రాజధాని స్వప్నం.. అలు పెరగని పోరాటం! అమరావతి@500 

అమ‌రావతి.. న‌వ్యాంధ్ర‌ క‌ల‌ల రాజ‌ధాని.. అది న‌గ‌రం కాదు.. భూత‌ల స్వ‌ర్గం.. చంద్ర‌బాబు స్వ‌ప్నం.. ఆంధ్రుల నిండు గౌర‌వం.. ఎవ‌రి దిష్టి త‌గిలిందో.. ఎవ‌రి క‌ళ్లు ప‌డ్డాయో.. ఆ సుంద‌ర స్వ‌ప్నం చెదిరి పోయింది.. ఆ క‌ల‌ల సౌధం కుప్ప‌కూలిపోయింది.. మూడు ముక్క‌లై.. ఓ ముక్క‌గా మూల‌న ప‌డింది.. 

ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల మెక్కాడు.. అమ‌రావ‌తిపై భ‌స్మాసుర హ‌స్తం మోపాడు.. ఇక అంతే.. అమ‌రావ‌తి స‌ర్వ నాశ‌నం.. త‌మ క‌లల రాజ‌ధాని.. మూడు ముక్క‌లై.. మోడు పోవ‌డంతో.. అమ‌రావ‌తి రైతులు భ‌గ్గుమ‌న్నారు.. ఉద్య‌మంతో ఉప్పెన‌లా విరుచుకుప‌డ్డారు.. దీక్ష‌ల‌తో జ‌గ‌న్‌పై దండ‌యాత్ర చేశారు.. 

2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు CM జగన్. ఆ క్షణమే అమరావతి ఉద్యమం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు.. అమరావతి ఉద్యమంలో ప్రతిదీ ఒక చారిత్రక ఘట్టమే... వంటిపై లాఠీలు విరిగినా వెనక్కు తగ్గలేదు... వరుసగా ప్రాణాలు పోతున్నా లెక్క చేయలేదు... 29 గ్రామాల రైతులు తొలిరోజు నుంచి అదే ధైర్యంతో 500 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు... పోరు మహోగ్రంగా మారుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు... తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, నవులురూ.. కృష్ణాయపాలెం, తాడికొండ అడ్డరోడ్డు ఇలా 29 గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ చూసినా ఒకటే మాట.. మన రాజధాని-మన  అమరావతి..... 5 కోట్ల మంది ప్రజల గొంతుక 500 రోజులుగా ప్రతిధ్వనిస్తోంది..

రాజధాని కోసం అనేక‌ రూపాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు... జలదీక్షలు చేశారు... అర్థనగ్నంగా ప్రదర్శనలు చేశారు... మోకాళ్లపై నడిచారు... రాజధాని వీధుల్లో కదం తొక్కి ర్యాలీలూ చేశారు... దేవుళ్లకు మొక్కారు... ముడుపులు కట్టారు... అల్లానూ ప్రార్థించారు... ఏసు ఆశీస్సులనూ కోరారు... తమకు నామాలు పెట్టిన వాళ్ల బుద్ధి మారాలంటూ హోమాలు చేశారు... ఏ రీతిన తమ ఆకాంక్ష తెలియచేసినా అంతా శాంతిమంత్రమే... 

అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు నిరసన బాట పట్టి కేసులతో జైళ్ళకు కుడా వెళ్లారు. ఒక్క రాజధాని ప్రాంతంలోనే 600 మందికి పైగా రైతులను అరెస్టు చేసి కోర్టు బోను ఎక్కించారు. ఇది కృత్రిమ ఉద్యమం ఎంత‌మాత్రం కాదు..... ఇది పెయిడ్ ఆర్టిస్టుల పోరాటం అంతకంటే కాదు...క‌రోనా విజృంభ‌ణ‌తో.. సామూహిక దీక్షలకు బ్రేక్ పడినా.. విడతల వారీగా ప్రతిరోజూ రైతులు పరిమిత సంఖ్యలో భౌతికదూరం పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమరావతి నినాదాన్ని గొంతెత్తి చాటుతూనే ఉన్నారు. అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు కూడా సంపూర్ణ మద్దతు పలికారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానుల కాన్సెప్ట్ సక్సెస్ కాలేదనేది NRIల మాట‌.  

తెలుగుదేశం హయాంలో 2014 సెప్టెంబర్‌ 1న కేబినెట్ తీర్మానం చేశారు. 2015 అక్టోబర్‌లో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేశారు. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి ప్లాన్ సిద్ధమయ్యాక పనులు పరుగులు పెట్టాయి. ఒక్కో భవనం పైకి లేచింది. సింగపూర్ సంస్థలూ రంగంలోకి దిగాయి. వేల మంది కార్మికులు రేయింబవళ్లు పని చేస్తుంటే.. విద్యుత్ వెలుగుల్లో అమరపురి వెలిగిపోయింది.  

కానీ ఇదంతా గ‌తం. ఇప్పుడు ఆ వెలుగులన్నీ ఆరిపోయాయి. YCP అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి భవిష్యత్ అగమ్య గోచరమైంది. నమ్మించి గొంతు కోశారు. అధికారంలోకి రాగానే విధ్వంసానికి తెర తీశారు. అమరావతి సాక్షిగా చేసిన చట్టాలనే రద్దు చేసి వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనకు విశాఖ, కర్నూలు వాసుల నుంచి పూర్తి మద్దతు లేకపోయినా బలవంతంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగుల పేరుతో చేసిన వృధా 2,600 కోట్లు పెడితే  అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు కొలిక్కి వచ్చేవి. పాలన మరింత సమర్థంగా జరిగే వీలుండేది. 

YCPసర్కారు 3 ముక్కలాటకు తెరతీసిన నాటి నుంచి 500 రోజులుగా రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులకు కడుపు నిండా తిండిలేదు. కంటి నిండా నిద్రలేదు. రాజధానికి భూములిచ్చిన వారిలో 29 వేల 881 మంది ఉన్నారు. ఇందులో ఎకరం లోపు ఇచ్చిన చిన్నరైతులే 20 వేల మంది. వీరిలో బీసీలు, దళితులే ఎక్కువ. ఈ పేద రైతులంతా కన్నీళ్లు పెడుతున్నారు. తమను ఏడిపించి జగన్ సర్కారు ఏం సాధిస్తుందని ప్రశ్నిస్తున్నారు.  

న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ మినహా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. 13 జిల్లాల్లోనూ అమరావతికి మద్దతుగా దీక్షలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా లోకేష్, ఇతర రాజకీయ పార్టీలన్నీ రాజధాని రైతులకు బాసటగా నిలిచాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినాయకులు అమరావతి ప్రాంత రైతులను పరామర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతుల కోసం జోలె పట్టుకుని బిక్షాటన చేశారు. ఆయన భార్య భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ప్రకటించడం వంటి ఘటనలు అమ‌రావ‌తి ఉద్య‌మంలో ముఖ్య ఘట్టాలు. 

రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకం సందర్భం వచ్చిన ప్రతిసారీ అమరావతి వైపే నిలబడుతున్నా.. కుట్రలు, పోలీసు బలగాలతో ఉద్యమంపై జగన్‌ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. 29 గ్రామాల ప్రజలు చేసి తప్పేంటి..? ఆంధ్రులకు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఉండాలని ఆకాంక్షించడం తప్పా? ల్యాండ్ పూలింగ్‌లో అడిగిన వెంటనే భూములు ఇవ్వడం నేరమా. దశల వారీగా రాజధాని నిర్మించుకోవడానికి ఇబ్బందేంటి.. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ ఏ YCP నాయకుడి దగ్గరా సమాధానం ఉండదు. అందుకే, సీఎం జ‌గ‌న్ క‌నిపించినా, స్థానిక ఎమ్మెల్యే RK కనిపించినా.. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఓటు వేసి గెలిపించినందుకు తమను ఎందుకు మోసం చేశారని క‌డుపుమంట‌తో ర‌గిలిపోతుంటారు రైతులు, మ‌హిళ‌లు. 

రాజధానిపై సామాజిక వర్గం ముద్ర వేయడం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం.. ఖర్చు ఎక్కువంటూ ప్రచారం చేయడం.. ఇలా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు అధికార పార్టీ నేతలు. వీటన్నింటినీ తిప్పికొడుతూనే ఉద్యమాన్ని వినూత్న రీతుల్లో ముందుకు తీసుకెళ్లారు అమరావతివాసులు. మహిళలైతే ఉద్యమంలో మొదట్నుంచి కీలకమైన పాత్ర పోషించారు. ఈ మహిళా శక్తి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

సాక్షాత్తూ ప్రధానే అమరావతికి శంకుస్థాపన చేశారు. చేయూత ఇస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో మాస్టర్ ప్లాన్ మొత్తం సిద్ధమై నిర్మాణాలు చకచకా  మొదలయ్యాయి. ఓ పక్క ప్రభుత్వ కాంప్లెస్‌లు సిద్ధమవుతుంటే.. SRM, విట్ లాంటి ఎన్నో సంస్థలు తరలివచ్చాయి. విశ్వనగరానికి పునాదులు పడి వడివడిగా ముందుకు సాగుతున్న టైమ్‌లో.. అధికారమార్పిడితో మొత్తం తలకిందులైంది. అమరావతిని భ్రమరావతి అని నిరూపించాలనుకుని ప్రయత్నం చేసిన వారు.. వస్తూనే  విధ్వంసానికి తెరతీశారు. దీన్ని సరిదిద్దాలంటూ 500 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ప్రస్తుతం అమరావతిలో సాగుతున్న పోరాటం 29 గ్రామాలకు సంబంధించింది ఎంత మాత్రం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌. అందుకే.. అమరావతి నినాదం రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతిచోటా మార్మోగుతోంది.

కొవిడ్ కారణంగాను, కోర్టు తీర్పుల వల్లా ప్రస్తుతానికి రాజ‌ధాని తరలింపు ఆగింది. ఇది తాత్కాలికంగా ఆగడం కాదు శాశ్వతంగా అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ విశ్రమించేది లేదంటున్నారు అమ‌రావ‌తి ప్ర‌జ‌లు. అందుకే, 500 రోజులుగా ఉద్య‌మిస్తున్నారు. త‌మ పోరాటం ఇక్క‌డితో ఆగిపోదు.. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా లక్ష్యం చేరుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లేదంటున్నారు.

ఉద్యమమే ఊపిరైతే.. రేపటి తరాల బంగారు భవిష్యత్తే నీ లక్ష్యమైతే.. ఆ స్ఫూర్తిని ఆపేదెవరు. ఆ ఆశయానికి అడ్డు తగిలేదెవరు. నియంతల్లా మారిన పాలకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా సరే.. ఆ ఉక్కు సంకల్పం గెలిచే తీరుతుంది. ఈ తథాగతుడి సాక్షిగా.. ఆ గౌతమబుద్ధుడు బోధించిన అహింసా సిద్ధాంతమే ఆయుధంగా.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే అవుతుంది. ప్రజా ఉద్యమానికి ఎలాంటి పాలకులైనా తలవంచాల్సిందే. న్యాయం, ధర్మం గెలవాల్సిందే. అమరావతి పోరాటం విజయం సాధించాల్సిందే. ఇప్ప‌టికే రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. మ‌రో మూడేళ్లైనా ఇలానే పోరాడే స‌త్తా, స‌త్తువ, సాహ‌సం ఉంది. అప్ప‌టికి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈసారి చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోతారా.. అమ‌రావ‌తి స్వ‌ప్నం సాకారం కాక‌పోతుందా.. అనే ఆశ‌తోనే, ప‌ట్టు వ‌ద‌ల‌ని సంక‌ల్పంతో పోరాడుతున్నారు అమ‌రావ‌తివాసులు. వారి ఆకాంక్ష త‌ప్ప‌క‌ నెర‌వేరాల‌ని కోరుకుంటూ.. జై అమరావతి.. జైజై అమరావతి.

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి లాప్ ట్యాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.   

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.