చరిత్రలో అతి నికృష్టమైన మత కలహాలు బొంబాయిలో జరిగి 238 మంది వ్యక్తులు చనిపోయి 7 కోట్ల ఆస్తి ధ్వంసం అయినప్పుడు వసంత్ దాదా మొట్టమొదటిసారి తెరవెనుక నుంచి బయటకొచ్చాడు. నలుగురు స్మగ్లర్ల మధ్యా చరిత్రాత్మకమైన ఒప్పందం జరిగి, "ఒకరి సామ్రాజ్యంలోకి మరొకరు ప్రవేశించకూదడు" అని నిర్ణయం తీసుకున్నారు. "ఏదైనా ఒక నగరంలో ఒక ముఠా మత కలహాలు లేపాలీ అంటే అది మిగతా ఏ మాఫియాకీ నష్టం రాకుండా వుండే పద్ధతిలోనే జరగాలి. మిగతా ముఠాల అనుమతి తీసుకోవాలి" అన్న అగ్రిమెంటు కుదర్చడంలో అతడు కృతకృత్యుడయ్యాడు. ఆ రోజు నుంచి వసంత్ దాదా ప్రతిష్ట చీకటి ప్రపంచంలో పెరిగిపోయింది! ఆ రోజుల్లోనే దాదా- ప్రజల సాంఘిక సంక్షేమం కోసం ప్రబుత్వంతో సంబంధం లేకుండా- తనే పది అంబులెన్సులు నడిపి, రోడ్డుమీద ఆక్సిడెంట్ అయిన ప్రజల కోసం, ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించి పత్రికల ప్రశంసలు పొందాడు. ఈ సంస్థని పెరవాయి అని పిలిచేవారు. 1984 లో ఈ అంబులెన్సుల్లో 20 లక్షల విలువ గల వాచీలు పట్టుబడేవరకు అవి నిజమైన అంబులెన్సులే అని ప్రజలతో పాటు పోలీసులు (?) కూడా భావించేవారు.
వసంత్ దాదాని అరెస్టు చేసినప్పుడు, జైల్లో తన చర్యలు కొనసాగించుకునే నిమిత్తం CARD-LESS టెలిఫోన్ కూడా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించారని ఒక పత్రిక వ్రాసింది. జైల్లో అతడికి అయిదు నక్షత్రాల హొటల్ ట్రీట్ మెంట్ లభించిందట.
2. ఆ తరువాత దాదా దృష్టి 'బట్టీ' లమీద పడింది. దాదాపు అయిదువేల ఛోటా- బట్టీల సాయంతో నెలకి కోటి రూపాయిల వ్యాపారం ప్రారంభించి, దాదాపు పోలీసు డిపార్ట్ మెంట్ లో అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకున్నాడు దాదా!
3. 1976 ప్రాంతాల్లో దాదా తన వ్యాపారాన్ని 'ఖాళీ స్థలాల' మాఫియాకి విస్తరింపచేశాడు. దీని ఆఫీసు బొంబేలో స్థాపించబడింది. BMRDA (బొంబే మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ) వారి అంచనా ప్రకారం బొంబాయిలో నూటికి ఎనభైశాతం కుటుంబాలు ఒక గది వున్న ఇళ్ళల్లో నివస్తారు. కొత్తగా వచ్చిన వారికి అసలు ఇల్లు దొరకదు. ఈ వార్త చదవగానే దాదా మెదడులో మెరుపు మెరిసింది. దాదాపు వందమంది బలిష్టుల్ని పోగుచేశాడు. వీళ్ళకి స్లమ్- లార్డ్స్ అని పేరు పెట్టాడు. వీళ్ళు ప్రభుత్వ ఖాళీ స్థలాల్ని లాక్కొని షాంటీలు నిర్మిస్తారు. దాదా పర్యవేక్షణలో ఒక మధ్యతరగతి స్లమ్ - లార్డ్ కి నెలకి ఒక కాలనీ మీద ప్రస్తుతం లక్ష రూపాయిల దాదా లభిస్తుంది అని అంచనా! ప్రభుత్వాన్ని కోర్టులోనూ, ప్రభుత్వాధికారుల్ని కండబలంతోనూ ఎదుర్కోవడం కోసం ఈ స్లమ్ -లార్డ్స్ దాదాకి హఫ్తా చెల్లిస్తారు. ఇలాంటి కాలనీలు ఒక్కొక్క స్లమ్ లోనూ దాదాపు పది దాకా వుంటాయి అనుకుంటే, నగరం మొత్తం మీద దాదా టర్నోవరు ఏడాదికి 2.60 కోట్లు వుంటుంది అధమపక్షం.
4. తన జీవిత మొత్తంలో ఏ స్త్రీతోనూ శారీరక సంబంధం పెట్టుకోకపోయినా- స్త్రీ మాంసం కూడా దాదాకి ధనాన్ని ఆర్జించి పెడుతూంది. నగరపు దక్షిణ ప్రాంతం (పాఠకులు ఊహించగలరు) లో వుండే రెహనా మంజిల్, సుమన్ సంద్లి అనే కేవలం రెండు భవనాల నుంచే ఒక రాత్రి ఆదాయం, 50,000 దాకా వుంటుందని అంచనా. తమిళనాడు, బెంగుళూరు, కలకత్తాల నుంచి తీసుకురాబడ్డ అమ్మాయిల్తో- రాజకీయ నాయకుల అండ, ఆశీర్వాదాల్తో- చేయబడుతున్న ఈ వ్యాపారం ఏటికి 4.5 కోట్ల రాబడి చూపిస్తుందని ఒక పోలీసు అధికారి లెక్కకట్టాడు! 'డి' మొదటి అక్షరంగా గల స్త్రీవాంఛ అధికంగా గల ఒక రాజకీయ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు అతడి- ప్రమాణ స్వీకారపు రాత్రి ఉత్సవం జరుపుకోవడానికి దాదా స్వయంగా పర్యవేక్షించి పదునారుగురు అమ్మాయిల్ని పంపాడు. ముగ్గురు వేర్వేరు డాక్టర్లు ఈ పదాహారుమంది అమ్మాయిల్నీ పరీక్షించి అందరూ కన్నెపిల్లలే అని ఇచ్చిన సర్టిఫికెట్ ని కూడా వారి నడుములకు రిబ్బను కట్టినట్టు కట్టి, ఓపెనింగ్ కోసం పంపటం దాదా ప్రత్యేకత! వందల సంవత్సరాల పాటు స్కాచ్ ని ఎలా భద్రపర్చేవారో, అలా ఈ సందర్భం కోసం అంతమంది ఆడపిల్లల్ని పోగుచేసి ముందుచూపుతో పోషించగలిగాడు కాబట్టే వసంత్ దాదా- 'దాదా' అయ్యాడు.
5.దాదా వ్యాపార హస్తాపు ఆఖరి వేట మట్కా!!! మధ్యతరగతి గాంబ్లింగ్ మనస్తత్వం మీద ఆడుకునే బ్రాకెట్ ఆట ద్వారా కనీసం లక్షమంది దాదా అనుచరులు పోషించబడుతూ వుంటారు. కావల్సిందల్లా రెండు గజాల స్థలం- ఒక టెలిఫోను. భారతదేశపు మొట్టమొదటి 'మట్కా' ప్రారంభించిన(1200 మాట్కావాలాలతో) రతన్ కాత్రీ అనే వ్యక్తి నుంచి దాదా ఈ వ్యాపారాన్ని కొనుక్కున్నాడు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దాదాపు ఆరు నుంచి పదిమంది వరకు మట్కావాలాలుంటారు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దాదాపు 45,000 రూపాయిల బిజినెస్ జరుగుతుంది. ఒక నగరం మొత్తంలో ఏడాదికి దాదాపు 9 కోట్ల వ్యాపారం ఈ విధంగా చేతులు మారుతుంది.
చీకటి ప్రపంచపు ఈ అయిదు వ్రేళ్ళయిన,..... స్మగ్లింగ్, లిక్కర్, ఖాళీ స్థలాలు, వ్యభిచారం, మట్కాలని ఒక్కొక్క ఏరియాకి ఒక దళాధిపతి సూపర్ కంట్రోల్ చేస్తాడు. ఈ అయిదుగురు ఉప దళాధిపతులూ అతడి క్రింద పనిచేస్తారు. ప్రమోషన్లు వుంటాయి. నిష్పత్తులు మారుతూ వుంటాయి. వీలైనంతవరకు గొడవలు జరగవు.
తన సామ్రాజ్యం విస్తరించాలంటే పోలీసు వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకోవాలని దాదాకి తెలుసు. నిజాయితీ గల పోలీసు అధికారులని ట్రాన్స్ ఫర్ చేయించాలంటే రాజకీయ నాయకుల అండ వుండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుల్ని కొనాలంటే ఓట్లు ఎరగా వేయాలి.
'ఓట్లు' అంటే ప్రజలు.
భారతదేశం లాంటి బీద దేశంలో మురికివాడల్లో నివసించేవాళ్ళే ఎక్కువ.
సరీగ్గా ఇక్కడే "స్లమ్-లార్డ్ "రంగంలోకి వస్తాడు. తమకి రక్షణ కల్పిస్తున్న 'స్లమ్-దాదా' కి బీద ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞులై వుంటారు. ఎలెక్షన్లు దగ్గరపడగానే పెద్ద పెద్ద పార్టీలు కూడా దాదాని ఆశ్రయిస్తాయి.
ఇక్కణ్ణుంచి వ్యూహం ప్రారంభమవుతుంది.
ఓట్ల క్యూలో ఒకరు ప్రథమంగా కుర్బానీ చేస్తారు. (తనతో పాటూ ఓటుని బయటకు తీసుకురావడాన్ని 'కుర్చానీ' అంటారు) దానిమీద కావలసిన ముద్రవేసి మరో ఓటరుకి ఇవ్వబడుతుంది. అందుకు ప్రతిగా ఆ ఓటరు తన ఖాళీ ఓటును బయటకు తెచ్చేస్తాడు. 20 నుంచి 50 రూపాయిల ధరకి ఆ ఓటు అతడి దగ్గర్నుంచి కొనుక్కోబడుతుంది. ఈ గొలుసు ఇలా సాగిపోతుంది. ఎన్నికలు జరిగే ప్రాంతానికి కొద్ది దూరంలో బాగా ట్రెయినింగ్ పొందిన ఇద్దరు మాఫియా వ్యక్తులు ఎంతో అనుభవంతో, నిపుణతతో ఈ పని నిర్వహిస్తారు. మధ్యలో ఏ ఓటరన్నా-ముందు ఒప్పుకుని తరువాత లింకు తెంపితే, అతడి శవం రెండు మూడు రోజుల తరువాత కాలువలో తేలుతుంది. స్లమ్-లార్డ్ ల సాయంతో, ఈ విధంగా గెలిచిన రాజకీయ నాయకుడు ఆ విధంగా పదవిలోకి వచ్చాక దాదా మాటకి ఎలా ఎదురుచెప్పగలడు? ఒక వేసవికాలపు రాత్రి జైల్లో దాదాకి నిద్రపట్టకపోతే ఏ జైలు అధికారి అతడికి ఎయిర్- కూలర్ సప్లయ్ చేయకుండా వుండగలడు?
అటువంటి దాదా ఇప్పుడు చిరాగ్గా వున్నాడు.
ఒక చిన్న ఆడపిల్లని పట్టుకోలేక సలీంశంకర్ తలనొప్పి ఎక్కువ చేస్తున్నాడు. ప్రొద్దున సంఘటన తెలిసినప్పటి నుంచి దాదా చిరాకు మరింత ఎక్కువయింది. నేషనల్ హైవే మీద ఈ పిస్తోళ్ళ పోరాటం రేపు పేపర్లో పది మరింత సంచలనం కలిగిస్తుంది. జర్నలిస్టులు దీనికి మరికాస్త రంగు పులిమి కథలు చిత్రీకరిస్తారు. పేపర్లకి వీలైనంత దూరంగా వుండాలన్న తన కోరికకి మరొకసారి ఈ విధంగా భంగం వాటిల్లబోతోంది.
అంతలో ఫోన్ మ్రోగింది. అవతల్నుంచి రామూ.
"ఏమిటి- ఏమైనా ఆచూకీ దొరికిందా?"
"ఇంకా లేదు దాదా"
"బాద్ ఖోవ్! ఏం చేస్తున్నారు మరి?" దాదాకి అంత కోపం రావడం అదే మొదటిసారి. "అందరి చేతులూ పక్షవాతమొచ్చి చచ్చుపడ్డాయా- లేక మీరే చూస్తూ కూర్చున్నారా? అసలేం జరిగింది అక్కడ?"
రామూ భయపడుతూ మొత్తం సంఘటనని వివరించాడు. చివరికి అన్నాడు- "బస్ లో ప్రయాణం చేసేవాళ్ళ దగ్గర పిస్తోళ్ళుంటాయని, ఒకవేళ వున్నా వాళ్ళింత ఫాస్ట్ గా వుండగలరనీ ఊహించకపోవడంతో జరిగింది దాదా ఇదంతా".
"అంత ఫాస్ట్ గా పిస్తోళ్ళు పేల్చగలిగే వాళ్ళు ఈ ఏరియాలో మీకు తెలియని వాళ్ళెవరు?"
"అనుమానం వున్న అందరి దగ్గరికీ నేనూ, గుండప్ప స్వయంగా వెళ్ళి పరీక్షించాం. ఆకారాల్లో బాగా దగ్గర పోలికలున్న వాళ్ళు ఇద్దరున్నారు, జానీ, భిల్లూ అని..... కానీ వాళ్ళు ఆ టైమ్ కి ముఖ్యమంత్రి ఫంక్షన్ లో వున్నారట".
"'అట' కాదు. మీరు స్వయంగా వాకబు చేశారా?"
"లేదు దాదా"
"రోడ్డుమీద తిరగబడ్డ ఆ జీపు ఏమైంది? పోలీసుల పరీక్షార్థం దాన్నలాగే వదిలేసారా?"
"లేదు. అక్కడే కాల్చేసేం".
"ఫర్వాలేదు. ఆ మాత్రం మెదడు పనిచేస్తోంది సంతోషం. రెండో జీపు?"
"దాన్లో ఆ అమ్మాయినెక్కించుకుని నగర పొలిమేర్ల వరకూ వచ్చి వదిలేసారు వాళ్ళు."
"దానిమీద వాళ్ళ వేలిముద్రలుంటాయి కదా".
అప్పటివరకు ఒక విద్యార్థిలాగా సమాధానాలిస్తున్న రామూ హఠాత్తుగా ఈ ప్రశ్నకి షాక్తగిలినట్టు నాలిక్కర్చుకోవడం స్పష్టంగా వినిపించింది. "ఆ విషయం తట్టలేదు".
"వెళ్ళండి. వెళ్ళి వాటిని తీసుకుని, మళ్ళీ పరీక్షించండి వాళ్ళెవరు?"
"జానీ, భిల్లూ".
"అక్కర్లేదు దాదా. మిగతాది మేం చూసుకుంటాం-" హుషారుగా ఫోన్ పెట్టేశాడు రామూ.
వసంత్ దాదాతో మాట్లాడిన తరువాత రామూ సలీంశంకర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే సలీంశంకర్ ఉత్పల ఇంటి ముందు మరో మనిషిని నిలబెట్టి తను రిలీవ్ అయ్యాడు. ఇరవై నాలుగు గంటలూ ఉత్పల ఇంటి ముందు ఒక మనిషి కాపువేసి వుండాలని వసంత్ దాదా సూచన్లు ఇచ్చాడు.
రామూ సలీంశంకర్ తో తను కనుక్కున్న విషయాన్ని చెప్పాడు.
"జీపు తీసుకు వెళ్ళిపొయిందెవరో సరిగ్గా తెలియటం లేదు శంకర్. వాళ్ళా అమ్మాయిని తమతో వుంచుకున్నారో లేక దీని వెనుక మనం వున్నామని తెలిసి వదిలేసారో అర్థం కావటంలేదు. మొత్తంమీద వాళ్ళు పిస్టల్స్ ఉపయోగించిన విధానం చూస్తోంటే ఈ రంగంలో ప్రవేశమున్నవాళ్ళే అని తెలుస్తూంది. నా అనుమానం జానీ, భిల్లూల మీదకే వెళ్తోంది. ఆ దొంగనాకొడుకుల వేలిముద్రలు సంపాదిస్తే కానీ అసలు విషయం బయటపడదు. ఒక్కసారి ఆ విషయం తేలనీ, ఇక ఆళ్ళిద్దరి పనీ ఎలా పడతానో చూద్దూగానీ! ఎంత నాటకమాడారో వెధవలు- ముఖ్యమంత్రి మీటింగని!"
"అనుమానం వుంటే అక్కడికక్కడే చంపి పారెయ్యక పోయావా?"
"చంపొచ్చు. కానీ దానివల్ల ఆ కట్ మల్ (ఉత్పల) అక్కడుందో లేదో తెలీదు కదా. ఇంకెంత, అయిదు నిముషాలు ఓపికపట్టు. మన వాళ్ళు వెళ్ళి ముద్రలు తెస్తున్నారు. అక్కడ నుంచి మరో అయిదు నిముషాల్లో ఆ జానీగాడి దగ్గిరికి వెళతారు".
ఇంతలో ఫోన్ మ్రోగింది.
సలీంశంకర్ ఉత్పల ఇంటి ముందు నిలబెట్టిన మనిషి ఫోన్ చేశాడు. "బాస్! నువ్వెళ్ళిపోయాక ఈ శాస్త్రి ఇంటికి ఓ ఆడపిల్ల వచ్చి వెళ్ళింది".
"ఎవరు? ఉత్పలేనా?" వెంటనే అడిగాడు సలీంశంకర్. పక్కనే వింటున్న రామూ కూడా చటుక్కున రిసీవర్ దగ్గిరగా వచ్చాడు.
"అదేమిటి బాస్. ఉత్పలయితే ఇంతసేపు ఆగుతానా? అక్కడికక్కడే కాల్చి పారేయ్యనా. ఇంకెవరో పిల్ల".