"నేను నీ తండ్రిలాంటి వాడిని. నా దగ్గర అబద్ధం చెప్పకు. అనుభవించవలసిన వయసులో ఇప్పటికే ఎన్నో కోల్పోయావు. మనం ప్రేమించే వ్యక్తులు చాలామంది దొరుకుతారు. మనల్ని ప్రేమించే వ్యక్తులు దొరకటం కష్టం. ఆ విధంగా నువ్వు అదృష్టవంతురాలివి-"
"నేనా? నే నదృష్టవంతురాల్నా?" ఆమె బరస్ట్ అయింది. ఎన్నో సంవత్సరాలుగా ఆమె మనసులో గూడు కట్టుకున్న వేదనంతా ఒక్కసారి దుఃఖరూపంలో బయటకు వచ్చింది. "నా తల్లి చిన్నప్పుడే పోయింది. నా తండ్రి జీవితమంతా డబ్బు సంపాదించటానికీ, కుహనా మేధావుల పొగడ్తలమధ్య శయ్యాసుఖం అనుభవించటానికీ సరిపోయింది. వయసులో, ఊహ తెలిసినప్పటి నుంచీ ప్రతి మొగవాడూ ఏదో విధంగా దగ్గిరవటానికి ప్రయత్నించి ప్రేమంటే అసహ్యం కలిగేలా చేశారు. అటువంటి నేను.... నేనా అదృష్టవంతురాల్ని?"
"కాదా మరి? ఎంత దాహంతో అల్లాడిపోయావో- చివరికి అంత ప్రేమ ఇవ్వగలిగేవాడు దొరికాడు కదా?"
"అతడు ప్రేమకన్నా అబద్ధాలే ఎక్కువ చెప్పాడు".
"లేదు విద్యాధరీ! అతడు అన్నీ నిజాలే చెప్పాడు. ఈ ప్రపంచంలో ఒక మనిషికి, సాటి మనిషి తనని ప్రేమిస్తున్నాడంటే- ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఏ స్వార్థంతో ప్రేమిస్తున్నాడు అన్న అనుమానం వచ్చేలా ప్రస్తుత సామాజిక పరిస్థితులు వుండటం దురదృష్టకరం. నేను ఎంక్వయిరీ చేశాను. అతడు వింధ్యపర్వతాలకి వెళ్ళి నీ గురించి తపస్సు చేయటం నిజమే. అందులో అబద్ధం ఏమీలేదు".
ఆమె ఒక్కసారిగా తెల్లబోయి "మీరు ఎంక్వయిరీ చేశారా?" అంది.
"అవును, నేను స్వయంగా వింధ్యపర్వతాల్ల్లోకి వెళ్ళి వాకబుచేసి వచ్చాను".
ఆమె చాలాసేపు మౌనంగా వుండి, "నేనింక ఇదంతా నిజమే అని నమ్మలేకపోతున్నాను" అంది.
"నేనూ మొదట్లో నీలాగే అనుకున్నాడు. కానీ జరిగే ఒక్కొక్క సంఘటనా అతడి నిజాయితీని నిరూపించింది. తపస్సు మునుల్ని మానవాతీతుల్ని చేస్తుంది అన్నది నిజమైతే, ప్రేమపట్ల అతడి నిజాయితీ అతడికి మానవాతీతశక్తుల్ని యిచ్చిందన్నది కూడా నిజమే".
"ఆ అహంతోనే అతడు నాతో ఎప్పుడూ కటువుగా ప్రవర్తిస్తూ వచ్చాడు".
"నువ్వు అతడిని సరిగ్గా అర్థంచేసుకోలేదు విద్యాధరీ! నీ చుట్టూ అతడు ఏ విధమైన మాటల మత్తు, చేతల 'వల' జల్లకుండా ప్రవర్తించాడు".
"దాన్ని సహించవచ్చు, కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం సహించలేకపోయాను... ముఖ్యంగా నేను లాకప్ లో వున్నప్పుడు".
శాస్త్రిని మళ్ళీ ఆవేశం వూపేసింది. 'చెప్పెయ్యాలి. చెప్పెయ్యాలి...' అనుకొన్నాడు. తన పిల్లలమీద చేసిన ప్రమాణం గుర్తొచ్చింది. అయినా ఫర్వాలేదు. తన పిల్లలు నాశనమైనా సరే, ఈ పిల్ల అపార్థాలు తొలగించాలి అనుకున్నాడు. మొత్తం అంతా చెప్పాడు. చక్రధర్ హత్యకేసు పరిశోధించటంలో అనుదీప్ మొట్టమొదట ఎలా సాయపడిందీ వివరంగా చెప్పుకొచ్చాడు. "...నిన్ను హత్యానేరం నుంచి బయట పడేయ గలిగే మార్గాలూ, అసలేం జరిగిందన్న వాస్తవాలూ, అన్నీ అతడే చెప్పాడు. అతడే నిన్ను జైలుశిక్ష నుంచి తప్పించాడు. కానీ నాతో ఒట్టేయించుకున్నాడు. ఇంత చేసినా అతడు తన పేరు బయటకు రావటానికి వీలులేదన్నాడు. ఎందుకో తెలుసా విద్యాధరీ... ఆ విధంగా నీ ప్రేమ పొందకుండా వుండాలన్న నిస్వార్థ చింతనతో...."
ఆమె నిర్విణ్ణురాలైంది. చిగురుటాకులా కంపించిపోయింది. ఆమె మనోదర్పణంలో అనుదీప్ ప్రతిబింబం మరింత ప్రజ్వలంగా, ఆమెకే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా గోచరించసాగింది. తను ఎంత అల్పమైందో అర్థమైంది. అతడు అడుగుతున్నకొద్దీ మరీ శిఖరమెక్కి కూర్చుంది. ఎవరికీ లభ్యంకాని 'ప్రేమ' తనకి దొరుకుతున్నప్పుడు దాన్ని అర్థంలేని అనుమానాల్తో త్రోసిపుచ్చింది. తన ప్రేమకోసం ఒక యువకుడు తపస్సు చేయటం..! ఎంత మంచి అనుభూతి!!... అంత అందమైన అనుభూతిలో కూడా ఆమెకు దుఃఖం వచ్చింది. 'అనుదీప్ ... అనుదీప్' అనుకుంది. చంద్రుడిని చూసి సాయంసంధ్య అంబరాన్ని (అంబరము- ఆకాశము / వస్త్రము) వదిలేసినట్టు, ఆ నవల (నవల-స్త్రీ)/పుస్తకము (థ్రిల్లర్) యొక్క బంధనాలు తెగిపోయి, పుటలు (పుట-కాగితము/ అపనమ్మకము) కదిలిపోయాయి. తెల్ల పావురాలు ఆకాశంలో గుంపుగా పయనిస్తున్నప్పుడు మలయమారుతం వాటిని పరామర్శించి, రాబోయే వర్షపు స్పర్శ గురించి చెప్పినట్టు, బీడుపడిన ఆమె ప్రేమ రాహిత్యపు హృదయంపై స్నేహమాధుర్యపు తొలకరిజల్లు పడింది. అయితే అది మలయమారుతమె అవుతుందో, పెనుతుఫానుగా మారుతుందో విధే నిర్ణయించాలి. ఆస్ప్రతిలో అతడు మాత్రం చావు బ్రతుకులమధ్య కొట్టుమిట్లాడుతున్నాడు.
* * *
ఆమె ఇంటికి వచ్చింది.
ఆగి ఆగి దుఃఖం వస్తోంది. నిశ్చలంగా వున్న తటాకం మీదకు ఒక పిల్లగాలి రివ్వున వీస్తే అలలు ఎలా కదుల్తాయో అలా జరిగినదంతా గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసంతా అదోలా అయి, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం పూర్తిగా బయటకు రాదు. పూర్తిగా లోపలే వుండిపోదు. ప్రేమలో పడినవారికి మాత్రమే దానియొక్కప్రభావం అనుభవపూరకం.
ఇన్ స్పెక్టర్ రవిశాస్త్రి ఆమెకి అన్ని విషయాలూ చెప్పినప్పటి నుండే అనుదీప్ ని కలుసుకోవాలనీ, మాట్లాడాలనీ ఆమె మనసు తహతాహ లాడుతుంది. అది అహమో, అజ్ఞానమో, అపనమ్మకమో, ఏదైతేనేం పూర్తిగా నశించింది. ఆమె అతడితో వాదించదల్చుకోలేదు. వాదనలతో సమయం వృధా అయిపోయింది.
మరుసటిరోజు ప్రొద్దున్న వరకూ ఆ సందిగ్ధత అలా వుండవలసిందే. డాక్టర్లు ఆస్పత్రిలో ఆ రాత్రి పేషెంటు ప్రక్కన వుండటానికి వీల్లేదన్నారు. పరిస్థితి నిరాశాజనకంగా వుందని ఆమెకి తెలుస్తూనే వుంది. భుజానికి కలకత్తా చేతిసంచి, లాల్చీ పైజమా, చిరుగెడ్డం, చెదరని నవ్వు ఆభరణాలుగా అతడు చెయ్యి వూపుతూ వెళ్ళిపోవటం ఆమెకు గోచరమవుతూనే వుంది. ఆకాశం మెట్లు ఎక్కి ఇంద్రధనస్సు రథంమీద ఏడురంగుల గుర్రాలమీద అతడు వెళ్ళిపోతూ ఆఖరిసారి పలకరించాడు.
ఆమె దృష్టి టేప్ రికార్డర్ మీద పడింది.
ఇంతసేపూ దానిగురించి మర్చిపోయినందుకు తనని తిట్టుకుంటూ టేప్ రికార్డర్ ఆన్ చేసింది.
మొదట చిన్న చిన్న శబ్దాలు కదిలిన తరువాత అతడి స్వరం ఆ చీకటి నిశ్శబ్దంలో ప్రకంపనాల రూపంలో సందేశాన్ని అందించింది.
* * *
"విద్యాధరీ...
ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక వయసులో 'చింతన' ప్రారంభమవుతుంది. ఆ ఘర్షణలో అతడు ఎంత లోతుకి వెళతాడన్నది అతడి మానసిక స్థాయిమీద ఆధారపడి వుంటుంది. పక్షి మరణం వేటగాడిని వాల్మీకిని చేసినట్టు, ప్రేమంటే ఏమిటి అన్న చింతన నన్ను అడవులకి పంపింది. ఈ చింతనకి కారణం నా చెల్లి మరణం. విషజ్వరంతో మరణించే ముందు నా చెల్లి నాకో ఉత్తరం వ్రాసింది.
పది చీమలు పక్కమీద చేరి రాత్రంతా నిద్రలేకుండా చేశాయంటే నవ్వుతాం. కానీ ఈ రోజుల తరబడి నిద్రలేక ఒక మనిషి మరణించాడంటే?
- ఆ మాత్రం చీమల్ని దులుపుకోలేకపోయాడా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఈ చీమలు అంత సులభంగా వదిలిపోవు విద్యాధరీ. మనిషి ఆనందాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. తన డాక్టర్ కొడుకు ఒక బీదమ్మాయిని ప్రేమించాడని తెలిసి, పెళ్ళికి వప్పుకుంది. ఆ తల్లి - కేవలం బంధువుల మధ్య గొప్పతనం బాగా పెరుగుతుందని.
కానీ ఆ 'వేడి' తగ్గిపోగానే, ఆ కసిని నా చెల్లిమీద, మా తల్లిదండ్రుల మీదా చూపెట్టేది. చూపెట్టటం అంటే కిరసనాయిలు పోసి కాల్చటం వగైరా కాదు. మాటలు- మంటలుకన్నా వేడిగా హృదయాన్ని కాలుస్తాయి.
ఇప్పుడు ఈ ప్రసక్తంతా ఎందుకు అన్న అనుమానం నీకు కలుగవచ్చు. కానీ మన కథకీ దీనికీ చాలా సంబంధం వుంది విద్యాధరీ! నా చెల్లి వ్రాసిన ఉత్తరాన్ని యధాతధంగా చెబుతాను విను. "ఒరేయ్ అన్నయ్యా! నెల రోజుల్నుంచీ ఒకటే జ్వరం. రేపటికి ఎలా వుంటుందో తెలీదు. బాధని ఒకరికైనా చెపితే కాస్త మనశ్శాంతి.
"మా ఇల్లు చాలా గొప్ప గొప్ప వ్యక్తుల నిలయం అని నీకు తెలుసు. అందులో ముఖ్యులు మా పెద్ద బావగారు. మొన్న కాశీకి వెళ్ళినప్పుడు చెంబుతో గంగని తెచ్చి తల్లిదండ్రుల్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆ జలంతో కాళ్ళు కడిగారు. అంత మహాత్ముడు. ఇక మా పెద్ద తోడికోడలు ఉత్తరాలు ".... పూజ్యులయిన అత్తగారికి, మీ ఉత్తరం అందింది. మామగారికి వంట్లో బావోలేదని తెలిసినప్పటినుంచీ ఆయన సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. పిల్లలు కూడా తాతయ్యని ఎప్పుడు చూద్దామా అని కంగారుపడుతున్నారు. మామగారి ఆరోగ్యం బాగుపడేవరకూ శుక్రవారాలు ఉపవాసాలుంటానని లక్ష్మీదేవికి మొక్కుకున్నాను...." ఇలా వుంటాయి! పగలంతా ఇంటెడు చాకిరీతో అలసిపోయి, అప్పటికి మూడుసార్లు మాత్రలు ఇచ్చి, ఒక తెల్లవారుఝామున నాలుగోసారి మందు ఇవ్వటం మర్చిపోతే, ఆ మరుసటి రోజు పదిమంది ముందూ, "ఎలాగయినా మా పెద్దకోడలి ప్రేమ మరెవరికీ రాదండీ" అని నేను వినేట్టూ మా అత్తగారి నోటివెంట పలికిస్తాయి ఆ ఉత్తరాలు!!
అలా అని వాళ్ళు నాటకం ఆడుతున్నారని నేననను. నిజంగానే ఉపవాసాలు ఉంటారు. పండక్కి వచ్చి బాధలు చెప్పి పదివేలు తీసుకెళతారు. అదే మా మామగారు వాళ్ళ వూరికెళ్ళి మంచాన పడితే అర్థరాత్రి లేచి మందివ్వటానికి ఆవిడకి బి.పి... ఆయనకి నడుము నొప్పి! అందుకే పూజ్యులైన మా అత్తమామలు వారింట్లో ఒకటి రెండురోజులు కంటే ఎక్కువ వుండరు... నేనెవర్నీ తప్పు పట్టటంలేదు. మనుష్యుల జీవితాల్లో లౌక్యానికీ మంచితనానికీ ఎంత దగ్గర సంబంధం వుందో చెప్పటమే నా ఉద్దేశ్యం.
వారి కుటుంబంలో రెండుచేతులా సంపాదిస్తున్నది మా ఆయనే! చిన్నతనంనుంచీ తనో గొప్ప అదృష్టజాతకురాల్నని మా అత్తగారి అభిప్రాయం. పూర్వజన్మ సుకృతంవల్లనే మేమంతా ఆవిడకి కోడళ్ళమయ్యామనే వారి నమ్మకం. నయాపైసా ఖర్చులేకుండా డాక్టర్ భర్తని కొట్టేసిన నా అదృష్టం, తన అదృష్టం కన్నా ఎక్కువేమో అన్న అనుమానం వచ్చినప్పుడల్లా 'నువ్వు మాకు ఋణపడి వున్నావు సుమా' అని ఆవిడ అన్యాపదేశంగా హెచ్చరిస్తూ వుంటుంది.
ఇక మా ఆడపడుచు? ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు. అపూర్వమయిన జ్ఞానసంపదతో విలసిల్లుతున్నానని అనుక్షణం అనుకుంటూ ఉంటుంది. అక్కలు, బావలు, అన్నలు, వదినలు అందరి మనసుల్లోకి తొంగిచూసి, వారి కష్టాలకి సలహాల సిద్దాంతీకరణలు చేసి అందరికీ దగ్గరవ్వాలనేది ఆమె లక్ష్యం! వచ్చిన ప్రతిసారీ చెల్లెలి వళ్ళో అరగంటన్నా తలపెట్టుకొని ఏడవందే పెద్దన్నగారికి తృప్తితీరదు. ప్రతివారితోనూ "నువ్వు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావ్ సుమా" అనిపించుకోవటం ఆమెకి చాలా ఇష్టం. ఇదేం మనస్తత్వమో నాకు అర్థంకాదు.
మా మూడో బావగారు మా ఇంట్లో వున్నందుకు నెలకి నాలుగు వందలు (తనకి, తన భార్యకి కలిపి) ఇస్తారు. పెళ్ళయి నాలుగు సంవత్సరాలయినా కొత్త దంపతులే. ఆయనకి స్పెషల్ కూర వండటానికే ఆవిడ గదిలోంచి వస్తుంది. వాళ్ళ కంచాలు ఎత్తటానికి కూడా నేను సిద్ధమే. కానీ మా అత్తమామలకి తాను దగ్గరై, చివరికి నా పిల్లల్ని కూడా నా నుంచి దూరం చేయటానికి ఆవిడ చేసే ప్రయత్నాలు, ఒక అంతర్జాతీయ చదరంగపు ఆటగాడు వేసే ఎత్తులకన్నా తెలివిగా వుంటాయి. నా పిల్లాడిని నేను కొట్టబోతే ఆరుచేతులు అడ్డుకుంటాయి. "పిల్లాడికి దెబ్బలు తగిలాయని సువర్ణ భోజనం చేయలేదమ్మా. రాత్రంతా ఏడుస్తూనే వుంది" అంటాడు ఆయన. ఈ ఇంటికి నేను అతిథినో- నాకు వీళ్ళందరూ అతిథులో ఎప్పటికీ నాకు అర్థంకాదు. నా పిల్లలు ఎలా బ్రతకాలో వీళ్ళు నిర్ణయిస్తారు. మర్రిచెట్టు ఊడలు దింపినట్టు నా గృహ సామ్రాజ్యంలోకి నలువైపుల్నుంచీ చొచ్చుకు వచ్చేశారు. నాకంటూ భర్తనీ, ఇంటినీ, పిల్లల్నీ కూడా మిగల్చటంలేదు.
మనిషి తన చేతగానితనానికి బింకంగా ఎలాంటి ముసుగు వేసుకుంటాడో చెప్పటానికి మా బంధువులే ఉదాహరణ. వాళ్ళ ఊళ్ళో వెయ్యి ఖర్చవుతుంది. రెండొందలు రైలు ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ భోజనాలతో సహా ఫ్రీ!! "హస్తవాసి మంచిది" అన్న నెపం మీద వస్తారు. అత్తగారి బావమరిది చిన్నకోడలి తమ్ముడినుంచీ, మామగారి అన్నగారి పెద్దకూతురు బావగారి వరకూ అందరూ మాకు ఇప్పుడు 'దగ్గిరవారే'. ఇద్దరికన్నా ఎక్కువ 'దగ్గిరవారు' అలా ఒకేసారి వస్తే మేము మా బెడ్ రూం ఖాళీచేసి ఇవ్వాలి. అన్నిటికన్నా చిత్రమేమిటంటే వెళుతూ వెళుతూ నాకో జాకెట్టు గుడ్డముక్కో, చీరో పెట్టి ఫీజు రుణం తీర్చేసుకున్నామని ఏ ఆత్మవంచనా లేకుండా అనుకుంటారు.