మనం పెళ్ళి చేసుకోవటం వల్ల మా నాన్నగారికి నిజంగానే అనందం కలిగితే నిన్ను తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను వామన్!"
"సౌందర్యా! నేను ఎంత అదృష్టవంతుడ్నో" ఆనందంతో తలమునకలయిపోతూ అన్నాడు వామనమూర్తి.
"కానీ, నేను నీతో సంసారం చెయ్యను!"
ఒక్క క్షణంలో విస్తుపోయి పట్టించుకోనట్లు నవ్వేశాడు వామనమూర్తి.
"ఫరవాలేదు, నీ అనుగ్రహం కోసం నిరీక్షించగలను. ఎన్ని యుగాలైనా సరే!"
"ఎన్నెన్ని యుగాలైనా నువ్వు నన్ను సమీపించలేవు. కానీ మా నాన్నగారు నిన్ను విదేశాలకు పంపిస్తారు."
"నువ్వూ వస్తావు."
"నేను రాను! కానీ, నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. కలెక్టర్లు, మినిస్టర్లు - ఆఫీసర్లు..... వాళ్ళందర్నీ నవ్వులతో మురిపించి .... నా మాటలతో కవ్వించి.... నా అందంతో ఆకర్షించి నీకు కావలసిన పనులు చేసి పెడతాను"
'సౌందర్యా...."
"ఏం! నేను అలా చెయ్యగలనని నీకు తెలియదా? అప్పుడు నీకు అన్నీ ఉంటాయి డబ్బు! పలుకుబడి! పెద్ద హోదా! నలుగురిలో గొప్పగా చూపించుకోవటానికి అందమైన భార్య! నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. కానీ, నిజంగా నీకు కావలసింది..... కావాలని నువ్వు ఎప్పుడూ అనుకోనిది ....అనందం .... అది మాత్రం దొరకదు."
"ఇన్ని ఉండగా అనందం ఎందుకుండదూ?"
"నేను ప్రక్కనుండగా ఉండదు! నిజంగా నీకు ఏం లేదో, నువ్వు ఏది పోగొట్టుకున్నావో నేను అనుక్షణం గుర్తుచేస్తూ ఉంటాను గనుక! నువ్వు సృష్టించుకునే ఈ మాధుర్యాల మధ్య నేను సృష్టించే నరకంలో ఉక్కిరిబిక్కిరయ్యే నీకు ఊరట కలిగించే ప్రాణి ఒక్కర్తే ఉంది. చెప్పనా?"
"వద్దు!"
"అయితే వస్తాను. సుధ! ఇంకా - ఇంకా - ఇంకా పైకి పైకి అని నువ్వనుకుంటున్న ఆశల శిఖరాల మీదకి చేరుకోవటానికి నన్ను భార్యగా పక్కన నిలబెట్టుకున్నప్పుడు - అన్ని అవమానాలను భరించి, సుధ నీకు ఉంపుడుకత్తెగా ఉంటుందేమో కనుక్కో"
సౌందర్య చెంప చెళ్ళుమంది!
బిత్తరపోయి తన చెయ్యి చూసుకున్నాడు వామన్.
తనేనా? ఆమెను కొట్టాడా? సౌందర్యను కొట్టగలిగాడా?
భయంతో బిగుసుకుపోతూ ఆమె ముఖంలోకి చూశాడు.
ఆ కళ్ళు కవ్వుతున్నాయి - ఆర్ద్రంగా.
"థాంక్యూ వామన్!"
"ఎందుకూ?" పోడారిపోతున్న పెదవులతో అయోమయంగా అడిగాడు.
"మానవత్వంలో నాకు నమ్మకం మిగిల్చినందుకు!"
18
ఆనాడు కామేశ్వరీదేవి గారి ఇంట్లో ఒక అభ్యుధయ రచయిత తను వ్రాసిన "గోలాయణం" గురించి మాట్లాడుతున్నాడు. శ్రోతలలో ఎక్కువ మంది ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు.
"నా నవలలో శూర్పణఖ ముక్కు చెవులు కోసినా ఎడవదు. మరింత రోషంతో "నువ్వు అల్పుడివి. .స్త్రీని గౌరవించడం రాదు. నేను మా అన్నకు సీతను గురించి చెపుతాను. ఇక ఈ సీత నీకు దక్కదు. మా రావణుడు నీలాగా ఆడదాని ముక్కు చెవులు కోయడు. గౌరవిస్తాడు. బంధించినా దౌర్జన్యాలు చెయ్యడు." శ్రోతలలో కొందరు చప్పట్లు కొట్టారు.
"రామాయణంలో స్త్రీలకు చాలా అన్యాయం జరిగింది. దానిని నిరసించటానికి బదులుగా నెత్తిన పెట్టుకుంటున్నారు."
"ఈ జాతి ఇంకా ఇంకా అనాగరికతలో మగ్గిపోతుంది." అన్నాడు రచయిత.
"అవును" అన్నట్లు తలలూపారు శ్రోతలు.
ఇంతసేపటికి సౌందర్య కల్పించుకుంది.
"అసలు ఒక ఆడపిల్ల "భూమిలో దొరికింది" అనటమే గొప్ప అన్యాయం. ఆడపిల్లలు భూమిలో దొరుకుతారా? ఈ అన్యాయాన్ని ఖండిస్తే అసలు రామాయణమే లేదు. ఇది మహత్యంగా ఒప్పుకుంటే మహాత్తులతో కూడిన రచనలో తప్పొప్పుల ప్రస్తావనే లేదు."
ఆ మాటల్లో - మాట్లాడిన తీరులో సన్నని నవ్వు, సౌందర్య ముఖంలో ఎగతాళి స్పష్టంగా కనిపిస్తుంది.
సాధారణంగా ఏ విషయంలోనూ కల్పించుకొని సుధ "గజం విద్య - పలాయనం మిధ్య" అంది.
ఆ మాటల్లో "జోక్" అర్ధమయిన వాళ్ళు నవ్వారు. అర్ధం కాని వాళ్ళు నవ్వినట్లు నటించారు.
"గోలాయణం" రచయిత ఊరుకోలేదు.
"అవును, మిధ్యే కాని ఆ మిధ్యలోనే లక్షలాది జనం మూర్ఖులవుతున్నారు. ఆ మూర్ఖత్వాన్నుంచి బయట పడెయ్యటానికే నాబోటివారి ప్రయత్నం."
"రామాయణం ఏనాటిదో , ఎలాంటిదో కాని ఈ నాటికీ ఆ కధనే, ఆ పాత్రలనే తిరగేసి, మరగేసి, కధకులు పేరు తెచ్చుకుంటున్నారు. రామాయణానికి సంబంధించి ఆ పేర్లతో ఆ కధనే రాశారుట! ఏం రాశారో? రామాయాణాన్ని ఎలా మార్చారో? అనే కుతూహలంతో జనం చదువుతున్నారు. ఇదంతా ఒక రకం "వైర భక్తీ'. రాముడి దయ. నిందిస్తూ అయినా తనను తలచినవారికి మేలు చేస్తాడు. వైర భక్తీ కూడా తక్కువ కాదు కదా" సుధ మాటలకు లోలోపల ఆశ్చర్యపోయారందరూ.
ఆ మాటల్లోని నిజానికి కాదు - సుధ అంత ధైర్యంగా మాట్లాడినందుకు మౌనం పిరికితనం కాదు సహనం.
విక్రమ్ మాట్లాడకుండా కూర్చోవటం కామేశ్వరీదేవికి నచ్చలేదు. అతని నిర్మొహమాటంగా మాట్లాడతాడు. గనుక వాదోపవాదాలు చెలరేగే అవకాశం ఉంది. సమావేశం రక్తి కడుతుంది.
"విక్రమ్ ! మీరేమంటారు?" అంది.
"దీని మీద ఇంత రచ్చ అనవసరం. ఆ రచనలో "జీవం" ఉంటే జనుల హృదయాలలో నిలుస్తుంది. లేకపోతే, అదే నశించిపోతుంది.
"అది సరే, మీ అభిప్రాయం చెప్పండి."