మరింత దిగజారిన కరణానిధి ఆరోగ్యం..
posted on Dec 17, 2016 @ 11:10AM
మొన్నటి వరకూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. గత కొంత కాలంగా కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో గురువారం రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. ఈనెల 7వ తేదీనే డిశ్చార్జి అయిన ఆయన మళ్లీ కావేరీ ఆస్పత్రిలో చేరడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కరుణ ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆయన వెంట సతీమణి రాజాత్తి అమ్మాళ్, తనయుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి, సీనియర్ నేతలు ఉన్నారు. కనిమొళి కన్నీరు పెట్టుకుంటూ ఆస్పత్రి నుంచి బయటకు రావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది.
ఇదిలా ఉండగా కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ఈడీ ఆరవిందన్ హెల్త్ బులిటెన్ విడుదుల చేశారు. కరుణానిధి గొంతు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని.. ఐసీయూలో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే గొంతుకు రంధ్రం చేసి ఈ పరికరాన్ని అమర్చినట్టు వైద్యులు తెలిపారు. యాంటీబయాటిక్స్తో ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.