Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 25

   

        ఆ మధ్యాహ్నం అతనూ, మోహన్, అతని బావగారూ, చిన్న అన్నగారూ చేరి సావిట్లో పెకాడుతున్నారు. ఇంతలో లోపలనుంచి ఆడవాళ్ళు "పాము పాము" అని అరిచారు. మొగవాళ్ళంతా హడావుడిగా లోపలకు పరిగెత్తారు. ఆదుర్దాలో, ఉబలాటంలో అది కొత్తచోటు అని మరిచి శివనాథరావు కూడా వాళ్లవెంట వంటింటి పెరట్లోకి పరిగెత్తాడు. స్పష్టంగా కనిపించింది గోధుమ వన్నెతరచు. చాలా పొడవుగా, పొగరుగా వుంది. వాళ్ళంతా అలా చూస్తుండగానే యిటుకలమీద నుంచి మహావేగంతో జరజరమని ప్రాకుకుంటూ ప్రక్క యింటికి సరిహద్దుగా వున్న సగం పడిపోయిన గోడలో ఓ కన్నంవుంటే అందులో దూరింది. ఆడవాళ్ళు పిల్లల్ని గట్టిగాపట్టి వుంచుతున్నారు ముందుకు పోనీయకుండా వాళ్ళు వారిస్తున్నా వినకుండా మోహన్ బావగారు ప్రక్కనే వున్న బావి గట్టుమీద కూర్చుని ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూపులతో గాలిస్తున్నాడు. మోహన్ బాగా దూరంగా నిలబడి "లోపలికి పొండి" అని పిల్లల్ని ఆడవాళ్ళని గదమాయిస్తున్నాడు. శివనాథరావుకు చాలా ఉత్సాహంగా వుంది. పాములవాడి బుట్టలోకాకుండా స్వేచ్చగా తిరుగుతూన్న ఓ పామును యిదే మొదటిసారి అతను చూడటం. ముందుకు ఓ అడుగు వేయబోతుంటే మోహన్ కాలరు పట్టి బలంగా గుంజాడు.
   
    ఎవరో పాములావాడిని పిలుచుకురావటానికి పోయారు. ఇరుగుపొరుగు వాళ్ళు చాలామంది గుమికూడారు. పాములు రావటం అలవాటే అయినా ఎప్పటికప్పుడు ఈ ఉత్సాహం వాళ్ళకు వుంటూనే వుంది. అది యింకా అక్కడే వుండదనీ, దొంగదారిగుండా వెళ్ళిపోయి వుంటుందనీ ఒకరిద్దరు అన్నారు. శివనాథరావు మెల్లిగా జరిగి మోహన్ బావగారి దగ్గరకు చేరాడు.
   
    పాములవాడు వచ్చాడు, కూడా ఓ ఆడదికూడా వుంది. ఎవరో గునపం అందించారు. పాములాడు గోడ త్రవ్వటం మొదలుపెట్టాడు. శివనాథరావు ఏదో క్షణంలో అది రివ్వున బయటకు ఎగిరి పడుతుందని చూడసాగాడు. పాములవాడు ఓ నిముషం త్రవ్వటం ఆపి పరిశీలనగా చూసి "లోపల వుంది" అని అరిచాడు. చాలాభాగం త్రవ్వడం అయిపోయి, కన్నం తగ్గిపోతోంది. అయినా సర్పం లో లోపలకు యింకా ముడుచుకుపోతోంది. అది బయటకు ఎంత భయంకరంగా...
   
    అతని ఆలోచన పూర్తిగాకముందే సర్రున నాగు బయటికొచ్చేసింది. శివనాథరావు ఆవేశంతో లేచి నిలుచున్నాడు. అందరూ భయంతో రెండడుగులు వెనక్కువేశారు. పాములవాడు తొణకలేదు, బెణకలేదు. ఒడుపుకోసం కాబోలు ఆలోచిస్తూ ఓ క్షణం నిలబడ్డాడు. ఈలోగా అది యిటుకలరాశి మీదనుంచి జారిపోతోంది. మోహన్ పట్టుకొమ్మని గట్టిగా అరిచాడు. కూడా వచ్చిన ఆడది ముందుకు ఉరికి దాని తోక పట్టుకుని ఇవతలకు గిరాటు వేసింది. పడగవిప్పి బుస కొట్టందేం అనుకుంటున్నాడు శివనాథరావు పాము నేలమీదపడి చుట్టూ మనుషులను చూసి బెదిరి, దారితోచక అక్కడున్న తులసి చెట్టుకు చుట్టుకుంది. పాములవాడు ఎటూ పోనీయకుండా దాన్ని పట్టుకుని లాగాడు. క్రిందపడి కదల్లేక కదిలింది. మోహన్ 'చంపెయ్యి' అని అరిచాడు. పాములవాడు కర్రఎత్తి మెదక్రింద కొంచెం యిట్లా అన్నాడు నేర్పుగా కదల్లేక కొట్టుమిట్టాడుతోంది. తరువాత మెడమీద జాగ్రత్తగా కర్ర ఆనించి చేత్తో పామును పట్టుకున్నాడు. దాని నోరుతెరచి కోరలు చూపించాడు. వాడు పాములవాడే అయినా-ఆ వృత్తి చేయటం లేదుగావును క్రిందపడేసి కర్రతోబాధి చంపేశాడు.
   
    ఇంటికి కొంచెం అవతలగా వీధిలో చితిని పేర్చారు. నాగుపాముని అందులో పడేసి నిప్పంటించారు. పిల్లలు అందులో కాణీలు పడేశారు. దాదాపు గంటసేపు కాలింది. పాము బూడిద అయిపోయింది. పిల్లలు కాలిన కాణీలు తెచ్చి దాచుకున్నారు.
   
                              *    *    *
   
    కాలం మందంగా పరిగెడుతోంది. రాత్రి భోజనానికి లోపలికి పోయే సమయంలో దీపం వెలుగులో ఓ దృశ్యం చూసి చకితుడయ్యాడు శివనాథరావు.
   
    ఆ వెలుతురు చాలు!
   
    అబ్బ! అంత అందం! మోహన్ వాళ్ళ కుటుంబంలో పిల్ల అంటే నమ్మశక్యం గాలేదు. చిత్రకారుడు వెదుక్కునే విశాల విచిత్రనేత్రాలు. ఎండముఖం ఎరుగని దానిలా ఆమె శరీరపు వన్నెచిన్నెలు-పరవశం కలిగించే దివ్యకాంతులు. గ్రామీణ వాతావరణంలో అమరిన సౌష్టవం ఆమె ప్రత్యేకత. అందం ఆనందాన్ని రగిల్చింది. అతని ఊహలో జ్యోత్స్నాహిసారిక అతి వయ్యారంగా నడుస్తోంది.
   
    ఆ వెలుతురు చాలదూ?
   
    అతన్ని చూసి ఆమె లేవలేదు. చాపమీద పడుకుని వుంది. చూస్తోంది కానీ అతన్నికాదు. వచ్చినరోజు దూరంనుంచి చూశాడు. పడుకునే వుంది కానీ అప్పటికి ఈ సౌందర్యం బోధపడలా ఆమె పెదవికదపగా అతను చూడలా.
   
    అతను వ్యాకులపాటుతో స్నేహితుడివెనుక లోనికి వెళ్ళిపోయాడు.
       
    రాత్రి పదకొండు దాటి వుంటుంది. మిగతావాళ్ళు నిద్రపోతున్నారు. శివనాథరావు అటూఇటూ కదుల్తున్నాడు. అతనిలో హృదయం దద్దరిల్లింది. ఓ గావుకేక, ఓ ఆక్రందనం పెనుగాలి రయ్యిమని వీచినట్లయింది. ప్రకృతినుంచి ప్రభవించిన ఆహ్వానంలా పోకడలుపోయింది. అతనిలో ఓ స్త్రీ జాగా చేసుకుని విలపిస్తోంది. హఠాత్తుగా సరోజిని రూపం కంటిముందు సాక్షాత్కరించింది. రాత్రి పదకొండుగంటలకు ఏంచేస్తూ వుంటుందో సరోజిని? వద్దు ఆమెను గురించి యిప్పుడు ఆలోచించవద్దు.. కానీ...
   
    మళ్ళీ మూలుగు, ఆర్తనాదం..
   
    శ్మశానవాటికలో పిశాచం గాఢతిమిరంలో నవ్వినట్లు శరీరంలోని అణువు లన్నీ ఒక్కపెట్టున ఏడిచినాయి భయం చీకటి ముసుగు కప్పుకున్న హృదయాంత రాళంనుంచి ఉబికి వస్తోన్న కంపన అధికమై, మరింత ఆహ్దికమై మహావేగంతో విజ్రుంభించి, సర్వం తనే అయి యుగాంతంలో దిగంతాలన్నీ తృటిలో నుసి అయినట్లు హఠాత్తుగా సమసిపోగా ప్రకృతికాంత చేసిన వికటాట్టహాసంగా జంకించి జంకించి విడచిపెట్టింది.
   
    చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బ్రద్దలుచేస్తూ హాహాకారాలు లేచి చూద్దామనుకున్నాడు కానీ ఏదో అదృశ్యపాశం మంచానికి కట్టి పడవేసింది. మోహన్ ని గొంతెత్తి పిలవబోయాడు. స్వాధీనంకాలా ఒక దొర్లు దొర్లి వుంటాడు. పెద్దగా వేశాననుకున్న కేక, చెట్టు మొక్కనుంచి పువ్వు రాలి పడినంత స్వల్పంగా వినిపించింది.
   
    భుజంమీద ఒక మెత్తని చెయ్యిపడింది "ఝడుసుకున్నావా?" అంది మోహన్ గొంతు.
   
    "ఊ"
   
    మోహన్ వెళ్ళి దీపం పెద్దదిచేశాడు. ఇంత జరిగినా అతని బావగారు నిద్ర లేవలేదు. లోపలినుంచి ఓ స్త్రీ గొంతు ఎవరినో సముదాయిస్తున్నట్లుగా  వినిపిస్తోంది.
   
    మోహన్ దగ్గరకు వచ్చాడు "బయటకు వస్తావా?" అన్నాడు. శివనాథరావు మెల్లగా లేచి నిలబడ్డాడు. ఇద్దరూ బయటకు పోయి అరుగుమీద కూర్చున్నారు.
   
    "ఏం చేశాను?" అన్నాడు శివనాథరావు తడారిపోయిన గొంతుకతో.
   
    మోహన్ జవాబు చెప్పకుండా సిగరెట్ వెలిగించుకున్నాడు. "మా చెల్లెలు" అన్నాడు కొంచెం ఆగి.
   
    "జబ్బా ఏమయినా?"
   
    "విను చెబుతాను" మోహన్ ముఖం ప్రక్కకి త్రిప్పుకుని చెప్పసాగాడు. "భవాని దాని పేరు. మా అందరిలోకీ అదే చాలా అందమైనది. మా యింట్లో అందరికీ  చెప్పలేని గారాబం అదంటే. ఈ పల్లెటూరిలో కూడా బోలెడు డబ్బు ఖర్చుపెట్టి సంగీతం మేష్టారిని పిలిపించి సంగీతం చెప్పించాం ఆ రోజుల్లో అది గొంతువిప్పితే వంద కోయిలలు కూసేవి. చివరకు మానాన్న చనిపోయేటప్పుడు కూడా మమ్మల్ని చేరబిలిచి "భవానిని జాగ్రత్తగా చూసుకోండిరా దానిని కొంచెమైనా నొప్పివ్వకండి. అది చాలా సుకుమారి" అంటూ ఎంతో ఆవేదన పడ్డారు. అప్పుడు డానికి పదకొండేళ్ళు. మేమంతా ప్రాణానికి ప్రాణంలా చూసుకున్నాం. ఓ ఏడాది గడిచాక ఏం జరిగిందంటే.....
       
    మోహన్ కంఠం అపశృతులతో ఒణుకుతుంది.
   
    అది వేసవికాలం గాలికోసం మేమంతా ఆరుబయటే పడుకున్నాం. అది యిక్కడే ఈ అరుగుమీదే పడుకుంది. అర్దరాత్రి దాటివుంటుంది. ఒక్క గావు కేక వినబడి మేమంతా త్రుళ్ళిపడి లేచాం. చీకటి నేను ప్రక్కనే పెట్టుకున్న టార్చి వెలిగించి చూశాను. భవాని నేలమీద పడి కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటూ వణికిపోతోంది. అసలా రూపంవేరు.
   
    అంతే! అప్పటినుంచీ బాహ్యస్మృతి కోల్పోయింది. ఎంతోమంది డాక్టర్లకి చూపించాం. వేలకు వేలు ఖర్చుపెట్టాం. అనేక ఊర్లు తీసుకుపోయాం. ఎవరూ నయం చేయలేకపోయారు. మనతో మాట్లాడదు. చెబితే అర్ధం చేసుకోదు. వేరే ప్రపంచంలో నివశిస్తుంది. దాని అందం దాన్ని కాపాడలేదు. రాత్రిళ్ళు అప్పుడప్పుడూ అరుస్తుంది, ఆర్తనాదాలు చేస్తుంది. నరకయాతన పడుతుంది.

 Previous Page Next Page