న  నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఒక్కో సారి అంతకు మించి కూడా సమయం పడుతుంది. ఇందుకు ఉదాహరణ ముంబైలో ఇటీవలే ప్రారంభమైన రెండో అంతర్జాతీయ విమానాశ్రయమే. ఈ విమానాశ్రయం ప్రతిపాదన దశ దాటి, అన్ని అనుమతులూ పొంది..  నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రయాణీకులకు అందుబాటులోకి రావడానికి పాతికేళ్లు పట్టింది.  ఇక గత దశాబ్ద కాలంగా  బెంగ‌ళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ గత దశాబ్ద కాలంగా ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.    అయితే అందుకు భిన్నంగా  ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఆపరేషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో   దశాబ్దాలు పట్టిన పని ఏపీలో   రెండేళ్ల లోపే పూర్తయ్యిందంటే.. అది చంద్రబాబు ఫాస్టెస్ట్ గవర్నెన్స్ ఫలితమే అనడంలో సందేహం లేదు.  

కొండ‌గ‌ట్టు, కోన‌సీమ ఓ ప‌వ‌న్ క‌ళ్యాణ్?

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయుడి గుడికి ప‌వ‌న్ ద్వారా భారీ విరాళం. ఆ భూరి విరాళంతో ఆలయంలో అభివృద్ధి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేయడం..ప్ర‌స్తుతం ఈ వార్తలు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆంజ‌నేయ స్వామి వారంటే ప‌వ‌న్ కి ఎందుకంత ఇష్టం? అని చూస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు కొణిదెల కుటుంబానికి కులదైవం. అందుకు నిదర్శనంగా ప‌వన్ కల్యాణ్ నామధేయంలోని పవన్  ఆంజ‌నేయ స్వామి వారిపేరు. ఔను   ప‌వ‌న సుత హ‌నుమాన్ అని కూడా ఆంజ‌నేయుడ్ని పిలుస్తుంటారు భ‌క్త జ‌నం. వాయుపుత్రుడాయ‌న‌. అంటేపవన్ కల్యాణ్ పేరులో  స‌గం ఆంజ‌నేయ‌స్వామి ఉన్నారు. ఇక పవన్ తల్లి పేరు అంజనా దేవి. ఆ పేరులోనూ ఆంజనేయుడు ఉన్నారు.    అందుకే కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.   అదే బీఆర్ఎస్ గ‌తంలో ఇదే  కొండ‌గ‌ట్టు ఆలయానికి  వంద కోట్ల మేర నిధులు  ప్ర‌క‌టించి ఇవ్వ‌లేదు. అదే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలోనూ, దైవ భక్తికి రాష్ట్రాల హద్దులు ఉండవని చాటడంలోనూ ముందున్నారు.  ప‌వ‌న్  ఏపీకి చెందిన రాజ‌కీయ నాయ‌కుడైనా.. తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టుకు విరాళం ఇప్పించ‌డం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వాసులు అయితే మరో అడుగు ముందుకేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూడా.   పవన్ కల్యాణ్ గ‌తంలో ఇక్క‌డి నుంచే త‌న వారాహీ వాహ‌న యాత్ర‌ను లాంఛ‌నంగా మొద‌లు పెట్టారు. అదీ హనుమంతుల వారిపై ఆయనకు ఉన్న భక్తి. అది పక్కన పెడితే ఇక్కడ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. గ‌తంలో ఆయ‌న కోన‌సీమలో కొబ్బరి రైతులు నష్టాలు పాలుకావడంపై మాట్లాడుతూ..  తెలంగాణ ప్ర‌జ‌ల దిష్టి త‌గిలింద‌ని చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ప‌వ‌న్ యాంటీ తెలంగాణ అన్న మాట కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. అదే ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవ‌మైన కొండ‌గ‌ట్టు హ‌నుమ‌న్న ఆల‌యానికి కోట్ల రూపాయ‌ల విరాళం వ‌చ్చేలా చేసి.. త‌న‌పై వ‌చ్చిన యాంటీ తెలంగాణ కామెంట్స్ ని చెరిపేసుకున్నారు పవన్ కల్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పేర్కొంటున్నారు.