రౌండప్ 2022 ఈ ఏడాది ఏం జరిగింది?

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
జనవరి 1

 

2022 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో  కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.  
జనవరి 4

 


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్  ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల  విలువైన 22  అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో  ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త  పరిచారు. 
జనవరి 5


 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా  ప్రధాన మంత్రి పంజాబ్  పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 

జనవరి 15

సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా  నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ   ట్వీట్‌ చేశారు.
జనవరి 20


 బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు. 
జనవరి 23 
నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి.  దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు. 
జనవరి 30
మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా  రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు.
జనవరి 31 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఫిబ్రవరి 

జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు. 
ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్  లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు. 


అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.  
ఫిబ్రవరి 6:  

ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక  నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు  నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు  పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు.  వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

మార్చి

తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి,  ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి. 

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ  తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. 
మార్చి 10  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.  

యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది.  పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు. 
మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ  పదవీ కాలం  ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది.

ఏప్రిల్

ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్,  హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో  చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని  తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది.

ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్  డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో  పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ  కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది.
ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు. 

తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి  జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు. 

ఏప్రిల్ 11  తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు  సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని  సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.  

ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. 

ఏప్రిల్ 14  ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన  ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు. 

ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు.

ఏప్రిల్ 24  ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో  పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు.  ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు.

మే నెల వివరాలు రేపు 

వేమిరెడ్డికి....కేంద్ర బెర్త్ క‌న్ఫర్మ్ అయిన‌ట్టేనా!?

  కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో 16 ఎంపీలు టీడీపీకి ఉండ‌గా, ఇద్ద‌రు జ‌న‌సేన‌, ముగ్గురు బీజేపీ, న‌లుగురు వైసీపీకి ఉన్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి పెమ్మ‌సాని, రామ్మోహ‌న్ రూపంలో  కేంద్రంలో మంత్రి ప‌ద‌వులుండ‌గా.. బీజేపీ నుంచి శ్రీనివాస‌వ‌ర్మ కూడా  కేబినేట్ లో స‌హాయ హోదాలో ఉన్నారు. అంటే ఏపీకి ముగ్గురికి  అవ‌కాశం ల‌భించింది తొలి  మంత్రి వ‌ర్గంలోనే వీరు స్థానం సంపాదించారు. అయితే  కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తిరిగి ఏపీకి,, మ‌రీ ముఖ్యంగా టీడీపీకి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఛాన్స్ ల‌భించేలా తెలుస్తోంది. మొన్న ఢిల్లీకి  వెళ్లిన  చంద్ర‌బాబు అమిత్ షాతో భేటీలో ఈ విష‌యం  ఆయ‌న చెవిలో వేసి  వ‌చ్చారు. దీంతో ప్ర‌తిపాద‌న‌లు పంప‌మ‌ని  కేంద్రం నుంచి స‌మాచారం వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ  వేమిరెడ్డి  ప్ర‌భాక‌ర్ రెడ్డి  పేరు ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. కుల స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా  ఈ సారికి ఒక రెడ్డి సామాజిక‌వ‌ర్గం పేరు ప్రతిపాదించిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి రాగానే  నెల్లూరు జిల్లా  రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా  మారిపోయాయి. అంతే కాకుండా  ప్ర‌కాశం జిల్లాలోని  కొన్ని సెగ్మెంట్ల‌లోనూ వేమిరెడ్డి  ప్ర‌భావం ఉన్న‌ట్టు గుర్తించారు. దీంతో వేమిరెడ్డికి కేంద్ర మంత్రిత్వం క‌ట్ట‌బెడితే  ఆయ‌న ద్వారా రెండు జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన‌ట్టుగా  ఉంటుంద‌ని భావించిన టీడీపీ అధిష్టానం ఆయ‌న పేరు కేంద్ర మంత్రిగా  సిఫార్సు చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక జ‌న‌సేన‌కుగానీ ఒక మంత్రి ప‌ద‌వే ఇస్తే.. బాల‌శౌరి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. దీంతో ఏపీకి రెండు కేంద్ర ప‌ద‌వులు ఇస్తార‌న్న మాట కూడా జోరుగాన‌నే ప్ర‌చారం  సాగుతోంది. ఒక ద‌శ‌లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వేమిరెడ్డితో పాటు  వినిపించిన‌ప్ప‌టికీ.. వేమిరెడ్డికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కార‌ణం వేమిరెడ్డి  స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డి  కూడా  జిల్లాలో ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌క‌త్వం వ‌హించ‌డం.. వంటి అంశాల‌ను  ప‌రిగ‌ణ‌లోకి తీస్కున్న అధిష్టానం వేమిరెడ్డికే ప్రాధాన్య‌త‌ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా

ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలోని మంగంపేట బారైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినవి. అయితే, ఈ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పరమవుతోందని 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ తో  కలిసి  పంచుకున్న వాస్తవ వేదికలో ఆయన బైరైటీస్ దోపిడీపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.  రాయలసీమ ఆర్థిక వ్యవస్థలో మంగంపేట బారైటీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందులో సందేహం లేదు. గతంలో ఇక్కడ జరిగిన విపరీతమైన అవినీతిని అరికట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మైనింగ్‌ను  ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు.  కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయన్నారు డోలేంద్ర ప్రసాద్.   మంగంపేట బారైటీస్ విషయంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదని విమర్శించారు.   అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక టన్ను బారైటీస్ ధర సుమారు 140 డాలర్లు అంటే బారత కరెన్సీలో   12,704.79 రూపాయలు ఉంటే, ఇక్కడి కాంట్రాక్టర్లకు కేవలం  12.78 డాలర్లు అంటే 1,160 రూపాయలకే కట్టబెడుతున్నారని డోలేంద్ర ప్రసాద్  వివరించారు.  ఎంపరాడా  వంటి సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలను రూపొందించడమన్నది పక్కగా కుమ్మక్కై చేస్తున్న పనిగా ఆయన అభివర్ణించారు.   ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ,  కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  ఈ దోపిడీలో అధికార, విపక్ష పార్టీలు, బ్యూరోక్రసీ, కొన్ని మీడియా సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు.  ఒక చిన్న స్థాయి గుమాస్తా దగ్గరే కోట్లాది రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.  బారైటీస్ మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని బీచ్ శాండ్ అలాగే అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా లూటీ అవుతున్నాయన్నారు.    చైనా నేడు ఈ రేర్ ఎర్త్ ఖనిజాలతోనే అమెరికా వంటి దేశాలను గడగడలాడిస్తోందనీ, అయితే మన దగ్గర ఉన్న  ఈ అద్భుతమైన సంపదను పది రూపాయల కోసం రాజకీయ నాయకులు విదేశాలకు తరలిస్తున్నారని  విమర్శించారు.  థోరియం వంటి దేశ రక్షణకు సంబంధించిన ఖనిజాలు కూడా అక్రమంగా తరలిపోతున్నాయన్నారు.ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రజలలో చైతన్యం రావాలని డోలేంద్రప్రసాద్ వాస్తవ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.  మంగంపేట బారైటీస్ వంటి ఖనిజాలకు లోకల్ టెండర్లు కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.  రాష్ట్ర ఖనిజ సంపద ఆంధ్ర హక్కు అంటూ ప్రజాసంఘాలు నినదించాలనీ,  బాధ్యత గల ప్రతి పౌరుడూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంచాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల సుమారు 140 పల్వరైజింగ్ మిల్లులు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, దీనివల్ల 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న డోలేంద్ర ప్రసాద్  "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమా కుమ్మక్కు ప్రభుత్వమా అని సందేహం వ్యక్తం చేశారు.   ఖనిజ దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం  తెలుగు వన్ న్యూస్ లో వాస్తవ వేదిక ఎనిమిదో ఎడిషన్ వీక్షించండి.  

ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణం.. కుండ బద్దలుకొట్టిన పేర్ని

గత ఎన్నికలలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి జగన్ పాలనా వైఫల్యాలే కారణమని మాజీ మంత్రి వైసీపీ అధినేత పేర్ని నాని కుండబద్దలు కొట్టేశారు. ఒక యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. ఇక 2029 ఎన్నికలలో విజయం కోసం జగన్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఔను మాజీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర @ 2.0 కు రెడీ అవుతున్నారంటూ అందుకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైందన్నారు పేర్ని నాని.  వచ్చే ఏడాది అంటే 2027లో పార్టీ ప్లీనరీ తరువాత జగన్ తన పాదయాత్ర ప్రారంభిస్తారని   చెప్పారు. అయితే జగన్ పాలనా వైఫల్యాలు అంటూ   వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జగన్ పాలనా వైఫల్యం కారణంగానే   2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని  ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా పాలనలో వైఫల్యం చెందిందన్న పేర్ని నాని, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం, మరో సారి అధికారంలోకి వస్తే ఆ పాలనా వైఫల్యాలను అధిగమించి జనరంజకమైన పాలనను ఎలా అందిస్తామన్న విషయాలను మాత్రం చెప్పలేదు. అయితే వైసీపీ అధినేత  జగన్ ఇప్పటికీ తాము అద్భుత పాలన అందించామనీ, అయితే ఈవీఎంల టాంపరింగ్, చంద్రబాబు అసత్య ప్రచారాలే తమ ఓటమికి కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు పేర్ని నాని పాలనా వైఫల్యం అనడంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.  అది పక్కన పెడితే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలై, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అధికారపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నది. ఈ ఏడాదిన్నర కాలంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చింది లేదు. అసలాయన ఆంధ్రప్రదేశ్ కు రావడమే ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్లు వస్తున్నారు. వారంలో ఒక రోజు రాష్ట్రంలో ఇలా పర్యటించి అలా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేస్తున్నారు. అలా వచ్చినప్పుడు కూడా ప్రజలలోకి రావడం అత్యంత అరుదు. ఏదో అందుబాటులో ఉన్న, లేదా ఆయన ఎంపిక చేసుకున్న నేతలతో  ఇన్ హౌస్ మీటింగ్ లకు పరిమితమౌతున్నారు.   ఈ ఏదాడిన్నర కాలంలో జగన్ చేపట్టిన కార్యక్రమాలంటూ ఏవీ లేవనే చెప్పాలి. తన ప్రభుత్వ హయాంలో  అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీ ఆరోపణలతో అరెస్టైన వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులకు అడపాదడపా ఖండనలు, లేదా జైలు పరామర్శలకే జగన్ పరిమితమయ్యారు.  అటువంటి జగన్ ఇప్పుడు పాదయాత్ర అంటూ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దానిపై పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ఏడాది కిందటే.. అంటే 2025 జనవరిలోనే జిల్లా పర్యటనలు సహా  కార్యక్రమాలను ప్రకటించారు. తాను స్వయంగా వాటికి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు. అయితే ఆయనా ప్రకటన చేసి ఏడాది గడిచిపోయినా ఆయన అడుగు బయటపెట్టింది లేదు. బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ వైస్ వెర్సా అన్నట్లుగానే ఆయన పర్యటనలు సాగాయి. దీంతో జగన్ జనంలోకి అన్న మాటను పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని జగన్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటనను ఎవరు విశ్వసిస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రకటనలే తప్ప ఆచరణ ఉండే అవకాశాలు మృగ్యమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే వస్తున్నది. మరి చూడాలి జగన్ పాదయాత్రపై పేర్ని నాని ప్రకటిన ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో? 

అవినీతికి పాల్పడితే తన, పర భేదం లేదు.. లోకేష్ వినూత్న విధానం

అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే తన, పర తేడా లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యేలు, అధికారులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన నారా లోకేష్.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తెలుగుదేశం వారైనా, ప్రత్యర్థి పార్టీ వారైనా చర్యలు ఒకేలా ఉంటాయని విస్పష్టంగా చెబుతున్నారు. పొలిటిలక్ గా ఆయన దూకుడు ముఖ్యమంత్రి చంద్రబాబును మించి ఉందని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం.  వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం,  తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు  వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. ఇందు కోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఆ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.   ముఖ్యంగా ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వస్తే.. వాటిని నాలుగు గోడలమధ్యా చర్చించి, హెచ్చరించో, బుజ్జగించో వదిలేయడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తామంటున్నారు లోకేష్.    ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై, వారు అధికార పార్టీ వారైనా, ప్రత్యర్థి పార్టీవారైనా సరే ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించాలని లోకేష్ నిర్ణయించారు. అవినీతికి ఎవరు పాల్పడినా అది తప్పే అని కుండబద్దలు కొడుతున్నారు.  ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నేరుగా పార్టీకే ఫిర్యాదు చేసేలా ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెబుతున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది?  ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? వంటి విషయాలను జనం నేరుగా పార్టీకే ఫిర్యాదు చేయడానికి వీలుగా తెలుగుదేశం  పార్టీ   పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటుచేయనున్నారు.  ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు.  అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను   గోప్యంగా ఉంచుతారు.  అంతే కాకుండా ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటారు.  ఎమ్మెల్యేలే కాదు,   అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, నిజానిజాల నిగ్గు తేల్చి అవసరమైతే చర్యలు తీసుకుంటారు.  ఇది దేశంలో ఎక్కడా లేని  నూతన విధానమనీ, దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారనీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  దీని వల్ల అధికారులు,  ఎమ్మెల్యేలలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందనీ, ప్రజలు  ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావించి లోకేష్ ఈ విధానాన్ని తీసుకురావడానికి సమాయత్తమౌతున్నారని చెబుతున్నారు.  

థాక్రే బ్రదర్స్ కలయిక ప్రభావం ఎంత?.. బీఎంసీ ఫలితాలకు ముందు సర్వత్రా ఉత్కంఠ!

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు  శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.  ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో  ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.   బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా..  పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో  మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.  జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది.  ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114. 

మాజీ మంత్రి జోగు రామన్న గృహ నిర్బంధం.. ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో జోగురామన్న అరెస్టు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామంటూ మాజీ మంత్రి జోగు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం (జనవరి 16) ఉదయమే ఆయనను హైస్ అరెస్టు చేశారు.  రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం (జనవరి 16) , నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటితోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరంభం పలకనున్నారు.  ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

రాయలసీమ లిఫ్ట్‌ను జగన్, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు : సోమిరెడ్డి

  రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు. 2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు. లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.

రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కారణం...మంగంపేట గనులేనా?

  తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో మంగంపేట గనుల అంశంపై జామీన్ రైతు, ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ప్యాక్షనిజానికి ప్రధాన మూలం మంగమ్మపేట గనులేనని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు నిజంగా లాభమా, లేక సీమ పేరుతో కొద్దిమందికే లాభమా అన్న ప్రశ్నను లేవనెత్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేసిన విషయం, ఆయన తండ్రి రాజారెడ్డి నేర సామ్రాజ్యం గనుల నుంచే మొదలైందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం చేసిన తప్పులను తర్వాతి ప్రభుత్వం కాపాడుతుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చే ప్రభుత్వం రక్షించే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. వ్యవస్థ మొత్తం అవినీతి చక్రంలో చిక్కుకుపోయిందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగి వద్ద సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు బయటపడటం పాలనలో ఉన్న అవినీతికి నిదర్శనమని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 15) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  

ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

ఈటల వర్సెస్ మర్రి.. తెలంగాణలోనూ క్రెడిట్ వార్

ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్యం విషయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఒక పక్క క్రెడిట్ వార్ కొనసాగుతుండగానే.. తెలంగాణలో కూడా మరో క్రెడిట్ వార్ మొదలైంది. పొలిటికల్ గా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి నేతల ఆరాటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే అడ్డగోలుగా తాను అవసరం లేదంటూ వాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆ ఎయిర్ పోర్టు ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న తాపతయం నవ్వుల పాలౌతోంది. అది పక్కన పెడితే.. తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది. సదరు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి బాహాబాహీదాకా వెళ్లింది. ఇదే విషయంలో ఈటల, మర్రి రాజశేఖరరెడ్డిల మధ్య వాగ్వాదం కూడా ముదిరింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకోండి అది వేరే సంగతి.  విషయమేంటంటే మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కు శంకుస్థాపన కార్యక్రమంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తన ఘనత అంటే తన ఘనత అంటూ ఈటల, మర్రి వాదనకు దిగారు. దీంతో శంకుస్థాపన సందర్భంగా బీజీపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.   పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా.. మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ లో విజయం ఎవరిదో?