Previous Page Next Page 
శారద పేజి 14


    ఏడిశావు. నీ పని చూసుకుపో" అని రవి కోపంతో గుడ్లెర్రజేశాడు.

    "సరే, నాకెందుకు లెండి?" అని పనివాడు ఆడదానిలా గొణుక్కుంటూ క్రిందకు దిగి వెళ్ళిపోయేవాడు.

    చాలారోజులు రవి బయటకు వెళ్ళలేదు. ఇంట్లో చాలా పుస్తకాలు పడి వున్నాయి. ఏమీ తోచనప్పుడు అవి చదువుతూ కూర్చునేవాడు. కానీ వాటిలో ఒకటీ పూర్తిచేసేవాడు కాదు. అందులో కొన్ని అసలు అర్ధమయ్యేవే కాదు. నిజంగా పట్టుదల వచ్చేది. ఒక్కోసారి ఎలాగయినా ఈ పుస్తకం అర్ధంచేసుకుని ఈవేళ పూర్తి చేసి తీరాలి అని ఒక్కోరోజు గట్టిగా కూర్చునేవాడు. పట్టుదల హెచ్చినకొద్దీ ఆలోచనలూ హెచ్చుతుండేవి. అలా కొంతసేపటికి పరిస్థితి విషమించేసరికి మతి కకావికలమైపోయేది. పిచ్చికోపంతో ఆ పుస్తకం అవతలకు గిరాటువేసి పడక్కుర్చీలో వెనక్కు నీరసంగా వాలి కళ్ళు మూసుకునేవాడు.  

    ఓ సాయంత్రం అలా బయటకు పోయి నాలుగు వీధులూ తిరిగివద్దామనిపించింది. బయల్దేరాడు. ఊరు తనకు తెలియకుండానే బస్తీ అల్లా సిటీ అయిపోయింది. చాలారోజులుగా ఈ సందుల్లో గొందుల్లో తిరగటం మానివేసి నందువల్ల ఇప్పుడు ఇవన్నీ ఇంత పరిశుభ్రంగా ఎలా తయారయినాయో అని ఆశ్చర్యంగా వుంది. రామాలయం దాటాడు. తన తండ్రి బ్రతికున్న రోజుల్లో ఇందులో అర్చనలూ, భోగాలూ, ఉత్సవాలూ ఇలా ఏవేవో అట్టహాసంగా జరుగుతుండేవి. రాత్రులు దేదీప్యమానంగా వెలిగిపోతుండేది. ఇప్పుడు దీని ఉన్నతిని గురించి ఎవరూ శ్రద్ధవహిస్తున్నట్లు లేదు. తన దగ్గరకు పూజారి రెండుమూడుసార్లు వస్తే విసుక్కున్నాడు. తానుచేసిన తప్పునుగురించి అతను చాలా వేదనకు గురిఅయ్యాడు. పెద్దలు భక్తిశ్రద్ధలతో ఆచరించిన విధానాలను ఇలాగేనా అనుసరించడం? భారంగా అడుగులువేసి ముందుకు సాగాడు. తను చిన్నప్పుడు చదువుకున్న బడి ప్రక్కనేవుంది. ఒకసారి గేటుదూకి లోపలికి పోయి ఆ రోజుల్లో ఆడుకున్న చిలిపిఆటలు ఆడుకోవాలనిపించింది. తమ గోలకు ప్రక్కింటి ముసలమ్మగారు గొడవపెడితే వాళ్ళ ఇంటి షెడ్డుమీదకు రాళ్ళు విసరాలనిపించింది. ఎత్తు ఎత్తు గోడలు దూకాలనిపించింది. గడచిన సంఘటనల స్మృతులు మనోల్లాసాన్ని, అంతఃకల్లోలాల్ని కూడా రేపాయి. నయన యుగళంనుండి బిడియంతో జారిపడ్డాయి అశ్రువులు. ఆనాటి స్నేహితులూ వారందరూ ఏమయినారో?

    సరిగ్గా అదే సాయంత్రం ఇద్దరుముగ్గురు పాత స్నేహితుల్ని కలుసుకోవటం తటస్థించింది. వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువస్థితిలో వున్నవాళ్ళు. అంచేత తాము పలకరించినా ఈ గొప్పవాడైన రవి పలుకడని, అవమానం పాలు కావలసివస్తుందనీ జడిసి అధవా ఎప్పుడైనా కనబడినా తలవంచుకుని వెళ్ళి పోయేవాళ్ళు. ఈరోజుకూడా అలానే చేయబోతుంటే రవి పట్టుబట్టి ఒకరిద్దర్ని ఆపాడు.

    "ఏరా, మర్చిపోయారా?" అన్నాడు.

    "అబ్బే, లేదురా" అన్నారు వాళ్ళు.

    "మరి చూసికూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నారేం?"   

    "అదికాదురా, అర్జెంటు పనివుంటే......"

    రెండోవాడు "మా చెల్లాయికి మందు తీసుకొద్దామని డాక్టరు దగ్గరకు వెళుతున్నాను" అన్నాడు.

    "అదేం?"

    "చాలా జబ్బుగా వుందిరా. కానీ డాక్టరు రానంటున్నాడు."

    "ఏం?" అని అడిగాడు రవి ఆశ్చర్యంతో.

    "మేం బీదవాళ్ళంగా మరి" అని అతను సిగ్గుతో తలవంచుకున్నాడు.    

    "అరె, నేనప్పుడే చచ్చిపోయాననుకున్నారా?" అని వాళ్ళిద్దర్నీ బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. శోకార్ధ్రహృదయతో, స్నేహితుడు ఆ మాట అన్న మితిలేని ఖేదంతో కుచించుకుపోయిన హృదయం, అతనిచేతిలో ఇరవైఅయిదు రూపాయలు పెట్టి "అవసరం గడుపుకో" అని తిరిగి భుజం చరిచినప్పుడు ఉన్మేషితమైంది.

    అప్పటినుంచి అడపాతడపా ఆ స్నేహితులు వస్తూనేవున్నారు. వాళ్ళతో కొన్ని రోజులు సరదాగా గడిచాయి. తాను ఒక్కడు. ఎన్ని రోజులు తిన్నా తరిగి పోనంతటి ఆస్తి వుంది. వీళ్ళందర్నీ ఎందుకు చేరదియ్యకూడదు? రోజూ ఒకరోఇద్దరో అతిథులు వుండేవారు. కాఫీలవేళకు అయిదారుగురు తయారయ్యేవారు. ఇదంతా చూసి ఓరోజు కేశవులు మొత్తుకున్నాడు. "ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేసేట్లయితే నిధులుకూడా హరించిపోతాయి బాబూ!" అన్నాడు.

    "ఓహో! నాకు చెప్పేవాడివి ఈనాటికి బయల్దేరి వచ్చావా? ఫూల్! మళ్ళీ ఈ సంగతి నాముందు ఎత్తావంటే తన్ని తగలేస్తాను" అని రవి అంతులేని కోపంతో అరిచాడు.

    వచ్చిన స్నేహితులంతా కాఫీలూ, భోజనాలతో సంతృప్తిపడక యాభైలూ, వందలూ అవసరంగా వుందని అప్పుతీసుకోవటం, ఎగవేయటం పరిపాటయిపోయింది. అదీగాక వంటవాడి ఆగడం మితిమీరింది. రవి తండ్రి కావాలని మనసుపడి ఓ బంగారు ఉద్ధరిణి చేయించుకున్నాడు ఆరోజుల్లో. ఆయన దివంగతులయ్యాక ఆ బంగారుఉద్ధరిణి చాలాకాలం భద్రంగా కాపాడబడుతూ వచ్చి ఒకసారి ఇనప్పెట్టె తీసినప్పుడు రవికి అది కనపడింది. దాచటం ఎందుకని తీసి వాడటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉదయం ఎనిమిది గంటలవేళ వంటవాడు "హుష్! పాడుకాకి అయ్యో! అయ్యో! ఇవాళప్రొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానోగానీ నా పీకమీదకొచ్చింది. బంగారంలాంటి బంగారుగరిటె పొట్టనబెట్టుకుంది కదా! ఇప్పుడు నేనే ఆపని చేశానంటే నా గతి ఏంకాను? దారిద్రమ్ముండా! ఉండు, నీపని చెబుతాను" అంటూ శాపనార్థాలు విసురుతున్నాడు.   

    ఆ సమయానికి అక్కడికి కేశవులు చేరుకుని ఈ వేటగాడు మరో అమూల్య వస్తువును గుటకాయస్వాహా చేశాడని గ్రహించి "ఇవేళేం చేరేశావ్ ఇంటికి?" అన్నాడు. వంటవాడు తనమాటలు వినిపించుకోకుండా ఇంకా నెత్తీనోరూ మొత్తుకుంటూ శాపనార్థాలు విసరటంచూసి ఆ మాటలువిని నిర్విణ్ణుడై "అయిందీ? బంగారు గరిటకే ఎసరు పెట్టావ్?" అన్నాడు.

    "మాటలు తిన్నగా రానియ్యి. నేను తీశాననుకుంటున్నావా?"

    "నువ్వు ముందు మాట దక్కించుకో. అది మా బాబుగారిది. చూడు, ఈవేళ నీ భరతం పడతాను."

    ఇలా మాటమీద మాట పెరిగిపోయింది. ఆఖరికి ఆవేశంతో వంట బ్రాహ్మణుడు ఒక దూషణవాక్యం పలికేసరికి, కేశవులు ఒళ్ళు తెలియని కోపంతో అతడి కంఠసీమను తన పిడికిలితో బిగించాడు. ఆ మనిషిబలం సామాన్యమైంది కాదని వంటబ్రాహ్మణుడు "చంపేస్తున్నాడు, చంపేస్తున్నాడు" అని పెద్దపెట్టున కేకలు పెట్టాడు. ఈ రాద్ధాంతమంతా రవి వింటూనేవున్నాడు. అతని క్రోధానికి హద్దు లేకపోయింది. కానీ పోయిన వస్తువును తలుచుకునే సరికి అతనిలో విచారం పెల్లుబికింది. గబగబ అక్కడకు వచ్చి "ఇదిగో మర్యాదగా చెబుతున్నా - సాయంత్రంలోగా ఆ వస్తువు నా కళ్ళఎదుట కనబడక పోయిందంటే మీ ఇద్దర్నీ పోలీసులకు పట్టించి దుంప తెంపుతాను" అన్నాడు.

 Previous Page Next Page