కూటమి పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ ఎలక్షన్ ఫండ్స్

Publish Date:Dec 22, 2025

  తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.  రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి. ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.  ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.   పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.  తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.  వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?

Publish Date:Dec 23, 2025

  వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు, అరెస్ట్ చేస్తానంటున్నాడు.​ కూటమి ప్రభుత్వ భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు వస్తే, తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ  మోడల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానించినందుకు నిరసనగా 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం చేపట్టారు.  కోటి సంతకాలు చేసిన వారి చిరునామా, ఫోన్ నంబర్లు కూడా పొందుపరిచామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని కూడా తెలిపారు. ఇది మాత్రం కొత్త విధానం. "మేము అబద్ధం చెప్పడం లేదు" అని నిరూపించుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.​ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఒక అనుమానం వ్యక్తం చేయడం, అందుకు నిరసన వ్యక్తం చేయడం విపక్షంగా జగన్ బాధ్యత. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టగానే, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని భావించిన వారికి, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వినగానే నిరాశే మిగిలింది.​  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభాలో, ఇంత తక్కువ వ్యవధిలో ఒక కోటి నాలుగులక్షల సంతకాలు సేకరించడం అంటే అంత సులభం ఏమీ కాదు. ప్రతి పల్లెలోనూ, పట్టణాలలోనూ జనరల్ బాడీ మీటింగులు పెట్టినా సేకరించడం కష్టం. పల్లెల్లో సంతకాలు పెట్టడం మరీ కష్టం. అధికారపార్టీకి వ్యతిరేకంగా సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా సంకోచిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను 'సంక్షేమ రాష్ట్రం' అనే కంటే 'సంక్షేమ పథకాల రాష్ట్రం' అంటే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలే కాక, వారి మేనిఫెస్టో ప్రకారం చేసిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. తటస్థంగా ఉండేవాళ్ళు అంత బాహాటంగా రారు. పట్టణాలలో మీటింగులకు రావడమే కష్టం. ​ఇన్ని పరిమితుల మధ్య కోటి సంతకాలు సేకరించడం కష్టంతో కూడుకున్న పని. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉన్నట్లు వెంటనే రుజువు అవుతూ ఉంటాయి.  అందుకే సంతకాల విషయంలో రుజువులు కూడా జత చేయవలసి వచ్చింది. ఇంత కష్టపడి కార్యకర్తలు చేసిన పనిని, ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలతో వృధా చేశారు. పీపీపీ మోడల్‌ను తాను ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు తీసుకుంటే, వారిని తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు మొదలు తెలుగుదేశంపార్టీ కార్యకర్తల నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ చేసే పనిలో పడి పాలనను మరచిపోవడమే జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణం.  ప్రధానమంత్రి, అమిత్ షా ఆశీస్సులు ఉంటే చాలనుకుని పాలనకు దూరంగా ఉన్నారు. బటన్ నొక్కితే చాలనుకుని ప్రజలకు దూరం అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరెస్టులు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డాయో అనే సమీక్ష జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కానీ, ప్రజలకు అరాచకం నచ్చకనే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టారు.​ ఆయన అధికారంలోకి వస్తేఏంచేయాలనుకుంటున్నారు అంటే 'జైళ్లు నింపుతాడు' అనే నినాదం ఇస్తున్నట్లుగా ఉంది. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార సంస్థలను వెళ్లగొడతాను అనే మాటతోనే ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనకు చాలా పెద్ద న్యాయవాదుల బృందం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారిని జైల్లో పెట్టడానికి చట్టరీత్యా అవకాశం ఉండదు అనే కనీసపు సలహా కూడా ఇస్తున్నట్లుగా లేరు. ఆయనకు రాజకీయ సలహాదారులు కూడా అనేకమంది ఉన్నారు.  ఇలా బెదిరించినందువలన ప్రజలు ఓట్లు వేయరు అనే సలహా మాత్రం చెప్పడం లేదు.​ తానొక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం మరచిపోయి, యోగా దినోత్సవం నాడు ప్రధాని ఆంధ్రప్రదేశ్ వచ్చి యోగా చేసిన విషయం పక్కన పెట్టి, మీడియా ముందు అభినయం చేస్తూ చేసిన హేళన.. ఆయన ప్రజాక్షేత్రంలో ఇక ప్రజలను మెప్పించలేరు అనే విషయాన్ని ఆయనే చెప్పుకున్నట్లు అయింది. అటువంటి అభినయం చూసిన వారు కొంతమంది ఆయన్ను కమెడియన్లతో పోలుస్తున్నారు. తాను అధికారంలో ఉండగానే గౌరవం కోల్పోయారు. బెదిరిస్తే బెదరరు అని అర్థమయ్యాక కూడా 'జైల్లో పెడతాము' అంటారు.  ఉద్యోగులను రిటైర్ అయినా వదిలిపెట్టం అని అంటారు. జగన్మోహనరెడ్డి ఎలాగూ అంటున్నాడు కాబట్టి మేము తక్కువ కాదు అన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇరిగేషన్ డిపార్టుమెంటు ఉద్యోగులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కుమ్మక్కు అయి అవినీతి చేస్తున్నారంటూ, వాళ్ల ప్రభుత్వం రాగానే జైల్లో వేసి వాళ్ల ఆస్తులన్నీ జప్తు చేయిస్తారట. 'సముద్రం లోపల ఉన్నా వదిలిపెట్టను' అంటాడు జగన్. ​దేశమంతా అమలు చేస్తున్న పీపీపీ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. పథకంలో ఏవైనా అప్రజాస్వామికమైనవి ఉంటే ముందుగా ఆపథకాన్ని ఛాలెంజ్ చేయాలి.  ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఒక పథకాన్ని, దానికి కొన్ని మార్గదర్శకాలనే కాకుండా కొన్ని నిధులను కూడా సమకూర్చిన కేంద్రం మీద కనీసపు నిరసన తెలపకుండా.. కేంద్రం సూచించిన విధంగా పీపీపీ మోడ్‌లో కళాశాలలను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు నాయుడునో, భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ వ్యక్తులనో అరెస్ట్ చేయాలనడం జగన్ అవివేకానికి చిహ్నం. ​దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలలో ప్రభుత్వమే సీట్లు అమ్మే సంస్కృతిని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓల పైన అప్పటి ప్రతిపక్షం టీడీపీ  న్యాయపరమైన చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం.  ఆ విషయమై ఇప్పటికీ రాష్ట్రంలో పౌరులకు కనీస అవగాహన కలిగించకపోవడం టీడీపీ వైఫల్యానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం అనుకుంటే, ముందుగా చేయవలసింది మెడికల్ సీట్లను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన తన పాలసీకి ప్రజలకు క్షమాపణ చెప్పి, పీపీపీ మోడ్‌లో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలి. అటువంటి విధానాన్ని రూపొందించిన కేంద్రానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. ​జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిలబడాలనుకుంటే వాస్తవాలు మాత్రమే ప్రజలకు వివరిస్తూ, ఒక పద్ధతిలో నిరసన తెలుపుతూ న్యాయపోరాటం చేయాలి.  కానీ ఆయన అధికారం గురించి, చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల కోసమే అయితే సాదాసీదాగా లోకేష్ మాదిరిగా ప్రజలకు చేరువ కావాలి. ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడాలి. పొద్దుటే మీడియా ముందు యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  అక్కడ జగన్ విశ్వసనీయత కోల్పోతున్నారు.​ఇక రుషికొండ రాజభవనం గురించి జగన్ మాట్లాడకపోవడమే మంచిది. అధికారంలో ఉన్నప్పటి కంటే, అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని ఎక్కువ కోల్పోయి, కూటమి ప్రభుత్వానికి మరో పదేళ్లు తానే బాటలు వేస్తున్నట్లుగా ఉన్నది. అందుకే జగన్ చెప్పే కోటి సంతకాలను కూడా ప్రజలు విశ్వసించలేక పోతున్నారు.   

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

తెలివైన వాళ్లమని మిడిసిపడుతున్నారా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వెంటే షాకవుతారు..!

Publish Date:Dec 23, 2025

తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం వచ్చిన ప్రతి సారి తమ తెలివితేటలు, సామర్థ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఎవరైతే తెలివి లేని వెధవ అని అన్నారో.. వారికి తమ విజయం తెలిసేవరకు మనసు ప్రశాంతంగా మారదు.  తాము తెలివైన వాళ్ళం అని నిరూపించేంత వరకు వారి అహం కూడా అస్సలు తగ్గదు. అయితే ఇదంతా కూడా చాలా పిచ్చి చేష్ట అని  అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్తగా, రాజనీతి శాస్త్రజ్ఞునిగా,  ఆర్థిక నియమాలు అద్బుతంగా వెల్లడించిన వ్యక్తిగా అందరికీ పరిచయమే.  ఆయన రెండువేల సంవత్సరాల కిందట చెప్పిన విషయాలు నేటికీ  ఆచరణీయంగా, అనుసరణీయంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన మనుషులను,  సమాజాన్ని, పరిస్థితులను, రాజకీయాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి తెలివైన వారికి ఒక నమ్మలేని  వాస్తవాన్ని చెప్పారు. ఈ విషయం చదివితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసుకుంటే.. చాణక్యుడు చెప్పిన నమ్మలేని రహస్యం.. చాణక్యుడు ప్రజలను తెలివైన వారిగా ఉండమని చెబుతాడు. అయితే బయటకు మాత్రం మూర్ఖులుగా నటించమని చెబుతాడు. అంతేకాదు.. అవసరమైనప్పుడు స్వార్థంగా కూడా ఉండాలని చెబుతాడు. ఈ విషయంగానే ఇదొక తప్పు మార్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన విషయాలకు తగిన వివరణ కూడా ఇచ్చాడు. ప్రతి వ్యక్తి తాను చేసే పనిని, తన ప్రణాళికను గొప్పగా అందరికీ తెలిసేలా చెప్పడం తెలివైన పని కాదని చాణక్యుడు అంటాడు.  ప్రస్తుత  ప్రపంచంలో ప్రజలు,  చుట్టుపక్కల ఉండేవారు, సన్నిహితులు,  ఆత్మీయులు అందరూ  స్నేహపూర్వకంగా కనిపిస్తుంటారు.  కానీ వారి ఉద్దేశాలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవిగా ఉండవని చాణక్యుడు చెబుతాడు.  అందరినీ గుడ్డిగా నమ్మితే ఏదో ఒకరోజు అవతలి వారు బలహీనతనలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.   అందుకే నిజంగా తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన తెలివితేటలను అవసరం లేకుండా బయటపెట్టడు.  అందరికీ ప్రదర్శన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తన తెలివిని బయటపెట్టడు. మూర్ఖుడిలా నటించాలి ఎందుకుంటే.. ఒక వ్యక్తి తనను తాను తెలివైన వాడిని అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంటే అలాంటి వ్యక్తి నుండి అందరూ క్రమంగా దూరం అవుతారని చాణక్యుడు అంటున్నాడు. లేకపోతే ఇతరుల వల్ల హాని కలగడం లేదా ఇతరుల కుట్రలకు బలి కావడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వాడిని అని అందరికీ తెలిసేలా చేయడం కంటే మూర్ఖుడిగా నటించడం ఉత్తమం. దీని వల్ల ఇతరుల ప్రణాళిక, వారి ఉద్దేశ్యాలు గుర్తించడం సులువు అవుతుంది. అంతేకాదు.. ఎవరి ముందు అయినా సరే.. తక్కువగా మాట్లాడి, ఎదుటివారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు ఎదుటివారి ఉద్దేశ్యాలు చాలా బాగా అర్థం చేసుకోవచ్చు.  స్వార్థంగా ఎందుకు ఉండాలి? ఎప్పుడు ఉండాలి? మనుషులు స్వార్థపూరితంగా ఉండాలని చాణక్యుడు ఎప్పుడూ సమర్థించడు. పరిస్థితులు  మారిపోయినప్పుడు, ఒక వ్యక్తిని ఇతరులు స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు,  స్వంత ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని చాణక్యుడు చెబుతాడు.  మొదట తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, తమ పనులను తాము సమర్థవంతంగా చేసుకుంటూ తమకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పరుచుకున్నప్పుడు ప్రపంచం కూడా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది.  ఎప్పుడూ  ఇతరుల కోసం మాత్రమే బ్రతికేవారిని ప్రజలు  దోపిడీ చేస్తారు. స్వార్థపూరితంగా ఉండటం అంటే ఇతరులకు హాని చేయడం కాదు, ప్రతి వ్యక్తి తన  హక్కులను కాపాడుకోవడం. తెలివి, చాకచక్యం.. తెలివిగా ఉండటం,  చాకచక్యంగా ఉండటం రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ ఈ రెండింటి  మధ్య చాలా తేడా ఉంది. తెలివి అంటే పరిస్థితులను తెలివిగా నిర్వహించడం,   మాటలు  నిర్ణయాలలో సమతుల్యతను కాపాడుకోవడం. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఆలోచించి, సరైన సమయంలో తమ జ్ఞానాన్ని ఉపయోగించే వారు మాత్రమే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తారని చాణక్య నీతి బోధిస్తుంది. చాకచక్యం ఏదైనా పనిని సులువుగా,  ఎలాంటి సమస్య లేకుండా చేయడం.  కాబట్టి చాకచక్యంగా ఉండటం ముఖ్యమే కానీ తెలివైన వారు కూడా మూర్ఖుడిలా నటిస్తూ సరైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం.                               *రూపశ్రీ.
[

Health

]

ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..!

Publish Date:Dec 23, 2025

  సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు.. ఇతర మాంసాలతో పోలిస్తే  జీర్ణం కావడానకి కూడా తేలికగా ఉంటుంది.  చికెన్ లేకుండా భోజనం చేయలేని వారు చాలామంది ఉంటున్నారు.  ముక్క లేకపోతే ముద్ద దిగదు అని చాలా గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే రోజూ చికెన్ తినేవారికి చాలా పెద్ద షాకింగ్ న్యూస్.  రోజూ చికెన్ తినడం వల్ల జరిగేదేంటో వివరంగా చెప్పేశారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే.. వైద్యులు చెప్పేదాన్ని బట్టి కడుపు క్యాన్సర్ మెల్లిగా పెరుగుతూ వస్తుంది.  ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు కారణం అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా చికెన్ ను రెగ్యులర్ గా ఎక్కువ రోజులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.  చికెన్ ను ఎలా వండుతున్నారనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు. అధికంగా చికెన్ తినడం వల్ల కడుపు,  పేగు సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, చికెన్ తినడం వల్ల మాత్రమే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందని కాదు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు చికెన్ రెగ్యులర్ గా తినడం కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఒకే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర ఆహారాల నుండి లభించాల్సిన చాలా పోషకాలు లోపిస్తాయని. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా ఒకే ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల కడుపు లోపల సహజంగా ఉండే రక్షణ పొర బలహీనం అవుతుందని చెబుతున్నారు. రోజూ చికెన్ తినడం, అది కూడా బయట తినడం, వేయించిన చికెన్,  లేదా వేయించిన ఆహారాలు,  బయటి ఆహారాలు తినడం, తక్కువగా కూరగాయలు తీసుకోవడం వంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చికెన్ తింటే క్యాన్సర్ ఎలా వస్తుంది? శాకాహారాలతో పోలిస్తే చికెన్ జీర్ణం అవడం కాస్త కష్టం. రోజూ చికెన్ తినడం వల్ల జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అధికంగా నూనె లేదా కారం వంటివి తిన్నప్పుడు కడుపులోపలి పొరకు మంట కలుగుతుంది. దీని వల్ల వెంటనే సమస్య కనిపించకపోయినా ఎక్కువ కాలం కంటిన్యూగా చికెన్ తింటే కడుపు లోపలి రక్షణ పొర దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ మంట మీద వండిన చికెన్ ను, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనెతో తయారు చేసిన చికెన్ ను రెగ్యులర్ గా తీసుకుంటే హెటెరోసైక్లిక్ అమైన్స్ అనే హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలను చాలా కాలం పాటు పదే పదే తీసుకుంటే, అవి కణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి రోజూ చికెన్ తినేవారు.. దాన్ని ఎలా వండుతున్నారు, ఎలా తింటున్నారు అనే విషయాన్ని గమనించుకోవాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...