యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా కలంపట్టి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంలో, ప్రముఖ సాంస్కృతిక సంస్థలు రజతోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నాయి.
వీరేంద్రనాథ్ 'తులసిదళం' రచయితగానే చాలామందికి తెలుసు. ఆ తరువాతే ఆయన పాపులర్ అయ్యారని కాబోలు ఆ ముద్రపడింది. తులసిదళం 1980 ప్రాంతాల్లో ప్రచురితమైంది. కానీ వీరేంద్రనాథ్ మొదటి రచన అంతకుముందు పుష్కరం క్రితం ప్రచురితమైంది. నాటకరంగంతో పరిచయం వున్నవారికి 1970 - 80 మధ్య వీరేంద్రనాథ్ నాటక రచయితగా తెలుసు.
నాటకాలు వ్రాయకముందు వీరేంద్రనాథ్ నాలుగయిదు కధానికలు వ్రాశారు. చందమామలలో కథలు వ్రాయటం తన హాబీగా ఆయన పేర్కొన్నారు.
ఆ రోజుల్లో చందమామ సంపాదకవర్గంవారే భేతాళ కథలు వ్రాసేవారు. లేదా వచ్చిన కథల్లో అనువైనదాన్ని బేతాళ కథగా మలచి ప్రచురించేవారు. మొత్తం కథనే ఆ రూపంలో వ్రాయటం ప్రారంభించింది వీరేంద్రనాథే. ఆ చందమామ కథలు చదువుతూ సంపాదవర్గంతో "ఈ రచయిత ఎవరో త్వరలో పైకి వస్తాడు" అని కొడవటిగంటి కుటుంబరావు అనటాన్ని తన మొట్టమొదటి అపూర్వ అనుభవంగా వీరేంద్రనాథ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
1969లో ప్రచురితమైన ఈ కథల్లో ఈనాటి వీరేంద్రనాథ్ శైలి, శిల్పం స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, ఆయన రచనల్లో వుండే (తర్కానికి అందని) క్లిష్టత కూడా కనిపిస్తుంది. చదవండి -