అగర్తలా నించి కొమిల్లావెళ్ళినట్టే ముందు మా యూనిటంకా కదిలింది. మర్నాడు, నేను, ఓ సీ. ఆఫీసు ఆర్డర్లీ రైల్లో బైల్దేరాం.
మా రైలు చిట్టగాంగు చేరేసరికి సాయంత్రం ఏడుగంటలైంది. బాగా చీకటి పడింది. దీపాలు వెలుగుతున్నాయి.
చిట్టగాంగు వూరంతా కొండలు గుట్టలు, లోయలు, కొండల మీద కూడా చక్కని రోడ్లు, మా స్టేషను వాగను కిందరోడ్డుమీంచి జోరుగా వెళ్ళిపోతూంటే, రోడ్డుపక్కనే వున్న గుట్టమీదవెళ్ళి పోతూన్న కార్ల, లారీల దీపాలు కనిపిస్తున్నాయి. అవి మట్టిగుట్టలు కావు. ఆకు పచ్చగా జీవం వుట్టి పడుతున్నాయి. చిట్టగాంగు వంగదేశపు ఆరామం (Garden of bengal).
ఇక్కడకూడా సివిల్ జీవితం పూర్తిగా నశించిపోలేదు. కాని మిలిటరీ వాతావరణంలో కనికనిపించకుండా వుంది.
మా యూనిట్ ఊరికి సుమారు తూర్పు చివర వుంది. మర్నాడుదయం నేను బ్రష్ తో పళ్ళు తోముకుంటూంటే, ఎదురుగుండా "ఆరకాన్ రోడ్" అనే బోర్డు అవుపించింది. ఆరకాన్ రోడ్డు సరిగ్గా అక్కడే ఆరంభమైంది. అది వెడల్పుగా, నల్లగా, కొండచిలవలా వుంది.
ఆర్. హెచ్. క్యూ ఆ రోడ్డుమీద రెండు ఫర్లాంగులు ఎగూని ఒక ఎతైన కొండమీద పెద్ద భవనంలో వుంది. నేను సాయంత్రం మౌలాని. ప్రభూని కలియడానికి వెళ్ళా. వాళ్ళు, సుబేదారు సాబు మేడమీద గదుల్లో వున్నారు.
మౌలా గదికిటికీలోంచి చూస్తే, ఆ యెత్తు మీంచి, గుట్టలు, లోయలు, మైదానాలు, తోటలు, వాగులు. చెరువులు, చాకిరేవులు పొడుగాటి యినపకడ్డీల్లా మెట్లురోడ్డు వాటిమీద కండ చీమల బారుల్లా పోతున్న లారీ కాన్వాయ్ లు, కిందికి వంగిపోయి నీలి గొడుగులా ఆకాశం కనిపించి, ఆ ప్రకృతి అందానికి వూపిరాగి పోయినంతవుతుంది.
ఆ భవనంలో యెత్తుగా విశాలంగా ఎన్నో గదులున్నై. అది పూర్వం ఒక ప్రఖ్యాత కనిదట. ఆ కవి పేరు తెలీదు. అక్కడు ఏ మహా కావ్యాలు రాయబడ్డాయో, గానం చెయ్యబడ్గాయో! ఇప్పుడందులో యినపబూట్లు కదంతొక్కు తున్నాయి.
యుద్ధం పూర్వం చిట్టగాంగులొ ఆరు కళాశాలలు, అనేక ఉన్నత పాఠశాలలు వుండేవట. లక్షలాది మిలిట్రీ అక్కడ చేరుతూంటే ఒక్కొక్కటే దూరపు పల్లెటూళ్ళకి తర్లిపోయేయి, ఇప్పుడక్కడ ముఖ్యమైన ప్రభుత్వపు ఆఫీసులు, వర్తక వ్యాపారసంస్థలూ వున్నాయి. సినిమాల్లో, కాంటీన్లలో. క్రీడాస్థలాల్లో, పగటి బజార్లలో, రాత్రి బజార్లలో ఎక్కడ చూసి నా పటాలం సిబ్బందే, నల్లబజారు తప్ప వేరే బజారే లేదు.
లాల్ దిఘీ దగ్గిర "రంగూన్ ట్రేడింగ్ కో" అనే గొప్ప వ్యాపార సంస్థ వుంది. దాని అధిపతులు పెద్ద కంట్రాక్టర్లు. వాళ్ళకక్కడ ఒక డిపార్టు మెంటల్ స్టోరు కూడా వుంది.
రంగూన్ ట్రేడింగ్ కొ యజమాన్లు నలుగురన్నదమ్ములు. ఆఖరివాడు సన్నీగోపాల్ సీన్ యిరవై రెండేళ్ళవాడు. ఒక మిత్రుడి ద్వారా అతనితో నాకు పరిచయమైంది. నేను వాళ్ళింటికి తరుచు వెళ్ళేవాడిని. ఇంటిల్ల పాదీ నన్ను యింట్లో వాళ్ళాగే చూసేవారు. సేన్ కి ఒక అక్క' యిద్దరు చెల్లెళ్ళు కూడా వున్నారు.
సేన్ కుటుంబం దబ్బుగలవాళ్ళు, ధనవంతులు అంటే చాలదు. ఐశ్వర్యవంతులనాలి. సివిలు, మిలిటరీ అధికార్లంతా వాళ్ళ స్నేహపు వలలో చేపలు, జల్లలు, మిలిటరీ సప్లై డిపార్టు మెంట్లతో సేన్ సంస్థకి కోట్లు విలువ జేసే లాలూచీ వ్యవహారాలున్నాయని అంతా అనుకునేవారు. కాని ఆ తీగలాగితే డొంకంతా కదుల్తుందని ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
మొదట్లో అంత ఐశ్వర్యవంతుల యింట్లో ఎలా మెసలాలో తెలీక తికమకపడ్డా, కాని త్వరలోనే ఆ భయం తీరిపోయింది.
వాళ్ళ సంసారం డబ్బు అనే ప్రవాహంలో కొట్టుకుపోతూంది. వాళ్ళ స్త్రీలకి పనిపాటలు లేవు. ఎవరి అభిరుచిప్రకారం వాళ్ళు సింగారించుకుని, స్నేహితులతో కార్లమీద తిరుగుతూంటారు. వాళ్ళకి ధాన్యం దంపాలనిగాని, బియ్యం పండాలనిగాని తెలీదు. అన్నం ఒకటే తెలుసు. వడ్డించిన విస్తరివంటి జీవితం అంటే అదె అనిపించింది.
సేన్ అన్నలు, తల్లి, అక్కలు, చెల్లెలు నాకు వంగ సాహిత్యంతో వున్న పరిచయానికి చాలా ఆశ్చర్యపోయారు. యుద్దానికి పూర్వం వాళ్ళు "మెడ్రాసీ"ల్ని చూళ్ళేదు. చరిత్ర పాఠాల్లో దక్కను ప్రజల్ని ద్రావిళ్ళంటారని, వాళ్ళునల్లగా. పొట్టిగా వుంటారని, ఆర్యులు ద్రావిళ్ళని దక్షిణానికి తరిమికొట్టేరని చదూకున్నారు. నేను నల్లగా లేను. ఇంగ్లీషు బాగానే మాట్టాడుతున్నా. హిందీ వచ్చు. బెంగాలీ కూడా దడదడ మాట్టాడే స్తున్నా. ఇదంతా వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. నేనంటే చాలా గౌరవభావం కూడా కలిగింది.
"మిస్టర్ సేన్! మీ సంస్థకి "రంగూన్ ట్రేడింగ్ కో" అని పేరెందుకు పెట్టారు?" నేను.
"మొదట మానాన్నగారు వ్యాపారం బర్మా లోనే ఆరంభించేరు. అది చాలా పెద్ద సంస్థ. బర్మావాళ్ళు భారతీయుల మీద కత్తిగట్టి, వాళ్ళని దేశం నుంచి తరిమివేసేరు. భారతీయ వ్యాపార సంస్థల్ని దోపిడీ చేశారు. గొప్ప విధ్వంసకాండ జరిపేరు. అప్పుడు బర్మాలో దశాబ్దాల తరబడి స్థిరనివాసం యేర్పరచుకున్న యెన్నో భారతీయ కుటుంబాలు దేవుడా అని మాతృ దేశం దారి పట్టేయి. ఆ గొడవలో మా సంస్థకూడా దెబ్బ తింది. రంగూన్ లొ మా వ్యాపారం చిన్నన్నయ్య నడిపేవాడు. మొదట అతనా ఒత్తిడి నిభాయించు కొని అక్కడ వుండడానికి ప్రయత్నించేడు. కానీ లాభం లేకపోయింది. బంగారం, వెండి కొన్ని విలువైన వస్తువులు కూడగట్టుకొని. కుటుంబంతో సహా విమానంలో ప్రయాణం చేసి యిక్కడికి చేరుకున్నాడు."
"అయితే మీ వ్యాపారం అంతా మీ నాన్న గారు స్వయంగా పెంపొందించిందే..."
ఔను అంతే కాదు. మా తాతగారి హయాంలో మాది మధ్యతరగతి కుటుంబవే. ఇదంతా మా నాన్నగారి స్వార్జితం. తరువాత అన్నయ్యలు ఈ సంస్థని అభివృద్ధి చేస్తున్నారు."
"మీ తండ్రిగారికి అన్నదమ్ములున్నారా..."
"ఒక తమ్ముడుండేవాడు,"
"ఎక్కడ?"
"కొమిల్లాలో- మా పిత్రార్జితపు యింట్లో. ఆ యిల్లు మేం వాళ్ళకొదిలేశాం"
"ఆయన పోయి ఎన్నాళ్ళయింది..."
"ఏదీ...కొన్ని నెలలే. పాపం ఆయనికి ఐదుగురు కూతుళ్ళు. ఒక కొడుకు.
నాకేదో మనసులో పీకినట్టయింది. కొంపతీసి ఆ చనిపోయినది పద్మ తండ్రి కాదుకద.
సేన్ యేదో పనిమీద లోపలి కెళ్ళేడు. అక్కడికా సంభాషణ ఆగిపోయింది. తరవాత అతని కారుమీద నన్ను యూనిట్ కి దిగ్గబెట్టేడు.
చిట్టగాంగ్ లో ఆకలి చావులకి కొదవలేదు, ఐశ్వర్యంతో తులతూగుతున్న "రంగూన్ ట్రేడింగుకో"కెదురుగుండానే, పేవ్ మెంటు మీద ప్రతి రోజూ కనీసం రెండు శవాలుండేవి. ప్రజలు వాటిని పగటిపూట చచ్చిన కుక్కల్నిలాగే తప్పుకు పోయేవారు. రాత్రి చీకట్లో వాటిని పట్టుకుని పోయేవాడు.
మా యూనిటు కెదురుగా ఒక కాంటీనుంది. అది ఒక బెంగాలీది. అతను టీ, పకోడీలు అమ్మేవాడు మా సిపాయిలక్కడ కాతాలు పెట్టేరు.
ఆరకాన్ రోడ్డువేపు మా యూనిటు పొడుగునా ముళ్ళ తీగల కంచెవుంది. ఆ కంచకి సమీపంలోనే తెల్లసోల్జర్ల మెస్సు. స్టోరుగది వున్నాయి.
ఓ నాడు సాయంత్రం యేడు గంటలకి తెల్లసోల్జర్ల మెస్సు పక్క నించి కంచమీదుగా. రోడ్డు కవతలున్న ఆ కాంటీనులోకి రెండు బస్తాలు తరలించ బడుతుండగా మా సార్జంటు మేజరు చూసేడు. అక్కడ చీకటిగా వుంది, బస్తాలు యెవరు మోసకెళ్ళేరో సరిగా పోల్తి అనలేదు.
సార్జంటు మేజర్ ఈ సంగతి వెంటనే మరో యిద్దరు ముగ్గురు సార్జంట్లతో ప్రస్తావించేడు. తక్షణం కాంటీన్ సోదా చేసేరు. సోదాలో నాల్గు బస్తాల బియ్యం, రెండు బస్తాల పంచదార, వంద సుమారు పాలడబ్బాలు వగైరా బైట పడ్డాయి. సార్జెంటు మేజరు వాటన్నిటినీ స్వాధీన పర్చుకున్నాడు. కాంటీను యజమానివి. ఆఫీసర్ల మెస్ లో ఓ.సీ ముందు హాజరుపెట్టేరు. ఓ. సీ అతన్ని నిలదీసి అడిగేడు. అతను గజగజ లాడి పోయాడు. ఆ సరుకులు సార్జంట్లు మెస్ వెయిటరు మనిరుజ్జమాన్ యిచ్చేడని చెప్పేడు. అలా చాలా కాలంనించీ యిస్తున్నాడని; అవి తను కొనుక్కుంటున్నానని చెప్పేడు.
వెంటనే ఓ సీ మనిరుజ్జిమాన్ని పిలిపించేడు. మనిరుజ్జమాను హడిలిపోయి, యింకోలా చెప్పి లాభం లేదని, నేరం ఒప్పుకున్నాడు. అతన్ని తక్షణం గార్డు రూములో బంధించేరు.
నాకీ గొడవేం తెలీదు. నే నిధి జరుగుతున్న ప్పుడక్కడలెను. ఊళ్ళో కెళ్ళా. తిరిగొచ్చేసరికి రాత్రి పద్దాటింది.
మర్నాడుదయం లేవగానే సంగతంతా తెలిసింది. నాకు నమ్మకం లేకపోయింది. మనిరుజ్జ మాన్ స్వతహాగా అమాయకుడు. అంతపని చెయ్యలేడు. ఇందులో ఏదో రహస్యం వుందని పించింది. నీళ్ళు పోసుకుని, "బ్రేక్ ఫాస్ట్" త్వరగా ముగించి గార్డు రూము కెళ్ళా. మనిరుజ్జమాన్ దిగాలుపడి వున్నాడు. నన్ను చూడ గానే లేచి సలాంచేసేడు. నేను గార్డు కమాం డర్ని. యితరగార్డుల్ని బైటికివెళ్ళమన్నాను.
"మనిరుజ్జమాన్! నువ్వు నిజంగా దొంగతనం చేశావా?" అతను తలవంచుకుని "ఔను సాబ్" అన్నాడు.
"నేను నమ్మను - నిజం చెప్పు..."
"నిజం సాబ్" అతడు మళ్ళీ తలొంచుకునే అన్నాడు.
"డేవుడు సాక్షిగా? ఖురాన్ సాక్షిగా?"
అతను కొంచెం ఆలోచించి "హాఁ సాబ్!" అని కన్నీళ్ళు పెట్టుకు అన్నాడు.
"చూడు మనిరుజ్జుమాన్! నువ్వు ఘోరమైన ప్రమాణం చేసికూడా అబద్ధం చెప్తున్నాననే నాకు తోస్తూంది. ఏం?"
అతను చంటి పిల్లల్లా యేడుస్తున్నాడు.
"సాబ్! నన్నిలా వుండనీ నా బతుకు ఎలాగూ ధ్వంసవైంది. నేను నిజం చెప్పినా ఎవరు నమ్ముతారు? నాకు జైలు తప్పదు, నా గురించి నాకు బెంగలేదు, కాని నాకు ముగ్గురు భార్యలు, పదిమంది పిల్లలున్నారు, వాళ్ళగురించే దిగులుగా వుంది, కాని నా వూసు పట్టించుకోకు సాబ్..."