Previous Page Next Page 
మణిదీపం పేజి 23

    "ఏం కూశావురా? నిప్పులాంటి నా కూతురిమీద నింద వేస్తావా?" మాధవరావు చెయ్యి పైకి లేచింది.

    అరవింద్ చురుగ్గా వెనక్కి తప్పుకొన్నాడు."నిజమో, నిందోలేడీ డాక్టరుచేత పరీక్ష చేయించండి. అంతవరకూ నేనిక్కడే వుంటాను" తొణక్కుండా అన్నాడు అరవింద్.

    అంతవరకు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న వాళ్ళంతా వెనక్కి తగ్గారు. నిశ్చేష్టులై నిలబడ్డారు.

    పెళ్ళికి వచ్చిన బంధువుల్లో ఒక లేడీ డాక్టరుకూడా వుంది. ఆమె పేరు సుభద్ర. ఆమె మాధవరావుకు వరుసకు కూతురవుతుంది. "ఇంత జరిగాక నిజమేమిటో నిర్ధారణ కావలసిందే. ఇతని మాట అబద్దమైతే వీడికి నా బిడ్డనివ్వడంకాదు_వీడిని ఇక్కడే చంపి నేను జైల్ కి వెడతాను. నిజమైతే నా కూతుర్ని చంపి నేను ఆత్మహత్య చేసుకొంటాను. ఈ రెంటిలో ఇప్పుడు ఏదో ఒకటి జరగాలి" ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా అన్నాడు మాధవరావు.

    "నిజం బయటపడితే అనర్ధం జరుగుతుందనే తప్పంతా నా నెత్తిన వేసుకొని వెళ్ళిపోదామనుకొన్నాను"

    కాంచన నెమ్మదిగా పీటల మీదినుండి లేచి వచ్చింది. "ఈ గొడవంతా అనవసరం ఈ పెళ్ళి ఎలాగూ జరుగదు. అతడిని వెళ్ళిపోనివ్వండి"

    "అతడిని ఎలా వెళ్ళిపోనిస్తాం? అతడి చావు ఇక్కడ రాసిపెట్టివుంది పాపం" వెటకారం చేశాడు కండలు తిరిగిన మేనమామ.

    అరవింద్ మాటను నమ్మింది ఒక్క రామకృష్ణ మాత్రమే. అరవింద్ సంగతి అతడికి బాగా తెలుసు. చూపులతోనే రోగనిర్ధారణ చెయ్యగల సమర్ధుడు అరవింద్. చాలా కేసుల్లో అతడి మాటకు తిరుగుండదు.

    పరీక్ష జరగాల్సిందే అని అందరూ పట్టుబట్టడంతో కాంచనకి మర్యాదగా తప్పుకొనే అవకాశమే లేకుండాపోయింది. "డాక్టరుచేత పరీక్ష అనవసరం. ఆయన చెప్పింది నిజమే" అనేసి ఇంట్లోకి పారిపోయింది.

    చేష్టలుడిగి నిలబడ్డ రామకృష్ణతో, "ఆమె ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమో. పెళ్ళి ఆమెను కాపాడుకోండి! నాకు తెలుసు. ఇదిచాలా సున్నితమైన విషయమని. అందుకే నిజం బయటపెట్టకుండా వెళ్ళిపోదామనుకొన్నాను. దురదృష్టవశాత్తూ మీరెవరూ నన్ను అర్ధం చేసుకోలేక పోయారు"

    ఆ మాట వింటూనే అర్చన పరిగెత్తింది కాంచన కోసం.

    రామక్రుష్ణకి కన్నీళ్లు తిరిగాయి.

    "నువ్వు గొప్ప డాక్టరువేకాదు, గొప్ప మనసున్నవాడివి. నువ్వు నా స్నేహితుడివని చెప్పుకోవడానికి గర్విస్తాను ఫ్రెండ్" గాద్గదికంగా అని అరవింద్ చెయ్యి నొక్కి వదిలి అర్చనని అనుసరించాడు.

    అక్కడంతా శ్మశాన వాతావరణం నెలకొంది.

    ఎవరినో తగలబెట్టడానికి వచ్చినట్టుగా అందరి ముఖాల్లో విషాదం.

    పెళ్ళివాళ్ళు వచ్చిన బస్సులు, కార్లూ వరుసగా వెళ్ళిపోయాయి.

    మాధవరావు ఆత్మహత్య చేసుకోలేదుగాని, భరించలేని అవమానభారంతో గుండెలో నొప్పివచ్చి విలవిల్లాడుతూ మంచంమీద ఒరిగిపోయాడు.

    మనిషి ప్రాణంకంటే పెళ్ళేకాదు, ఏదీ ముఖ్యంకాదు. పెళ్ళి విషయం మరిచిపోయి అందరూ ఆయనచుట్టూ మూగారు.

   
                                                               *    *    *    *


    ఈ సంఘటన జరిగాక అరుంధతమ్మ కొడుకు దగ్గర మళ్ళీ పెళ్ళి మాట ఎత్తితే ఒట్టు. కళ్యాణగీత లేదని మనసు రాయిచేసుకొంది.

    అర్చనే ఒకసారి కబురు చేసింది అరవింద్ ను ఒకసారి వచ్చి వెళ్ళమని.

    "ఏమిటీ? మా ఇంటికి రావడం మానేశారు?" అరవింద్ ఇంట్లో అడుగు పెడుతూనే నిష్టురమాడింది అర్చన.

    "మనమధ్య జరిగినా ఆ చేదు సంఘటన...ఆ పెళ్ళి ఆగిపోవడం వాల్ల మీరెంత బాధపడి వుంటారోననిపించింది."

    "బాధపడినమాట నిజమేగాని అందుకు బాధ్యులు మీరుకాదుగా? చదువుకొని, లెక్చరర్ ఉద్యోగం చేస్తూ ఒక మామూలు ఆడపిల్లలా కాలుజారి కడుపు తెచ్చుకొన్నదాన్ని అనాలి. అసలు ఇలాంటిదని చూచాయగా తెలిసినా ఆ పెళ్ళి కుదిర్చేదాన్నికాదు"

    "నాక్కూడా ఎంతో ఉన్నత వ్యక్తిత్వం కలదానిగా అనిపించింది. ఆ రోజు గుళ్ళో మాట్లాడినప్పుడు ఆమె ముక్కుసూటి మనిషి అని, దాపరికాలు ఎరుగదని, ఆమె మనసు తెరిచిన పుస్తకం లాంటిదని అనుకొన్నాను. దాపరికాలు లేనివాళ్ళంటే నాకిష్టం. అందుకే ఆమెతో నా వివాహానికి అంగీకారం తెలిపాను. ఇంతకీ ఇప్పుడు కాంచన ఎలా వుంది? బాగుందా?"   

 Previous Page Next Page