Previous Page Next Page 
విరాజి పేజి 29

   

    విరాజి నవ్వింది. ఆ నవ్వులో ఏ భావం లేదు.

    "నన్ను బ్రతికుంచుకోవటం! నువ్వు చనిపోయి ఏం సాధించావు గౌతమ్?"

    "నిన్ను!"

    అప్పుడు నేను మరణిస్తే _ పోగొట్టుకునే వాడివి. అ పోగొట్టుకోవటంలో అందముంది.      ఇప్పుడు నన్ను బ్రతికించుకుని పోగొట్టుకున్నావు. ఇందులో అసహ్యముంది.

    "విరాజీ! అలా మాట్లాడవద్దు "

    "ఒక్క విరాజీ మరణిస్తే యీ ప్రపంచానికి నష్టం లేదు గౌతమ్."

    "కానీ నాకు నష్టముంది."

    "ఓ మహాయాత్రకు సిద్ధపడినప్పుడు వ్యక్తిగతమైన లాభ నష్టాల ప్రమేయంలేదు గౌతమ్. ఈ భూమ్మీద మహా మహులెవరూ తమ ఆశయ సాధన గురించే ఆలోచించారు. గాని వ్యక్తిగతమైన నష్టాలకు విలువ యివ్వలేదు."

    "నేను మహామహుడ్ని కాదు సామాన్య మానవుడిని ."

    "నిన్ను ఉత్తమోత్తమమైన వ్యక్తిగా చూడాలని కళలు కన్నాను గాని ఒక సామాన్యుడిగా కాదు. నేను వెళ్ళిపోయినా నా కలలు, ఆశలకు ఓ రూపమైన నువ్వు ఎదిగివుంటే నా ఆత్మ ఒకవేళ ఆత్మ అంటూ వుంటే వుంటే సంబరపడి పోయేది. మురిసిపోయేది. కాని యిప్పుడు .... ఆమె కళ్ళనుండి జల జల మని కన్నీళ్ళు.

    అతని గుండె నీరయి పోయింది ."విరాజీ! ప్లీజ్, నన్నర్ధం చేసుకో" అంటూ దగ్గరకు రాబోయాడు.

    "నో! నా దగ్గరకు రాకు" అన్నది విరాజి దృఢ సంకల్పం పుట్టిపడే కంఠంతో.

    "విరాజీ!"

     "అవును , ఈ దూరం దూరం గానే వుండనియ్యి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ!"

    "విరాజీ! దిన్ ఈజ్ టూ మచ్!" ఈ పర్యవసానం నేను ఊహించలేను. ఇది భరించలేను.

    "నువ్వు డబ్బు మనిషి వైపోయావు గౌతమ్ నీధన వ్యామోహన్ని, అల్పంగా పరిస్థితులకు లొంగి పోయే నీ గుణాన్ని నేనూ భరించలేను."

    "విరాజీ! మూర్ఖంగా మాట్లాడకు ఎస్కేపిజం గౌతమ్! ఎందుకు మారినా, ఎవరి కోసం మారినా డబ్బుమనిషి డబ్బు మనిషి."

    అతనికి కోపం ముంచుకోస్తున్నది. నిస్సహాయత , బలహీనత, ఆమెను కన్విన్స్ చేయలేక పోతున్నా నన్న ఉక్రోషం ఆమె తనని అర్ధం చేసుకోవాటం లేదన్న కసి __ అతనిని ఉన్మత్తుడిని చేస్తున్నాయి.      
       

    "డబ్బు మనిషి, డబ్బు మనిషి. డబ్బు మనిషి ,అవును నేను డబ్బు మనిషిగా మారితే తప్పేం ? అసలు డబ్బు సంపాదిస్తే ఏమిటందులో అపరాధం? ఈ డబ్బులేకపోతే నువ్వీరోజు ప్రదర్శనయివ్వగలిగితే దానివా? డబ్బులేని, డబ్బు సంపాదించటం చేతకాని అసమర్ధపు స్థితిలో చేతకాని వాజేమ్మలా ప్రాణాలర్పించు కోవటం గొప్పా? తింటానికి తిండి లేక రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ మరమరాలు, లేదా సెనగపప్పు తింటూ కడుపు నింపుకోవటం ఓ వేడుకా విరాజీ? ఏమిటి కళ? ఆకలితో మండే గుండెలతో అలమటిస్తూ నూటికి ఒక్కరు తప్ప అర్ధం చేసుకుని, వెలుగుకు నోచుకోని, ఎవరికీ అఖ్కర్లేదని , సాహిత్యాన్ని సృష్టించి , ఎప్పటికప్పుడు నిరాదరణకు లోనవుతూ, మనలిని మనం చంపుకోకుండా వుండాలనుకొంటూ అర్పణ చేసుకోవతమా! అది సమర్ధతా జీవితాన్ని సాధించటమా? అవును నేను డబ్బు సంపాదిస్తాను . ఈ సమాజంలో అసమర్దుడిగా ,అయిన వాళ్ళు ఆపదలో వుంటే ఆదుకోలేని దుస్థితిలో , ఎప్పటికప్పుడు జేబులు తడుముకొనే అవమానకర పరిస్థితిలో వుండను, వుండబోను, నాకా అవకాశాలు వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటాను. సక్సేస్ అంటే ఏమిటో చూపిస్తాను!"

    విరాజి ఆశ్చర్యంగా , కళ్ళు పెద్దవిచేసి అతని వంక చూస్తోంది.

    ఇరనేనా నాగవుతమ్! కళలోని ఉత్తమ విలువలని గురించి, కళాత్మక __ రసాత్మక గుణగుణాల గురించి ఎన్నిసార్లు , ఎన్నిరకాలుగా బోధించింది! అతని హృదయక్షేత్రంలో ఆరోగ్యకరమైన పుష్పీకరణ చెయ్యాలని ఎంత శక్తిని ధారాపోసింది?"

    ఒక్క కారణం .... తనను బ్రతికించాలని యిదంతా చేశానని ప్రకర్ష చూపెడుతూ ఎలా మాంపోయాడు? ఎంత యంత్రకంగా మారిపోయాడు?

    అతనంటే ఆమెకు ఎలర్జీ  కలిగింది .

    అతన్ని ఒక్క క్షణంకూడా భరించలేని స్థితికి వచ్చింది. "సరే గౌతమ్! ఈ జీవిత సమరంలో ఇద్దరం భిన్నధృవాలలో నిలబడ్డాం. నాతో కలసిపోయివుంటే స్వార్దాలతో, కల్మషాలతో ఎడం అవుతానన్న భయంతో , సమాంతర రేఖలావుంచి నిలబెట్టుకుందామని ప్రయత్నించాను. ఓడిపోయాను. ఈ మహా యాత్రలో గెలుపెవరిది? ఓటమి ఎవరిది? అన్న సంఘర్షణ మన కొద్దు. అభిప్రాయాలు వేరయిపోయాయి. ఇహా మనము విడిపోవటము మంచిది గవుతమ్."

    అతనిలో ఆవేశం అవదులుదాటి, ఉద్రేకంతో ఊగిపోయాడు.

    "సరే విరాజీ ! నీ అభీష్టం , ఉద్రేకంతో ఊగిపోయాడు.

    "సరే విరాజీ ! నీ అభీష్టం అదే అయితే ఒక మనిషిని అర్ధం చేసుకో లేని మూర్ఖత్వమే నీ జీవిత పరమావధి అయితే అలాగే ..... విడిపోదాం"

    "మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకొబోవటం లేదు గవుతమ్ "

    "అలాగే" అంటూ అతను విసురుగా బయట వెళ్ళిపోయి చీకట్లో కలసిపోయాడు.     

    తలుపులు జారవేసి, బరువెక్కిన గుండెతో, జలజల వర్షిస్తోన్న నేత్రాలతో ఆ తలుపులకానుకుని ఎంతోసేపు విరాజి నిలబడిపోయి వుందని అతనికి, చీకట్లో ఎటుపోతున్నాడో కూడా తెలుసుకోకుండా దూసుకు పోతోన్న అతనికి తెలియదు.

                                                              *    *    *   

    గాడికి వొచ్చాక ఆ రాత్రంతా నిద్రపట్టక చాలాబాధపడ్డాడు. గవుతమ్  దుఃఖం, బాధ, ఉక్రోషం వీటి మధ్య నలిగి ముద్దయి పోయినట్లు అయిపోయాడు.

    కాని ఉదయం ప్రక్కమీద నుంచి లేచాక పునర్జన్మ ఎత్తినట్టుగా అనుభూతి పొందాడు. ఎవరికోసం తాను తపించి మనసును అమ్ముకున్నాడో ఆ నిజాన్ని నిరాకరించడానికి ప్రయత్నించిన స్రీ ఆమె. యిహా మరచిపోవాలి. మనస్సు రాయి చేసుకున్నాడు.

    లేచి ముఖం కడుక్కుని గది తలుపులు దగ్గరకు జారవేసి వరదరాజు టీకొట్టు కెళ్ళాడు.

    గవుతమ్  ని చూసి వరదరాజు పులకరింపుగా  నవ్వాడు.

    "వరదరాజూ! రాత్రి పోగ్రాంకి వచ్చావా! అనడిగాడు.

    "వచ్చాను బాబుగారూ! మీరు స్టేజిమీద బిజీగా వుండటం చేత నన్ను చూడలేదు. కొంచం దూరంలో కూర్చున్నాను" అని వేడి వేడి టీ అందించాడు.

    "నాట్యం ఎలా వుంది?" అని అడగాలనుకుని తమాయించుకున్నాడు. విరాజిని గురించిన ప్రస్తావన తీసుకురావట మతనికిష్టం లేకపోయింది.

    "ఆ అమ్మాయి డ్వాన్స్ చాలా అద్భుతంగా చేసింది బాబుగారు ! డ్వాన్స్ ద్వారా కధ నడిపించిన తీరుకూడా గొప్పగా వుంది."

    గవుతమ్ వినిపించుకోనట్టు టీ త్రాగుతున్నాడు.

    "ఇందులో మీ కృషి కూడా చాలా వుందనుకుంటాను బాబుగారూ!

    అప్పటికీ గవుతమ్ మాట్లాడలేదు.                

    "ఆ అమ్మాయి కథ నడిపించిన తీరు, నాట్యాన్ని మలచిన విధానం _ యీ పద్దతినే ముందుకు నెడితే చాలా పైకి వచ్చేస్తుంది. బాబుగారూ.

    గవుతమ్ దానికి కూడా జవాబువ్వలేదు. అతని మౌనాన్ని వరదరాజు అపార్ధం చేసుకోలేదు. ఆమెకూ, గవుతమ్ కూ గల స్నేహము అతను కొంతవరకూ అర్ధం చేసుకుకొన్నాడు. తన సంతోషం బయటకు ప్రకటించు కోవటము సభ్యతగా ఉండదని అలా మౌనంగా వున్నాడని అనుకున్నాడు.

    టీ త్రాగి గాడికి వస్తూ దార్లో ఆరోజు డిన పత్రికల్నీ కొన్నాడు.

    గదికి వచ్చాక ఒక్కొక్కటీ చదివాడు.

    దాదాపు అన్ని పత్రికల్లోనూ విరాజి నృత్య ప్రదర్శనను గురించి ప్రముఖంగా ప్రచురించబడింది. ఆ పత్రికలూ ఆమె కళాభినయాన్నీ, నటనా ధృవతార" "నాట్యానికి కొత్త వొరవడి పెట్టిన కళాభినేత్రి" యిలా హెడ్డింగ్స్ కూడా ఆమెను పైకి ఎత్తివేస్తూ రాశాయి.

    చదివినంత సేపూ వాటిని ఆసక్తిగా చదివి తర్వాత ఓ మూలకు గిరాటు వేశాడు.

    "విరాజీ! విరాజీ! విరాజీ! నిన్ను మరచిపోతాను. నిన్ను అదిగా మిస్తాను. ప్రపంచానికి ఏది అవసరమో నిరూపిస్తాను.

                                                               *    *    *

    తర్వాత రెండు రోజులు పిచ్చేత్తినట్లు రాశాడు. ఇంచు మించు నాలుగు పత్రికలకు కమిట్ అయ్యాడు. నలుగురూ ఎడ్వాన్స్ యిచ్చారు.

    అతన్లోకి ఓ నూతన పురుషుడు ప్రవేశించి నట్లయింది. చాలా తేలిగ్గా నాదమునిగారి పాట్లు రచనా విధానం అన్నీ ఆకళింపు చేసుకున్నాడు. కథలో ఎప్పుడూ ఏదో సంఘటన దొర్లుతూ వుండాలి. కథ నడిపించటం కష్టపైనప్పుడల్లా ఓ కొత్త పాత్రని ఏవో మేనేరిజమ్స్ జతచేర్చి ప్రవేశపడుతూ  వుండాలి. ప్రతి ఇన్ స్టాల్ మెంటుకూ అంతలో అవసరమన్నా సరే లేక పోయినా సరే ఓ మెలిక ఉండాలి ..... ఏ విధంగానైనా జోప్పించాలి.

 Previous Page Next Page