కేటీఆర్ కాదు.. ఈటెలను సీఎం చేయండి!
posted on Feb 4, 2021 9:25AM
తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అంశంమే ఇప్పుడు కీలకంగా మారింది. కేటీఆర్ చుట్టూనే రాజకీయాలన్ని తిరుగుతున్నాయి. కేటీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్దం అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఓపన్ గానే కోరుతున్నారు. కొందరు మంత్రులు కూడా కేటీఆర్ జపం చేస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు విషయంలో కొత్త డిమాండ్ వినిపిస్తోంది.
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని సోనియాగాంధీ భావించారని చెప్పారు. దళితుడిని మొదటి సీఎం చేస్తానన్న కేసీఆర్, తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఇప్పుడు తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, కేటీఆర్ స్థానంలో ఈటల రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వస్తే, 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకూ అది జరగలేదని చెరుకు సుధాకర్ ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్నా అందులో ఎంతమాత్రమూ స్పష్టతలేదన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కోదండరామ్ కు ఎన్డీయే నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని తెలిపారు.