ఇటు రంగారావుకీ, అటు భూషణానికీ మధ్య మాటలు చేరవేసే పెదకామందూ వున్నాడు.
"ఏమంటాడయ్యా భూషణం?" అడిగాడు రంగారావు.
"బెదిరిపోయేడు. ఇంకెమంటాడు?" నవ్వేడు కామందు.
"చెట్టుక్కట్టి కాలుస్తానన్నాడుగా రాజయ్యని కాల్చడంటావా?" తెలియనట్టే అడిగేడు రంగారావు.
ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు రాజయ్య అక్కడికి చేరుకుంటున్నాడు.
"ఇంకేం కాలుస్తాడు మీ అండ రాజయ్యకి వున్నాక."
"అయితే రాజయ్యకు మన అండ వున్నదంటావ్?" ముసి ముసిగా నవ్వేడు రంగారావు.
కామందుకి చదరంగం రాదు. మాట అర్ధంకాలేదు. అతగాడికి అర్ధం కాలేదన్నది రంగారావుకి అర్ధమయింది.
"రాజకీయాల్లో ఒకడి అండ ఇంకోడికి పర్మనెంట్ గా ఎప్పుడూ వుండదయ్యా కామందూ వినుకో పైకి రావాల్సినోడివి ఆ భూషణం తగలెట్టకపోతే రాజయ్యని మనమే తగలేద్దాం."
వింటూన్న రాజయ్య వణికిపోయేడు.
"మనమా?" అన్నాడు కామందు అర్ధంకాక.
"ఆడ్ని నడివీధిలో సెట్టుకట్టేసి కాలుత్తానని ఆ భూషణం గాడు అందరికీ సెప్పుకున్నాడు కదయ్యా. ఇయ్యాల ఏదో పెళయం వస్తూందని ఆడు ఆగిపోతే మనం ఆగుతమా? అదే సమయానికి ఓ సెట్టు నీడన రాజయ్యగాడి శవం కాలిపోయి పెజలకి కనిపించిందనుకో! ప్రవాహం ప్రవాహంలా ఆ భూషణం మీద ఇర్చుకుపడరూ? భూమ్మీద ఈ అరిష్టానికి కారణం .....ఇదో-ఇట్టా ఈ రాజయ్యగాడ్ని ఆ భూషణం కాల్చెయ్యడమే అని ఓ "రూమరొ" దిల్నామానుకో - ఇంకా తరువాత మిగిలింది నువ్వే ఆలోచించు....."
ప్రళయాన్ని కూడా తన స్వార్ధానికి ఉపయోగించుకొనే తోటి మనిషిని చూసి, రాజయ్య బెదిరిపోయేడు. కంచే కదిలి తనను మేయతానికి వస్తుంటే విస్తుపోయిన చేనులా అల్లల్లాడిపోయాడు. రెండు పులులు దెబ్బలాడుకొంటూంటే, డానికి కారణమైన కుందేలులా భీతి చెందేడు.
చావటం ఖాయం, ఏ పులి నోటిలోపడి అన్నదే ప్రశ్న.
వెళ్ళిపోవాలి. అక్కణ్ణుంచి దూరంగా పారిపోవాలి. ఈ మనుషులకి అందనంత దూరానికి.....
కాలికింద ఎండుటాకు విరిగింది "ఎవరదీ?" అరిచేడు రంగారావు. రాజయ్య వణికిపోయాడు. కామందు బైటికి వచ్చి చూస్తే పరుగెడుతున్న రాజయ్య కనపడ్డాడు.
విషయం తెలిసిన రంగారావు కంగారు పడ్డాడు. "ఆణ్ణి పట్టుకో" అరిచాడు. విషయం బైటకు రాకూడదు.
రాజయ్య పరుగెత్తుతున్నాడు. వెనుకే రంగారావు.
తొమ్మిదయింది.
ముసలాయన అసహనంగా కదిలాడు. "ఏమయ్యారు వీళ్ళిద్దరూ?" అన్నాడు. అలా అడగటం అది అరవయ్యోసారి. జానకి మాట్లాడలేదు. మోకాళ్ళమీద తల పెట్టుకొని, ఓ మూలకూర్చుని వుంది. ఆమె మాట్లాడి ఎంతోకాలమైంది. మౌనంగా, నిర్లిప్తంగా రాబోతున్న ప్రళయాన్ని తొందరగా ఆహ్వానిస్తున్నట్టూ సమాధిలో కూర్చొని వుంది..... బాబు తల్లివంక భయంగా చూస్తూ వున్నాడు భయం. అంతా భయమే.
హాట్ లైన్ మీద సంప్రదింపులు జరుగుతున్నాయి. చైనాని ఎలిమినేట్ చేసి యుద్దానికి సిద్దపడాలా? లాండ్ ఆఫ్ యుటోపియాలో దానికీ భాగం యివ్వాలా? ఒకవైపు సంప్రదింపులు జరుగుతూనే.... అంతర్గతంగా యింకో సమావేశం.... ఆఖరి నిముషంలో 'ఇంకో' దేశాన్ని కూడా అక్కణ్ణుంచి తోసేస్తే? యుద్ధం తప్పదు. ఎలాగూ చచ్చిపోతున్నప్పుడు యుద్ధం తప్పనిసరైతే మాత్రం నష్టం ఏముందీ? ప్రపంచమే ఒక హిరోషిమా అవబోతూంది. బలాబలాలు తేల్చేసుకుంటేనే సరి. శాంతి అనేది చాలా అస్పష్టమైనది. మనిషిలో లేదది. ప్రపంచం వరకూ ఎందుకు? చైనాతో కలిసి రష్యామీద యుద్ధం ప్రకటించలా? మనిషి చావబోయే రెండు గంటల ముందు ఇదీ సమస్య. ఇంకో పెర్వర్షను అసలు లాండ్ ఆఫ్ యుటోపియానే బ్లాస్ట్ చేసేస్తే? ఏమీ మిగల్దుగా!!
ఆయా దేశాల మారణాయుధాలు అన్నీ సిద్దం చెయ్యబడ్డాయి. ఇరవై ఔన్సులతో ప్రపంచాన్ని నాశనంచేసే బొటోలినస్ టాక్సిస్.....సైనేడ్ కన్నా మూడువందల మిలియన్ రెట్ల ప్రమాదకరమైన విషం. ముప్పై సెకన్లలో మనిషిని పక్షవాతానికి గురిచేసే నెర్వ్ గ్యాస్ ట్యూబ్స్ - మినిట్ మెన్!!! న్యూక్లియర్ మిసిల్స్.....ఫిఫ్టీ, మిలియన్ టన్.... టి యస్టీ బాంబ్స్.... ప్రళయం రావటానికి ప్రకృతే అక్కరలేదు. మనిషికీ మనిషికీ మధ్య వైషమ్యం చాలు.
పదయింది.
ఆకాశం రక్తంతో తడిసినట్టు ఎర్రబడింది. జలచరాలు రాబోయే ప్రమాదాన్ని గుర్తించినట్టు గుంపులుగా పరుగెడుతున్నాయి. పక్షులు చెట్లమీద చేరి రెక్కలు టపటపా కొట్టుకుంటూ అరుస్తున్నాయి.
హోరున శబ్దం.
సముద్రాలన్నీ ఏకమవుతున్నాయి. ముల్లోకాలను ముంచటానికి తరంగాలు పర్వతాల్లా లేస్తున్నాయి.
పృథ్వి, ఆకాశం, జాలం, శిలలు, అగ్ని, కలం, క్రియ అన్నీ నాశనమవటానికి ఆయత్తమవుతున్నాయి.
.....
పదిన్నర.
.....
ప్రాక్సిమా సెంక్చువరీ భూమిని తన ఆకర్షణ పరిధిలోకి లాక్కోవటానికి వస్తూ వుంది. ప్రపంచాన్ని నాశనం చెయ్యటానికి మిస్సిల్స్ సిద్దంగా వున్నాయి. స్విచ్ నొక్కగానే పరిగెత్తటానికి.
రాజయ్య పరుగెడుతున్నాడు. వెనుకే రంగారావు.
మేఘాలన్నీ ఒకచోట చేరి ఏడుస్తున్నట్టు కుండపాతగా వర్షం!
........
పదిగంటలా యాభై నిమిషాలు.
ప్రపంచం ఆఖరవటానికి ఇంకా పది నిముషాలు. మనిషి చచ్చిపోవటానికి ఇంకా పది నిముషాలు.
చచ్చిపోకుండా వుండటం కోసం రాజయ్య పరుగెడుతున్నాడు. సాంఘికంగా మనిషి ప్రతిక్షణమూ చావకుండా రక్షించగలిగేది ఏది? గడియారం టిక్ టిక్ మన్న శబ్దం తప్ప ఇంకేమీ విన్పించటం లేదు. ఒక్కొక్కక్షణమే మనిషిని మృత్యువు దగ్గరగా తీసుకెళుతుంది!
మనిషి చచ్చిపోతున్న క్షణంలో మనిషిలోని రాక్షసుడు బ్రతుకుతున్నాడు. వేయి చేతులు సాచి విజ్రుంభిస్తున్నాడు.
"ఆగు" అంది జానకి.
ముసలాయన అడుగు ముందుకేసేడు.
"ఆగు రాక్షసుడా! ఆగు."
ఆఖరి క్షణంలో ఆఖరి అనుభవం పొందాలనుకుంటున్న రాక్షసుడు మరొ అడుగు వేసాడు. ఆమె చేతికి దొరికిన హరికేన్ లాంతరు విసిరేసింది.
కెవ్వున కేక.
మంటలు ఎర్రటి మంటలు.
ఆర్తనాదాలు.
పాపాన్ని భరించలేక భూమి బీటలు వారుతోంది.
పదకొండు గంటలయింది.
ఒకటి - రెండు - మూడు - సెకన్లు.
పరుగెడుతున్న రాజయ్య కాలుజారి పడిపోయేడు. వెనుక నుంచి మృత్యువు వస్తోందని తెలుసు. చేతులెత్తి "దేవుడా" అని అరిచేడు.
ఐదు - ఆరు - ఏడు - సెకన్లు.
ఒక్కసారిగా తుఫాను వచ్చేముందు వుండే ప్రశాంతత ఏర్పడింది.
ఇంకో రెండు సెకన్లలో భూమి పేలిపోతుంది.
అంతా నిశ్శబ్దం. మానసికంగా చచ్చిపోయిన ప్రకాశరావు, సాంఘికంగా చచ్చిపోయిన రాజయ్య, నైతికంగా చచ్చిపోయిన ముసలాయన - అందర్నీ తనలో కాలపుకున్న నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దంలో రెండుచేతులూ ఎత్తి, జానకి భగవంతుడితో ఇలా అంది -
"ప్రభూ! ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నావు, చెయ్యి. తొందరగా అందరినీ నీలో కలుపుకో, భగవంతుడా! ఈసారి మళ్ళీ సృష్టి అంటూ చేస్తే ఆ క్రొత్త ప్రపంచంలో మనిషి నిజమైన మనిషిలా బ్రతకాలి. మానసికంగా, సాంఘికంగా, నైతికంగా చావకూడదు. అలాంటి ప్రపంచాన్నే గాని నువ్వు మళ్ళీ సృష్టిస్తే అందులో రాయిగానో, ఓ పిచ్చి మొక్కగానో మళ్ళీ పుట్టడాన్ని నేను కోరుకుంటాను. అలా పుట్టడం కోసం చావును ఆహ్వానిస్తాను. ప్రళయాన్ని ఆహ్వానిస్తాను...."
ఆమె ప్రార్ధన ముగిసింది. ఆ తర్వాత భయంకరమైన శబ్దంతో భూమి పెఠేలున విడిపోయింది. ముక్కలు విశ్వంలో ఐక్యం అయిపోయేయి.
అయిపోయింది
****-----****