2011 వరల్డ్ కప్ విజేత భారత్
posted on Apr 3, 2011 @ 10:44AM
ముంబై: వ్వావ్వ్వ్.... యాహూ... హుర్రే... శబ్బాష్ష్ష్... సూపర్... ధోనీ సేన గెలిచింది. దేశం మొత్తం ఊగిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యావద్భారతం ఉర్రూతలూగింది. ఆనందం పట్టలేక ఎగిరి గంతేసింది. విజయోద్వేగంతో గంతులేసింది. భారత వీరుల వీర విహారం చూసి తనువెల్లా పులకించింది. ఇది మామూలు ఆట కాదు. మనోళ్లు కొట్టారు.. ఇరగ్గొట్టారు.. చితగ్గొట్టారు.. గెలిచారు. దేశాన్ని గెలిపించారు. కోట్లాది అభిమానులను మురిపించారు. కప్పు... వరల్డ్ కప్పు... క్రికెట్ వరల్డ్ కప్పు.. ఎన్నాళ్లుగానో.. ఎన్నేళ్లుగానో.. ప్రతి భారతీయుడికీ ఓ తీరని కల. ఇన్నాళ్లకు మన కుర్రాళ్లు ఆ ముచ్చట తీర్చారు. చరిత్రను పునరావృతం చేశారు. 1983నాటి లార్డ్స్ను... 2011లో వాంఖడేలో ఆవిష్కరించారు. 28 సంవత్సరాల తర్వాత దేశానికి కప్పు అందించారు. అంతేకాదు... 'సచిన్కు ప్రపంచ కప్పును బహుమతిగా అందిస్తాం' అన్న మాట నిలబెట్టుకున్నారు.
టాస్లో చుక్కెదురైనా... లంకేయులు 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచినా... ఏ దశలోనూ తడబడలేదు. వీర విజృంభణ చేస్తాడనుకున్న వీరేంద్ర సెహ్వాగ్ రెండో బంతికే డకౌట్ అయినా, శత శతకాల వీరుడిగా చరిత్ర సృష్టిస్తాడనుకున్న సచిన్ 18 పరుగులకే పెవిలియన్ ముఖం పట్టినా.... అదరలేదు,బెదరలేదు. 'అంతా అయిపోయినట్లే' అనుకుని అటు స్టేడియంలో, ఇటు దేశవ్యాప్తంగా టీవీల ముందు కూర్చున్న అభిమానుల్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒక్కో పరుగుతో ఆశలు రేకెత్తించారు. వీలైతే ఫోర్, కాకుంటే రెండు... అదీ కాకుంటే సింగిల్! బంతికి, కాలికి పని చెబుతూనే ఉన్నారు. స్కోరు బోర్డును కదిలిస్తూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాక... ధోనీ రంగ ప్రవేశం చేశాడు. అసలే ఫామ్లో లేడు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లోనూ 50 పరుగులు చేయలేదు. ఇప్పుడేం చేస్తాడు.... అని 'శంకావాదులు' సందేహిస్తూనే ఉన్నారు. ఈ అనుమానాలను ధోనీ తన బ్యాట్తో బద్దలు కొట్టాడు. అటు ధోనీ, ఇటు గంభీర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు.
తొండితో టాస్ గెలిచినప్పటికీ... శ్రీలంక మ్యాచ్ను మాత్రం గెలవలేకపోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచి శ్రీలంక బ్యాటును కట్టేశారు. అడపాదడపా బంతి ముందుకు కదిలినప్పటికీ ఫీల్డర్లు చిరుతల్లా ఉరికి ఉరికి పట్టేశారు. 15 ఓవర్లదాకా ఇదే సీన్! లంకేయుల మొత్తం స్కోరు 210 - 220 దాటదనుకున్నప్పటికీ... చివరికి పరిస్థితి మారింది. ఈ టోర్నీలో అంతగా ఫామ్లో లేని మహేళ జయవర్ధనే సెంచరీ కొట్టి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి పవర్ప్లేలో లంకేయులు గర్జించడంతో మొత్తం స్కోరు 274 పరుగులకు చేరింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఛేదిస్తే... ఇలాంటి భారీ లక్ష్యాన్నే ఛేదించాలి. అప్పుడే గెలుపులో మజా! అసలైన ఆనందం! ఈ ఆనందాన్ని శనివారం యావద్భారతం సంపూర్ణంగా ఆస్వాదించింది. గెలుపు ఖాయం కాగానే కుగ్రామాల నుంచి మహా నగరాల దాకా పండగే పండగ! బాణసంచాతో దద్దరిల్లాయి. అటు విదేశాల్లోని భారతీయులు కూడా ఈ విజయంతో సంబరాలు చేసుకున్నారు. ఇటు.. వాంఖడేలో భారత విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల ఆనందానికి హద్దులే లేవు. ఈ విజయాన్ని సాధించిన భారత జట్టు ఉద్వేగాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.అటు పరుగులతో, ఇటు వికెట్లతో అద్భుత ప్రతిభ చూపిన యువరాజ్సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.13.50 కోట్ల నజరానా లభించింది. కాగా, జగజ్జేతగా నిలిచిన టీమ్ ఇండియాకు రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ ఆదివారం తేనీటి విందు ఇవ్వనున్నారు. దేశానికి వరల్డ్కప్ సాధించిపెట్టిన ధోనీ సేనకు రాజ్భవన్లో ఈ సాయంత్రం రాష్టప్రతి విందు ఏర్పాటు చేశారు.