"అడవిలో పుట్టి పెరిగినదాన్ని. నాకేం భయంలేదు దొరా. వెళ్ళగలను" అని మరో నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోయింది. మహర్షి కారు వద్దకు స్టార్ట్ చేసి తిరిగి అరకు బయలు దేరాడు.
10
సిరిచందన మొహం వాడిపోయింది. మహర్షి ఏం చెప్పాలో తోచనట్టు తలవంచుకొని ఉన్నాడు. రవితేజ మొహం భావరహితంగా వుంది. కానీ మనసులో మాత్రం చాలా నిరాశ చెందినట్టు ఉన్నాడు.
అందరికన్నా ముందు తేరుకున్నది అతడే. "మందు ఉంది కానీ అది సంపాదించటం కష్టం అంటాడా? నాన్సెన్స్! అసలు వీళ్ళకి ఏ మందో తెలిసివుండదు. అలాచెప్తే అగౌరవమని ఈ విధంగా అబద్ధమాడి ఉంటారు. అయినా నేను అప్పుడే అనుకున్నాను! పోయిన కళ్ళు తెప్పించే మందు ఆ కోయవాళ్ళకేం తెలుస్తుందని" అన్నాడు కోపంగా.
మహర్షి దానికి కూడా సమాధానం చెప్పలేదు. అప్పటికే అతనికి చాలా గిల్టీగా ఉంది- అనవసరమైన ఆశలు కల్పించి చివర్లో ఈ విధంగా చేసినందుకు.
అసలు తను వాళ్ళకి ఈ విషయాలేమీ చెప్పకుండా ఒక్కడే వెళ్లి కోయదొరతో మాట్లాడి ఆ తరువాత వెల్లడి చేయవలసింది. ఏదో ఒక అవకాశం దొరికింది అన్న తొందర్లో అంతా చెప్పి అభాసుపాలయ్యాడు.
"పోన్లే మహీ! నువ్వు మాత్రం ఏం చేస్తావ్? ప్రయత్నం చేశావ్. అది ఫలించలేదు" అంది సిరిచందన ఓదారుస్తున్నట్టు. మహర్షి అక్కడినుంచి లేచి తన అవుట్ హౌస్ కి వచ్చేసాడు.
ఆ రాత్రి అతడు భోజనం చేసి పక్కమీద వాలాడు. దాదాపు పదకొండు అవుతుండగా బయట అలికిడి వినిపించింది.
రాత్రి పడుకోబోయేముందు చలమయ్య ఆ గెస్ట్ హౌస్ ఆవరణంతా తిరిగి చూడటం అలవాటే. అతని తాలూకు అలికిడేమో అనుకున్నాడు. కానీ తలుపు మీద శబ్దం వినిపించింది. ఆ టైమ్ లోచలమయ్య ఎందుకొచ్చాడా అని ఆశ్చర్యపడుతూ అతడు తలుపు తీసాడు. బయట రామరాజు నిలబడి వున్నాడు.
మహర్షి విభ్రాంతుడయ్యాడు. ఒక్కక్షణం ఎదురుగా ఉన్నది రామరాజేనా? అన్న అనుమానం కూడా వచ్చింది. తను చూస్తున్నది కలకాదనీ, నిజమనీ నమ్మకం కుదిరాక "రా, రామరాజూ" అన్నాడు వెనక్కి అడుగు వేస్తూ.
రామరాజు లోపలికి రాలేదు. "దొరా" అన్నాడు. అతని స్వరం సన్నగా కంపించింది. "మా పల్లెలో ఆడపడుచుని ఎలుగొడ్డు బారినుంచి రక్షించావంట కదా?"
"ఆ అమ్మాయి మీ గూడెం పిల్లా? నాకు తెలియదు" అన్నాడు మహర్షి.
"రేపోద్దున్నే మా గూడెంరా దొరా. మనం బయలుదేరదాం."
మహర్షి అర్థంకానట్టు "ఎక్కడికి?" అన్నాడు.
"కొండల్లోకి, కోనల్లోకి! ఎక్కడున్నాసరే ఆ మూలిక పట్టుకొని వెతికి తీసుకొద్దాం" రామరాజు దృడంగా చెప్పాడు.
"కానీ-" అంటూ మహర్షి ఏదో చెప్పబోయాడు.
అతని మాటలు మధ్యలోనే ఆపుచేస్తూ రామరాజు కొనసాగించాడు. "ఈడ నుండి వంద కోసులు ఎల్తే ఓ పెద్ద అడవి వస్తుంది. అక్కడ నాగకోన అనే ఓ చిన్న కోనుంటుంది. ఆడున్న మొగలి పొదల్తో పాటు ఇయీ పెరుగుతాయి. ఆడికెల్లటం ప్రాణాలకే ప్రమాదం. ఆ కోన మొత్తం యిసప్పురుగులు తిరుగుతూ ఉంటాయి. అడుగడుక్కోటి ఎదురైద్ది, ఆటిని దాటుకొని మొగలి పొదల్లో ఉన్న ఆ మూలికలు తీసుకురావాలి. అయి సెంద్రగ్రహణం రోజు రంగరించి రక్తపింజరి ఇసంలో కలిపి ఎన్నెల్లో పెడితే, ఆ మూలికల మందు, ఇసమా కలిసి అమృతంగా మారుద్ది. దాన్ని ఆ మరునాడు ఉదయం సూర్యోదయం కాగానే కంట్లో ఎయ్యాలి."
"అలాంటి చోటికి వెళ్ళటం ప్రమాదమని కదా నువ్వు చెప్పింది?"
"అవును దొరా, ప్రమాదమే! పది సంవత్సరాల క్రితం నేనూ నా తమ్ముడు ఎల్లినప్పుడు మొట్ట మొదటి అడుగులోనే మా తమ్ముణ్ణి ఒక పురుగు కాటేసింది. ఆడికాడే నురగులు కక్కుకొని సచ్చిపోయాడు. అట్టాంటి ప్రమాదంలో లోపలికి...... ఇంకా లోపలికి ఎల్లి ఆ మూలికలు సంపాదించాల. దాదాపు అసంభవం అయినా..... అయినా.... సరే మనం ఎల్దాం దొరా."
మహర్షి మాటలుడిగినట్టు అలాగే నిలబడిపోయి ఉన్నాడు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తల్చుకుంటేనే అతడి వళ్ళు గగుర్చొడిచింది. కానీ అతడి మౌనాన్ని రామరాజు మరోలా అర్థం చేసుకున్నాడు. అతడి కంఠంలో ఒక రకమైన నిశ్చయం తొణికిసలాడుతూ ఉండగా అతడు దృఢంగా అన్నాడు.
"అవును దొరా! నువ్వు మా పల్లెకి వచ్చి అడిగినప్పుడు నేను ఆ వైద్యం మానుకున్నాననే చెప్పాను. ప్రాణాంతకమైన ఆ మూలికల కోసం ఎందుకెల్లాలి? నువ్వు నాకేమవుతావని ఎల్లాలి? ఎవరికోసం ఎల్లాలి? అని ఎదురు ప్రశ్నలు వేసాను. కానీ నువ్వు ఈ రోజు మా పల్లెలో ఒక పడుచుని రక్షించావు. ఆమె నీకేమవుతుందని రక్షించావ్? ఎవరికోసం నీ చేతులు రక్తం చేసుకున్నావ్? ఎవరి కోసం ప్రాణాలకి తెగించావ్? అదే ఈ రోజు నా కళ్ళు తెరిపించింది దొరా. ఎవరో స్నేహితుడి కోసం నువ్వు నీ ప్రాణాలకి తెగించి ఆ మూలికల కోసం వస్తాననగా లేంది, నేను మాత్రం ఎందుకు సెప్పినాడు? సాటి మనిషిని రక్షించాలని! సాటి మనిషిని రక్షించటంలో ప్రాణాలు పొతేమాత్రం ఏం నష్టమని నువ్వే నిరూపించినావుగా రక్షించటంలో ప్రాణాలు పోతేమాత్రం ఏం నష్టమని నువ్వే నిరూపించినావుగా దొరా! నీ కోసం నేను ఆ పని సేస్తాను- ప్రాణాలు పోయినాసరే, నీకా పని చేసి పెడతాను. రేపోద్దున్నే మా గూడానికి రా దొరా. అక్కడినుంచి ఎల్దాం" అంటూ మహర్షికి మారు మాట్లాడటానికి అవకాశమివ్వకుండా చీకట్లో కలిసిపోయాడు.
మహర్షి అలాగే అటువైపు చూస్తూ వుండిపోయాడు.
కోయదొర రామరాజు తనకు చెప్పిన వివరాలన్నీ పూర్తిగా ఆ దంపతులకి చెప్పకుండా మహర్షి క్లుప్తంగా అన్నాడు. "నేను, ఆ కోయదొర కలిసి మూలికలు తీసుకురావటానికి రేపే వెళ్తున్నాం. వారం రోజుల్లో వచ్చేస్తాను. అంతవరకూ మీ కోసం సాయంగా ఉండటానికి చలమయ్య మరో మనిషిని మాట్లాడాడు."
రవితేజ మొహం విప్పారింది. అప్పటివరకూ అంతా బోగస్ అన్నవాడు, తిరిగి మహర్షి మూలికలు కోసం వెళ్తున్నాను అనగానే "అదేమిటి? అదంతా ఎంతో ప్రమాదకరం అని ఆ కోయవాడన్నాడన్నావ్?" అని అడిగాడు.
ఎలుగు బారినుంచి తానొక అమ్మాయిని రక్షించటం, అందువల్ల కోయదొర మనసు మారటం, గతరాత్రి తన దగ్గరికి రావటం మొదలైన వివరాలేవీ చెప్పకుండా "అతనెందుకో మనకి సహాయం చేస్తానన్నాడు. కోయపల్లెకి వస్తే అక్కడినుంచి అవుట్ హౌస్ కొచ్చాడు. సిరిచందన కళ్ళల్లో మెరుపు అతడ్ని కదిలించి వేస్తోంది.
బ్యాగ్ లో బట్టలు సర్దుకుని ఒక కాగితం మీద ఉత్తరం రాశాడు.
"డియర్ సిరీ....
కొన్ని రోజుల మానసిక ఘర్షణకి ఫలితమే ఈ ఉత్తరం. దయచేసి మనసు పెట్టి చదువు.
నేను వెళ్ళేది దాదాపు మృత్యుగహ్వరంలాంటి చోటుకి. అనుకోని సంఘటన జరిగి అక్కడికక్కడే నా ప్రాణాలు విడవవలసి పోయేముందు ఒకే ఒక్క నిజం నీకు చెప్పాలనిపిస్తోంది.
.........
"మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీ అల్లరి....." అతడు వ్రాయటం పూర్తిచేశాడు. ఉత్తరం కవర్లో పేట్టి దాన్ని సీల్ చేశాడు.
వెళ్ళేముందు దాన్ని సిరిచందనకిచ్చి అతడు తిరిగి రాకపోతే ఆమెని ఆ ఉత్తరం చదవమని చెప్పాలని అతనికోరిక.
అతడు ఆ ఉత్తరాన్ని పట్టుకొని గెస్ట్ హౌస్ కి రాబోతూ మళ్ళీ ఆగిపోయాడు.
ఎందుకు ఆమెకి ఈ ఉత్తరం ఇవ్వటం?
తన ప్రేమ సంగతి అసలు ఆమెకి ఎందుకుచెప్పాలి?
ఆ విషయం చెప్తే మొత్తం అంతా చెప్పాలి. ఆమె భర్త తన భార్యని ప్రేమించిన విషయం, రవితేజని తను చంపాలనుకొన్న విషయం - అంతా చెప్పాలి. కానీ ఈ ఉత్తరంలో అదేమీలేదు. తనలో మచ్చని దాచుకొని, కేవలం మంచితనాన్ని, ఆమెని ప్రేమించిన విషయాన్ని చెప్పటం ఏ మాత్రం సమంజసం? తనలోని రాక్షసుడ్ని బైటికి రానివ్వకుండా కేవలం ప్రేమికుణ్ణి మాత్రమే ఆమెకి చూపించటం అన్యాయం కదూ?
అంతేకాదు, ఆమె భర్తమీద తను చేసిన హత్యా ప్రయత్నం చెస్తే ఆ భర్త ఎలాంటివాడో కూడా చెప్పాలి. అది మరీ దారుణం.
.......ఇలా పరస్పర విరుధ్ధమైన ఆలోచనలతో అతడు ఆ కవర్ తన జేబులోనే పెట్టుకొని బ్యాగ్ తీసుకొని బయటికొచ్చాడు.
అతడు గుమ్మం దాటుతూండగా అవుట్ హౌస్ వైపు వస్తున్న సిరిచందన కనబడింది. దూరంగా కొండ మధ్య అస్తమిస్తున్న సూర్యుడిలా ఉందామె. బంగారు రంగులో వున్న ఆమె శరీరం మీదనుంచి వెలుతురు ఏటవాలుగా పడుతూ వుంది. ఆ కిరణాలు ఆమె చుట్టూ ఒక వెలుగుని ప్రకాశింప చేస్తున్నట్టున్నాయి.
ఒక కొత్త అందాన్ని చూస్తున్నట్టు అతడు ఆమెని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆమె దగ్గరకొచ్చి కృతజ్ఞత నిండిన కంఠంతో "నా కోసం ఇంత శ్రమ తీసుకుంటున్న నీకు నేనేమివ్వగలను మహీ?" అంది.
అతడు చిరునవ్వుతో "ఏమిస్తావ్?" అని ప్రశ్నించాడు.
"నాకే కనుక కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటాను మహీ! అంతకు మించి ఏ గొప్ప కానుకయినా నీకు తక్కువే అవుతుంది."
అతడు కదిలిపోయాడు.
కళ్ళు ఆర్థ్రమై...... మనసు అర్థమై...... అందులో ఆమె పత్రి బింబమై......
అతడు "వెళ్ళొస్తా" అన్నాడు.
ఆమె "మంచిది" అంటూ పక్కకి తొలగింది.
అతడు బయటికి నడిచాడు.
చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక భయంకరమైన మృత్యుగుహలోకి తను ప్రవేశిస్తున్నాడని ఆ క్షణం అతడికి తెలీదు.
11
అరకు నుండి కొండల్లోకి వెళ్ళటానికి ఒక ప్రైవేట్ బస్సు వుంది. అది కోయపల్లెకి పది కిలోమీటర్లు దూరంలో ఆగిపోతుంది.
మహర్షి వెళ్ళి బస్ స్టాపులో నించున్నాడు. చెట్టునీడ హాయిగా అనిపించసాగింది. సాయంత్రం అవటం వలన జనం లేరు.
దూరంగా ఇద్దరు ముగ్గురు కోయవాళ్ళు నేలమీద చతికిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో పూసల దండలు, తేనె సీసాలు ఉన్నాయి. అమ్మి, అమ్ముడయినవి పోగా మిగిలినవి ఇంటికి తీసుకువెళ్ళి పోతున్నారేమో అనుకున్నాడు.
అతను చెట్టు నానుకొని, మౌనంగా నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఒక కారువచ్చి అతని ముందాగింది.
ఫ్రంట్ డోర్ తెరుచుకుని అందులోంచి సిరిచందన దిగింది. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యాన్ని ఆనందం డామినేట్ చేసింది. అనుకోని అతిధిలా ఆమె అక్కడికి రావటం భ్రమలాగా తోచి కళ్ళు వెడల్పు చేసుకుని మరీ ఆమెను చూశాడు..... సిరిచందనే!
అతడు గబగబా కారు దగ్గరికివెళ్ళి "ఏమిటి సిరీ...... ఏమయినా మరచిపోయానా?" అని అడిగాడు.
"లేదు, నువ్వెళ్ళింతర్వాత నేనెంత పూలిష్ గా ప్రవర్తించానో అర్థమయింది. అంత దూరం నువ్వెళ్ళుతున్నావన్న దిగులుతో, కనీసం అంతవరకూ డ్రాప్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. అందుకే వుండలేక వచ్చేశాను. ఆయన్ని కూడా రమ్మన్నాను కానీ తలనొప్పిగా వుంది అన్నారు. పద, కారెక్కు. కారులో కోయపల్లెవరకూ డ్రాప్ చేస్తాను" అంది.
మొట్టమొదటిసారి ఆమె గొంతునుంచి తనపట్ల తొణకిసలాడిన అభిమానానికి అతను కదిలిపోయాడు.
వద్దులే అనికూడా చెప్పకుండా వెళ్ళి ఆమెతోపాటు కారులో కూర్చున్నాడు.
కారు కదిలింది.
ఆమె మౌనంగా డ్రైవ్ చేస్తూ వుంటే అతడు మధ్య మధ్యలో తలతిప్పి ఆమెను చూస్తున్నాడు. ఆమె ముఖానికి ఒక ప్రక్క మాత్రమే అతనికి కనిపిస్తోంది. సూటిగా వున్న ముక్కు ఆమెలోని పట్టుదలని సూచిస్తోంది. కారు గతుకుల్లో పడినప్పుడల్లా వూగుతున్న చెవి జూకా ఎంతో అందంగా వుంది. పల్చగా రేగిన ముంగురులు ఆమె అందాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె "ఏదయినా మాట్లాడు మహీ" అంది.
అతడు చప్పున ఆలోచనలనుంచి తేరుకొని, ఆమెఏం చెప్పిందో సరిగ్గా వినపడక "ఏమిటీ?" అన్నాడు.
"ఏ లోకంలో వున్నారు సర్ తమరు?"
"ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలోకి వెళ్ళిపోయాను."
"పక్కన ఒక మనిషి వుందన్న ధ్యాస కూడా లేకుండా, నీ మటుకు నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా?" అందామె.
"సారీ."
కారు ఘాట్ రోడ్ దాటి అడవి ప్రాంతంలో ప్రవేశించింది.
"నేనొకటి అడుగుతాను నిజం చెపుతావా?" అందామె.
"అడుగు సిరీ. నీకు అబద్ధం కూడా చెప్పగలనా?" మాటయితే అనేసాడు గానీ తనిప్పటికి ఎన్ని అబద్ధాలు చెప్పాడో గుర్తొచ్చి సిగ్గువేసింది.
అంతలో ఆమె అడిగింది "మహీ నువ్వింత రిస్క్ దేనికి తీసుకుంటున్నావ్?"
అతడు సమాధానం చెప్పలేదు.
"చెప్పు మహీ ఎందుకింత త్యాగం చేస్తున్నావు?" ఆమె కంఠంలో సన్నటి జీర ధ్వనించింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో అప్రయత్నంగా నీటితెర మెరిసి మాయమైంది.
"ఇందులో త్యాగమేముంది సిరీ! స్నేహితురాలు భర్తకు కళ్ళు తెప్పించా లనుకోవటం త్యాగమెలా అవుతుంది?"
"అవటానికీ, అనుకోవటానికీ ఒక హద్దు అనేది వుంటుంది. నువ్వు వెళ్ళేది ఎంత భయంకరమైన ప్రదేశానికో నాకు తెలుసు. ఆ ప్రదేశమంతా కాలినడకన తిరుగుతూ, పాములమధ్య మూలికల కోసం వెతుకుతూ....... చెప్పు మహీ, ఎందుకు వెళ్ళాలను కుంటున్నావ్?"
"లేదు సిరీ. నువ్వనుకునేంత కష్టమేమీ వుండదు."
"నాకు తెలుసు. అందేంత కష్టమో. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో. ఆ కోయవాళ్ళకే ఎంత కావాలంటే అంత డబ్బిచ్చి వాళ్ళనే వెళ్ళమందాం."
మహర్షి నవ్వడానికి ప్రయత్నించాడు!" భలే దానివే. నన్ను ఒక పిరికివాడి క్రింద జమ కడుతున్నావ్ నువ్వు. అలాంటి దిగులేమీ పెట్టుకోకు సిరీ. నేను క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తాను."
"ఏమో మహర్షీ నా మనసు కీడు శంకిస్తోంది. నా భర్తకు కళ్ళు వస్తాయేమో అన్న ఆశ ఒక మూల వున్నా, ఓ ప్రాణ మిత్రుడు నాకోసం ఇంత కష్టపడటం కలచివవేస్తోంది. ఒక్క విషయం చెప్పు. ఇదంతా నామీద జాలితో చేయడం లేదు కదా, నేను దేన్నయినా భరించగలనుగానీ, జాలిని మాత్రం భరించలేదు."
అప్పటికే అతనొక నిశ్చయానికి వచ్చాడు. కారు కోయపల్లెకు వెళ్ళే మట్టిరోడ్డు దగ్గిర ఆగింది. అతడు కారుదిగి జేబు లోంచి కవరు తీశాడు. అప్పటివరకూ ఆ కవరు ఆమెకివ్వడం పట్ల అతనికున్న అనుమానాలన్నీ అతనికి ఇప్పుడు లేవు. 'తను ఆమెని ఎంతగా ప్రేమించాడో, తను మరణించిన తరవాతన్నా ఆమెకు తెలియాలి' అన్న కోరిక ఒకటే ఇప్పుడు మిగిలింది.
ఆ కవరు ఆమెకిస్తూ "నాకో వాగ్దానం చేస్తావా సిరీ" అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతడి చేతిలోని కవరుకేసి చూస్తూ "ఏమిటి" అంది.
"వచ్చే చంద్రగ్రహణం రోజునాటికి నేను తిరిగివస్తే సరేసరి. అలా రాకపోయినా పక్షంలో అప్పుడు తెరిచి, ఈ కవరు చదువు. ఈ లోపులో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని విప్పకు. నేను తిరిగి వస్తే ఇలాగే నాకు వెనక్కీ ఇచ్చేయాలి సుమా" అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా "ఏమిటి, ఏముందీ కవరులో" అని అడిగింది.
"ఇంకే ప్రశ్నలూ వద్దు. నేను చెప్పింది అర్థమైందిగా?"
"ఆమె కవరు తీసుకుంటూ "అలాగే , కానీ నువ్వు తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంది.
అతడు ఆఖరిసారిగా ఆమె చూసుకుంటున్నట్టు, ఒకసారి కళ్ళారా ఆమె చూసి వెనుదిరిగి, మట్టిబాటగుండా నడుస్తూ అడవిలోకి కలిసిపోయాడు.
అతడు కనుమరుగయ్యేవరకూ ఆమె అలాగే కూర్చుని, ఆ తరువాత కారు స్టార్టుచేసి వెనక్కి సాగిపోయింది.