Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 25

 

    "విష్ణుజీ.......అవన్నీ నాకెందుకు గానీ, ఇప్పుడు నన్నెందుకు పిలిపించారో,నేను మీకు ఏ సహాయం చేయగలనో అది చెప్పండి చాలు" పుల్ల విరిచినట్లుగా అన్నాడు.
    అప్పుడు కనిపించింది విష్ణు ముఖంలో చిరునవ్వు.
    అది గమనించి ఆశ్చర్యపోయాడు వినయ్.
    "మిస్టర్ వినయ్ మీలో నన్ను ముగ్దుడ్ని చేసిన గుణం ఇదే. మీకు డ్యూటీ పట్ల ఎంత అంకిత భావంతో పనిచేస్తారో మీ మాటలే తెలియ చెబుతుంటాయి. అందుకే ప్రత్యేకించి మిమ్మల్నే పిలిపించాను. నిజానికి డి.జి.పి స్థాయి వరకూ ఎందరో పోలీస్ అధికారులలో నా భక్తులు వున్నారు , కానీ వాళ్ళు ఎవరూ మీలా డీప్ గా ఇన్ వెస్టిగేషన్ లో చొచ్చుకుపోలేరు. నా రిక్వెస్ట్ ఏమిటంటే మీకు రిపోర్ట్ ఇస్తాను , సృష్టికే అద్యులయిన త్రిమూర్తుల విగ్రహాలను ఆభరణాలను దొంగలించిన దొంగ ఎవరో అరా తీయండి. వాళ్ళను శిక్షించే సంగతి ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. మీ ప్రయత్నం మీరు చేయండి.
    ఈ విషయం లీక్ కాకుండా చూడండి. మిమ్మల్నే ఏరో కోరి పిలవడంలో ముఖ్య కారణం ఇదే. మీ సిన్సియారిటీ పట్ల నాకు నమ్మకం వున్నది. ఎంత అధికారంలో వున్నా నా మందిరం పై కన్నెత్తి చూడడానికి,  వీసమెత్తు అభియోగం మోపడానికి అయినా వణికిపోయే పోలీస్ డిపార్ట్ మెంట్ లో తొలిసారిగా మీరు మాత్రమే మీ అధికారాంతో నన్ను ప్రశించగలిగారు. అందుకే మీలాంటి ఆఫీసర్ మాత్రమే సిన్సియర్ గా పరిశోధించగలరనే నమ్మకంతో మీకు తెలియజేస్తున్నాను.
    విష్ణు మాటలలో రకరకాల అర్ధాలు గోచరించాయి.
    దొంగతనం జరిగిందనే విషయం ప్రజల మధ్యకు వెళితే ఇప్పుడు తనకు వున్న పాపులారిటీ తగ్గిపోతుందనే భయం కావచ్చు. లేదా విగ్రహాలను ఆభరణాలను దొంగలించిన దొంగ ఒకవేళ ఈ ఆశ్రమంలోనే నివాసము ఏర్పరచుకుని వుంది వుంటే జాగ్రత్త పడిపోతాడనే ముందు చూపు అయినా అయివుండాలి.
    "విష్ణుజీ ....నా శక్తి వంచన లేకుండా సాధ్యమయినంత త్వరలో ఆ దొంగ ఎవరో ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తాను" విష్ణు ఇచ్చిన కంప్లయింట్ తీసుకుంటూ అన్నాడు వినయ్.
    ఒకప్పుడు తను దొంగతనం జరిగిందంటూ వస్తే ఎలాంటి దొంగతనమూ జరగలేదన్నాడు విష్ణు. ఆ దొంగను తను కళ్ళారా చూశాడు అయినా ఏమీ దొంగలించబాధలేదని , అసలు అలాంటి దొంగాబుద్దితో ఎవరు తన ఆశ్రమంలో అడుగు పెట్టరనే చెప్పాడు.
    తరువాత అదే దొంగను రెడ్ హండెడ్ గా ఆ ఆశ్రమంలోనే పట్టుకుంటే-
    ఆమె ఆధ్యాత్మిక పుస్తకాల కోసం వచ్చిందే తప్ప దొంగతనానికి రాలేదని చెప్పి ఆమెను సపోర్టు చేయడమే కాకుండా ఆమెను శిష్యురాలిగా చేసుకున్నాడు విష్ణు.
    మరి ఈరోజు కోట్ల ఖరీదు విలువయిన విగ్రహాలు పోయాయి.
    ఆశ్రమంలో వుండే భక్తులకు తెలియకుండా , ఎంతో ధైర్యంగా విష్ణు పూజా మందిరంలోకి పరాయివాళ్ళు ప్రవేశించడానికి వీలులేదు.
    అయినా దొంగతనం జరిగిందంటే ఆ డింగ ఎవరో లోపల వుండి వుండాలి. లేదా లోపల వున్నవాళ్ళ సహకారంతో బయటవున్న వారెవరో ఆ పని చేసయినా వుండాలి.
    వినయ్ కుమార్ ఆలోచనలను భంగపరిచాడు విష్ణు.....
    "మిస్టర్ వినయ్....దయచేసి ఈ విషయంలో నా శిష్యులకు మనస్తాపం కలిగించే ప్రశ్నలు మాత్రం వేయవద్దు.'
    "ఇట్స్ ఒకే.....మీకు ఎవరిమీదనయినా అనుమానం వున్నదా?"
    "ఇన్ స్పెక్టర్ ...మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేక పోతున్నాను."
    'అదేమిటి?"
    "తండ్రి తన బిడ్డలను అనుమానించగలడా- గురువు తన శిష్యులను శోధించగలడా? మీరే చెప్పండి.....ప్రజలు నాకిచిన్న కానుకలన్నీ తిరిగి ప్రజలకే ఖర్చు పెట్టాలన్నది నా అభిమతం. నా అభిప్రాయాన్ని మన్నించే నా శిష్యులు ఎందరో ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, విద్యాలయాలను కట్టిస్తున్నారు.
    సామాన్యులకు అందుబాటులో లేని విదేశీ విద్యా కోర్సులను ఉచితంగా అందజేస్తున్నారు. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి సచ్చిలతకు అంకితమైపోయి ఉన్న నా బిడ్డలలో ఎవరో ఒక దొంగ వున్నాడని అందరినీ అనుమానించగలనా చెప్పండి. అందుకే మీ సహకారాన్ని కోరుతున్నాను. నా బాధ ఏమిటో మీకు అర్ధం అయిందనుకుంటున్నాను."
    విష్ణు చెప్పిన మాటలు సూటిగా వినయ్ కుమార్ మనసును హత్తుకున్నాయి.
    "పాము చావాలి.......కర్ర విరగకూడదు" అన్నట్లున్నాయి. విష్ణు మాటలు. అయినా తన వృత్తి ధర్మమే అంత కాబట్టి మౌనంగా వుండిపోయాడతను.
    "ఓకే విష్ణుజీ.......ఏదయినా సమాచారం లభించినా....ఎలాంటి అనుమానం కలిగినా నాకు తెలియజేయండి. మీ అభీష్టం మేరకు ఈరోజు సాయంత్రం ఒక సాధారణ భక్తునిలా మీ దర్శనానికి మాప్టీలో వస్తాను. నా పరిశోధన అప్పటినుంచి ప్రారంభిస్తాను."
    అని ఆయనవద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు వినయ్ కుమార్.
    భక్త జన సందోహం మధ్యలో వున్న భారతి...రీటాలు , మందిరంలో నివసించే భక్తులను కానీ, శిష్యులను గానీ ఎవరినీ ప్రశ్నించకుండానే వెళ్ళిపోతున్న ఇన్ స్పెక్టర్ ను చూస్తూ ఎవరికి వారె ఆలోచనలో పడ్డారు.

                                                            *    *    *    *

 Previous Page Next Page