మరో రెండు రోజుల్లో పెళ్ళి సంభాషణ వేగం పుంజుకుంటుంది. కుర్రవాడు ఇంజనీరు. కాస్త బీద కుటుంబమైనా మంచిది. కుర్రవాడికి ఒక చెల్లెలు, ఒక అన్నా వున్నారు. యూనివర్సిటీ ఫస్టు. స్కాలర్ షిప్ వచ్చింది.
సాహితి ఫోటో చూసింది. ఆమెకు ప్రత్యేకంగా ఏ భావమూ కలుగలేదు. కుర్రవాడు బాగానే వున్నాడు అనుకొంది. ఆమెకు దానికన్నా అతని 'యూనివర్సిటీ ఫస్టు'బాగా నచ్చింది. ఒకప్పుడు తను దానికి కలలు కనేది.
ఆ మరుసటిరోజు పరమహంస వచ్చినప్పుడు నిర్మల ఆ విషయం చెప్పింది.
"అప్పుడే సాహితికి పెళ్ళా?" అన్నాడు.
"మీకు చిన్నపిల్లలాగే కనబడవచ్చు ."
"చదువు పూర్తికాకుండానే..." అంటూ అనబోయాడు.
అతడి మాట పూర్తికాకుండానే "మంచి సంబంధం చూసి పెట్టుకుంటే పరీక్షలయ్యాకే చేసుకోవచ్చు" అంది నిర్మల అభ్యర్ధిస్తున్నట్లు.
పరమహంస మౌనంగా వూరుకుని, "సరే! అబ్బాయిని పిలిపించి చూసి నిర్ణయిస్తాను" అన్నాడు.
పక్క గదిలోంచి వింటున్న సాహితికి ఈ వాక్యం అదోలా ధ్వనించింది. 'అబ్బాయిని పిలిపించటం ఏమిటి?' అనుకుంది.
ఆ తర్వాత తల్లీ, మావయ్య మాట్లాడుకుంటూంటే తెలిసింది- "ఆయనోసారి అబ్బాయిని చూడాలనుకుంటున్నారు. రమ్మని వ్రాయి అన్నయ్యా" అంది తల్లి.
"దానికేముంది- పెళ్ళిచూపులకి ఎలాగూ వస్తారుగా?"
"అదికాదు....అమ్మాయిని చూసుకునే ముందు ఆయన ఒకసారి అబ్బాయిని చూడాలట! మనింట్లో అవసరంలేదు. ఆయన వుండే ఇంటికి వెళ్ళి కనబడితే చాలు."
మావయ్య ఇబ్బందిగా "దానికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో...." అన్నాడు.
"బాగోగులన్నీ చూసి నిర్ణయించేది ఆయనే కదన్నయ్యా! ఒక్కచూపులో ఆయన అబ్బాయిని చదివేయగలరు. ఆయనకాశక్తి వుంది. ఇంత డబ్బు పోసి పెళ్ళి చేస్తున్నప్పుడు అబ్బాయి మనకి నచ్చినవాడు కాకపోతే ఆ తర్వాత యిబ్బంది కదా?"
"ఆడపెళ్ళి వాళ్ళం.... మనం వెళ్ళి అడగటం బాగుంటుంది కానీ, అబ్బాయిని ఇక్కడికి రమ్మనటం అంత బాగోదు నిర్మలా! నువ్వు ఆలోచించు" అన్నారాయన.
"ఈయన ఎంత బిజీనో చూశావుగా అన్నయ్యా.....! ఎంతో మంది వచ్చి ఆయన దర్శనం చేసుకుంటూ వుంటారు. అటువంటిది....అబ్బాయిని చూడటానికి ఈయన వెళ్లడమంటే...." సాయిబాబాని పెళ్ళి పెద్దగా తీసుకెళ్ళటమేమిటి అన్నట్లుగా మాట్లాడింది.
ఆయన లేచి "సరే అమ్మాయ్! అడిగి చూస్తాను" అన్నాడు.
* * *
"నేను నీ మనసులో ఏముందో గ్రహించగలను సాహితీ! నీకీ పెళ్ళి యిష్టం లేదుకదూ?" అన్నాడు పరమహంస. ఆమె మాట్లాడలేదు. చాలా రోజుల్నుంచీ అతడీ మాట అంటున్నాడు. మాటిమాటికీ "నీ కిష్టంలేదు కదూ! నీ కిష్టంలేదు కదూ....." అంటూ వుంటాడు నిజానికి అది అతడి మనసులో కోరిక లాగానే కనబడుతోంది. అతడికెందుకో ఈ వివాహం ఇష్టంలేదు. ఆ విషయం డైరెక్టుగా చెప్పడు. ఇలాగే అడుగుతుంటాడు. అయితే అతడికి ఇష్టం లేనిది సాహితికి పూర్తిగా వివాహం తలపెట్టడమా....? లేక కేవలం యీ సంబంధమేనా అన్నది తెలీదు.
పక్కనే కూర్చున్న నిర్మల, తమలపాకుల చిలకని అతడి కందిస్తూ "ఏం సాహితీ? నీ కిష్టం లేకపోతే చెప్పమ్మా...." అంది. పరమహంస నిజంగానే కూతురి మనసులో మాట గ్రహించి మాట్లాడుతున్నాడని ఆవిడ నమ్మకం.
ఏం మాట్లాడుతుంది సాహితి? 'లేదమ్మా....! నాకిష్టమే తొందరగా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవాలనుంది' అనలేదుగా!
ఆమె నా పరిస్థితి నుంచి రక్షించటానికి భగవంతుడే పంపినట్టు నౌఖరు వచ్చి, "మీ కోసం ఎవరో వచ్చారు బాబూ...." అన్నాడు. పరమహంస అర్ధంకానట్లు చూశాడు. సాధారణంగా ఈ మొదటి (సారీ.... మూడో భార్య) ఇంటికి ఎవరూ అతని కోసం రారు. ఇలా రాత్రిపూట వచ్చిన దెవరా అని అర్ధంకాక, ముందు హాల్లోకి వచ్చాడు. వెనకే నిర్మల కూడా వచ్చింది.
హాల్లో ఇద్దరున్నారు. అందులో కాస్త చిన్న వాడుగా కనబడుతున్న యువకుడు లేచి నమస్కారం పెడుతూ, "నా పేరు గుణశేఖర్...." అన్నాడు. లోపల్నుంచి రాబోతున్న సాహితి చప్పున ఆగిపోయింది.
శేఖర్ తనతోపాటు వచ్చిన వయసులోపెద్ద వ్యక్తిని చూపిస్తూ "ఈయన రచయిత భరద్వాజ" అన్నాడు.
అప్పుడో చిత్రం జరిగింది.
భరద్వాజ హఠాత్తుగా తన సీటులోంచి వెళ్ళి, పరమహహంస కాళ్ళముందు వంగి, ఆయన పాదాల్ని స్పృశించి లేచాడు. నిర్మల అమితాశ్చర్యంతో యీ సంఘటనని చూసింది. పరమహంస పూజలు చేస్తున్నప్పుడు కొందరు భక్తులు ఈ విధంగా ఆయన పాదధూళి స్వీకరించడం చూసిందిగానీ, ఈ పరిస్థితులు వేరు. దంపతులిద్దరికీ, వచ్చిన ఇద్దరిమీదా అభిమానం పెరిగింది. దయతో కూడిన చిరునవ్వుతో పరమహంస భరద్వాజవైపు చూశాడు.
"క్షమించాలి! సాహితిగారి మావయ్యగారు చెప్పారు. పెళ్ళికి ముందు పిల్లవాడిని మీరొకసారి చూడాలన్నారట. అందుకని వచ్చాము. బస్సు లేటయింది...." అన్నాడు భరద్వాజ. నిర్మల యిబ్బందిగా భరద్వాజవైపు చూసింది. అన్నగారి మీద కోపం కూడా వచ్చింది. ఏదో పని వున్నట్టు పిలిపించటం వేరు, చూడటం కోసం పిలిపించడం వేరు.
"ఏం చదివావబ్బాయ్?" అన్నాడు పరమహంస.
"ఇంజనీరింగ్ చదివానండీ!" అన్నాడు గుణశేఖర్. పరమహంస ఆ కుర్రాణ్ణి నఖశిఖ పర్యంతం చూడసాగాడు. శేఖర్ తలవంచుకొని కూర్చున్నాడు.
"కొంచెం కాఫీ తెస్తాను" అంటూ నిర్మల లేచింది.
"అబ్బే వద్దండీ! గుణశేఖరుడు కాఫీ తాగడు. ఇది నాకు కాఫీ తాగే టైము కాదు" అన్నాడు భరద్వాజ నమ్రతగా.
"ఇంకా పైకి చదవాలని వుద్దేశ్యం వుందా?"
"లేదండీ" అన్నాడు శేఖర్. "ఇప్పటికే నాన్నగారి మీద చాలా బరువు పెట్టాను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటే తోడుగా వుంటుంది."
"నీకింకా చదవాలని వున్నట్టు నా మనసు చెపుతోంది...." గంభీరంగా అన్నాడు పరమహంస. "అందులో తప్పులేదు. బాగా చదువుకోవచ్చు. ఈ ఇంటి అల్లుడికి డబ్బు సమస్య ఏమిటి? నవ్వి పోతారు. అమెరికా వెళ్ళి చదవొచ్చు, ఇక్కడే -ఈ ఇంట్లోనే వుండిపోవచ్చు. ఇక నీ తల్లిదండ్రులంటావా.....వాళ్ళకి కావల్సిన డబ్బు యివ్వొచ్చు. నీ అభిరుచులు ఏమిటి?"
"చదువుకోవడం ఒక్కటేనండీ!"
"అలవాట్లేమైనా వున్నాయా? మొహమాటం లేకుండా చెప్పు, సిగరెట్లు, సినిమాలు...."
"లేవండీ!"
"సాహితి ఒక్కతే కూతురు. తండ్రిలేని పిల్ల. చాలా గారాబంగా పెరిగింది. తెలివైంది, కావాల్సినంత డబ్బుంది. అందుకనే, ఈ ఇంటికొచ్చే అల్లుడు అన్ని విధాలా గుణవంతుడూ, కాస్త చెప్పినమాట వినేవాడూ అయుండాలని నా వుద్దేశ్యం! ఈ కుటుంబాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నా మీద వుంది. సాహితికి ఇప్పుడే పెళ్ళిచేయటం నాకిష్టంలేదు. ఆ అమ్మాయికి సరిపోయే పిల్లవాడు అంత సులభంగా దొరకడని నా అభిప్రాయం. అందుకే ముందు నేను నిన్ను చూడాలనుకున్నాను. మనిషిని చూడగానే అతన్ని గురించి చెప్పెయ్యగలను."
"పెళ్ళి అనేది నూరేళ్ళ పంట. కాబోయే అల్లుడి అన్ని విధాలుగా తెలుసుకోవటంలో తప్పులేదు పరమహంసగారూ....." అన్నాడు భరద్వాజ.
పరమహంస గర్వంగా నవ్వాడు.
".....అలాగే గుణశేఖరుడు కూడా ఈ యింటి గురించి తెలుసుకోవటంలో తప్పులేదు" పూర్తిచేశాడు.
పరమహంస ముఖంమీద నవ్వు ఆగిపోయింది.
"మొదట ఆ ఇంటికి వెళ్ళాం. లక్ష్మిగారు మా గురించి తెలుసుకొని ముఖం మీదే తలుపు వేసినంత పనిచేశారు. 'ఆయన ఇక్కడ ఎందుకు వుంటారు? లక్ష్మివారం గదా, ఆ ఇంట్లోనే వుంటారు. అక్కడికెళ్ళండి' అని కొట్టినట్టు చెప్పారు. భగవత్ స్వరూపులైన మీరు లక్ష్మివారం పూట ఈ లక్ష్మి ఇంట్లో గడుపుతున్నారని తెలిసి, మీ లక్ష్మీ పూజకి భంగం వాటిల్లుతుందన్న భయం వున్నా, రేపు మళ్ళీ మాకు వేరేపని వుండబట్టి రాత్రికి రాత్రే వచ్చాం. ఒకప్పుడు మీ ఇంట్లో పనిచేసి, మీతో తీసివేయబడ్డ నౌఖరే మాకు ఈ ఇల్లు చూపించాడు."
సాహితి కిటికీలోంచి పరమహంస ముఖంలో రక్తం ఇంకి పోవటాన్ని స్పష్టంగా చూసింది.
భరద్వాజ సంభాషణ కొనసాగించాడు. "ఇంట్లో దొరికే వస్తువులాగా నేను వెళ్ళి నన్ను చూపించుకోవడమేమిటి? అని మా గుణశేఖరుడు ఇలా అభ్యంతరం చెప్పాడు. నీ గురించి వాళ్ళు తెలుసుకోవటంలో తప్పులేదు కదా అన్నాను. మరి ఆ అమ్మాయిని చేసుకోబోయే ముందు 'వాళ్ళ' గురించి కూడా నేను తెలుసుకోవాలి కదా అన్నాడు. అదీ నిజమే అనిపించింది. రచయిత అన్నాక అన్ని కోణాల్నుంచీ చూడాలి కదా! పాపం మీ నమ్మకస్తుడైన నౌఖరు దారివెంట వస్తున్నప్పుడు మా ప్రశ్నలన్నిటికీ నిండు మనసుతో సమాధానాలు చెప్పాడు. గుణశేఖరుడు చాలా అదృష్టవంతుడు. ఇటువంటి ఇంటికి అల్లుడిగా రావటం అతని అదృష్టం."