Previous Page Next Page 
భారతి పేజి 12

      అంత సిగ్గులోనూ, అంత హడావిడిలోనూ  వీలు చూసుకుని ఒకటి రెండుసార్లు  సారధివంక చూసింది. ఆమె కనురెప్పలను ఎత్తి. ఎంత అమాయకంగా, నిష్కల్మషంగా వున్నాడు! చాలా బలహీనమైన శరీరం అతనిది. ఆమె కళ్ళలో నీళ్ళు నిండుకొన్నాయి. అతనిపై జాలివేసింది. అతనంటే ఆమెకు గాఢానురాగం కలిగింది.

    పెళ్ళి అయిపోయింది. ఆ తరువాత కూడా  భారతికి విశ్రాంతిలేదు. అగ్నిహోత్రం దగ్గరి నుంచి లేవనివ్వటం లేదు పురోహితులు. సదస్యమనీ, నాగవల్లి అనీ కదలనివ్వటం లేదు. పొగ!కళ్ళలోకిపోయి  మంట పుట్టి నీళ్ళు కారుతున్నాయి. ఎప్పటి నుంచో భోజనం లేదేమో, నీరసం కూడా వచ్చి కళ్ళు తిరిగాయి.

    ఆ రాత్రి భోజనాలకు  ముందు భారతి సామాన్ల గదిలో నేలమీద  ఒంటరిగా  కూర్చుని ఆలోచిస్తున్నది బయట నుండి  మనుషుల సందడీ, మధ్య మధ్య గౌరీపతిగారి మాటలూ ,రాధమ్మగారి మూగ శబ్దాలూ వినిపిస్తున్నాయి.

    ఒక విధమైన శూన్యం. 'అయ్యో! అయిపోయిందే' అన్న అసంతృప్తి ఆమెను వేదిస్తున్నాయి దీపావళి వెళ్ళిన మరునాడు బస్తీకి వచ్చి ఆడిన సర్కస్ డేరా ఎత్తేసిన తరువాత ఆమె కిలాంటి వేదనే మిగులుతూండేది. శూన్యరాకాసి తన వికృతపు కోరలను  తెరుచుకుని నోరు దాచి నిలబడినట్లు  వుండేది.

    "ఇక్కడున్నావా దొంగా!" భుజం మీద  మెత్తని చేయి పడేసరికి  వులిక్కిపడి. ముఖం వెనక్కి త్రిప్పింది.

    దరహాసవదనంతో  మల్లిక  కనబడగానే ప్రాణం  లేచివచ్చినట్లయి  ఆమె చేతులు దొరకపుచ్చుకుని  తన భుజాలమీదుగా  ముందుకు లాక్కుని, వాటిని గోముగా  నిమురుతూ, "మల్లికా! పరాయిదాన్నయి పోయానే" అని ఏడ్చింది.

    మల్లికకు కూడా  ఏడుపు వచ్చి చేతులు  వెనక్కి లాక్కుని, ఆమె ప్రక్కన కూర్చుని, "భారతీ! ఎందుకే ఏడుస్తావు! నువ్వు పరాయి దానివైవావని ఎవరే చెప్పింది నీ పతి కాదుగదా, భగవంతుడు దిగి వచ్చినా మనద్దర్నీ వేరుచేయలేడు. నీకెందుకే దిగులు" అన్నది రుద్ద కంఠంతో.

    భారతి సజలనయనాలతో స్నేహితురాలి వంక అనురాగపూరితంగా చూసి "యీ మాటలు నిజమేనా మల్లికా!" అన్నది.

    "అపనమ్మకమా? ఇంత త్వరగా  ఒక ఇంటి కోడలివవుతానని ఎన్నడూ అనుకోలేదు. ఎంతో చదివేద్దామనుకున్నాను. దానికి మొదటే ఆటంకం వచ్చింది. ప్రైవేటుగానన్నా  పరీక్షలకు కట్టాలని వుత్సాహం కట్టలు తెగి ప్రవహిస్తూ వుండేది  ఆ ఆశా మంట కలిసింది. ఇప్పుడు నాకో మగడూ, అత్తగారూ, మామగారూ....ఎంత బాధ్యత నెత్తిన పడిందని...." అంటూంటే  అనుకోకుండా  నవ్వు వచ్చింది.

    "అప్పుడే  పెద్దరికం  నీ వంటినిండా  చుట్టబెట్టుకుని  మాట్లాడకు. మీవారు ఎంతో విశాలహృదయం కలవారేమోననిపిస్తుంది. ఇప్పుడు నీకేమి కొదవ? ఆయన్ని  అండగా  వుంచుకుని నీ కోరికలన్నీ తీర్చుకో. తలుచుకుంటే  ఇప్పుడు నువ్వు వండర్స్  చెయ్యగలవు. తెలుసా?"

    "ఇప్పటికే  ఒక వండర్ చేసేశాను" అనుకుంది  భారతి చప్పున.

    ఒక నిమిషం  ఆగి, "మల్లికా! నువ్వు మాత్రం  చదువాపకు. నీకు ఇష్టమొచ్చినంతకాలం, విసుగు  పుట్టేంత వరకూ  చదువు" అన్నది.

    యీసారి  నిట్టూర్పు విడిచే వంతు  మల్లికదయింది. కొంతసేపు స్తబ్దంగా  ఊరుకుని  తరువాత  "అలాగే" అన్నది నెమ్మదిగా.

    అంతలో  గౌరీపతిగారు  లోపలకు వచ్చి, "మీరిద్దరూ  ఇక్కడ వున్నారా, అమ్మా! కూర్చుని తాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారా? ఆకళ్ళు వేయటం లేదూ? రండి. రండి. భోజనాలకు తీసుకువెళ్ళటానికి కారు కూడా వచ్చింది" అన్నారు.  

    భారతికి నవ్వు వచ్చింది. యీ పెళ్ళి ఎవరు జరిపిస్తున్నారో, భోజనాలకు ఎవరు ఎవర్ని  పిలుస్తున్నారో అర్ధంకాని స్థితి వచ్చిందామెకు.

    కాని తండ్రి ముఖంవంక  చూడగానే  ఆమె ముఖం మీది నవ్వు వెంటనే చెరిగిపోయింది. పెళ్ళిపనులవల్ల, కొన్ని రోజులుగా  రాత్రింబవళ్ళు  సరియైన  నిద్రా హారాలు కూడా  లేకుండా  శ్రమిస్తూ ఉండటం చేత, మనిషి సగం జీవం వుడిగి పోయినట్లయింది. మనిషి బక్క చిక్కిపోయి, కళ్ళు లోతుకుపోయి  ఎలాగో ఉన్నాడు.

    ఇందుకేనా  ఆడపిల్లకు  పెళ్ళి జరిగేది? యీ దుఃఖాలు  చూడటానికి  నా అన్న వారందర్నీ  పోగొట్టుకోవటానికి....ఇందుకేనా?

    లేచి నిలబడి దగ్గుత్తికతో. "నాన్నా!" అంది భారతి. ఉప్పెనలా ముంచుకు వచ్చే దుఃఖాన్ని అణుచుకుని ఆ రెండక్షరాలలో  ఎలా ఇమడ్చగలిగిందో  ఆమెకే తెలియదు. మల్లిక కూడా లేచి నిలబడి, కొంచెం దూరంగా జరిగి తల వంచుకుంది.

    "ఏమమ్మా!" అన్నారు గౌరీపతిగారు. కూతురిలో క్షణక్షణానికి మారిపోయే భావాలను తిలకిస్తూ.

    "నాన్నా!" అంది మళ్ళీ అప్రయత్నంగా  భారతి. ఆమె కేం చెప్పాలో తోచలేదు. 'నీ ఆరోగ్యం క్షీణించింది. నువ్వెలాగో ఉన్నావు. నిన్ను చూస్తే భయమేస్తోంది, నాన్నా!' ఇలా ఎన్నో అనుకుందిగాని పెదవులు దాటి ఆ మాటలేవీ బయటకు రాలేదు.

    "నీకు ఒక్కసారి పాదాభివందనం  చేస్తాను, నాన్నా" అని మాత్రం అనగలిగింది చివరకు.
    ఆయన విస్మితుడై  చూస్తున్నాడు. భారతి ఏదో ఆవేశానికి లోనైనట్లు  ముందుకు నడిచి వంగి, ఆయన పాదాలను తాకి నమస్కరించింది.

    "నూరేళ్ళు శుభంగా వర్ధిల్లమ్మా!" అని ఆయన ఆశీర్వదించి, ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు. నీవదృష్టవంతురాలివమ్మా" అన్నాడు తిరిగి.

    భారతి ఏమీ మాట్లాడలేదు.

    ఆయన ఆకస్మికంగా  యీ దృశ్యభారాన్ని  భరించలేక, అందు నుండి విముక్తి కోరేవాడివలె "రండమ్మా, రండి ఆలస్యమై పోతోంది. భోజనాలయినాక మళ్ళీ ఊరేగింపుకు సిద్ధం కావాలి" అని కుమార్తె భుజంమీద చేయి అలానే వుంచి, ఆమెను బయటకు నడిపించి తీసుకువెళ్ళాడు. మల్లిక వారి ననుసరించింది.

    భోజనాలలో  పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి వెండికంచాలు వేసి, ఏవేవో వేడుకలు చేయించాడు. ప్రక్కన కూర్చున్న అమ్మలక్కలు ఒకరి కంచంలోని  మిటాయిలు  మరొకరి కంచంలో వేయించారు. చిన్న చిన్న పిల్లలు ఎదురుగా నిల్చుని ఏవేవో  పాటలు  పాడారు. భారతి సిగ్గుతో  తల ఎత్తలేకపోతూంది. ఇందులో  కొన్ని ఆమెకు నచ్చటంలేదు  కూడా.

    భోజాలయినాక ఊరేగింపు. యీ ఊరేగింపు  తతంగం  భారతికి సుతరామూ ఇష్టంలేదు. అసలా వూహ వస్తేనే ఒళ్ళు జలదరించింది. వేలాది ప్రజలు  చూస్తూండగా, ఆటవికజాతి  మనుషుల్లా పువ్వులతో, రంగులతో అలంకరించిన  వాహనం మీద  రాజదంపతుల మనుకుంటూ కూర్చుని  బాజాలు, టపాకాయలు....ఆమె భరించలేకపోయింది. తన అభ్యంతరం  తెలియచేద్దామనుకుంది.

    కాని అది గంగాధరంగారి ముచ్చట  ఆయన నోటి నుండి  మాట వెలువడిందంటే  శిలాశాసనమే కదా!

    రంగాజమ్మగారు కోడలికి  కనులు జిగేలుమనేటట్లు  కొత్తబట్టలు కట్టించింది. ఇనప్పెంట్టెలోంచి  నగలు తీసుకువచ్చి స్వయంగా  ఒంటినిండా అలంకరించింది. అనుభవజ్ఞరాలైన  ఓ ముత్తైదువతో  పూలజడ వేయించింది. కళ్ళకి కాటుక, నుదుట తిలకం ,పాపటలో  తిరుచూర్ణం తనే దిద్దింది. సంతోషం పట్టలేక "చందనపు బొమ్మలా వున్నావమ్మా" అని నుదుట ముద్దు పెట్టుకుంది.

    విద్యుద్దీపాలతో, రంగురంగుల  కాగితాలతో  పూలదండలతో  అలంకరించిన టాపులేని  కారులో  యిద్దర్నీ కూర్చోపెట్టారు. వెనుక వందలకొద్దీ  చుట్ట పక్కాలు. కారు ముందు గంగాధరంగారు చేతికర్ర ఊపుకుంటూ, గౌరీపతిగారితోనూ.ఇంకా కొద్దిమంది పెద్దమనుషులతోనూ ఠీవిగా నడుస్తున్నారు. ధనిక కుటుంబాలకు  చెందిన కొందరు స్త్రీలు కార్లలో ఎక్కి వస్తున్నారు. చాలామంది  నడుస్తున్నారు  పిల్లలను పట్టశక్యం గాకుండా వుంది. వారి అట్టహాసం వర్ణనాతీతం.

 Previous Page Next Page