కొంతసేపయిన తర్వాత ఇద్దరూ రామనాధం గారింటికి వెళ్ళి స్థలం వ్యవహారం చేసుకొని వచ్చారు. ఇందిర భోజనం చేసింది. నీరజ పాలు తాగి పడుకుంది. పది పదిహేను రోజులుగా ఆమె ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తున్నది.
కళ్ళు మూసుకుని పడుకున్న నీరజ కు రామనాధం గారి భార్య సీతమ్మ గారు కళ్ళలో మెదిలింది.
పచ్చగా దబ్బ పండు రంగులో -- వంటి నిండా నగలతో -- నుదుట అర్ధ రూపాయంత బొట్టుతో పార్వతీ దేవిలా ఉన్న సీతమ్మ గారిని చూడం గానే భక్తీ భావం కలుగుతుంది. ఆచారాలను, సాంప్రదాయాలను అంటి పెట్టుకుని భర్త తప్ప ప్రపంచంలో మరింకేవ్వరూ లేరని ఆరాధించే నిర్మల హృదయం కలవాళ్ళు కొందరు - ఎక్కడ డబ్బు ఉండి హోదాలో ఉన్న వ్యక్తీ దొరుకుతాడా . అతన్ని వలలో వేసుకునే మార్గమేమిటా అని ఆలోచించే క్షుద్ర హృదయం కలవాళ్ళు కొందరు ఏమిటో ఈ ప్రపంచం రకరకాల మనస్తత్వం గల విచిత్ర వ్యక్తులతో పరిభ్రమిస్తున్నది ఇంతా ఏడిస్తే అనంతమైన కాల ప్రవాహం లో మనుష్య జీవితమెంత? రెప్పపాటు కాలం. ఆ కాస్త కాలం లోను మనిషి జీవితం మున్గుతూంటుంది. లేస్తుంటుంది. ఆలోచనలలో మునిగిపోయిన నీరజకు తన ఆలోచన్లు తనకే నవ్వు తెప్పించినయి.
అసలీ మధ్య తనకి ప్రతి చర్యా ప్రతి కదలికా పరిశీలనా దృష్టి తో చూడటం అలవాటయింది. అంతేగా మనిషి - ఏదైనా ఎదురు దెబ్బ తగిలితేనే గాని వేదాంతం వంట బట్టదు. భగవంతుడు జ్ఞాపకం రాడు. అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది నీరజ.
* * * *
శ్రీధర్ పెట్టిన గడువు అయిపొయింది. సాయంకాలం అయిదు గంటలు అయింది. అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చుంది భార్గవి ముందు వరండా లో . అందంగా పెరిగిన క్రోటను మొక్కలు మెల్లగా వీస్తున్న గాలికి తలలూగిస్తున్నవి. వరండా కి ఒక పక్క నుంచి పైకి మేడ మీద వరకూ అల్లుకుపోయిన మాలతీ లత విరబూసి సన్నని సువాసన వెదజల్లుతున్నది. పచ్చని లాన్ లో అక్కడక్కడ చిన్న చిన్న రంగు రంగు పిట్టలు వాలి ముక్కులతో గడ్డి మీద రుద్దుతూ ఎగిరిపోతున్నాయి. ఒక వారగా ఉన్న పంపు కింద నిలవ ఉన్న నీళ్ళలో ముక్కులు ముంచి పిచ్చుకలు నీళ్ళు తాగుతున్నాయి.
ఇంతలో శేఖర్ వచ్చాడు. ఏదైనా కబురైనా తెలిందేమోనని. ఆదుర్దాగా ఎదురు చూసింది భార్గవి. కాని భార్గవి ఆశించినట్టుగా అతను ఆమె కెదురుగా వచ్చి కూర్చోలేదు. కనీసం కళ్ళేత్తయినా చూడలేదు. సరాసరి లోపలి కెళ్ళి పోయాడు. భార్గవి అక్కడే వీధి వైపు చూస్తూ కూర్చుండి పోయింది. దాదాపు అరగంట తర్వాత శేఖర్ వచ్చాడు.
శేఖర్ కూర్చున్న తర్వాత రంగడు రెండు కప్పులలో కాఫీ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు.
"భార్గవీ! ఇంకా కొన్ని గంటల్లో మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు కాబోలు నేనేమైనా పొరపాటు చేస్తే మనసులో పెట్టుకోవు గదూ" అతని గొంతులో ఒక రకమైన మార్దవం కనబడుతున్నది. అంత జాలిగా మాట్లాడుతున్న శేఖర్ ని చూస్తుంటే భార్గవి మనసు మెత్తబడసాగింది. "మీరేం పొరపాటు చేశారు. అర్ధం లేని ఆలోచనలతో నేనే మిమ్మల్ని బాధపెట్టాను"
అన్నయ్యతో వెళ్ళి పోతానన్న ధైర్యం భార్గవిని మాట్లాడేలా చేసింది.
"మీరు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోతారా?' అంది భార్గవి కాస్త చనువుగా.
"లేదు. వెళ్ళను. ఇక కలకత్తా లోనే ఉండి పోతాను. అసలు నేను చదువుకోవలసిన అవసరమే లేదు. మాకు కలకత్తా లో కొన్ని వ్యాపారాలున్నాయి , మొన్న మొన్నటి వరకు -- అంటే నాన్నగారు పోయిన తర్వాతన్న మాట -- మా నాన్నగారి ముఖ్య స్నేహితుడొకాయన చూస్తుండేవారు. ఎంతో అనుభవం ఉన్నవాడు-- మంచి నమ్మకస్తుడు. అయన హటాత్తుగా గుండె పోటుతో మరణించడం వల్ల ఇప్పుడా భారం నామీద పడింది. అందుకనే ప్రాక్టీసు వదిలి వచ్చేశాను.'
"మీరసలు ప్రాక్టీసు పెట్టకుండా ఉండవలసింది."
"ఏదో కాలక్షేపానికి పెట్టానంతే! నాన్నగారి ఆఖరి కోరిక మీద మెడిసిన్ చదివాను. ఇక్కడ అమ్మ గారభం వల్ల సరిగా చదువు అబ్బటం లేదని నాన్నగారి స్నేహితుడని చెప్పానే -- ఆయనకి తెలిసిన వాళ్ళుండటం చేత విశాఖపట్నం లో చదివించారు. చదువు పూర్తయి ఇంటికి వచ్చిన నాలుగు నెలలకే అమ్మ విష జ్వరంతో మరణించింది. అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరగని నాకు పిచ్చి పట్టినట్టయింది. ఈ వాతావరణం , ఈ యిల్లు అన్నీ అమ్మని గుర్తు చేస్తుంటయ్యని ఆయనే బలవంతంగా నన్నక్కడకు పంపాడు. కానీ భార్గవీ! అక్కడా నన్ను అదృష్టం వెక్కిరించింది. ఇక్కడ ఆస్తి వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుండేవారు. కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నాను, ఇంతలోనే ఆయన కూడా నన్నీ ప్రపంచంలో వంటరిగా వదిలేసి తప్పుకున్నాడు. ఇంత డబ్బు - ఈ ఇల్లు-- ఈ కార్లు ఇవ్వన్నీ చూసి లోభం తో నేను కావాలనుకునే వాళ్ళే గాని- నేనుగా నా వ్యక్తిని కావాలని కోరుకునే వాళ్ళెవ్వరూ ఈ లోకంలో నాకు లేరు" అతని గొంతులో నిస్పృహ కొట్టవచ్చినట్టు కనపడింది భార్గవి కి.
"అతని ముఖం చూసిన భార్గవి కి "పాపం" అనిపించింది. చూస్తుండగానే భార్గవి లో నిరాశా, నిస్పృహ అణుచుకుందామన్నా అణగటం లేదు. ఈలోపల శేఖర్ లోపలి కెళ్ళి స్నానం చేసి వచ్చాడు. భార్గవి అక్కడే కుర్చీ కంటుకు పోయి లైటన్నా వేసుకోకుండా కూర్చుంది.
ఆ రాత్రి పడుకుందే గాని నిద్ర రాలేదు.
వస్తానని చెప్పిన అన్నయ్య ఏమయినట్టు? ఒక వేళ రైలు లేటుగా వచ్చిందేమో! అర్ధరాత్రి చీకట్లో ఏం రావాలని రాలేదేమో? ఆలోచిస్తూ పడుకున్న భార్గవి తెల్లవారక ముందే లేచి కూర్చుంది. రాత్రి రావటానికి వీలు కాని అన్నయ్య ప్రొద్దున్నే వచ్చి తనని తీసుకు పోతాడనే ఆశ కళ్ళలో నింపుకుని క్రిందకు దిగి వచ్చింది.
అప్పటికే శేఖర్ ఆఫీసు రూములో ఉన్నట్టున్నాడు. ఆ గదిలో లైటు వెలుగుతూనే ఉన్నది. నెమ్మదిగా కర్టెను తొలగించి చూసింది. టేబుల్ లైటు కింద అతనేదో సీరియస్ గా వ్రాసుకుంటున్నాడు.
"భార్గవీ! రా, లోపలికి -- అతని కంఠం గంబీరంగా పలికింది. ఉలికిపడిన భార్గవి తను వచ్చినట్టుగా అతనికేట్లా తెలుసో" అని ఆశ్చర్య పోతూ లోపలి కెళ్ళింది.
"రాత్రంతా నిద్ర పట్టలేదు కదూ" తలెత్తకుండానే అన్నాడతను.
"ఆ...." అని మాత్రం అని అక్కడే ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుంది.
శేఖర్ తన పనిలో మునిగిపోయాడు.
భార్గవి ఆశలన్నీ నిరాశలయినాయి ఆ రోజూ గడిచిపోయింది. శ్రీధర్ రాలేదు సరికదా ఉత్తరమైనా వ్రాయలేదు. యాంత్రికంగా భోజనం చెయ్యటం- నిద్రొస్తే నిద్రపోవటం -- అవీ లేకపోతె శూన్యం లోకి చూస్తూ కూర్చోవటం -- శేఖర్ పిలిస్తే మాట్లాడటం కూడా మానేసింది. పది రోజులు గడిచి పోయినాయి . శేఖరం కూడా ఏదో వ్యవహారం లో మునిగి పోయి చాలా బిజీగా ఉన్నాడు.
నాలుగురోజుల క్రితం కాకినాడ ఉత్తరం వ్రాసింది. అదే మయిపోయిందో తెలియదు.
ఎన్నాళ్ళు తనలా ఉండాలి? తనకి విమోచనం లేదా? కాకినాడ వెళ్ళిపోతే? అవును ఈ ఒంటి పేట గొలుసు అమ్మేసి కాకినాడ వెళ్ళి పోవచ్చు . మొండి ధైర్యంతో కిందికి వచ్చింది భార్గవి కింద ఎవ్వరూ లేరు. రంగడు కూడా కనబడలేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా చెప్పులేసుకుని అటూ ఇటూ చూస్తూ గేటు దాటి బయటపడింది. ఒక్కసారిగా బందిఖానా లోంచి విడుదలైన ఖైదీ లాగా సంబర పడిపోయింది భార్గవి మనసు. కాని, మరుక్షణం లోనే ఆ జనసందోహం, కార్లు, ట్రాములు అంతంత పెద్ద పెద్ద వీధులు గుండెలు దడదడ లాడినాయి ఆమెకు.
అయినా తనకేం భయం. బి.ఏ చదివిన తను స్టేషను కనుక్కుని వెళ్ళలేదా? టాక్సీ పిలుడ్డామనుకుంది. అంతలో ఎవరో కలకత్తా లాంటి మహానగరాల్లో టాక్సీ లో ఆడపిల్లలు వంటరిగా వెళ్తే ఎత్తుకు పోయి అమ్ముకుంటారని అన్నట్టు జ్ఞాపకం వచ్చింది. ఒడలంతా వణికి పోయింది. అందుకని ఆ ప్రయత్నం మానుకుని ఎంత దూరమైనా సరే నడిచే వెళ్లాలని నిశ్చయించుకుంది. ఎవరో ఒకతన్ని ఇంగ్లీషు లో అడిగింది. అతను ఓ వెకిలి నవ్వు నవ్వి దారి చెప్పాడు. ఎంతదూరం నడిచినా స్టేషను రావటం లేదు. పరాకుగా కోట్ల వంక చూస్తూ నడుస్తున్న భార్గవి ని ఎవరో ఒక స్థూల కాయుడు అమాంతం డీ కొట్టి పళ్ళికిలించి వెళ్ళిపోయాడు. దొంగల ముఠాలో నుంచి బయటపడి హంతకుల ముఠాలో పడ్డట్టయింది తన పని. ఎండకు ముఖమంతా ఎర్రగా కందిపోయి చెమటలు పట్టింది. కాళ్ళు లాక్కు పోతున్నాయి. కనీసం తానిప్పుడు శేఖర్ ఇంటికి కూడా వెళ్ళలేదు.
ఆ క్షణంలో శ్రీధర్ మీద విపరీతమైన కోపం వచ్చిందామెకు. మళ్ళీ మనసు ఇంకో రకంగా ఆలోచించటం మొదలు పెట్టింది. 'అన్నయ్య కంత మాత్రం తెలియదా! నమ్మకం లేని మనిషి దగ్గర తననెందుకు వదిలి వెడతాడు. అనవసరంగా తను అపోహ పడి తోందర పడ్డది శేఖర్ ఈ పదిహేను రోజుల్లో ఎన్నడూ అనుచితంగా ప్రవర్తించలేదు. తను కోరి కష్టాన్ని కొని తెచ్చుకున్నది.